Skip to main content

వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై కేంద్రం వివక్ష!

సాక్షి, హైదరాబాద్: దేశంలోని రాష్ట్రాల్లో వైద్య సదుపాయాల కల్పన, వైద్య విద్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజితంతో అమలయ్యే పథకాల్లో వివక్ష కొనసాగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు, ఉన్న కళాశాలల అప్గ్రెడేషన్ లాంటి కార్యక్రమాల్లో తెలంగాణకు మొండిచేయే చూపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం పెద్దమొత్తంలో కాలేజీలు, సీట్లను మంజూరు చేసింది. 2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు దేశంలో మొత్తం 157 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. ఇక, ఉన్న కళాశాలల్లో సీట్ల పెంపులో కూడా తెలంగాణను పట్టించుకోని కేంద్రం... మొత్తం 5,799కు పైగా పీజీ సీట్లను దేశ వ్యాప్తంగా మంజూరు చేయగా, మొక్కుబడిగా 279 సీట్లు రాష్ట్రానికి ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇవి కూడా మొదటి దశలో ఇచ్చినవే.

ఆస్పత్రికి అనుబంధ కళాశాలలేవీ?
ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్ర, రిఫరల్ ఆస్పత్రులకు అనుబంధంగా మెడికల్ కళాశాలల ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అసలు పట్టించుకున్నట్లు కూడా కనిపించలేదు. 2014 నుంచి 2021 ఏప్రిల్ వరకు ఈ ప్రాయోజిత పథకం కింద దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఒక్కటీ రాలేదు. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలకు (అండమాన్ నికోబార్ దీవులతో కలిపి)గాను.. తెలంగాణ, కేరళ, చండీగఢ్, గోవా, త్రిపుర రాష్ట్రాలకు శూన్య హస్తం చూపించారు. మొత్తం రూ.41 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ కళాశాలల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలయిన మధ్యప్రదేశ్ (14), ఉత్తరప్రదేశ్ (27)కు భారీగా మంజూరయ్యాయి. సమాచార హక్కు చట్టం కార్యకర్త, జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే ఈ వివరాలను చెబుతున్నాయి. ఇక, రాజస్తాన్ లోనూ బీజేపీ అధికారంలో ఉన్న కాలంలోనే 23 కళాశాలలు ఇవ్వగా, ఇటీవల జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు, పశ్చిమబెంగాల్కు 11 చొప్పున కొత్త ఆస్పత్రులు మంజూరు చేయడం గమనార్హం.

సీట్ల పెంపులోనూ ‘శూన్యమే’
ఇక, కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్ల పెంపు విషయంలోనూ కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 150 సీట్లను 250 సీట్లకు అప్గ్రేడ్ చేయగా, మరికొన్ని రాష్ట్రాల్లో రెండు లేదా మూడు కళాశాలలకు 50 సీట్ల చొప్పున పెంచారు. కానీ, తెలంగాణ, కేరళలో ఒక్క మెడికల్ సీటు కూడా పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బుందేల్ఖండ్లోని మెడికల్ కళాశాలలో 100 సీట్లుంటే ఆ కళాశాల స్థాయిని ఏకంగా 250 సీట్లకు పెంచిన కేంద్రం.. ఏపీలో మూడు కళాశాలలకు కలిపి 150 సీట్లు మాత్రమే పెంచింది. ఒక్క మధ్యప్రదేశ్లోనే ఈ ఏడేళ్ల కాలంలో 550 అదనపు మెడికల్ సీట్లు పెరగ్గా, కర్ణాటకలో 550, రాజస్తాన్లో 700 సీట్లు చొప్పున పెరిగాయి. ఇక, పీజీ సీట్ల పెంపు విషయంలోనూ కేంద్రం వివక్షాపూరిత వైఖరినే ప్రదర్శించింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్ల విషయంలో తొలిదశలో భాగంగా దేశ వ్యాప్తంగా 4,058 సీట్లు ఇవ్వగా, అందులో తెలంగాణకు ఇచ్చింది 279 మాత్రమే. అది కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఉన్న సౌకర్యాల ప్రకారం కోటాగా రావాల్సిన సీట్లను మాత్రమే కేటాయించారు. ఇక, రెండోదశలో దేశ వ్యాప్తంగా 1,741 పీజీ మెడికల్ సీట్లు ఇవ్వగా, అందులో ఒక్క సీటు కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం గమనార్హం.
Published date : 25 May 2021 01:25PM

Photo Stories