Skip to main content

ప్రణాళికతో చ‌దివితే.. 'సివిల్స్' ఎస్-టీలో గెలుపు సులువే..!

సివిల్స్ మెయిన్స్- సైన్స్ అండ్ టెక్నాలజీ..
సిలబస్‌లోని పేపర్-4 (జనరల్ స్టడీస్-3) లో ఎకానమీతో పాటు టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనే అంశాలున్నాయి. ఈ పేప‌ర్‌లో వివిధ అంశాల‌పై ప‌ట్టుపెంచుకోవ‌డంతో పాటు, సిలబస్‌లో ఇచ్చిన టెక్నాలజీ తదితర అంశాల పరిధిని అర్థం చేసుకోవడం అభ్యర్థికి ఎంతైనా అవసరం. ఆ తర్వాత సరైన రీతిలో సమాచార సేకరణ, ప్రశ్నలు అడిగే అవకాశమున్న తీరు, రైటింగ్ ప్రాక్టీస్ లాంటివి ముఖ్యమైనవి.

సిలబస్ విశ్లేషణ:
Science and Technology development and their applications effects in everyday life.
మన దైనందిన జీవితంలో మెరుగైన జీవన విధానానికి సైన్స్ అండ్ టెక్నాలజీ అనువర్తనాలు, ఎన్నో పరికరాలు, సాంకేతిక ప్రక్రియలు ఉపయోగపడుతున్నాయి. వీటిపై అవగాహన ఎంతైనా అవసరం. రివర్స్ ఆస్మాసిస్‌లాంటి ప్రక్రియ ఆధారంగానే ఈ రోజు స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వచ్చింది. వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టంలు అధిక వినియోగంలోకి వచ్చాయి. దీనిపై ఇదివరకే యూపీఎస్సీ మెయిన్స్‌లో ప్రశ్న వచ్చింది కూడా. అదే విధంగా అధిక వినియోగంలోకి వచ్చిన Compact Fluorescent Lamp (CFL), Light Emitting Diodes (LED), Direct to Home (DTH) టెలివిజన్ సేవలు, మొబైల్ ఫోన్స్ రకాలు ముఖ్యంగా స్మార్ట్ డివెసైస్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది.

Achievements of Indians in Science and Technology; Indigenization of technology and developing new technology.

భారత శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ప్రాచీన కాలం నాటిది. ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, వరాహమిహిర, నాగార్జున, ధన్వంతరి, చరకుడు, శుశ్రుతుడు వంటి వారు ఖగోళ శాస్త్రం, గణితం, వైద్య, లోహ సంగ్రహణ శాస్త్రాల్లో ఎంతో ప్రగతిని సాధించారు. ఆధునిక కాలంలో విక్రం సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, జేకే బోస్, సత్యేంద్రనాథ్ బోస్, బీర్బల్ సహానీ, సర్ సీవీ రామన్, శ్రీనివాస రామానుజన్, హరగోవింద్ ఖురానా, ఎమ్మెస్ స్వామినాథన్, ఏపీజే అబ్దుల్ కలాం, వర్గీస్ కురియన్ వంటి వారు ఒక్కో రంగంలో దేశాన్ని ముందుకు నడిపించారు, మార్గదర్శకులుగా నిలిచారు. భవిష్యత్ అవసరాలను వీరు ముందుగానే గుర్తించి ఆయా రంగాల్లో అభివృద్ధికి కృషి చేశారు. దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు. ఇటీవల కాలంలో పీఎం భార్గవ, ప్రొఫెసర్ యశ్‌పాల్, డా. లాల్జీ సింగ్, రాజేంద్ర కుమార్ పచౌరి కూడా తమ శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేశారు. ఈ విధంగా దేశ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి కృషి చేసి ఎన్నో కొత్త విషయాలను, టెక్నాలజీలను అభివృద్ధి చేసిన వారి గురించి సమాచారాన్ని తెలుసుకోవడం ఈ యూనిట్ సారాంశం.

దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయాలంటే దేశీయ టెక్నాలజీ అభివృద్ధి తప్పనిసరి. టెక్నాలజీ అభివృద్ధి ఫలాలను దేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలంటే దేశీయ టెక్నాలజీ అభివృద్ధి ఒక్కటే మార్గం. ప్రతి దేశానికి విదేశీ టెక్నాలజీ దిగుమతి ఖర్చుతో కూడుకుంది. అందరికీ త్వరగా అందుబాటులోకి తీసుకురావడం కూడా కష్టం. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీ అవసరం. తాగునీటి సరఫరా కోసం డీఫ్లోరినేషన్, డీసాలినేషన్, శక్తి భద్రతకు హైడ్రోజన్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఓషన్ టైడల్ ఎనర్జీ, జీవ ఇంధనాలు, శక్తి సామర్థ్యం అభివృద్ధికి, శీతోష్ణస్థితి మార్పు నివారణకు, జియో ఇంజనీరింగ్ మొదలైన వాటిని అభివృద్ధి చేయడం తప్పనిసరి. కాబట్టి అభ్యర్థులు ఈ కోణంలో చదువుకోవాలి.

Awareness in the fields of IT, Space, Computers, Robotics, Nano technology, Bio-technology and issues relating to Intellectual Property Rights.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధిని, సాధారణ మానవునికి ఐటీ ద్వారా చేకూరే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. ముఖ్యంగా ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఈ-కామర్స్ వంటి అంశాల్లో ఐటీ పాత్రను ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న మార్పులు, ఆర్థిక వృద్ధిలో సాఫ్ట్‌వేర్ పాత్ర, బీపీఓ, కేపీఓ లాంటి అంశాలపై సైతం అభ్యర్థి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా కంప్యూటర్ నిర్మాణం, ప్రాసెసింగ్‌లో వస్తున్న మార్పులపై కూడా అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

అంతరిక్ష కార్యక్రమం: ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్ అనువర్తనాలు, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీల ప్రాధాన్యత, భారత అంతరిక్ష కార్యక్రమం బలాలు, బలహీనతలు, భవిష్యత్తు కార్యక్రమాలు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సహజవనరుల పరిశీలన నిర్వహణ, దేశ భద్రత మొదలైన రంగాల్లో అంతరిక్ష కార్యక్రమం అనువర్తనాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

రోబోటిక్స్: వీటి ఉపయోగాలు, కృత్రిమ మేధస్సు, ఇంజనీరింగ్‌లో రోబోటిక్స్-రోబోటిక్ సర్జరీ; దైనందిన జీవితంలో రోబోటిక్స్ పాత్ర; జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత వంటి అంశాలపై దృష్టి సారించాలి.

నానోటెక్నాలజీ: ఇందులోని రకాలు, నానో మెడిసిన్, నానో క్రిస్టల్స్, నానో ట్యూబ్స్ నిర్మాణ, ఆరోగ్య రంగాల్లో నానో టెక్నాలజీపై అవగాహన ఉండాలి.

బయో టెక్నాలజీ: వ్యవసాయంలో జీవ ఎరువులు, జీవక్రిమి సంహారకాలు, ఆర్గానిక్ వ్యవసాయం, జన్యు మార్పిడి పంటలు ఉంటాయి. పశు సంవర్థకంలో జన్యు మార్పిడి జంతువులు; కాలుష్య నిర్మూలనలో బయో రెమిడియేషన్ లాంటి అంశాలతో పాటు డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, మూల కణాలు, క్లోనింగ్, జన్యు థెరపీ, కృత్రిమ జీవం వంటి అంశాలు బయో టెక్నాలజీలో ముఖ్యమైనవి. వీటికి అదనంగా బయో ఇన్ఫర్మేటిక్స్, బయోనిక్స్‌పై కూడా అవగాహన పెంచుకోవాలి.

మేధో సంపత్తి హక్కులు: వీటి విషయంలో ప్రధానంగా పేటెంట్‌లు, కాపీరైట్స్, ట్రేడ్ మార్కులు, జియోగ్రఫికల్ ఇండికేషన్ లాంటివి; భారత్‌లో పరిస్థితులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివాదాలు ముఖ్యమైనవి.

పర్యావరణం: సిలబస్‌లో పర్యావరణ పరిరక్షణ అని ఇచ్చారు. ఇక్కడ పరిరక్షణ సమస్యలు, పర్యావరణ విభాగాల పరిస్థితులపై అవగాహన, ప్రస్తుత ప్రభావాలు, పరిరక్షణ పద్ధతులు, జీవవైవిధ్యానికి ఏర్పడుతున్న ముప్పు, ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యంలో గాలి, నీరు, నేల, శబ్దం, కాంతి కాలుష్యాలు, కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, పద్ధతులను ప్రధానంగా అర్థం చేసుకోవాలి. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో పరిరక్షణ చర్యలు, పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, వాటిలో సమస్యలు మొదలైనవి చదువుకోవాలి. ఇటీవల కాలంలో పలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై కూడా దృష్టి సారించాలి.

విపత్తు, విపత్తు నిర్వహణ:
భారత్‌లో విపత్తు రకాలు మానవ జనిత, ప్రకృతి పరమైన విపత్తులు, విపత్తుల ప్రభావాలు, విపత్తుల తీవ్రత, కారణాలు, స్పందనా వ్యవస్థలో లోపాలు, మెరుగైన స్పందన వ్యవస్థకు తీసుకోవాల్సిన మార్గాలు, ప్రజల భాగస్వామ్యం, అత్యాధునిక కమ్యూనికేషన్, విపత్తు అనంతర పునరుద్ధరణ వంటి వాటిపై మొదటిగా దృష్టి సారించాలి. వరదలు, తుఫాను, భూకంపం, సునామీ, కొండ చరియలు, మంచు చరియలు విరిగిపడడం, అగ్నిప్రమాదాలు, అణుప్రమాదాలు, తొక్కిసలాటలు, రసాయన (ఉగ్రవాద, పారిశ్రామిక) దుర్ఘటనలు, బయో టెర్రరిజం, కరువు లాంటి విపత్తులకు కారణాలు, నష్టాలు, ఇటీవలి విపత్తులు, నివారణ చర్యలు ముందుగానే అంచనా వేసే టెక్నాలజీ, ప్రజల తరలింపు, విపత్తుల సమయంలో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, విపత్తు అనంతర పునరుద్ధరణ మొదలైన కోణాల్లో చదువుకోవాలి.

అదనంగా భారత్‌లో విపత్తు నిర్వహణ చట్టం, కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పడిన విపత్తు, నిర్వహణ సంస్థలు, వాటి విధులు, విపత్తు స్పందన దళం, వాటి చర్యలు మొదలైన సంస్థాగత విషయాలను కూడా తెలుసుకోవాలి.

పైన వివరించిన టాపిక్స్‌కు అదనంగా జీవ వైవిధ్యం(బయోడైవర్సిటీ)పై ప్రత్యేక దృష్టి సారించాలి. Convention on Biological Diversity, దీనికి అనుబంధంగా ఉన్న కార్టజీనా ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్, భారత్‌లో జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం, భారత్‌లో జీవ వైవిధ్యం సంపద, జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లపై అవగాహనను పెంచుకోవాలి.

అభ్యర్థులు చదవాల్సినవి..
ప్రధానంగా ప్రాథమిక విషయాల కోసం NCERT పుస్తకాలు (6-12 తరగతులు) చాలా అవసరం. ఈ పుస్తకాల్లో బేసిక్స్ లభిస్తాయి. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఆ తర్వాత దినపత్రికల్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ కాలమ్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, యోజన, కురుక్షేత్ర, డౌన్ టు ఎర్త్ వంటి మ్యాగజీన్‌లను క్రమం తప్పకుండా చదవాలి.

Published date : 27 May 2020 04:15PM

Photo Stories