Intermediate Board: ప్రైవేటు కాలేజీలకు హెచ్చరిక
![Junior College Students at NRI College in NAD Junction,Inter board officials discussing instructions](/sites/default/files/images/2023/10/20/junior-college-students-1697795844.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో నగరంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు యథావిధిగా పనిచేశాయి. ఎన్ఏడీ కూడలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో రికార్డులు రాయాలనే పేరుతో విద్యార్థులను రప్పించారు. కాలేజీలోనే పుస్తకాలు విక్రయించారు. సైన్సు కోర్సులు చదివే విద్యార్థులు సెలవుల్లో ఇళ్ల వద్ద రికార్డులు రాసి తీసుకురావాలని సూచించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫీజులో సగం చెల్లించిన వారికే రికార్డు పుస్తకాలు ఇస్తామని చెప్పడంతో.. విద్యార్థులు ఫీజు కౌంటర్ వద్ద బారులుదీరారు.
ఎన్ఏడీ కూడలిలోని నారాయణ కళాశాలలోనూ విద్యార్థులు కనిపించారు. గురుద్వార్ సమీపం శాంతిపురంలోని కైట్ కాలేజీలో సీఏ కోర్సుకు తర్ఫీదు పొందే విద్యార్థులకు శిక్షణ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇదే చోట ఉన్న రెజోనోన్స్ స్టడీ సెంటర్ (దీనికి అనుమతుల్లేవని అధికారులు చెబుతున్నారు) నుంచి గురువారం విద్యార్థులను ఇళ్లకు పంపించారు. దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలు తెరవవద్దని ముందుగా ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు.
Kaushal Exams 2023: కౌశల్ పోస్టర్ను ఆవిశ్కరించిన విద్యాశాఖాధికారి
స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. అయినా కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టాయి. దసరా సెలవులైనా కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం లేకుండా పోతుందని ఆయా కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిడితో విధులకు హాజరుకావాల్సి వస్తోందని చెబుతున్నారు. గురువారం పని చేసిన ప్రైవేట్ కళాశాలల వివరాలను సేకరిస్తున్నట్లు ఆర్ఐవో రాయల సత్యనారాయణ వెల్లడించారు.