Skip to main content

ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితా 2018

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2018 సంవత్సరానికి ప్రపంచ శ్రీమంతుల జాబితాను మార్చి 6న ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 2,208 మంది బిలియనీర్లకు స్థానం లభించింది. దీన్ని 2018, ఫిబ్రవరి 9 నాటి షేర్ల ధరలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు. 2017లో 7.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న బిలియనీర్ల సంపద.. ఈ ఏడాది 9.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది.
2018 ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని తొలిసారిగా అమెజాన్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ దక్కించుకున్నారు. ఆయన సంపద 112 బిలియన్ డాలర్లు. గత 24 ఏళ్లలో 18 ఏళ్లపాటు మొదటిస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండోస్థానానికి పడిపోయారు. ఆయన సంపద 91.2 బిలియన్ డాలర్లు.

టాప్ టెన్ బిలియనీర్లు
పేరు దేశం కంపెనీ
1. జెఫ్ బెజోస్ అమెరికా అమెజాన్
2. బిల్‌గేట్స్ అమెరికా మైక్రోసాఫ్ట్
3. వారెన్ బఫెట్ అమెరికా బెర్క్‌షైర్ హతవే
4. బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్రాన్స్ ఎల్‌వీఎంహెచ్
5. మార్క్ జుకర్‌బర్గ్ అమెరికా ఫేస్‌బుక్
6. అమాన్సియో ఒర్టెగా స్పెయిన్ జారా
7. కార్లోస్ స్లిమ్ హేలూ మెక్సికో టెల్‌మెక్స్
8. చార్లెస్ కోచ్ అమెరికా కోచ్ ఇండస్ట్రీస్
9. డేవిడ్ కోచ్ అమెరికా కోచ్ ఇండస్ట్రీస్
10. లారీ ఎల్లిసన్ అమెరికా ఒరాకిల్

ఫోర్బ్స్ 2018 జాబితాలో 119 మంది భారతీయులకు చోటు దక్కింది. ఇందులో 18 మంది కొత్తవారు ఉన్నారు. రిలయన్స్ ఇండ స్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 40.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,60,622 కోట్లు) సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 19వ స్థానంలో నిలిచారు. వరుసగా 11వ ఏడాది ముకేశ్ అంబానీ అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా కొనసాగుతున్నారు.

టాప్ టెన్ భారతీయ సంపన్నులు

పేరు

ప్రపంచ ర్యాంక్

1. ముకేశ్ అంబానీ 19
2. అజీమ్ ప్రేమ్‌జీ 58
3. లక్ష్మీ మిట్టల్ 62
4. శివ్ నాడార్ 98
5. దిలీప్ సంఘ్వి 115
6. కుమార్ మంగళం బిర్లా 127
7. ఉదయ్ కోటక్ 143
8. రాధాకిషన్ దమానీ 151
9. గౌతమ్ అదానీ 154
10. సైరస్ పూనావాలా 170

2018 ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 256 మహిళా బిలియనీర్లు ఉన్నారు. అలైస్ వాల్టన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ. ఈమె వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ కుమార్తె. అలైస్ సంపద విలువ 46 బిలియన్ డాలర్లు.

ఈ జాబితాలో 8 మంది భారతీయ మహిళలు ఉన్నారు. 8.8 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్ భారత్‌లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఆమెకు ఫోర్బ్స్ జాబితాలో 176వ ర్యాంక్ లభించింది. తర్వాతి స్థానాల్లో కిరణ్ మజుందార్ షా (629), స్మితా గోద్రెజ్ (822), లీనా తివారీ (1020), వినోద్ రాయ్ గుప్తా (1103), అను ఆగా (1650), షీలా గౌతమ్ (1,999), మధు కపూర్ (1,999) ఉన్నారు.

ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు దక్కింది. అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు పి.వి.రాంప్రసాద్ రెడ్డి (965), దివీస్ ఛైర్మన్ దివి మురళి (1070) ఈ జాబితాలో ఉన్నారు.
Published date : 17 Mar 2018 01:00PM

Photo Stories