Skip to main content

అంతర్జాతీయ అవార్డులు, బహుమతులు

పోటీ పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్ విభాగంలో అత్యంత ముఖ్యమైనవి అంతర్జాతీయ అవార్డులు. వీటిపై ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రశ్నలుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ అవార్డులు, వాటిని అందించే సంస్థలు, గ్రహీతల వివరాలు..

రామన్ మెగసెసె అవార్డులు
విమాన ప్రమాదంలో మరణించిన ఫిలిప్పైన్‌‌స మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఈ అవార్డును ఫిలిప్పైన్‌‌స ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1958 నుంచి ప్రతి ఏడాది మెగసెసె జయంతి అయిన ఆగస్టు 31న మనీలాలో ప్రదానం చేస్తారు. ఈ అవార్డును ఆసియా ఖండ వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. కాబట్టి వీటిని ఆసియా నోబెల్ బహుమతులు అని పిలుస్తారు. మొదట ఆరు రంగాల్లో ఇచ్చేవారు. 2009 నుంచి ప్రభుత్వ సేవ, ప్రజాసేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మక కళలు, శాంతి, అంతర్జాతీయ అవగాహన రంగాల్లో ఈ అవార్డులను నిలిపివేశారు. ఎమర్జెంట్ లీడర్‌షిప్ విభాగంలో మాత్రం ఇస్తున్నారు.

రామన్ మెగసెసె పొందిన భారతీయులు:
ఆచార్య వినోభా భావే (1958), సి.డి.దేశ్‌ముఖ్ (1959), మదర్ థెరిస్సా (1962), వర్గీస్ కురియన్ (1963), జయప్రకాశ్ నారాయణ్ (1965), సత్యజిత్ రే (1967), ఎం.ఎస్. స్వామినాథన్ (1971), ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (1974), ఇలాభట్ (1977), అరుణ్‌శౌరి (1982), ఆర్.కె.లక్ష్మణ్ (1984), బాబా ఆమ్టే (1985), కిరణ్‌బేడి (1994), టి.ఎన్.శేషన్ (1996), మహాశ్వేతాదేవి (1997), అరుణారాయ్ (2000), రాజేంద్రసింగ్ (2001), సందీప్ పాండే (2002), శాంతాసిన్హా (2003), జె.ఎం.లింగ్డో (2003), అరవింద్ కేజ్రీవాల్ (2006), పాలగుమ్మి సాయినాథ్ (2007), నీలిమా మిశ్రా(2011), కులంది ఫ్రాన్సిస్ (2012).

2013 రామన్ మెగసెసె గ్రహీతలు: హబీబా సరాబి (అప్ఘానిస్థాన్), లపాయ్ సెంగ్ రా (మయన్మార్), ఎమెస్టో డొమింగో (ఫిలిప్పైన్‌‌స), కరప్షన్ ఎరాడికేషన్ కమిషన్ (ఇండోనేషియా), శక్తి సమూహ (నేపాల్).

నోబెల్ బహుమతులు
Awards ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ప్రవేశపెట్టారు. ఆయన డైనమైట్ అనే పేలుడు పదార్థం కనిపెట్టారు. 1901లో ప్రారంభించిన ఈ బహుమతులను మొదట భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, శాంతి అనే ఐదు విభాగాల్లో ఇచ్చేవారు. ఆ తర్వాత స్వీడన్ కేంద్రబ్యాంక్ స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మొత్తం ఆరు రంగాల్లో వీటిని ఇస్తున్నారు. 2012 వరకు మొత్తం 834 మంది వ్యక్తులకు, 21 సంస్థలకు నోబెల్‌ను ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో అందిస్తారు. మిగిలిన ఐదు బహుమతులను స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఇస్తారు. ప్రతి ఏటా నోబెల్ వర్థంతి అయిన డిసెంబర్ 10న నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు.

కొన్ని ఆసక్తికర విషయాలు:
  • నోబెల్ శాంతి బహుమతిని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థకు మూడుసార్లు (1917, 1944, 1963) ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న అత్యంత పిన్నవయస్కురాలు తవక్కల్ కర్మన్. ఆమెకు 2011లో 32 ఏళ్ల వయసులో లభించింది.
  • ఇప్పటివరకు 43 మంది మహిళలకు ప్రదానం చేశారు. నోబెల్ బహుమతిని రెండుసార్లు అందుకున్న ఏకైక మహిళ మేరీ క్యూరీ. ఆమెకు 1903లో ఫిజిక్స్‌లో, 1911లో కెమిస్ట్రీలో నోబెల్ లభించింది.
  • బ్రిటిష్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌కు 1953లో సాహిత్యంలో నోబెల్ లభించింది.
  • నోబెల్ బహుమతి పొందిన అత్యంత పిన్నవయస్కుడు లారెన్‌‌స బ్రాగ్. ఆయనకు కేవలం 25 ఏళ్ల వయసులో, 1915లో, భౌతిక శాస్త్రంలో లభించింది.
  • అత్యంత పెద్ద వయస్కుడు లియోనిడ్ హర్‌విజ్. ఆయనకు 90 ఏళ్ల వయసులో 2007లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ లభించింది.
  • నోబెల్ బహుమతిని తిరస్కరించిన వ్యక్తులు ఇద్దరు. 1964లో జీన్‌పాల్ సార్‌తే(సాహిత్యం), 1973లో లెడక్ థో (శాంతి).
  • మరణానంతరం ఇద్దరికి లభించింది. డాగ్ హామర్‌‌సజోల్డ్ (1961, శాంతి), ఎరిక్ ఎక్సెల్ కాల్‌ఫెల్డ్ (1931, సాహిత్యం).
రెండుసార్లు గెలుపొందిన వ్యక్తులు, సంస్థలు:
  • లైనస్ పౌలింగ్ - కెమిస్ట్రీ (1954), శాంతి (1962)
  • జాన్ బర్దీన్ - ఫిజిక్స్ (1956, 1972)
  • మేరీ క్యూరీ - ఫిజిక్స్ (1903), కెమిస్ట్రీ (1911)
  • ఫెడరిక్ సాంగర్ - కెమిస్ట్రీ (1958, 1980)
  • యునెటైడ్ నేషన్‌‌స హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్(యూఎన్‌హెచ్‌సీఆర్) - శాంతి (1954, 1981)నోబెల్ బహుమతి పొందిన భారతీయులు: ఏడుగురు. వారు.. రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, సాహిత్యం), సి.వి.రామన్ (1930, భౌతికశాస్త్రం), హరగోబింద్ ఖొరానా (1968, వైద్యశాస్త్రం), మదర్‌థెరిస్సా (1979, శాంతి), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983, భౌతికశాస్త్రం), అమర్త్యసేన్ (1998, ఆర్థికశాస్త్రం), వెంకట్రామన్ రామకృష్ణన్ (2009, రసాయనశాస్త్రం). నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ పేరును ఐదుసార్లు ప్రతిపాదించారు. 1937, 1938, 1939, 1947, 1948లలో నామినేట్ అయినప్పటికీ ఆయనకు నోబెల్ లభించలేదు.
2012 నోబెల్ గ్రహీతలు:
భౌతికశాస్త్రం - సెర్‌‌జ హరోష్ (ఫ్రాన్‌‌స), డేవిడ్ వైన్‌లాండ్ (అమెరికా)
రసాయనశాస్త్రం - రాబర్‌‌ట లెఫ్‌కోవిట్జ్, బ్రయాన్ కోబిల్కా (అమెరికా)
వైద్యశాస్త్రం-జాన్ గర్డన్ (బ్రిటన్), షిన్యా యమనాకా (జపాన్)
సాహిత్యం - మోయాన్ (చైనా)
ఆర్థిక శాస్త్రం - ఆల్విన్ రాథ్, లాయిడ్ షేప్‌లీ (అమెరికా)
శాంతి - యూరోపియన్ యూనియన్ (ఈయూ)
2012లో ప్రైజ్‌మనీ 1.2 మిలియన్ డాలర్లు. 2013 నోబెల్ బహుమతులను అక్టోబర్‌లో ప్రకటిస్తారు.

రైట్ లైవ్‌లీహుడ్ అవార్డులు
Awards
వీటినే ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతులు అని అంటారు. 1980లో జర్మన్ - స్వీడన్ మానవతావాది జాకోబ్ వాన్ ఉక్స్‌కుల్ ప్రవేశపెట్టారు. వీటిని డిసెంబర్‌లో ప్రదానం చేస్తారు. ఈ అవార్డు పొందిన భారతీయుల్లో ఇలాభట్ (1984), చిప్కో ఉద్యమం (1987), నర్మదా బచావో ఆందోళన్ (1991), వందనాశివ (1993), కృష్ణమ్మల్ జగన్నాథన్, శంకరలింగం జగన్నాథన్ (2008) ఉన్నారు.

2012 విజేతలు: సీమా సమర్ (అఫ్ఘానిస్థాన్), క్యాంపేన్ ఎగెనెస్ట్ ఆర్‌‌మ్స ట్రేడ్ (యూకే), జీన్ షార్‌‌ప (యూఎస్‌ఏ), హెరెటిన్ కరాకా (టర్కీ).

ప్రపంచ ఆహార బహుమతి
Awards ఆహార నాణ్యతను మెరుగుపరిచి, ఆహార భద్రతకు కృషి చేసే వ్యక్తులకు ఈ అవార్డును ఇస్తారు. ఈ అవార్డును నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవమైన అక్టోబర్ 16న వీటిని ప్రదానం చేస్తారు. విజేతలకు 2,50,000 డాలర్లను బహూకరిస్తారు. ఈ బహుమతి మొదటిసారి 1987లో భారతదేశ హరిత విప్లవ పితామహుడైన ఎం.ఎస్.స్వామినాథన్‌కు లభించింది. 1989లో శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్‌కు ఇచ్చారు.

2013 విజేతలు: మేరీ డెల్ షిల్టన్, రాబర్‌‌ట ఫ్రాలే (యూఎస్‌ఏ), మార్‌‌కవాన్ మాంటేగ్ (బెల్జియం)

ఆస్కార్ అవార్డులు
Awards వీటినే అకాడమీ అవార్డులంటారు. ఇవి ప్రపంచ అత్యున్నత సినీరంగ అవార్డులు. 1929లో ప్రారంభించారు. లాస్ ఏంజెల్స్, అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్‌‌ట్స అండ్ సెన్సైస్ వారు బహూకరిస్తారు. ఇప్పటివరకు ఐదుగురు భారతీయులకు ఆరు ఆస్కార్ అవార్డులు లభించాయి. ఆస్కార్ గెలిచిన తొలివ్యక్తి భాను అతయ్యా. ఆమెకు 1983లో ‘గాంధీ’ చిత్రానికి దుస్తుల అలంకరణకు లభించింది. ప్రముఖ దర్శకుడు సత్యజిత్‌రేకు 1992లో హానరరీ అకాడమీ అవార్డు లభించింది. 2009లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాకు, ఎ.ఆర్.రెహమాన్‌కు రెండు ఆస్కార్‌లు లభించాయి. ఇదే చిత్రానికి రసూల్, గుల్జార్‌కు కూడా ఆస్కార్‌లు ప్రదానం చేశారు.

85వ అకాడమీ అవార్డులు: వీటిని ఫిబ్రవరి 24, 2013న ప్రదానం చేశారు. లైఫ్ ఆఫ్ పై చిత్రానికి నాలుగు ఆస్కార్‌లు లభించాయి. ఉత్తమ చిత్రం - ఆర్గో, ఉత్తమ దర్శకుడు - ఆంగ్‌లీ (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ నటుడు - డేనియల్ డే లూయిస్ (లింకన్), ఉత్తమ నటి - జెన్నిఫర్ లారెన్‌‌స (సిల్వర్ లైనింగ్‌‌స ప్లేబుక్), ఉత్తమ సహాయనటుడు - క్రిస్టోఫ్ వాల్జ్ (జాంగో అన్‌చైన్‌‌డ), ఉత్తమ సహాయ నటి - అన్నీ హతవే (లెస్ మిజరబుల్స్), ఉత్తమ విదేశీ చిత్రం - అమోర్ (ఆస్ట్రియా) 86వ అకాడమీ అవార్డులను మార్చి 2, 2014న ప్రదానం చేస్తారు. 2014 అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో గుజరాతీ భాషా చిత్రం ‘ద గుడ్ రోడ్’ నామినేట్ అయింది.

మ్యాన్‌బుకర్ ప్రైజ్
Awards సాహిత్యంలో ఇచ్చే మ్యాన్‌బుకర్ బహుమతిని ప్రతి ఏటా ఆంగ్ల రచనలకు ఇస్తారు. కామన్‌వెల్త్ దేశాలు, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు మాత్రమే దీన్ని బహూకరిస్తారు. విజేతలకు 50,000 పౌండ్లను ఇస్తారు. వీటిని మ్యాన్ గ్రూప్ సంస్థ లండన్‌లో అందిస్తుంది. 1969లో మొదటి విజేత పి.హెచ్.న్యూబీ (ఇంగ్లండ్). ఆయనకు ‘సమ్‌థింగ్ టు ఆన్సర్ ఫర్’ అనే నవలకు లభించింది. ఇప్పటివరకు నలుగురు భారతీయులు దీన్ని అందుకున్నారు. 1981లో సల్మాన్ రష్దీ ‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’కు, 1997లో అరుంధతీరాయ్ ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్‌‌స’ నవలకు, 2006లో కిరణ్ దేశాయ్ ‘ద ఇన్‌హెరిటెన్‌‌స ఆఫ్ లాస్’ నవలకు, 2008లో అరవింద్ అడిగ ‘ద వైట్ టైగర్’ నవలకు లభించింది. బుకర్ ప్రైజ్ -2012ను బ్రిటిష్ రచయిత్రి హిల్లరీ మాంటెల్ దక్కించుకున్నారు. ఆమె రాసిన ‘బ్రింగ్ అప్ ద బాడీస్’ అనే నవలకు బహుమతి లభించింది. దీన్ని రెండుసార్లు అందుకున్న మొదటి మహిళ హిల్లరీనే కావడం విశేషం. తొలిసారి 2009లో ‘వోల్ఫ్‌హాల్’ నవలకు లభించింది. 2013 మ్యాన్ బుకర్‌ప్రైజ్‌ను అక్టోబర్ 15న ప్రకటిస్తారు. ఇందుకుగాను ఆరు పుస్తకాలను షార్‌‌టలిస్ట్ చేశారు. వీటిలో భారత రచయిత్రి జుంపాలాహిరి రాసిన ‘ద లోల్యాండ్’ అనే పుస్తకం కూడా ఉంది.

మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
Awards దీన్ని కూడా 2005 నుంచి యూకేకు చెందిన మ్యాన్ గ్రూప్ బహూకరిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల రచయితలూ అర్హులే. రెండేళ్లకోసారి ఇచ్చే ఈ బహుమతి విలువ 50,000 పౌండ్లు. మొదటిసారి 2005లో ఆల్బేనియాకు చెందిన ఇస్మాయిల్ కదారే కు బహూకరించారు. 2013కు నామినేట్ అయినవారిలో భారతదేశానికి చెందిన యు.ఆర్.అనంతమూర్తి కూడా ఉన్నారు. కానీ బహుమతి అమెరికా రచయిత్రి లిడియా డేవిస్‌కు లభించింది.

ఏబెల్ ప్రైజ్
Awards నార్వే గణిత శాస్త్రవేత్త నీల్స్ హెన్రిక్ ఏబెల్ పేరు మీద 2003లో ఏర్పాటు చేశారు. 1 మిలియన్ డాలర్లు బహూకరిస్తారు. 2013లో ఈ బహుమతి బెల్జియం గణిత శాస్త్రవేత్త పియరీ డెలిగ్నేకు లభించింది.







ప్రిట్ట్జ్ కర్ ప్రైజ్
Awards
ఆర్కిటెక్చర్‌లో ప్రదానం చేస్తారు. 1979లో ప్రారంభించిన ఈ బహుమతి కింద ఒక లక్ష డాలర్లను ఇస్తారు. దీన్ని ఆర్కిటెక్చర్‌లో నోబెల్ బహుమతిగా అభివర్ణిస్తారు. 2013లో జపాన్‌కు చెందిన టోయో ఇటోకు ఈ బహుమతి లభించింది.




టెంపుల్టన్ ప్రైజ్
Awards
అమెరికాకు చెందిన టెంపుల్టన్ ఫౌండేషన్ 1973లో ఆధ్యాత్మిక విభాగంలో ఈ బహుమతిని ప్రవేశ పెట్టింది. 11 లక్షల పౌండ్లను బహుమతిగా ఇస్తారు. 1973లో తొలి విజేత మదర్ థెరిస్సా. 1975లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు, 1990లో బాబా ఆమ్టేకు, 1997లో పాండురంగ శాస్త్రి అథవలెకు ఈ అవార్డు లభించింది. 2013లో దక్షిణాఫ్రికాకు చెందిన డెస్మండ్ టూటుకు ప్రదానం చేశారు.

ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
  1. 2012 సంవత్సరానికి మోయాన్ (చైనా) ఏ రంగంలో నోబెల్ బహుమానం పొందారు?
  2. 2012 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన ఇద్దరూ ఏ దేశానికి చెందినవారు?
  3. 2012కి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందినవారు?
  4. 2012కి నోబెల్ బహుమానం పొందినవారిలో అధిక సంఖ్యాకులు ఏ దేశస్థులు?
  5. 2012కి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందినవారు?
  6. టెంపుల్టన్- 2012 ప్రైజ్ ఎవరికి లభించింది?
  7. నోబెల్ బహుమానాన్ని పొందిన మొదటి భారతీయుడు?
  8. జూలియన్ బార్న్స్‌కి 2011 బుకర్‌ప్రైజ్ ఏ పుస్తకానికి వచ్చింది?
  9. భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన తొలి భారతీయుడు?
సమాధానాలు:
1) సాహిత్యం, 2) యూఎస్‌ఏ, 3) జాన్ గర్డన్, షిన్యా యమనాకా, 4) యూఎస్‌ఏ,
5) రాబర్‌‌ట లెఫ్‌కోవిట్జ్, బ్రయాన్ కోబిల్కా 6) దలైలామా, 7) రవీంద్రనాథ్ ఠాగూర్, 8) ద సెన్‌‌స ఆఫ్ యాన్ ఎండింగ్, 9) సి.వి.రామన్.
Awards
Published date : 26 Sep 2013 04:15PM

Photo Stories