Skip to main content

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు(కాప్-25)

దాదాపు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులతో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాన్ఫరెన్స్‌ ఆఫ్ పార్టీస్-కాప్ 25) ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది.
 2019, డిసెంబర్‌ 2నుంచి 13 వరకూ జరగాల్సిన సమావేశాల్లో ఫలితం తేలకపోవడంతో డిసెంబర్‌ 15 వరకూ పొడిగించారు. అయినప్పటికీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్‌ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు. 2020 ఏడాది స్కాట్లాండ్‌ (గ్లాస్గో)లో జరగనున్న సీఓపీ26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు. సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఎటువంటి అంగీకారం కుదరలేదు.
 
కాప్ 25 సదస్సులో పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ డిసెంబర్ 11న ప్రత్యేక ప్రసంగం చేశారు. వాతావరణ కాలుష్యంపై పాలకులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని 16 ఏళ్ల గ్రెటా ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రణాళికలు మాత్రమే ప్రకటించి వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వాతావరణ కాలుష్యంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడం లేదన్నారు. ప్రస్తుత సదస్సులో అయినా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం భూ ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్నాయని, దీన్ని తగ్గించకపోతే ప్రపంచానికి ప్రమాదకరమని గ్రెటా హెచ్చరించారు.
Published date : 13 Dec 2019 02:30PM

Photo Stories