Skip to main content

ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం’ ప్రారంభమైంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 2019, నవంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొమానపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మత్స్యకార భరోసా పథకం పథకం ద్వారా 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది.

ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • మత్స్యకారులకు ఇచ్చే వేట నిషేధ పరిహారంను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నాం. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం ఉంటుంది.
  • మత్స్యకారుల కోసం.. లీటరు డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీని ఈ రోజు నుంచి రూ.6 నుంచి రూ.9కి పెంచుతున్నాం.
  • సముద్ర తీరంలో అవసరమైన చోటల్లా రాబోయే కాలంలో జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
  • సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. (ఇప్పటి దాకా రూ.5 లక్షలు మాత్రమే)
  • 2012లో సముద్రంలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల అన్వేషణకు జరిపిన తవ్వకాల్లో ముమ్మిడివరం ప్రాంతంలో జీవన భృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం (జీఎస్‌పీసీ బకాయిలు) రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. తర్వాత ఆ డబ్బు కేంద్రం నుంచి ఎలా తెచ్చుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దీని ద్వారా 16,559 మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం
ఎప్పుడు : 2019, నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కొమానపల్లి, ముమ్మిడివరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 22 Nov 2019 05:44PM

Photo Stories