Skip to main content

బడ్జెట్ పదజాలం

బడ్జెట్ అంటే...
ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో క్లిష్టమైన పదాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిని సులభతర రీతిలోకి మారిస్తే- నెలవారీ బడ్జెట్‌లో సామాన్యుడు వినియోగించే పదాలే ఇవి. ఇలాంటి కొన్ని ముఖ్య పదజాలం గురించి పరిశీలిద్దాం..

వార్షిక ఆర్థిక నివేదిక

సింపుల్‌గా చెప్పుకుంటే ఇదే బడ్జెట్. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తాలు ఇందులో పొందుపరుస్తారు. ఆర్థిక సంవత్సరం మన దేశానికి ఏప్రిల్ నుంచి వరుసగా 12 నెలలు అంటే ఆ తదుపరి సంవత్సరం మార్చి వరకూ కొనసాగుతుంది. కొన్ని దేశాలు క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాయి. ‘క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు’ అన్న అంశం ప్రాతిపదికన పలు అంచనాలు, సవరణలతో ఈ బడ్జెట్ రూపొందుతుంది.

బడ్జెట్ ఫండ్స్
బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్.. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది.
వసూళ్లు-వ్యయాలు అంటూ రెండు విభాగాలుగా ఈ మూడూ భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటెజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

కన్సాలిడేటెడ్ ఫండ్:
ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్‌లో చేరిపోతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.

కంటింజెన్సీ ఫండ్:
ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఉన్నట్లుండి అనుకోకుండా ఏర్పడే ఖర్చులకు వినియోగించడానికి ఈ నిధిలోని ధనాన్ని రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్:
ఈ అకౌంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు పద్దులుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ అకౌంట్. రెండు క్యాపిటల్ అకౌంట్. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి వచ్చీ, పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ (రెవెన్యూ అకౌంట్) క్యాపిటల్ బడ్జెట్ (క్యాపిటల్ అకౌంట్)గా పరిగణించడం జరుగుతుంది.
రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు ఇక వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లోకి చేరతాయి.
క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లో చేరతాయి.

పబ్లిక్ డెట్
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒకొక్కరి తలమీద ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు.

ద్రవ్య లోటు
సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు.

రెవిన్యూ లోటు
ప్రభుత్వం తన రెవిన్యూ ఆదాయం కంటే అధికంగా రెవిన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటును రెవిన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెవిన్యూలోటు సున్నాగా ఉండాలి. అలా ఉం టే ప్రభుత్వం చేసిన రెవిన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క.

జీడీపీలో లోటు శాతం
ద్రవ్యలోటు ఎంత ఉందన్నది శాతాల్లో లెక్కిస్తారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఈ లోటు శాతం ఎంత ఉందన్నది కీలకం. ఉదాహరణకు ప్రస్తుతం మన ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.

ట్రెజరీ బిల్స్
ఒక సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్న బాండ్లను ట్రెజరీ బిల్స్‌గా పేర్కొంటారు. వసూళ్ళు, చెల్లింపుల్లో వచ్చే తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి ట్రెజరీ బిల్స్‌ను ఆశ్రయిస్తారు. ఈ బాండ్స్ కాలపరిమితి ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని డెట్ సెక్యూరిటీస్‌గా పేర్కొంటారు.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు.

ప్రధాన ఆదాయమార్గాలివే..
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో పన్నులు కూడా ఒకటి. వివిధ శాఖలకు చేసే కేటాయింపులు పన్నుల వసూళ్ళపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం విధించే పన్నులను రెండు రకాలుగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులుగా విభజించవచ్చు.

ప్రత్యక్ష పన్నులు
ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయం, సంపాదనపై చెల్లించే పన్నులన్నీ ఈ ప్రత్యక్ష పన్నుల్లోకే వస్తాయి. ఉదాహరణకు ఆదాయపు పన్ను, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నీ ఇందులోకే వస్తాయి. వీటిలో కొన్ని ప్రధానమైన ప్రత్యక్ష పన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను
ఒక వ్యక్తి తన లేదా హిందూ అవిభక్త కుటుంబంలోని కర్త తన ఆదాయంపై చెల్లించే పన్ను. ఆదాయాన్ని బట్టి ఈ చెల్లించే పన్ను మారుతుంటుంది. ప్రస్తుతం రూ. రెండు లక్షల ఇరవై వేల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్నులేదు. ఆపైన శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కార్పొరేట్ ట్యాక్స్
ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే వాటిల్లో ఇదే ప్రధానమైనది. కంపెనీలు ఆర్జించిన లాభాలపై చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.

మినిమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్
కొన్ని కంపెనీలు లాభాలను ఆర్జించినా పన్ను చెల్లించనవసరం ఉండదు. అటువంటి కంపెనీలు వాటి లాభాల్లో కనీసం చెల్లించాల్సిన పన్నుని మినమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్ (మ్యాట్)గా పేర్కొంటారు.

లావాదేవీలపై పన్ను
స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయవిక్రయాలు వంటి లావాదేవీలపై చెల్లించే పన్నుని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌గా పేర్కొంటారు.

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
షేర్లు, స్థిరాస్తి, వ్యాపారం వంటి విక్రయాలు చేసినప్పుడు పొందే లాభాలపై చెల్లించే పన్నును క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు.

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్‌పై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు కానీ.. ఇచ్చే కంపెనీ డివిడెండ్ మొత్తంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.

వెల్త్ ట్యాక్స్(సంపద పన్ను)
ఒక వ్యక్తి, హెచ్‌యూఎఫ్ లేదా సంస్థ వ్యక్తిగత ఆస్తి విలువ రూ.30 లక్షలు దాటితే, ఆ పై మొత్తం మీద ఒక శాతం పన్ను చెల్లించాలి.

పరోక్ష పన్నులు
చేస్తున్న ఖర్చుల్లో మనకు తెలియకుండానే పన్నులు చెల్లించేస్తుంటాము. అందుకే వీటిని పరోక్ష పన్నులు అంటారు. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ వంటివి పరోక్ష పన్నుల్లోకి వస్తాయి.

కస్టమ్స్ సుంకం
విదేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడు చెల్లించాల్సిన పన్నుని కస్టమ్స్ సుంకాలుగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వం ఆదాయ వనరుగానే కాకుండా దిగుమతుల నుంచి దేశాన్ని కాపాడటానికి కూడా దీన్ని వినియోగిస్తారు.

ఎక్సైజ్ సుంకం
దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై ఈ సుంకాన్ని విధిస్తారు.
 

సర్వీస్ ట్యాక్సు
వివిధ సేవలపై ఈ పన్నును విధిస్తారు. ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో సర్వీస్ ట్యాక్స్ ఒకటి.

జీఎస్‌టీ
ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల విధానాన్ని సమూలంగా మారుస్తూ ఏకీకృత పన్నుల విధానం ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని రూపొందించారు. ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. జీఎస్‌టీ వస్తే వినియోగదారులపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని అంచనా.

బడ్జెట్ రూపకల్పన
క్లుప్తంగా చెప్పుకోవాలంటే... రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్‌ల రూపకల్పన. రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన రెవెన్యూ బడ్జెట్ రూపొందితే, క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన క్యాపిటల్ బడ్జెట్ రూపొందుతుంది. కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది.

సెప్టెంబర్ చివర్లో..

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్ చివర్లో..
తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు.

డిసెంబర్..
ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరి..
పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.

ముద్రణ ప్రక్రియ..
బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు.

ఫోన్ ట్యాపింగ్..
బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది.

సందర్శకులపై మూడో కన్ను..
ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సంద ర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

ఫిబ్రవరి చివర్లో..
బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

ఆహారంపై ఎంత జాగ్రత్తో..
ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు.

అత్యవసర సమయాల్లో..
ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

ఫిబ్రవరి 28/29..
సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు.

ఏ నాణెం ఎక్కడ తయారయింది?
  1. రూపాయి నాణెం చూసి.. అదెక్కడ తయారైందో చెప్పగలరా? ‘మింట్’లో.. అని చెబుతారా? అది సరే.. ఎక్కడి మింట్‌లో తయారైంది అని అడిగితే చెప్పగలరా? మీకీ విషయం తెలుసా? ప్రతి నాణెం అదెక్కడ తయారైందో తెలిపే సూచిక దానిపైనే ఉంటాయి. వాటి సంగతేంటో.. ఇక్కడ తెలుసుకుందాం.
  2. నాణెం ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘డైమండ్’ గుర్తు ఉంటే.. అది ముంబై మింట్‌లో తయారైనట్లు లెక్క.
  3. ముద్రణా సంవత్సరం కింది భాగంలో ఎలాంటి గుర్తు ఉండకుంటే.. అది కచ్చితంగా కోల్‌కతా మింట్నాణెమే.
  4. ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘చీలిన డైమండ్’ (స్ల్పిట్ డైమండ్) లేదా ‘చుక్క’ (డాట్) లేదా ‘స్టార్’ (నక్షత్రం) ఉందంటే.. అది మన హైదరాబాదీ మింట్ తయారీయే.
  5. ముద్రణా సంవత్సరం కింద ‘గుండ్రని బిందువు’ (రౌండ్ డాట్) ఉంటే.. అది నోయిడా మింట్ నాణెమన్న దానికి సంకేతం.
  6. ఇవేవీగాకుండా నాణెంపై ఇతర చిహ్నాలుంటే అవి విదేశీ మింట్‌లలో తయారైనట్టు లెక్క.
Published date : 19 Mar 2013 08:11PM

Photo Stories