Skip to main content

Jaganna Township : సొంత ఇల్లు ఉండాలనేదే మా సంకల్పం..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది.
Jaganna Township
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు.

జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటుకు..
మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి,  కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. 

తొలి విడత ఈ ప్రాంతాల్లోనే..
తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు.

ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..
మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఅవుట్‌లో తొలి విడతలో 538 ప్లాట్లు వేసినట్లు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఈ లేఅవుట్లలో ప్లాట్లు కొనాలనుకొనే వారు https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటరైజ్డ్‌ విధానంలో పూర్తి పారదర్శకతతో లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు. ప్రతి లే అవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను కేటాయించడంతో పాటు 20 శాతం రిబేటు కూడా ప్రకటించారు. దరఖాస్తు సమయంలో మొత్తం ప్లాటు ధర చెల్లించినవారికి ఐదు శాతం రాయితీ ఇస్తారు. పట్టణ నగర పాలక సంస్థల పరిధిలో ఉండే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ప్లాట్లకు ప్రజల్లో మంచి క్రేజ్‌ ఉంది.

నిబంధనలు ఇవే..
క్లియర్‌ టైటిల్‌ డీడ్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగం (డీటీసీపీ) అనుమతితో పాటు అన్ని వసతులతో వీటిని తీర్చిదిద్దారు. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలకు అనుగుణంగా వేసిన ఈ ప్లాట్లను రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే కేటాయిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు మొత్తం ప్లాట్‌ ధరలో 10% ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ప్లాట్‌ను కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో ఆన్‌లైన్‌లో చెల్లించాలి. కొనుగోలు ఒప్పందం కుదిరిన నెల రోజుల్లోపు 30%, ఆరు నెలల్లో మరో 30%, మిగిలిన 30 % నగదును ఏడాదిలోగా చెల్లించాలి.

తక్కువ ధరకే అన్ని వసతులతో..
మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేశారు. మార్కెట్‌ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీటికి మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మొత్తం ప్లాట్లు, చదరపు గజం ధర ఇలా..

ప్రత్యేకతలు ఇవే..

Jaganna township


న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్‌ డీడ్‌తో ప్రభుత్వమే వేస్తున్న ఈ లే అవుట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్‌లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు.

పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకుతో పాటు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నారు. లేఅవుట్‌ నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్, పట్టణాభివృద్ధి సంస్థల సంయుక్త నిర్వహణలో అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసే ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఎలాంటి వసతులు, అవసరాల కోసమైనా ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ నిధులు వెచ్చించవచ్చు.

Published date : 11 Jan 2022 12:04PM

Photo Stories