Skip to main content

కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి

భారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ బాలికమలాలా యూసుఫ్ జాయ్‌లు నోబెల్ శాంతి బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు.

కైలాశ్ సత్యార్థి:
వెట్టి చాకిరి నుంచి బాలల విముక్తికి 1980లో బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా పిల్లల హక్కుల కోసం కైలాశ్ సత్యార్థి పోరాడుతున్నారు. ఇప్పటి వరకూ 80 వేల మంది పిల్లల్ని వెట్టి చాకిరి, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించారు. ఆయన చేపట్టిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం పలు దేశాల్లో కొనసాగుతోంది. కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్‌లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా (1978, శాంతి), అమర్త్యసేన్ (1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు.

మలాలా యూసుఫ్ జాయ్:
పాకిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల మలాలా యూసుఫ్ జాయ్ బాలికల విద్యకోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. బాలికలు చదువుకోరాదంటూ తాలిబన్లు పాఠశాలల్ని పేల్చేశారు. తాలిబన్‌ల చర్యలకు ఎదురు తిరగడంతో 2012లో పాఠశాలకు వెళ్తున్న ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మలాలా లండన్‌లో చికిత్సపొందింది. ప్రస్తుతం ఆమె బర్మింగ్‌హమ్ స్కూల్లో చదువుకుంటోంది. ఐక్యరాజ్యసమితితో కలిసి విద్యా హక్కుల కోసం కృషి చేస్తోంది. అతి చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తిగా మలాలా రికార్డులకెక్కింది.

రసాయన శాస్త్రం
ఆప్టికల్ మైక్రోస్కోపును నానో స్కోపుగా మార్చే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది. అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్ (61), జర్మన్‌కు చెందిన స్టీఫెన్ హెల్ (51) లకు రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది.

అర్థశాస్త్రం
ఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్ (61) కు నోబెల్ బహుమతి దక్కింది. మార్కెట్ శక్తి సామర్థ్యాలు, నియంత్రణ గురించి ఆయన చేసిన పరిశోధనను గుర్తిస్తూ అకాడ మీ ఎంపిక చేసింది.

సాహిత్యం
నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మోడియానో (69)కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితాలను, నాజీల చేతుల్లో మారణ కాండకు గురైన యూదుల మనో భావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, అస్థిత్వాన్ని కోల్పోవడం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. మోడియానో ఫ్రెంచిలో 40కు పైగా నవలలు రాశారు. వాటిలో మిస్సింగ్ పర్సన్ నవలకు 1978లో ప్రతిష్ఠాత్మక ప్రిక్స్‌గాన్ కోర్టు అవార్డు లభించింది. ఆయన నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల్లో 11వ ఫ్రెంచ్ రచయిత.
Published date : 16 Oct 2014 12:30PM

Photo Stories