Skip to main content

లోక్‌పాల్.. అవినీతికి చెక్ పెడుతుందా?

దేశంలో అత్యున్నత స్థాయిలో అవినీతికి చెక్ పెడుతుందని భావిస్తున్న లోక్‌పాల్ చట్టం.. అనేక మార్పులు చే ర్పులు, సవరణల తర్వాత పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. అన్ని రకాల అవినీతిని ముఖ్యంగా ఉన్నత స్థాయిలోని అవినీతిని అరికట్టేందుకు చేసిన ప్రజా పోరాటంలో దీన్ని ఒక కీలక ఘట్టంగా చెప్పొచ్చు. పెరుగుతున్న అవినీతిని అరికట్టడానికి లోక్‌పాల్ వ్యవస్థ పటిష్టంగా పని చేయగలదా? మిగతా చట్టాల మాదిరిగానే లోక్‌పాల్ కూడా కాగితాలకే పరిమితం అవుతుందా? దీని నిర్మాణం-పరిధి, ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై విశ్లేషణ..

ప్రభుత్వ పాలనలోని అవినీతిని అరికట్టేందుకు స్కాండేనేవియన్ (ఫిన్‌లాండ్, డెన్మార్క్, నార్వే) దేశాలు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల అంబుడ్స్‌మన్ (Ombudsman) నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. భారతదేశంలో 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ లోక్‌పాల్ వంటి వ్యవస్థ అవశ్యకతను సూచించింది. అప్పటి నుంచి అనేక కమిటీలు ఇటువంటి ప్రతిపాదనలనే చేశాయి. అయితే లోక్‌పాల్ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందా? లేదా? అనే సంశయంతో ఇప్పటికీ ఎన్నో చట్టాలు తెచ్చారు. లోక్‌పాల్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడానికి మొట్టమొదట సారిగా 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి తొమ్మిది సార్లు ఈ బిల్లు పార్లమెంట్ తలుపు తడుతూ వచ్చింది. బలమైన లోక్‌పాల్ వ్యవస్థ కోసం సామాజిక ఉద్యమ నేతలు, ప్రజానీకం ఉధృతంగా ఉద్యమించటంతో ఒత్తిడికి తలొగ్గి కేంద్రప్రభుత్వం 2011లో పదో సారి ప్రవేశపెట్టిన బిల్లు చట్టంగా రూపుదాల్చుకుంది. ఇందుకు సంబంధించి లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు-2011కు పార్లమెంట్ గతేడాది డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది.

నిర్మాణం:
పార్లమెంట్ ఆమెదించిన బిల్లు ప్రకారం లోక్‌పాల్.. కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ. లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్‌తోపాటు గరిష్టంగా ఎనిమిదిమంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది సభ్యులు న్యాయ వ్యవ స్థ నేపథ్యం కలిగిన వారై ఉంటారు. మొత్తం సభ్యులలో సగం మంది సభ్యులను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీ వర్గాల నుంచి నియమిస్తారు. లోక్‌పాల్‌కు సొంత దర్యాప్తు విభాగంతోపాటు విచారణ (ప్రాసిక్యూషన్) వ్యవస్థ ఉంటుంది. లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకం కోసం చట్టంలో స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించారు. వీరి నియామకానికి ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి లేదా ఆయన సూచించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సభ్యులుగా వ్యవహరిస్తారు. మొదటి నలుగురు సభ్యులు చేసిన సూచనలాధారంగా రాష్ట్రపతి ప్రతిపాదించిన ప్రముఖ న్యాయవేత్త కూడా ఎంపిక కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తాడు. ఇలా మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తనకు సాయంగా ఏడుగురు నిపుణులతో ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసుకుంటుంది. లోక్‌పాల్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే సమకూరుస్తుంది.

పరిధి:
దేశ ప్రధానమంత్రి (కొన్ని పరిమితులు మినహా) కూడా లోక్‌పాల్ పరిధిలో ఉంటారు. అయితే ప్రధానిపై దర్యాప్తు చేపట్టేందుకు లోక్‌పాల్ ఫుల్ బెంచ్ (సభ్యులందరూ) కానీ, మూడింట రెండో వంతు మంది కానీ ఆమోదం తెలపాలి. ప్రధానిపై విచారణను రహస్యంగా (ఇన్ కెమెరా) నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ పరిధిలోకి వస్తారు. అయితే పార్లమెంట్‌లో చెప్పిన అంశాలపై కానీ, అక్కడ జరిగిన ఓటింగ్ అంశాలపై కానీ లోక్‌పాల్ ప్రమేయం ఉండదు. అవినీతి నిరోధక చట్టం-1988 కింద భాష్యం చెప్పిన గ్రూప్-ఏ,బీ,సీ, డీ తరగతుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిధులతో నడుస్తున్న, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల ఉద్యోగులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ నిధులు అందించే సొసైటీలు, ట్రస్టులు, సంఘాలు, విదేశాల నుంచి ఏటా రూ. 10 లక్షలకు మించి నిధులు అందుకునే అన్ని సంస్థలూ లోక్‌పాల్ పరిధిలో ఉంటాయి. ప్రార్ధనాస్థలాల నిర్మాణాలకు, మతపరమైన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి.

సీబీఐతోపాటు అన్ని రకాల విచారణ సంస్థలపై పర్యవేక్షణాధికారం కూడా లోక్‌పాల్‌కు ఉంటుంది.
విచారణ జరుగుతున్న సమయాల్లో కూడా అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోమని ఆదేశించే అధికారం కూడా లోక్‌పాల్‌కు ఉంటుంది.

రాష్ట్రాలలో:
లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి 365 రోజుల్లోగా (ఏడాదిలోగా) ఆయా రాష్ట్రాలు తమ శాసనసభల్లో చట్ట చేయడం ద్వారా లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లోకాయుక్త స్వరూప, స్వభావాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అవినీతిని లోకాయుక్త దర్యాప్తు చేస్తుంది. మహారాష్ట్రలో మొదటి సారిగా 1977లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1983లో లోకాయుక్త వ్యవస్థ చట్టబద్ధంగా ఏర్పాటైంది.

మంత్రదండం కాదు:
అవినీతిని అరికట్టాడానికి లోక్‌పాల్ వ్యవస్థ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే అవినీతిని నిరోధించేందుకు గ డచిన ఐదు దశాబ్దాల్లో డజను చట్టాలు, అంతే సంఖ్యలో సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. చట్టాలు, సంస్థలు కేవలం మార్గ నిర్దేశకంగా మాత్రమే ఉంటాయనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. వాటిని పటిష్టంగా, చిత్తశుద్ధితో అమలు చేసినపుడే ఆశించిన ఫలితం ఉంటుంది. ఈ విషయంలో ప్రజల్లో కూడా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది.

జనలోక్‌పాల్ - లోక్‌పాల్:
ఒక ఆదర్శవంతమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పౌర సమాజంలోని కొందరు ప్రముఖులు ముఖ్యంగా అన్నాహాజారే, అరవింద్ కేజ్రీవాల్, సంతోష్ హెగ్డే, శాంతి భూషణ్ మొదలైన వారు ఒక బిల్లును రూపొందించారు. దీన్నే జనలోక్‌పాల్ బిల్లు అంటారు. వీరు సూచించిన చాలా అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ప్రస్తుత లోక్‌పాల్ బిల్లును రూపొందించింది.

అర్హతలు-పదవీకాలం
  • లోక్‌పాల్ చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా గొప్ప న్యాయ కోవిధుడై ఉండాలి.
  • కమిటీలోని న్యాయ సంబంధిత సభ్యులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా పని చేసి ఉండాలి. వీరు పార్లమెంట్/ శాసనసభ.. సభ్యులుగా ఉండరాదు.
  • వీరి పదవీకాలం ఐదు సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయసు 75 ఏళ్లు. ఇందులో ఏదీ ముందు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
  • పదవీ విరమణ తర్వాత వీరు ఎటువంటి ప్రభుత్వ పదవులను చేపట్టడానికి అర్హులు కారు. సభ్యులను మాత్రం లోక్‌పాల్ చైర్మన్‌గా నియమించవచ్చు.
  • ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై కనీసం 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసి పిటిషన్ సమర్పించినట్లయితే.. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు సదరు సభ్యుడు/సభ్యురాలిపై విచారణ చేపట్టవచ్చు. లోక్‌పాల్ సభ్యుడిని/సభ్యురాలిని సుప్రీంకోర్టు సిఫారసు లేదా మధ్యంతర ఉత్తర్వు మేరకు రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై సుప్రీంకోర్టు విచారణ అనంతరం.. సదరు సభ్యుడు/సభ్యురాలిని రాష్ట్రపతి తొలగించవచ్చు.
పెనుసవాలు
అవినీతిని నిర్మూలించడం ప్రస్తుత పరిస్థితుల్లో పెనుసవాలుగా మారింది. దేశప్రగతిని ఆర్థిక వ్యవస్థను, రాజకీయ, సామాజిక ఇలా అన్నీ రంగాల అస్థిరతకు అవాంఛనీయ పరిస్థితులకు మొదటి కారణం అవినీతి. దీన్ని ప్రస్తుత పరిస్థితుల్లో అరికట్టాలంటే సమగ్ర చర్యలు అవసరం. ఈ దిశలో తీసుకోవాల్సిన చర్యలు: అవినీతికి పాల్పడుతున్న వారిని గుర్తించి తెలియజేసేవారు ఉండాలి. వీరిని ‘విజిల్ బ్లోయర్స్’ అంటారు. ఈ మధ్య కాలంలో వీరిపై భౌతిక దాడులు అధికమయ్యాయి. అలాంటి వారికి ప్రభుత్వ రక్షణతోపాటు సమాజం అండ కూడా ఉండాలి.
  • పరిపాలనా నిర్ణయాల్లో మరింత పారదర్శకత పెరగాలి.
  • సీబీఐతోపాటు ఇతర విచారణ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి.
  • పౌరుల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు సిటిజన్‌‌స చార్టర్ వంటి వ్యవస్థలకు చట్టబద్ధత కల్పించాలి.
  • అవినీతి వ్యతిరేక పోరాటంలో పౌరులకు మరింత ప్రోత్సాహాన్ని కల్పించేందుకు అవినీతి సొమ్ములో వారికి 50 శాతం నగదును రివార్డుగా అందించాలి.
  • ఎన్నికల్లో ధనప్రభావాన్ని అరికట్టేందుకు సమగ్ర ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి.
  • అధికార కేంద్రీకరణ కూడా అవినీతిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రజాతంత్ర వికేంద్రీకరణ ద్వారా అవినీతి నిర్మూలనకు బాటలు వేయవచ్చు.
  • సరళమైన, పారదర్శకమైన స్పందించే స్వభావం కలిగిన జవాబుదారీతనంతో కూడిన పాలనా వ్యవస్థను నిర్మించాలి. ఈ దిశలో ఈ-గవర్నెన్‌‌స వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి.
  • ఆర్థిక సరళీకరణల అనంతరం భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు విచక్షణాధికారాలను కట్టబెట్టుతున్నారు. ఇది అవినీతికి అవకాశం కల్పిస్తుంది. ఈ తరుణంలో సంబంధిత ప్రభుత్వాధికారుల విచక్షణాధికారాలను సమీక్షించాలి. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
అవినీతి నిర్మూలనకు చేసిన చట్టాలు
  • పబ్లిక్ సర్వెంట్స్ (ఎన్‌క్వైరీస్) యాక్ట్, 1850
  • ఇండియన్ కోడ్, 1860
  • స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1941
  • ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946
  • కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952
  • సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1964
  • స్టేట్ విజిలెన్స్ కమిషన్, 1964
  • రైల్వే సర్వీసెస్ రూల్స్, 1966
  • ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1968
  • ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988
Published date : 30 Jan 2014 06:07PM

Photo Stories