Skip to main content

విపత్తు నిర్వహణ - విశ్లేషణ

డా. బి.జె. బి. కృపాదానం , సీనియర్ సివిల్స్ ఫాకల్టీ, ఆర్.సి రెడ్డి స్టడీ సర్కిల్
భారతదేశంలో విపత్తు నిర్వహణ కంటే, దాని నిర్వహణ ఒక పెద్ద విపత్తు.. ఈ వ్యాఖ్యలో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు కానీ, ఇటీవల ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఉపద్రవం దానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించిన తీరు చూస్తే ఆ వ్యాఖ్యలు సమంజసమేమోననిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల తరచూ ప్రకృతి సిద్ధమైన విపత్తులు/ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 1990-2000 కాలాన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. ఆస్తి, ప్రాణనష్టాలను తగ్గిస్తూ, సామాజిక - ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి అంతర్జాతీయంగా సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చింది.

విపత్తులను ఎదుర్కోవడంలో భారతదేశానికి ఎంతో అనుభవం ఉంది. దేశంలో గత 110 సంవత్సరాలలో 90 లక్షలకు పైగా జన నష్టం జరిగింది. దేశంలో భూగర్భ, వాతావరణ, జీవ వైవిధ్యం అపారం. దీనికితోడు హిమాలయ పర్వతాలు భూకంపాలకు నిలయం. దాదాపు 60 శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది. 40 మిలియన్ హెక్టార్ల భూమి వరద బారినపడుతుంది. తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలు (ఎనిమిది శాతం భూమి) తుపానుల వల్ల తరచూ నష్టపోతుంటాయి. 68 శాతం భూభాగం దుర్భిక్షానికి గురవుతోంది. తరచూ సంభవిస్తున్న ఉపద్రవాలు భారతదేశంలో పరిమితంగా ఉన్న వనరులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విపత్తు పరిశోధనా కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత దశాబ్దంలో భారతదేశం వివిధ విపత్తుల వల్ల 24 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇందులో వరదల వల్ల 17 బిలియన్ డాలర్లు, భూకంపాల వల్ల 4.5 బిలియన్ డాలర్లు, దుర్భిక్షం వల్ల 1.5 బిలియన్ డాలర్లు. దేశంలో దాదాపు ప్రతి ఏటా కరువులు, వరదలు సంభవిస్తున్నాయి.

విపత్తు అంటే ఏమిటి?
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవ పూరిత సంఘటనే విపత్తు. దీని వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు ప్రస్ఫుటమౌతాయి.

విపత్తు ప్రధానంగా:
  1. సాధారణ జీవితానికి అంతరాయం కలిగిస్తుంది.
  2. అత్యవసర చర్యలకు ప్రతిబంధకంగా నిలుస్తుంది.
  3. దైనందిన అవసరాలైన, తిండి, బట్ట, వసతి వంటివి లభించడం దుర్లభమవుతుంది.
విపత్తులు ప్రకృతి సిద్ధమైనవి కావచ్చు, మానవ పూరితం (Man made) కావచ్చు. ఇవి భారీ ఎత్తున సంభవించవచ్చు లేదా స్వల్పమైనవి కావచ్చు.
  1. భారీఎత్తున సంభవించే ప్రకృతి సిద్ధ విపత్తులు: వరదలు, తుపానులు, సునామీ, కరవు, భూకంపాలు
  2. భారీ ఎత్తున సంభవించే మానవపూరిత విపత్తులు: యుద్ధాలు, రసాయన విస్ఫోటనాలు, కాలుష్యం, అణు ప్రమాదం, అడవుల నిర్మూలన (Deforestation)
  3. స్వల్ప ప్రకృతి సిద్ధ విపత్తులు: చలిగాలులు (Cold wave) ఉరుములతో కూడిన తుపానులు, వడగాలులు (Heat wave)
  4. స్వల్ప మానవ పూరిత విపత్తులు: రోడ్డు, రైలు ప్రమాదాలు, కొట్లాటలు, విషపూరిత ఆహారం (Food poisoning), పారిశ్రామిక విస్ఫోటనం, అగ్నిప్రమాదాలు.
భారతదేశంలో ఇటీవల కాలంలో సంభవించిన ఘోర విపత్తులు.
  • ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్)లో భూకంపం (1991)
  • లాతూర్‌లో (మహారాష్ర్ట) భూకంపం (1993)
  • ఒడిశాలో తుపాను (1999)
  • భుజ్ (గుజరాత్)లో భూకంపం (2001)
  • దక్షిణ కోస్తాలో సునామీ (2004)
  • గుజరాత్, ముంబైలో వరదలు (2005)
  • ముంబై మీద ఉగ్రవాదుల దాడి (2008)
  • లే (కాశ్మీర్)లో కుండపోత వర్షాలు (Cloud burst)
  • ఉత్తరాఖండ్ జలప్రళయం (2013)
విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు:
  1. సంసిద్ధత (Preparedness)
  2. ఉపశమన చర్యలు (Mitigation)
  3. సహాయ చర్యలు (Relief)
  4. పునరావాసం (Rehabilitation)
విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాలైన విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచికలు కనబడకపోవచ్చు. భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవిస్తాయి. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని ప్రమాదం నుంచి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించడం. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారి అవసరాలను తీర్చడం సహాయచర్య. తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం మొదలైన చర్యలు, ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు రుణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

విపత్తు నిర్వహణకు ప్రభుత్వం రూపొందించిన యంత్రాంగం:
కేంద్ర ప్రభుత్వం 1999లో నియమించిన కె.సి.పంత్ కమిటీ కింది సిఫార్సులు చేసింది.
  1. విపత్తు నిర్వహణకు సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాలి (విపత్తు నివారణ, సంసిద్ధత, ఉపశమనం).
  2. విపత్తు నిర్వహణ కోసం కేంద్ర, రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో 10 శాతం ప్రణాళికా నిధులు కేటాయించాలి.
  3. భూకంపాలు సంభవించే పట్టణ ప్రాంతాల్లో పటిష్ట నిర్మాణాలకు ప్రమాణాలు రూపొందించాలి.
దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సిఫార్సులను సక్రమంగా అమలు చేయలేదు. అయితే, 2005లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును ఆమోదించింది. చట్ట రూపాన్ని సంతరించుకొన్న ఈ విధానం ప్రకారం జాతీయ, రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పని చేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ, శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థ (National institute of disaster management) ఏర్పాటు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని (National disaster response force) ఏర్పాటు చేశారు. వీటికి తోడు 1. జాతీయ అగ్నిమాపక కళాశాల (National fire service college). 2. జాతీయ పౌర రక్షణ కళాశాల (National civil defence college) లను ప్రారంభించారు.

ప్రభుత్వ పథకాలు:
కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న పథకాలు...
  1. రాష్ర్ట విపత్తు స్పందన నిధి (State disaster response fund)
  2. విపత్తు స్పందన సామర్థ్యం పెంపుదల (Capacity building for disaster response) రాష్ర్ట, జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులకు తగిన తర్ఫీదునిచ్చి ప్రావీణ్యాన్ని మెరుగుపరచడానికి నిధులు సమకూర్చారు.
  3. అగ్నిమాపక సేవల పునరుద్ధరణ (Revamping of fire services)
  4. పౌర రక్షణ పునరుద్ధరణ (Revamping of civil defence setup)
అంతర్జాతీయ స్థాయిలో:
  1. భారత ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమ వ్యవస్థ భాగస్వామ్యం.
  2. భారత ప్రభుత్వం- అమెరికా ప్రభుత్వం భాగస్వామ్యం. ఈ రెండు కార్యక్రమాలు విపత్తు నిర్వహణ ప్రక్రియను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి.
పైన వివరించినట్లు భారీ పాలనా యంత్రాంగాన్ని రూపొందించినప్పటికీ వేల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తున్నప్పటికీ విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి.

మానవ తప్పిదాల వల్లే:
వాస్తవానికి ప్రపంచంలో పెద్ద, చిన్న విపత్తులన్నీ మానవ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని ఒప్పుకోక తప్పదు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ లోయలో సంభవించిన జలప్రళయం చాలా వరకూ మానవ తప్పిదమే. పర్యావరణానికి హాని కలిగించే పలు చర్యలు ఈ ఉపద్రవానికి కారణం. విచక్షణారహితంగా చెట్లను నరికివేయడం, యాత్రికుల సౌకర్యార్థమై విస్తృత రోడ్ల నిర్మాణం, హోటళ్లు, వసతి గృహాలు, షాపుల నిర్మాణం వంటి కార్యకలాపాలు పెళుసుగా ఉన్న కొండ చరియలు విరిగిపోవడానికి కారణం. దీనికితోడు విపత్తు నివారణసంభవిస్తే దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తగిన సాధన సంపత్తి లేకపోవడం, ఒకవేళ ఉన్నా దాన్ని సకాలంలో వినియోగించే స్థితిలో పాలనా యంత్రాంగం లేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, ఒకరిని ఇంకొకరు తప్పుపడుతూ, వేల మంది ప్రజలు ఆహుతికి, వేల కోట్ల ఆస్తి నష్టానికి కారణమయ్యారు.

చికిత్స కంటే నివారణే చౌక:
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రస్తావించినట్లు విపత్తు సంభవించే వరకు వేచి ఉండవద్దు. ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఎన్నో విలువైన ప్రాణాలను, ఆస్తిని కాపాడవచ్చు. నివారణ చర్యలు తీసుకోవడానికి మా వద్ద వనరులు లేవని తృతీయ ప్రపంచ దేశాలు తరచుగా వినిపించే మాట. వాస్తవానికి చికిత్స కంటే నివారణ వ్యయమే తక్కువ. ఉదాహరణకు చైనా 1960-2000 మధ్యలో వరదల ఉద్ధృతిని తగ్గించడానికి 3.5 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా 12 బిలియన్ డాలర్ల నష్టాన్ని నివారించగలిగింది. 2010లో హైతీ, చిలీ, కాలిఫోర్నియా (అమెరికా)లో భూకంపాలు సంభవించాయి. చిలీ, కాలిఫోర్నియాలో సంభవించిన భూకంపాలు హైతీలో కంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నప్పటికీ హైతీలో 2,30,000 మంది మరణిస్తే, చిలీలో కొన్ని వందల మంది, కాలిఫోర్నియాలో నలుగురు మరణించారు. దీనికి కారణం హైతీలో భవన నిర్మాణ విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం. మిగిలిన రెండు దేశాలు ప్రమాణాలను పాటించడం. ఈ రెండు దేశాలు విపత్తు నిర్వహణలో తగిన శ్రద్ధ చూపించాయి. అందుకే ఈ దేశాలలో జరిగిన జననష్టం, ఆస్తి నష్టం కూడా తక్కువే.

హైగో కార్యాచరణ:
ఐక్యరాజ్యసమితి చొరవతో 2005లో హైగో కార్యాచరణ పథకం (Hyogo framework for action) రూపొందింది. 168 సభ్యదేశాలు దీన్ని ఆమోదించాయి. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ మౌలిక సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి. ఉత్తరాఖండ్‌లో సహాయక కార్యక్రమాలు సకాలంలో చేపట్టలేకపోవడానికి ముఖ్య కారణం బలహీన మౌలిక సదుపాయాలే. రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, విద్యుచ్ఛక్తి; ముఖ్య, నిత్యావసర వస్తువుల నిల్వకు సరైన వసతి లేకపోవడం, సంక్షోభ సమయాల్లో శీఘ్రగతిన మానవహిత సహాయం (Humanitarian aid) అందకపోవడం. అందుకు సకాలంలో వనరుల సేకరణ, వాటిని వెంటనే నిర్దేశిత ప్రాంతాలకు తరలించడం, వినియోగించేంత వరకు భద్రంగా దాచిపెట్టడం జరగాలి. ఇది సరైన వ్యూహం. సంక్షోభ సమయాల్లో మన రక్షణ దళాలు అందిస్తున్న సేవలు అమోఘం. వాటికి మనమెప్పుడూ రుణపడి ఉంటాం. వీటితోపాటు రెడ్‌క్రాస్, యునిసెఫ్, ప్రపంచ ఆహార, ఆరోగ్య సంస్థలు ఆక్స్‌ఫామ్ అందిస్తున్న సేవలు కూడా శ్లాఘనీయం. బడా పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు వ్యక్తిగతంగా సహాయం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యం మాత్రం ఆశించిన రీతిలో లేదు.

కొరవడిన సమన్వయం:
పౌర రక్షణ (Civil defence) వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ అది ప్రజలకు తగిన అవగాహన కల్పించడంలో, శిక్షణనివ్వడంలో విజయవంతమైనట్లు కనిపించడం లేదు. సంక్షోభ సమయంలో తాను ఎలా స్పందించాలనే విషయంలో సగటు పౌరునికి తగిన శిక్షణ లేదు. పాఠశాల స్థాయిలో విపత్తు నిర్వహణ పాఠ్యాంశంగా చేర్చినప్పటికీ, బోధనలో దానికి తగిన ప్రాధాన్యత కొరవడింది. దీనికితోడు కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం లేదు. విధ్వంసక చర్యల నివారణలో భాగంగా జాతీయ ఉగ్రవాద నివారణ కేంద్రం (National counter terrorism) ఏర్పాటు విషయంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందనే నినాదంతో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చడం విచారకరం. దీనికి కొంత వరకు మీడియా మితిమీరిన స్పందన కూడా కారణం. ఈ సంస్థలు వాటి రేటింగ్ కోసం ప్రతి అంశాన్ని వివాదాస్పదంగా మార్చి గోరంతలు కొండంతలుగా చేస్తుంటాయి. విపత్తు నిర్వహణ సరిగా లేకపోతే దేశభద్రతకు విఘాతం కలుగుతుంది. అది మన ఉనికికే ప్రమాదం. విభేదాలు పక్కన పెట్టి సంఘటితంగా స్పందించినప్పుడే విపత్తు నివారణ, విపత్తు సంభవిస్తే ఉపశమన చర్యలు, సకాలంలో సహాయం, పునరావాసం వీలవుతుంది. అదే జాతీయ భద్రత (National security).

Published date : 25 Jul 2013 03:28PM

Photo Stories