Skip to main content

భారతదేశంలో తుఫాన్లు - విపత్తు నిర్వహణ

పి నరసింహులు, పోటీ పరీక్షల విశ్లేషకులు
భారతదేశంలో తుఫాన్లు - విపత్తు నిర్వహణ భారతదేశ తీరరేఖ ప్రాంతం ప్రపంచంలోనే ఎక్కువగా తుఫాన్లు తాకిడి కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఏటా సంభవించే తుఫాన్లలో 8 శాతం భారతదేశంలోనే సంభవిస్తుంటాయి. ఎక్కువగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య తుఫాన్లు వస్తుంటాయి. అయితే, ఈ ఏడాది(2013)లో వరుసగా నాలుగు తీవ్ర తుఫాన్లు వెనువెంటనే సంభవించడం సాధారణ ప్రజలకే కాకుండా పర్యావరణవేత్తలకు, ప్రభుత్వాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. 2013 మే నుంచి డిసెంబర్ మధ్య ఇప్పటివరకు తూర్పు తీరంలో ఐదు తుఫాన్లు సంభవించాయి. అవి: మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్). ఇందులో మహాసేన్ ఒక్కటి మాత్రమే సాధారణ తుఫాను కాగా, మిగతావన్నీ పెనుతుఫాన్లు.

2013 అక్టోబర్ 12న ఒడిషాలోని గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని తాకిన ఫైలిన్ తుఫాను ఇంతకు ముందెన్నడు లేని రీతిలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. 1999 ఒరిస్సా సూపర్ సైక్లోన్ అనంతరం అంతటి పెను తుఫానుగా ఫైలిన్‌ను పేర్కొనవచ్చు. ఫైలిన్ ఒక్క ఒడిషా రాష్ర్టంలోనే 18 జిల్లాల్లోని 1.33 కోట్ల మందిపై ప్రభావం చూపింది. ఫైలిన్ తుఫాను, దానివల్ల వచ్చిన వరదల కారణంగా ఒడిషాలో 2.1 లక్షల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రూ. 4,200 కోట్ల నష్టం వాటిల్లింది. గడిచిన 23 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 5,50,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ రెండు రాష్ట్రాలతో పాటు అండమాన్-నికోబార్ దీవులు, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, చత్తీస్‌గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా ఫైలిన్ వణికించింది. ఫైలిన్ తాకిడికి నేపాల్‌లోని కోసి, గండకి నదులకు వరదలు వచ్చాయి. అక్కడ ఏటా ఘనంగా జరుపుకునే దశేన్ పండుగ ఈ తుఫాను కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భారత వాతావరణ శాఖ ఫైలిన్‌ను అత్యంత తీవ్రమైన చక్రవాత తుఫాను అలజడి (Very Severe Cyclonic Storm)గా వర్గీకరించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 260 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి.

ఫైలిన్, దాని అనంతరం వచ్చిన హెలెన్, లెహర్ తదితర తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలోని రైతులు 12 లక్షల ఎకరాల్లోపంటను పూర్తిగా కోల్పోయారు. ఇది మొత్తం ఖరీఫ్ విస్తీర్ణంలో 7వ వంతు ఉంటుంది. ఇవన్నీ అధికారిక గణాంకాలు మాత్రమే. అనధికారిక అంచనాల ప్రకారం ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. వరుసగా వస్తున్న తుఫాన్ల వల్ల విపరీతమైన పంట, ఆస్తి, పశు నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా గణనీయంగా ఉంటోంది. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు చేపడుతున్న విపత్తు నిర్వహణ కార్యక్రమాల వల్ల ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించగలిగినప్పటికీ, పంట నష్టాలను, పర్యావరణ విధ్వంసాన్ని, విపత్తుల వల్ల వచ్చే ఇతర నష్టాలను కుదించడం సాధ్యం కావడం లేదు.

భారతదేశంలో తుఫాన్లు
ప్రపంచంలో అత్యంత విపత్తు ముప్పు కలిగి ఉన్న మొదటి 10 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఇందుకు అనేక ప్రకృతిపరమైన, మానవప్రేరేపిత కారకాలు దోహదం చేస్తున్నాయి. ప్రతికూల భౌగోళిక, శీతోష్ణస్థితి పరిస్థితులు, స్థలాకృతి స్వభావాలు, పర్యావరణ క్షీణత, జనాభా వృద్ధి, పట్టణీకరణ పెరుగుదల, పారిశ్రామికీకరణ మొదలైన వాటిల్లో అశాస్త్రీయ పద్ధతుల అవలంబన మొదలైన కారణాల వల్ల దేశంలో విపత్తుల తీవ్రత పెరుగుతోంది. ఈ కారకాలు నేరుగా గానీ, విపత్తు తీవ్రతను, ఆవృత్తిని పెంచడం ద్వారా గానీ పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

భారతదేశం తుఫాన్లు, వరదలు, భూకంపాలు, కరువులు వంటి ప్రకృతి విపత్తులకు దారితీయడానికి దాని విశిష్టమైన భౌగోళిక, భౌమ పరిస్థితులు చాలా వరకు దోహదపడుతున్నాయి. విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి, భారత దేశాన్ని ఐదు ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి...
  1. హిమాలయ ప్రాంతం
  2. ఒండ్రు మైదానాలు
  3. ద్వీపకల్పంలోని కొండల భాగం
  4. తీరప్రాంత మండలం
  5. ఎడారి ప్రాంతం
హిమాలయ ప్రాంతం భూకంపాలు, భూపాతాల వంటి విపత్తుల ముప్పు కలిగి ఉంటే, మైదాన ప్రాంతాలు దాదాపు ప్రతి సంవత్సరం వరదలకు గురవుతున్నాయి. దేశంలోని ఎడారి ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలు కరువుకాటకాలకు లోనవుతుండగా, తీర ప్రాంతాలు తుఫాన్లు, గాలివానలను ఎదుర్కొంటున్నాయి.

తక్కువ లోతు కలిగిన మహాసముద్ర సంస్తరం (Ocean Bed), తీర ప్రాంతపు తీరు కారణంగా భారత ఉపఖండం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన తుఫాను ప్రభావిత ప్రాంతంగా మారింది. భారతదేశంలో తుఫాన్లు చాలా వరకు మిత స్వభావం కలిగి ఉంటాయి. బలమైన గాలులు వీయడం, అసాధారణ వర్షం, తుఫాను కల్లోలం సృష్టించడం వీటి లక్షణాలు. కొన్ని సందర్భాల్లో భారీ కుండపోత వర్షం కురవడం వల్ల సముద్రమట్టాలు పెరిగి, లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడుతుంది. ఒక తుఫాను ఏర్పడటం, బలహీనపడి క్షీణించడం వరకు మధ్య ఉండే వ్యవధి సాధారణంగా 24 గంటల నుంచి ఆరు రోజులు. అయితే అసాధారణ పరిస్థితుల్లో ఈ వ్యవధి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు.

చరిత్రలో ఇప్పటివరకు అత్యంత సుదీర్ఘమైన వ్యవధి కలిగిన తుఫానుగా టైఫూన్ జాన్ నమోదైంది. ఈశాన్య, వాయువ్య పసిఫిక్ పరివాహక ప్రాంతంలో 1994 ఆగస్ట్, సెప్టెంబర్‌లలో ఏర్పడిన ఈ తుఫాను 31 రోజుల పాటు కొనసాగింది. సాధారణ చక్రవాత తుఫాన్లు గంటకు 65 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకితే, బలమైన తుఫాన్లు గంటకు 119 నుంచి 164 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. పెనుతుఫాన్లు అంతకంటే తీవ్రమైన వేగంతో దుసుకొస్తాయి. 1999 అక్టోబర్ 29న వచ్చిన సూపర్ సైక్లోన్ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఒడిషా తీరాన్ని తాకింది. దీన్నే ఇప్పటి వరకు భారతదేశంలో సంభవించిన అత్యంత తీవ్రమైన తుఫానుగా భావిస్తున్నారు. 2013 అక్టోబర్ 12న ఒడిషాలోని గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని తాకిని ఫైలిన్‌ను కూడా అత్యంత తీవ్రమైన పెను తుఫానుగా పేర్కొంటున్నారు.

మొత్తం భారతదేశ వైశాల్యంలో 8 శాతం ప్రాంతానికి తుఫాన్లు ముప్పు పొంచి ఉంది. తీరరేఖ వెంబడి ఉండే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిషా, పశ్చిమబెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షదీవుల్లోని 71% భూభాగంపై తుఫాన్ల ప్రభావం ఉంటోంది. ప్రతి సంవత్సరం బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫాన్లలో సుమారు ఐదు నుంచి ఆరు ఉష్ణమండల చక్రవాత తుఫాను అలజడులు తీరాన్ని దాటుతుంటాయి. ఇందులో రెండు లేదా మూడు చాలా తీవ్రంగా ఉంటాయి. అరేబియా సముద్రంతో పోల్చుకుంటే బంగాళాఖాతంలో తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రెండు సముద్రాల్లో తుఫాన్లు సంభవించే తీరు 4:1 నిష్పత్తిలో ఉంటుందని అంచనా వేశారు. లోతు తక్కువగా ఉండే బంగాళాఖాత ఉత్తర తీరంలో తుఫాను కల్లోలం అధికంగా ఉంటుంది. అందువల్ల పశ్చిమ తీరంతో పోల్చుకుంటే భారతదేశంలో తూర్పు తీరరేఖే తుఫాన్లకు అత్యంత అనువుగా ఉంటోంది. భారతదేశంలో సంభవించే మొత్తం తుఫాన్లలో 80 శాతం తూర్పు తీరరేఖను తాకుతుంటాయి. ప్రపంచంలోని ఇతర సముద్రాల్లో ఉద్భవించే తుఫాన్లతో పోల్చుకుంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉద్భవించే ఉష్ణమండల తుఫాన్ల ఆవృత్తి (Frequency) చాలా ఎక్కువగా ఉంటుంది.

తుఫాన్ల వల్ల నష్టాలు
తుఫాను అలజడి కారణంగా వచ్చే బలమైన గాలులు, విస్తారమైన వర్షాలు, వాటివల్ల వచ్చే వరదలు కలిసి భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని కలుగజేస్తాయి. 1999లో ఒడిషాలో వచ్చిన సూపర్ సైక్లోన్ కారణంగా 10వేల మందికి పైగా మరణించగా, అంతకంటే ముందు1977 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన భయంకర తుఫాను కారణంగా 9941 మంది చనిపోయారు. 34 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2.5 లక్షల పశువులు చనిపోయాయి. 33,36,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. 2013 అక్టోబర్‌లో వచ్చిన ఫైలిన్ తుఫాను కూడా భారీ విధ్వంసం సృష్టించింది.

తుఫాన్లు సృష్టించే విధ్వంసం ప్రధానంగా తుఫాను తీవ్రత, దాని పరిమాణం, అది సంభవించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. పెను తుఫాన్లు అడవులను సైతం ధ్వంసం చేస్తాయి. ఇటీవల వచ్చిన ఫైలిన్ తుఫాను వల్ల ఒడిషా రాష్ర్టంలో 26 లక్షలకు పైగా చెట్లు నేలకూలాయి. తీర ప్రాంతంలో ల్యాండు స్కేపుల రూపురేఖలను సైతం మార్చివేస్తాయి. ఇసుక దిన్నెలను తొలగించడం లేదా వాటి రూపురేఖలను మార్చడం ద్వారా తీరం వెంబడి భూక్షయానికి దారితీస్తాయి. తుఫాన్ల వల్ల వచ్చే భారీ వర్షాల కారణంగా తీరం వెంబడే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో సైతం విధ్వంసం జరుగుతుంది. పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటం(భూపాతాలు-Landslides),బురదపవాహాలు (పంకపాతాలు- Mudslides) వంటివి జరుగుతాయి. తుఫాను సంభవించిన సమీప ప్రాంతంలోని గుహల్లో ఆక్సిజన్ - 18 ఐసోటోపు గాఢత పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

తుఫాను సృష్టించిన విధ్వంసం అంతటితోనే ఆగిపోదు. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండటం వల్ల అంటువ్యాధులు వ్యాపిస్తాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి. ఉష్ణమండల తుఫాన్ల కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా. ఉష్ణమండల తుఫాన్లు సముద్రంలో 6 x 1014 వాట్ల వేగంతో ఊర్ధ్వముఖంగా ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తాయి. సాధారణంగా ఒక తుఫాను అలజడి ఏర్పడిన తర్వాత సముద్రంలోని నీరు సుడిగుండం లాగా తిరిగి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది. ఈ చల్లటి తరంగం కారణంగా వెనువెంటనే అదే ప్రాంతంలో మరో తుఫాను ఏర్పడటానికి అవకాశం ఉండదు. కానీ, కొన్నిసార్లు దీనికి భిన్నంగా జరిగి, వెనువెంటనే తుఫాన్లు ఏర్పడవచ్చు. ఇది అరుదుగా మాత్రమే జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాలు తుఫాన్ల వల్ల అధికంగా నష్టాలకు గురికావడానికి కారణాలు
  1. బంగాళాఖాతంలో సంభవించే సగం తుఫాన్లు తరచుగా తుఫాను అలజడులతో కూడిన తీవ్ర చక్రవాతాలుగా మారడం.
  2. తీరం వెంబడి లోతట్టులో ఉండే ప్రాంతాలు అసాధారణ వరదలకు, సముద్రపు నీటి ముంపునకు గురవడం.
  3. తీరం వెంబడి జనాభా, మౌలిక వసతులు, ఆర్థిక కార్యకలాపాలు అధికంగా కేంద్రీకృతం కావడం.
  4. వరద సంరక్షణ, సాగునీటిపారుదల వ్యవస్థలు, మురుగునీటి కాలువలు, ఆనకట్టల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
  5. తీరప్రాంత, డెల్టా నిర్వహణ సమగ్రంగా లేకపోవడం.
భారతదేశంలో తుఫాను హెచ్చరికలు
అల్పపీడనం ఏర్పడి, అది తుఫానుగా మారి, విధ్వంసం సృష్టించడాన్ని కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల ముందే పసిగట్టవచ్చు. కృత్రిమ ఉపగ్రహాలు తుఫాన్ల కదలికలను పసిగడతాయి. దాని ఆధారంగా, అవి ప్రభావితం చేయబోయే ప్రాంతాల నుంచి ప్రజలను ముందుగానే ఖాళీ చేయిస్తారు. అయితే తుఫాన్లను నిక్కచ్చిగా అంచనా వేయడం చాలా కష్టం. కచ్చితమైన హెచ్చరికలను కొద్ది గంటలు ముందుగా మాత్రమే ఇవ్వడం సాధ్యమవుతుంది.

ప్రపంచంలో అత్యుత్తమ తుఫాను హెచ్చరిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో తుఫాన్ల రాకను అంచనా వేసి, హెచ్చరికలను జారీ చేసే బాధ్యతను భారత వాతావరణ శాఖ(ఐఛీజ్చీ Meteorological Department-IMD) నిర్వర్తిస్తుంది. ఇన్‌శాట్ ఉపగ్రహాలతోపాటు 10 సైక్లోన్ డిటెక్షన్ రాడార్ల సహాయంతో చక్రవాతాల రాకను, అవి ప్రయాణించే మార్గాన్ని పసిగడతారు. కోల్‌కతా, చెన్నై, ముంబైలలోని ఏరియా సైక్లోన్ హెచ్చరికల కేంద్రాలు, విశాఖపట్టణం, భువనేశ్వర్, అహ్మదాబాద్‌లలో ఉన్న తుఫాను హెచ్చరికల కేంద్రాల ద్వారా తుఫాను హెచ్చరికలను జారీ చేస్తారు. తుఫాను హెచ్చరికల ప్రక్రియను పుణెలోని డీడీజీఎం వాతావరణ కేంద్రం, న్యూఢిల్లీలోని నార్తరన్ హెమిస్ఫెరిక్ ఎనాలసిస్ సెంటర్(ూౌట్టజ్ఛిట Hemispheric Analysis Centre)లు సమన్వయపరుస్తాయి. అనంతరం తుఫాను హెచ్చరికలను ప్రజలకు శాటిలైట్ ఆధారిత విపత్తు హెచ్చరికల వ్యవస్థ, రేడియో, టెలివిజన్, టెలిఫోన్, ఫ్యాక్స్, హై ప్రయారిటీ టెలిగ్రాములు, బహిరంగ ప్రకటనలు, పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేసి అప్రమత్తం చేస్తారు.

తుఫాను ఉపశమన చర్యలు
7516 కిలోమీటర్ల భారతదేశ తీరరేఖలో 5700 (71%) కిలోమీటర్ల భూభాగం తుఫాను అలజడులు, తుఫాన్లు, సునామీల ముప్పును కలిగి ఉంది. భారతదేశంలో ఏటా వచ్చే తుఫాన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. జీవనోపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోంది. మౌలిక వసతులు ధ్వంసమవుతున్నాయి. తద్వారా అప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమన మార్గం పడుతోంది. దీని నివారణకు కొన్ని ఉపశమన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి రెండు రకాలు: 1. నిర్మాణాత్మక ఉపశమన చర్యలు, 2. నిర్మాణేతర ఉపశమన చర్యలు.

తీర ప్రాంతాల్లో బహుళార్ధ సాధకతుఫాను షెల్టర్లను నిర్మించడం, తీరరేఖ వెంబడి శాస్త్రీయ పద్ధతిలో మడ అడవులను పెంచడం, వృక్షాలను నాటడం వంటి చర్యలు చేపట్టాలి. అడవులు బలమైన గాలులు, ఆకస్మిక వరదలను అడ్డుకునే కవచంలాగా పని చేస్తాయి. వీటితోపాటు భవనాలను బలమైన గాలులను తట్టుకునే విధంగా దృఢంగా నిర్మించడంతో పాటు ఎత్తయిన దిన్నెలు లేదా మట్టి దిబ్బలపై నిర్మించాలి. ఆయా ప్రాంతాలకు సంబంధించిన వైపరీత్యాల మ్యాపులను తయారుచేసి, ప్రజలకు అవగాహన కల్పించాలి. తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల్లో సంక్లిష్టమైన నిర్మాణాలు, కార్యకలాపాలు చాలా తక్కువగా ఉండే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్తపడాలి. వరదలు సంభవించే మైదాన ప్రాంతాల్లో ఉండే భూ వినియోగాన్ని క్రమబద్ధీకరించే విధానాలను, భవన నిర్మాణ కోడ్‌లను రూపొందించి అమలు చేయాలి.

ఈ చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేసేందుకు జాతీయ తుఫాను ముప్పు ఉపశమన ప్రాజెక్టు (National Cyclone Risk Mitigation Project)ను 2009-10లో ప్రారంభించింది. 5 ఏళ్లపాటు అమల్లో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.

తుఫాను నష్టాల తగ్గింపులో విపత్తు నిర్వహణ ప్రభావం
తుఫాన్ల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో వాటివల్ల సంభవించే ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతోంది. 1970లో పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లలో వచ్చిన భోలా తుఫాను తాకిడికి రెండు ప్రాంతాల్లో కలిపి 5 లక్షల మంది మరణించారు. అలాగే 1999 ఒడిషా సూపర్ సైక్లోన్ కారణంగా 10,000 మంది మరణించగా, 1977లో చెన్నై, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో వచ్చిన తుఫాను ధాటికి 14,204 మంది చనిపోవడం జరిగింది. ప్రాణ నష్టంతో గణనీయంగా పంటలు దెబ్బతినడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు విధ్వంసం కావడం జరిగింది. అయితే 2004లో వచ్చిన సునామీ అనంతరం విపత్తు నిర్వహణపై భారతదేశంలో కూడా అప్రమత్తత ప్రారంభమైంది. తత్ఫలితంగానే 2005లో విపత్తు నిర్వహణ చట్టం రూపుదాల్చడం, అందులో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ర్ట విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థలు ఏర్పాటు కావడం, వాటిని జిల్లా, గ్రామ స్థాయి వరకు వికేంద్రీకరించడం, పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, పంచవర్ష ప్రణాళికలో, ఆర్థిక సంఘాల నిధుల కేటాయింపుల్లో విపత్తు నిర్వహణకు స్థానం కల్పించడం తదితర చర్యలు కారణంగా విపత్తు నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలో విపత్తుల కారణంగా జీడీపీలో 2 నుంచి 2.25% వరకు నష్టం జరుగుతున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కాబట్టి విపత్తు నిర్వహణకు భారతదేశం పెద్ద పీట వేస్తోంది. తత్ఫలితంగా విపత్తుల నివారణతోపాటు విపత్తు సమయంలో చేపట్టాల్సిన చర్యలపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దేశంలో 10 చోట్ల జాతీయ విపత్తు స్పందన దళాల(ఎన్‌డీఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేయడం జరిగింది. 2007 నవంబర్‌లో * 100 కోట్లతో జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (National Disaster Response Fund (NDRF))ను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. 13వ ఆర్థిక సంఘం రాష్ర్ట విపత్తు స్పందన నిధి (State Disaster Response Fund (SDRF)), జాతీయ విపత్తు స్పందన నిధుల(National Disaster Response Fund)ల కోసం పథకాలను సిఫారసు చేసింది. ఈ చర్యల ఫలితంగా విపత్తుల వల్ల సంభవించే నష్టాలు గణనీయంగా తగ్గాయి. ప్రధానంగా ప్రాణ నష్టం భారీగా తగ్గింది. 1999లో వచ్చిన ఒడిషా సూపర్ సైక్లోన్ ధాటికి 10వేల మందికి పైగా మరణించగా, 2013 అక్టోబర్‌లో వచ్చిన ఫైలిన్ పెను తుఫానులో మరణించినవారు 44 మంది మాత్రమే. ఇందుకు సాంకేతిక విప్లవం కూడా చాలా వరకు దోహం చేసిందని చెప్పొచ్చు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాతావరణ రేడియోలు, హామ్ రేడియోలు, సెరైన్లు, లౌడుస్పీకర్లు, ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు లేదా ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్ల ద్వారా అందే సందేశాలు ప్రజలను చాలా వేగవంతంగా అప్రమత్తం చేసి, ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. గూగుల్ సెర్‌‌చ ఇంజన్ కామన్ అలర్‌‌ట ప్రోటోకాల్(Common Alert Protocol (CAP) ఆధారిత అలర్‌‌టలను ప్రారంభించింది. ట్విటర్ సామాజిక వెబ్‌సైట్ ట్విటర్ అలర్‌‌ట పేరుతో ఒక యాప్‌ను ఆవిష్కరించింది. ఇలా బహుముఖాలుగా విపత్తు నిర్వహణకు ప్రాధాన్యత పెరగడంతో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతున్నప్పటికీ, పంట నష్టం, ఆస్తి నష్టం, పశుసంపద నష్టం, పర్యావరణానికి జరిగే నష్టాలను కుదించలేకపోతున్నారు. దీనికి సైతం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అడవులను పెంచడం, భూతాపాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టడం, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యల ద్వారా విపత్తులను కుదించి, వాటివల్ల సంభవించే నష్టాలను కూడా నివారించవచ్చు.
Published date : 27 Dec 2013 05:35PM

Photo Stories