Skip to main content

వసంతం నుంచి శిశిరం దిశగా అరబ్ విప్లవం

ప్రేమ విఘ్నేశ్వర రావు కె.
అరబ్ దేశాలలో విప్లవ వసంత కాలం వెళ్ళి మతోన్మాద శిశిరంలోకి ప్రవేశించినట్లనిపిస్తుంది. రెండు మూడు దశాబ్దాల నుంచి అధికారంలో కొనసాగుతున్న నియంత పాలకులకు, పార్టీలకు వ్యతిరేకంగా అరబ్ దేశాల్లో పెల్లుబికిన తిరుగుబాట్లనే అరబ్ వసంతం లేదా అరబ్ స్ప్రింగ్ అని పిలుస్తున్నారు. 2010 సంవత్సరంలో డిసెంబర్ 18న ప్రారంభమయిన ఈ అరబ్ స్ప్రింగ్ ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, మొరాకో, సూడాన్, ఒమన్, పశ్చిమ సహారాలను కుదిపేసింది. ఈ సంచలనం మొదలై రెండేళ్ళు అయ్యింది. అయితే ఈ ప్రభంజనం ఎంత వరకు సత్ఫలితాలిచ్చింది? అనుకున్న లక్ష్యం నెరవేరిందా? అరబ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? అన్నవి మన ముందున్న ప్రశ్నలు.

అరబ్ విప్లవం నేపథ్యం
అరబ్ దేశాలను అనేక దశాబ్దాలుగా నియంతలు పాలిస్తున్నారు. అవినీతి, నిరంకుశత్వాల నుంచి స్వేచ్ఛ కోసం, తమ భవిష్యత్ ను తామే నిర్దేశించుకోగల మార్పు కోసం 2011లో ట్యునీషియాలో ప్రజాందోళనలు ప్రారంభమయి అతి తక్కువ కాలంలోనే ఉప్పెనలా మిగతా అరబ్ దేశాల్ని ప్రభావితం చేశాయి. ట్యునీషియా, అల్జీరియా, యెమెన్, సిరియా వంటి దేశాలలో ప్రజగ్రాహం పెల్లుబికి, మహోద్యమంగా మారి నిరంకుశ ప్రభువులను గద్దెదించాయి. భౌగోళికంగా ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియాలో విస్తరించి ఉన్న అరబ్ దేశాలలో తలెత్తిన ఉద్యమాలు ప్రజాస్వామ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా చెప్పవచ్చు.

1970వ దశకం నుంచి అమెరికా, రష్యాలు ఉత్తరాఫ్రికా, మధ్య ఆసియా దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అరబ్ దేశాలలో అంతర్యుద్ధాలకు కారణమయ్యాయి. దేశాల మధ్య విభేదాలను సృష్టిస్తూ, అంతర్గత కలహాలను పెంచటానికి ఆయుధాలను సరఫరా చేస్తూ, వాటిని రాజకీయంగా, ఆర్థికంగా తమ నియంత్రణలో పెట్టుకోవడానికి ప్రయత్నించాయి. అరబ్ దేశాలు సహజంగానే ఇంధన వనరులకు కేంద్రమైనందువల్ల ఈ దేశాలు తమ మాటను జవదాటకుండా ఉండటానికి అన్ని రకాల చర్యలకు సిద్ధపడ్డాయి. నియంతలను తమ కనుసన్నల్లో ఉంచుకొని అక్కడి చమురు, ఖనిజ సంపదపై గుత్తాధిపత్యం పొందేందుకు అమెరికా, రష్యాలు నిరంతరం పోటీపడటం వల్ల అవినీతి, పేదరికం, నిరుద్యోగం, దొంగతనం, హత్యలు, మారణ హోమాలు పెరిగిపోయాయి.

అయితే అరబ్ ప్రభుత్వాలు ప్రజాందోళనలను ప్రజాస్వామ్య ఉద్యమాలుగా గుర్తించకపోవడం వల్ల ఉద్యమాలు ప్రమాదకర స్థాయికి చేరుకునేవి. ఉద్యమాలను చల్లబరచడానికి కొన్ని తాత్కాలిక ఉపశమన చర్యలను చేపట్టేవి. ఉదాహరణకు 1977లో ఈజిప్టులో తీవ్రస్థాయిలో ప్రజాందోళనలు జరిగినప్పుడు ఆహార సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఉద్యమాన్ని శాంతిపరిచారు.

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ప్రపంచ రాజకీయాలలో ప్రబలశక్తిగా ఎదిగిన అమెరికా 2007లో అకస్మాత్తుగా సబ్ ప్రైమ్ సంక్షోభంllతో ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. దీంతో అమెరికా ఆర్థిక అండదండలతో ఏకపక్షనిర్ణయాలు తీసుకునే అరబ్ దేశ పాలకులకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల అరబ్ దేశాలలో ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పేదరికం, నిరుద్యోగం తారా స్థాయికి చేరింది. దీంతో యువతలో నిరాశ నిస్పృహలు మొదలయ్యాయి. యువకుల ఆవేశం నిరసనల రూపంలో మొదలై ప్రజా ఉద్యమ రూపాన్ని పొందింది. దీనికి సైనిక దళాల అకృత్యాలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఫలితంగా అరబ్ ప్రపంచం ఆందోళనలకు నిలయమైంది.

అరబ్ దేశాల్లో ప్రారంభమయిన జాస్మిన్ విప్లవం నియంతల పాలనను అంతమొందించడానికి ప్రయత్నించింది. ఈజిప్ట్ జనాభాలో 60 శాతం మంది యువకులు ఉన్నారు. జనాభాలో 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. జనాభాలో 25 శాతం మంది నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నారు. సామాన్య ప్రజలు కనీస అవసరాలు సైతం తీర్చుకోని స్థితిలో ఉన్నారు. ద్రవ్యోల్బణం తీవ్రత 30 శాతం ఉండటం వల్ల ధరలు పెరిగి ప్రజలు దారిద్య్రంతో సహజీవనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులు యెమెన్, సిరియాలలో ఎక్కువగా ఉండటం ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది.

అరబ్ నియంతలు పాశ్చాత్య దేశాలతో వ్యక్తిగత ప్రయోజనాలకోసం రహస్య ఒప్పందాలను చేసుకున్నారు. దీనివల్ల దేశ సహజ సంపదను కొల్లగొట్ట బడింది. అవినీతే రాజనీతిగా మారడం ప్రజల సహనానికి పరీక్షగా మారింది. దీనికి తోడు ప్రభుత్వాలు ప్రజల కనీస హక్కులను గౌరవించకుండా, ప్రజావసరాలను తీర్చకుండా భద్రతా దళాలతో బెదిరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. అగ్రరాజ్యమైన అమెరికా లిబియా, మొరాకో, ఇరాన్ వంటి దేశాలలో పాలకులను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ఆ దేశాల రాజులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ప్రోత్సహించింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితులలో ఆయా దేశాల రాజులు అమెరికాను సైనిక సహాయం అడిగే స్థితికి తీసుకొచ్చే ఎత్తుగడలు వేసి, ప్రయోగాలు చేసింది.

ప్రజా సమస్యలు, దిగజారిన ఆర్థిక పరిస్థితి, అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగ సమస్యలతో కొన్ని అరబ్ దేశాలు దుర్భర స్థితిని అనుభవిస్తున్నాయి. 1975 నుంచి 2005ల సంవత్సరాల మధ్య అరబ్ జనాభా రెట్టింపయ్యి 314 మిలియన్లకు చేరింది. జనాభా పెరుగుదల విషయంలో అరబ్ పాలకులకు ముందుచూపు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ఇటీవలి కాలంలో అరబ్ దేశాల్లో సగటు జీవన ప్రమాణం, అక్షరాస్యత కూడా బాగా పెరగడంతో విద్యాధికుల సంఖ్య పెరిగింది. ఇది కూడా ప్రజల సామాజిక చైత్యన్యానికి ఒక ప్రధాన కారణం. ఈ దేశాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థికరంగాలలో అనుకున్నంతగా మార్పులు లేకపోవడం వల్ల ప్రజలు సహనాన్ని కోల్పోయి నిరసనలు చేశారు. ఈ దేశాల్లోని యువతలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీనితోపాటుగా యువకులు పాశ్చాత్య దేశాల్లో విద్యనభ్యసించడం వల్ల నియంతృత్వ ధోరణులను వ్యతిరేకించారు. ఈ రెండు కారణాలు కూడా అరబ్ దేశాల్లో ఉద్యమాలు జరగడానికి త్వరగా వ్యాపించడానికి దోహదం చేశాయి. ఇది ఒక రకంగా యువకుల ఉద్యమమనే చెప్పవచ్చు.

ట్యునీషియాలో అంకురార్పణ
అరబ్ విప్లవం మొదట ట్యునీషియాలో ప్రారంభమయ్యింది. జైనే ఎల్ అబిదైన్ బెన్ అలీ 1987 నుంచి ట్యునీషియాదేశ అధికారాన్ని చేపట్టాడు. నిరంతర నియంతృత్వ పాలన వల్ల ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. ప్రజల మనస్సులలో ఉన్న భయాలు అన్నీ 2010 సంవత్సరం ఒక్కసారిగా నిరసనల రూపంలో బయట పడ్డాయి. 2010 డిసెంబర్ 17 న ట్యునీషియాలో సిది బౌజిద్ నగరంలో మహ్మద్ బౌజిజి అనే తోపుడుబండి వ్యాపారి నుంచి పోలీసులు పళ్లను స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. మామూళ్లు ఇవ్వనందుకే ఇదంతా జరిగింది. ఇది భరించలేక ఆ చిరువ్యాపారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అప్పటికే వీధులలోకి వచ్చిన ప్రజలు ఈ ఘటనతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఉద్యమం సిది బౌజిద్ నగరం నుంచి రాజధాని ట్యునిస్ నగరానికి పాకింది. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక 2011 జనవరి 14న అధ్యక్షుడు బెన్ అలీ సౌదీ అరేబియాకు పారిపోయాడు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ట్యునీషియా జాతీయ పుష్పం మల్లెపువ్వు కాబట్టి ఈ ఉద్యమానికి జాస్మిన్ రివల్యూషన్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 78 మంది చనిపోయారు.

విప్లవం ఫలితాలు
2011లో అక్టోబర్ 23, న ట్యునీషియా తొలిసారిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకుంది. ఇస్లామిస్ట్ మితవాద రాజకీయ పక్షం అల్ సహ్దా అధికారంలోకి వచ్చింది. అలీ ఎల్ అరీద్ అధికారంలోకి వచ్చాడు. మరో రెండు చిన్న సెక్యులర్ పార్టీలు కాంగ్రెస్ ఫర్ ది రిపబ్లిక్ పార్టీ, బ్లాక్ ఫర్ లేబర్ అండ్ లిబర్టీస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే రాజ్యాంగం రచన బాధ్యతను చేపట్టింది. కొత్త పార్టీ బెన్ అలీ కాలం నాటి రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. వంద రాజకీయ పార్టీలకు గుర్తింపునిచ్చింది. మీడియా మీద ఆంక్షలు సైతం తొలగించింది.

రాజ్యాంగ చర్చలతో పాటు ఇవన్నీ జరుగుతుండగానే ప్రజాస్వామ్య వ్యతిరేకులైన సలాఫిస్టులు (సలాఫిస్ట్ అన్సార్ అల్ షరియా ఉద్యమం. ఇది ఉగ్రవాద ఉద్యమం) వీధిపోరాటాలు మొదలు పెట్టారు. ఇవి బాగా విస్తరించి అల్ సహ్దా ప్రభుత్వ నేత అరీద్ వైదొలగాలన్న డిమాండ్ కు ఊపు నిచ్చాయి. బెన్ అలీ దేశం విడిచి పారిపోయే నాటికి 13 శాతంగా ఉన్న నిరుద్యోగం సమస్య 18 శాతానికి పెరిగింది. 2012 నాటికి ద్రవ్యోల్బణం ఆరు శాతం పెరిగింది. దీనార్ విలువ పడిపోయింది. ఇస్లామిస్ట్ మూవ్ మెంట్ నుంచి వచ్చిన అరీద్ ను దింపి తటస్థ నేతను దేశాధినేతను చేయాలని ఉద్యమకారులు కోరుతున్నారు. అంటే ఇస్లామిస్టులకు, సెక్యూలరిస్టులకు వైరుధ్యాలు తీవ్రమయ్యాయి.

వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఈ అంశంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నది. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలతో వచ్చిన విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ అలజడుల మధ్యనే ఈ ఏడాది ఫిబ్రవరి 6న రహోయి పార్టీ నాయకుడు చోక్రి బిలేడ్ ను కాల్చి చంపారు. జూలై 25న వామపక్ష ప్రముఖుడు మహ్మద్ బ్రహ్మిని హత్య చేశారు. ఈ రెండు హత్యలు కూడా సలాఫిస్టుల పనేనని అనుమానాలు ఉన్నాయి. ట్యునీషియా తిరుగుబాటు స్వచ్ఛమైన పాలన కోసం ఉద్దేశించినది. మత ఛాందస వర్గాలను అధికారానికి దూరంగా ఉంచే కృషి కూడా ఇందులో భాగం. కానీ ప్రజలు సత్వర ఫలితాలను కోరుతున్నారు. జాస్మిన్ విప్లవం ముగిసి రెండేళ్లు పూర్తయినా ట్యునీషియాలో పరిస్థితులు మెరుగుపడకపోవడం విచారకరం.

మరోవైపు ఈజిప్టులో 1981లో అధికారం చేపట్టిన హోస్నీ ముబారక్ ను ప్రజలూ, సైన్యం తొలగించి, బ్రదర్ హుడ్ అనుబంధ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ మొర్సీని ఎన్నుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు స్పందించకుండా ఇస్లామీకరణకు పాల్పడటం, అధికార దుర్వినియోగం, అధ్యక్షపదవికి మరిన్ని అధికారాలు కేటాయించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడంతో మళ్లీ ప్రజలూ, సైన్యం, ప్రతిపక్షాలే మొర్సీని తొలగించాయి. మొర్సీ స్థానంలో సైన్యం తాత్కాలిక అధ్యక్షుడిని నియమించింది. సైన్యం నేరుగా అధికారం చేపడితే ప్రజలంగీకరించరని గ్రహించి ఈ ఏర్పాటు చేసింది. అంటే అధికారం పరోక్షంగా సైన్యానిదే. ఈజిప్టు ముందు నుంచి సైన్యం అదుపాజ్ఞలలోనే ఉంది. అంటే ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని స్పష్టమవుతోంది. అంటే ప్రజా తిరుగుబాటును సైన్యం హైజాక్ చేసిందన్న మాట.

సిరియాను తాకిన అరబ్ విప్లవం రణరంగంగా మారింది. నియంతృత్వ అసద్ ప్రభుత్వానికి, బ్రదర్ హుడ్ ప్రేరేపిత వేర్పాటువాద సమూహాలకు మధ్య ఘర్షణలలో సిరియా యుద్ధక్షేత్రంగా మారింది. అంతర్జాతీయశక్తులు ఈ రెండు వర్గాలకు ఆయుధాలు సమకూరుస్తూ మరింత సంక్షోభానికి కారణమవుతున్నాయి. ప్రజల ఆకాంక్షలకు స్పందించకపోవడం అసద్ తప్పయితే ప్రజా ఉద్యమాన్ని వేర్పాటువాద శక్తులు, మతతత్వశక్తులు హైజాక్ చేయడం మరింత ఘోరంగా చెప్పవచ్చు. ప్రజా ఉద్యమం పూర్తిగా వేర్పాటువాద శక్తుల ఉద్యమంగా మారిపోయింది. అరబ్ విప్లవం ప్రజల తిరుబాటు అనే కంటే అసద్ ప్రభుత్వం, వేర్పాటువాద శక్తుల మధ్య యుద్ధంగానే చెప్పవచ్చు.

33 ఏళ్ల క్రితం యెమెన్ అధికారం చేపట్టిన అలీ అబ్దుల్లా సలేని ఫిబ్రవరి 2012లో అరబ్ విప్లవంలో భాగంగా ప్రజలు గద్దె దించారు. లిబియా నియంత గడాఫీ 44 ఏళ్ల తరువాత 2011, అక్టోబర్ లో అత్యంత విషాదకరంగా మరణించాడు. నియంతలు తుడుచుపెట్టుకుపోయినప్పటికీ యెమెన్ లో కానీ లిబియాలో కానీ పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు. పేదరికం, నిరుద్యోగం, యువతలో నిరాశ అదే స్థాయిలో ఉన్నాయి. ఆ మాటకోస్తే ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. లిబియాలో మానవ హక్కులకు భంగం కలుగుతుందని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అరబ్ వసంత వీచికలు తాకిన మిగిలిన దేశాల్లోనూ పరిస్థితులు మెరుగైన దాఖలాలు లేవు.

అరబ్ విప్లవం నేర్పుతున్న గుణపాఠం
దశాబ్దాల నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ప్రజలు తిరుగుబాట్లు చేయడం తప్ప మరో ఆలోచనకు తావేలేదు. నిరంకుశ పాలనలకు విసిగి వేసారి ఉప్పెనలా తిరుగుబాటు చేయడాన్ని హర్షించాల్సిందే. అయితే నియంతలను కూల్చడంలో చూపించిన శ్రద్ధ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంపై చూపలేదు. దీంతో నియంతల స్థానంలో ప్రజాస్వామ్యం ముసుగులో మరో నియంతృత్వ శక్తి (సైన్యం) లేదా మతోన్మాదశక్తులు లేదా వేర్పాటువాద శక్తులు అధికారం కైవసం చేసుకుంటున్నాయి. స్వప్రయోజనాలు, వేర్పాటువాద దృక్పథం, మతోన్మాద స్వభావం వల్ల నూతన అధికార శక్తులు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయి. అందుకే ఈజిప్టులో మరోసారి తిరురుగుబాటు జరిగింది. ట్యునీషియాలో నేటికీ అశాంతి, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

నియంతల పాలనలో అధికారం కేంద్రీకృతమై ఉన్నప్పుడు తిరుగుబాట్లును, ఉద్యమాలను ఉక్కు పిడికిలితో అణచివేసేవారు. అయితే నియంతలు అరబ్ విప్లవం దాటికి తలవంచారు. దీంతో రాజ్యం బలహీనమయ్యింది. ఇదే అదునుగా మతతత్వ శక్తులు, వేర్పాటువాద గళాలు పుంజుకున్నాయి. తమ స్వప్రయోజనాల కోసం అరబ్ దేశాల్లో అగ్గి రాజేస్తున్నాయి. మతాల పేరుతో, వేర్పాటువాదంతో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. దీంతో నియంతల పాలన విరగడయ్యిందని భావించిన అరబ్ దేశాల ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.

చమురు, విలువైన ఖనిజ సంపదలను కొల్లగొట్టడంలో నాకిది నీకిది లెక్కలతో తోడ్పాటు నందించి ఇన్నాళ్లు తమ స్వప్రయోజనాలు నెరవేర్చిన నియంతల స్థానంలో ఇప్పుడు తమకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటుచేసేలా పాశ్చాత్య దేశాలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల అభీష్టం మేరకు అధికారం చేపట్టినప్పటికీ అవి పాశ్చాత్య దేశాలకు ఇష్టం లేదు. తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భావించిన పాశ్చాత్య దేశాలు మరోసారి కీలుబొమ్మ ప్రభుత్వాలనే కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. అందుకే ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటు వాద శక్తులకు ఆయుధాలనిచ్చి ఉసిగొల్పుతున్నాయి. దాని వల్ల ఆయా దేశాల్లో వేర్పాటువాద శక్తులు పెరిగి అశాంతి చెలరేగుతోంది. ప్రజల ఆకాంక్షలు పక్కదారి పడుతున్నాయి. సిరియాలో వేర్పాటువాద సమూహాలకు అమెరికా, టర్కీ లాంటి దేశాలు అండగా నిలవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

దశాబ్దాలు తరబడి నియంతల పాలనలో ఉన్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదు. అయితే దశాబ్దాల నుంచి అరాచకాలతో నిరాశ నిస్పృహలకు గురైన ప్రజల ఆకాంక్షలు చాలా ఉన్నాయి. సహనంతో ఉన్న ప్రజలు సత్వరమే ఫలితాల కోసం ఆతృతతో వేచి చూస్తున్నారు. ఇవి నెరవేరకపోతే మళ్లీ నిరసనలు మొదలవుతాయి.

స్వీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టిన నియంతల కాలం నాటి విధానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటువంటి విధానాలకు వెంటనే స్వస్తి చెప్పకపోతే మళ్ళీ ప్రజాఉద్యమాలు మొదలవుతాయి.
దశాబ్దాల పాటు నియంతృత్వంలో మగ్గిన దేశాలు ఒక్కసారిగా ప్రజాస్వామ్యం బాట పట్టడం వల్ల సర్దుబాటుకు, తప్పటడుగులకు చాలా ఆస్కారం ఉంది. అరబ్ విప్లవం రుచి చూసిన దేశాలు అనేక సమస్యలతో తల్లడిల్లుతూనే ఉన్నాయి.

పరిష్కారం
  • అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వాలు ప్రజా ఆకాంక్షలకు విలువనివ్వాలి. ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోతే మరో విప్లవం ఖాయమని గుర్తెరగాలి.
  • ప్రజల సంక్షేమం కోసం నిర్మాణాత్మక కృషి జరగాలి. పేదరికం, నిరుద్యోగం, మహిళా హక్కులు, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భద్రత వంటి అంశాలపై పాలకులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
  • పశ్చిమ దేశాలు అరబ్ దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడం మాని ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేయాలి. తమ స్వప్రయోజనాల కోసం పశ్చిమదేశాలు మతతత్వ శక్తులు, వేర్పాటువాదులకు ఎటువంటి సహాయం చేయకూడదు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం తోడ్పాటును అందించాలి.
  • ప్రజలు కాస్త ఓపిక పట్టాలి. దశాబ్దాలుగా అలవాటు పడిన నియంతృత్వ స్థానంలో వెల్లివిరిసిన ప్రజాస్వామ్యం ఫలాలు అందాలంటే ప్రశాంత వాతావరణం ఉండాలి
    ముగింపు:
    అరబ్ తిరుగుబాట్లు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పాలనకై జరిగాయి. కాబట్టి వాటి ఫలితంగా నిర్మించుకున్న ప్రజా ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికే మొదట ప్రాధాన్యతనిచ్చే విధంగా వ్యవస్థాగత యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరబ్బు వసంతం విఫలమైంది అని చాలా మంది మేధావులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బే గానీ గొడ్డలి పెట్టు కాదు.

    నిరంకుశత్వానికి, అరాచకత్వానికి ప్రత్యామ్నాయం ఎప్పుడూ నిరంకుశత్వం, అరాచకత్వం కావు. కానేరవు. రెండేళ్లు లోపే ఒక విప్లవం ముగిసిందని చెప్పలేం. అరబ్ విప్లవం చవిచూసిన దేశాల్లో కొన్ని వసంతం రావడమనేది పరిపూర్ణం కాలేదని రెండో దశ వసంత విప్లవం అవసరమని భావిస్తున్నాయి. అరబ్ విప్లవం నినాదం నిరంకుశ ప్రభుత్వాల పతనం’. కాబట్టి అది కొంతవరకు నెరవేరినట్లే. అయితే ప్రజాస్వామ్యం ముసుగులో మళ్లీ నిరంకుశత్వం కొనసాగితే తిరుగుబాట్లు తప్పవు. అరబ్ ప్రజా ఉద్యమం హైజాక్ అయితే అవ్వచ్చు గాక కానీ అంతిమ విజయం మాత్రం ప్రజాస్వామ్యానిదే, ప్రజలదే. ప్రజల్లో నిరాశ పెరిగితే మరోసారి ఉద్యమం ఉప్పెనలా మొదలవుతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం కొనసాగిస్తున్న నియంతలు తలవంచక తప్పదు.

Published date : 12 Nov 2013 05:34PM

Photo Stories