Skip to main content

మానవాభివృద్ధి నివేదిక - 2013

21వ శతాబ్దంలోని పరిణామాల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక వృద్ధి నమోదైంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ స్థానాన్ని చైనా ఆక్రమించింది. కొన్ని వందల మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడంలో అది విజయం సాధించింది. భారత్ తన భవిష్యత్తును పునర్నిర్మించుకోవడంలో భాగంగా ఉద్యమిత్వ కల్పన, సాంఘిక విధానాలకు ప్రాధాన్యమిచ్చింది. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడం ద్వారా బ్రెజిల్ తన దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో విజయం సాధించింది. ఈ శతాబ్దంలో దక్షిణాది దేశాల ప్రగతిని ‘మానవాభివృద్ధి నివేదిక 2013 (హెచ్‌డీఐ)’ ప్రముఖంగా ప్రస్తావించింది. ఇండోనేషియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, టర్కీ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ చిత్రపటంలో ప్రధాన దేశాలుగా నిలిచాయి. ఇటీవలి దశాబ్దాలలో 40 అభివృద్ధి చెందుతున్న దేశాలు మానవాభివృద్ధి విషయంలో ఊహించిన దాని కంటే అధిక వృద్ధి సాధించాయని ఈ నివేదిక వెల్లడించింది. ఆయా దేశాల్లో గత పదేళ్ల కాలంలో ప్రగతి వేగవంతమైంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు చైతన్యంతో కూడిన భారీ ఆర్థిక వ్యవస్థలుగా రూపాంతరం చెందే క్రమంలో మానవాభివృద్ధిలో ప్రగతి కనిపిస్తుందని మానవాభివృద్ధి నివేదిక అభిప్రాయపడింది. గత దశాబ్ద కాలంలో అన్ని దేశాలు విద్య, ఆరోగ్యం, ఆదాయ స్థాయిలను పెంచుకోవడంలో విజయం సాధించాయి. అల్ప మానవాభివృద్ధి దేశాలలో ఈ దశాబ్దకాలంలో అధిక ప్రగతి నమోదైంది. పేద వర్గాల అభ్యున్నతికి అవసరమైన విధానాలు, ప్రజల సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలైన విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, ఉపాధి వంటి వాటిపై పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకతను నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత నివేదికతోపాటు గతంలో వెలువడిన నివేదికలు కూడా ఆర్థికాభివృద్ధి కారణంగా మానవాభివృద్ధిలో ప్రగతి సాధ్యపడకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

రైజ్ ఆఫ్ ది సౌత్ (Rise of The South):
పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు మంచి వృద్ధిని సాధించాయి. వీటిలో ముఖ్యంగా కొన్ని దేశాల్లో అధిక ప్రగతి నమోదైన స్థితిని ‘రైజ్ ఆఫ్ ది సౌత్ (Rise of The South)’గా నివేదిక అభివర్ణించింది. బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాలు ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి తమ ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడమే కాకుండా అత్యధిక వృద్ధి రేట్లను సాధించాయి.

గత 150 ఏళ్ల కాలంలో మొదటిసారిగా అభివృద్ధి చెందుతున్న మూడుదేశాల (బ్రెజిల్, చైనా, భారత్) ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి విలువ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్‌‌స, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తికి సమానంగా నిలిచింది. 1950 లో ప్రపంచ జీడీపీలో బ్రెజిల్, చైనా, భారత్ వాటా 10 శాతం. అదే సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల వాటా 50 శాతం. మానవాభివృద్ధి నివేదిక అంచనాల ప్రకారం ప్రకారం 2050 నాటికి ప్రపంచ జీడీపీలో బ్రెజిల్, చైనా, భారత్‌ల వాటా 40 శాతానికి చేరుకోగలదు.

వృద్ధిని కొనసాగించగలదా?
దక్షిణాది దేశాల్లోని మధ్య తరగతి ప్రజల ఆదాయ స్థాయి, వారి అంచనాల్లో (Expectations) ప్రగతి కనిపించింది. పారిశ్రామిక దేశాల తరహా ఈ దేశాల్లోనూ సాంకేతికపరమైన నవ కల్పనలు, ఉద్యమిత్వ పెరుగుదలకు పునాదులు ఏర్పడ్డాయి. దక్షిణాది దేశాలు ఆర్థికవృద్ధి సాధనలో విజయం సాధించినప్పటికీ.. ఈ వృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నమ్మకంగా చెప్పలేకపోతున్నాం. ఆయా దేశాలు మానవాభివృద్ధిలో సాధించిన ప్రగతిని భవిష్యత్తులో కొనసాగించగలవా? ఈ ప్రగతి ఇతర దేశాలకు ఎలా వ్యాప్తి చెందుతుంది? అనే అంశాలను వివరించే క్రమంలో ఈ నివేదిక నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అభిప్రాయపడింది. ‘‘సమానత్వాన్ని పెంపొందించడం, ప్రజల భాగస్వామ్యాన్ని అధికం చేయడం, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడం, జనాభాపరమైన మార్పుల నేపథ్యంలో సక్రమమైన యాజమాన్యం వంటి అంశాలు సుస్థిర అభివృద్ధి సాధనకు దోహదపడగలవని నివేదిక పేర్కొంది.

ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్న దేశాల్లో.. ఆర్థిక వృద్ధి పేదరికాన్ని తగ్గించడానికి కీలక సాధనంగా ఉపయోగపడుతుందని నివేదిక అభిప్రాయపడింది. విద్య, ఆరోగ్యం, సాంఘిక రక్షణ, న్యాయ సాధికారత (Legal Empowerment) వంటి అంశాలు పేదలు వృద్ధిలో భాగస్వామ్యం కావడానికి దోహదపడతాయి. వివిధ జాతుల మధ్య ఏర్పడుతున్న సాంఘిక వివాదాలను తగ్గిస్తే సమానత్వం సాధ్యపడుతుంది. దక్షిణాదిన పలు దేశాలు త్వరితగతిన వృద్ధి సాధించగలిగాయి. ఆయాదేశాలు అవలంబించిన సాంఘిక, ఆర్థిక విధానాలు పెట్టుబడి, వాణిజ్యం, అభివృద్ధి సహకారం వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. సౌత్-సౌత్ కో-ఆపరేషన్ (South-South Co-Operation), ఆయా దేశాల అనుభవాలు అభివృద్ధి విధానాల రూపకల్పనకు దోహదపడగలవు.

జనాభాపరమైన మార్పునకు సంబంధించిన యాజమాన్యం (Managing Dernographnic Change):
1970 నుంచి 2011 మధ్య కాలంలో ప్రపంచ జనాభా 3.6 బిలియన్ల నుంచి 7 బిలియన్లకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాలో విద్యా ప్రమాణాలు మెరుగైతే జనాభా వృద్ధి రేటులో తగ్గుదల ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. అభివృద్ధి ప్రక్రియ జనాభా పరిమాణం, వయోవర్గ నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి ప్రక్రియలో ఆధారపడే జనాభా నిష్పత్తిని ఒక ముఖ్యాంశంగా ప్రస్తుత నివేదిక ప్రస్తావించింది. పటిష్టమైన విధానాలను రూపొందిస్తే పేద దేశాల్లోని మొత్తం జనాభాలో పనిచేసే జనాభా పెరుగుతుంది. ఆ నేపథ్యంలో ఏర్పడే డెమోగ్రాఫిక్ డివిడెండ్ (Demographic Dividend) వల్ల ఆయాదేశాలు లబ్ధి పొందుతాయి. డెమోగ్రాఫిక్ డివిడెంట్‌కు బాలిక విద్య అనేది ముఖ్య సాధనం. దక్షిణాదిన ధనిక ప్రాంతాల్లో మొత్తం జనాభాలో పనిచేసే జనాభా తగ్గుతుంది. భవిష్యత్తులో వృద్ధిపై ఈ అంశం ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

భారత్, కొరియా-విద్యాప్రగతి:
1950వ దశకంలో కొరియాలోని బడిఈడు పిల్లలో (School-age children) అధికశాతం మంది కనీస స్థాయి విద్య (Normal Education) కు కూడా నోచుకోలేదు. తర్వాత కాలంలో విద్యారంగంలో అధిక ప్రగతి నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో యువ కొరియన్ మహిళలను బెస్ట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ (Best Educated Women)గా అభివర్ణించవచ్చు. కొరియన్ మహిళలలో సగం మందికిపైగా కాలేజీ విద్యను పూర్తి చేసిన వారే కావడం గమనార్హం. 2010లో కొరియాలోని మొత్తం జనాభాలో 14 ఏళ్లలోపు వారు 16 శాతం కాగా, 2050 నాటికి ఈ జనాభా 13 శాతానికి తగ్గగలదని, ఇదే సమయంలో ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి 26 నుంచి 47 శాతానికి చేరుకుంటుందని అంచనా. విద్యా ప్రమాణాలలో పెరుగుదల కారణంగానే కొరియాలో మానవాభివృద్ధి సాధ్యమైంది. తద్వారా మానవాభివృద్ధి సూచీలో 12వ స్థానం పొందగలిగింది. భారత్‌లో 2000వ సంవత్సరానికి ముందు సగం మందికి పైగా వయోజన జనాభా కనీస స్థాయి విద్య (Formal Education)కు నోచుకోలేదు. వివిధ పాఠశాలల స్థాయిలలో నమోదు నిష్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కనీస స్థాయి విద్య లేని వయోజన జనాభాలో తగ్గుదల స్వల్పంగానే ఉంది. మహిళలలో విద్య స్థాయి తక్కువగా ఉన్న కారణంగా రాబోయే కాలంలో చైనాను మించిన జనాభా భారత్‌లో ఉంటుందని నివేదిక పేర్కొంది. 2050 నాటికి కూడా విద్యా ప్రమాణాల లభ్యతలో అసమానతలు భారత్‌లో కొనసాగుతాయి. ఉన్నత విద్య విస్తరణ శ్రామిక శక్తిలో విద్యావంతులైన యువత సంఖ్యను పెంచగలదని నివేదిక అభిప్రాయపడింది.

వివిధ సూచీలు- భారత్ ప్రగతి
మానవాభివృద్ధి సూచీ: యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP)186 దేశాలకు సంబంధించి మానవాభివృద్ధి సూచీని రూపొందించింది. ఇందులో 47 దేశాలను అత్యధిక మానవాభివృద్ధి సాధించిన దేశాలుగా గుర్తించింది. మరో 47 దేశాలకు అధిక మానవాభివృద్ధి జాబితాలో చేర్చింది. మరో 47 దేశాలను మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాలుగాను, మిగిలిన 46 దేశాలను అల్ప మానవాభివృద్ధి దేశాలుగాను నివేదిక పేర్కొంది. మానవాభివృద్ధి సూచీలో నార్వే, ఆస్ట్రేలియా, అమెరికాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ 136వ స్థానాన్ని, నైజర్ చిట్ట చివరి 186వ స్థానాన్ని పొందాయి. మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానంలో ఉన్న నార్వే మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) విలువ 0.955. భారత్ విలువ 0.554, నైజర్ విలువ 0.304.

లింగ సంబంధిత అసమానతల సూచీ:
ఈ సూచీలో నెదర్లాండ్‌‌స, స్వీడన్, స్విట్జర్లాండ్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉండగా భారత్ 132వ స్థానాన్ని పొందింది. భారత్‌కు సంబంధించి ఈ సూచీ విలువ 0.610. ఈ సూచీలో యెమెన్ చిట్ట చివరిగా 148వ స్థానంలో నిలిచింది. భారత్‌లో స్త్రీ-పురుషుల మధ్య పెరుగుతున్న అసమానతలను ఈ సూచీ స్పష్టం చేసింది. ఈ సూచీని రూపొందించడానికి (1) ప్రతి లక్ష జననాలకు సంబంధించి ప్రసూతి మరణాల రేటు, (2) 15 నుంచి 19 సంవత్సరాల మధ్యలోని ప్రతి 1000 మంది మహిళలకు సంబంధించి సంతాన సాఫల్య రేటు, (3) పార్లమెంట్ సభ్యుల్లో మహిళల శాతం, (4) 2.5 సంవత్సరాలకు పైబడిన పురుషుల, మహిళలలో సెకండరీ విద్యను అభ్యసించిన వారి శాతం, (5) శ్రామిక శక్తి భాగస్వామ్యంలో స్త్రీ-పురుషుల వాటా వంటి అంశాలను సూచికలుగా తీసుకుంటారు.

మల్టీ డైమన్షనల్ పేదరిక సూచీ:
బహుమితీయ పేదరిక సూచీ 2005-06వ సంవత్సరంలో భారత్‌కు సంబంధించి ఈ సూచీ విలువ 0.283. ఈ సూచీని రూపొందించడానికి.. (1) బహుమితీయ పేదరికంలో ఉన్న జనాభా, (2) దారిద్య్ర రేఖ పరిధిలోనికి రావడానికి ఆస్కారం ఉన్న ప్రజల శాతం, (3) తీవ్ర పేదరికంతో బాధ పడుతున్న ప్రజల శాతం, (4) పేదరికానికి దారితీసే విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల లభ్యతలో వ్యత్యాసం (5) ఆదాయ పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రజలలో రోజుకు 1.25 డాలర్ల కొనుగోలు శక్తి లేని వారి శాతం, జాతీయ పేదరిక రేఖ వంటి అంశాలను సూచికలుగా తీసుకుంటారు. ఈ నివేదిక ప్రకారం బహుమితీయ పేదరికంలో ఉన్న జనాభా (తలల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా) 53.7 శాతం. దారిద్య్ర రేఖ పరిధిలోకి రావడానికి ఆస్కారం ఉన్న ప్రజల శాతం 16.4 కాగా, తీవ్ర పేదరికంలో ఉన్న జనాభా 28.6 శాతం. దీన్ని జాతీయ పేదరిక రేఖ (National poverty line) 29.8 శాతంగా నివేదిక పేర్కొంది.

లింగ సంబంధిత అసమానతల సూచీ:
ఈ నివేదిక ప్రకారం ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష జనాభాకు 200 గా నమోదు కాగా, కౌమార దశలోని మహిళల్లో ప్రతి 1000 మందికి సంతాన సాఫల్యాల రేటు 74.7 గాను, పార్లమెంట్ సభ్యులలో మహిళల శాతం 10.9 గాను, మహిళలలో సెకండరీ విద్యనభ్యసించినవారు 26.6 శాతం, పురుషులలో సెకండరీ విద్యనభ్యసించినవారు 50.4 శాతంగా నమోదైంది. మహిళలలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 29 శాతంగాను, పురుషులలో శ్రామికశక్తి భాగస్వామ్యం 80.7 శాతంగా ఉంది.

ఈ సూచీలాధారంగా:
ఆయుఃప్రమాణం, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, (Mean Years of Schooling), ఎక్స్‌పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (Expected Years of Schooling), తలసరి స్థూల జాతీయోత్పత్తి (కొనుగోలు శక్తి సామర్థ్యం) వంటి అంశాలాధారంగా మానవాభివృద్ధి సూచీని రూపొందించారు.
  1. భారత్‌కు సంబంధించి ఆయుః ప్రమాణం 2012లో 65.8 సంవత్సరాలు.
  2. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 4.4 సంవత్సరాలు.
  3. ఎక్స్‌పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (2011లో) 10.7 సంవత్సరాలు.
  4. తలసరి ఆదాయం (కొనుగోలు శక్తి సామర్థ్యం) 3285 డాలర్లుగా నమోదైంది.
  5. అసమానతల మిళితమైన మానవాభివృద్ధి సూచీకి సంబంధించి భారత్ విలువ 0.392 గా నమోదు కాగా, 2012లో అసమానతల కారణంగా మానవాభివృద్ధి సూచీలో నష్టాన్ని 29.3 శాతంగా అంచనా వేశారు. ఈ సూచీ రూపకల్పనకు సూచికలుగా (1) అసమానతల మిళితమైన ఆయుః ప్రమాణ సూచీ (2) అసమానతల మిళితమైన విద్యా సూచీ (3) అసమానతల మిళితమైన ఆదాయసూచీలను తీసుకున్నారు. భారత్‌లో ఆదాయం Co-Efficient 2000-10 మధ్య 33.4 శాతంగా నమోదైంది.
Published date : 09 May 2013 04:42PM

Photo Stories