Skip to main content

బ్రిక్స్ సదస్సు-2015

ఏడో బ్రిక్స్ సదస్సు రష్యాలోని ఉఫా నగరంలో జూలై 8, 9 తేదీల్లో జరిగింది. షాంఘై సహకార సంఘం, యురేసియన్ ఎకనమిక్ యూనియన్‌తో కూడిన ఉమ్మడి సదస్సును బ్రిక్స్ నిర్వహించింది.
ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జూమా పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల నాయకులు జూలై 9న ఉఫా ప్రకటనను (డిక్లరేషన్‌ను) విడుదల చేశారు.

‘బ్రిక్స్ భాగస్వామ్యం-ప్రపంచ అభివృద్ధికి శక్తిమంతమైన కారకం’ ముఖ్యాంశంగా ఏడో బ్రిక్స్ సదస్సు నిర్వహించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కేంద్ర బ్యాంకులు 100 బిలియన్ డాలర్ల బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ లక్ష్యంగా జూలై 7న పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. మాస్కోలో బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం తర్వాత ఈ డాక్యుమెంట్‌పై సంతకాలు జరిగాయి. జాతీయ విత్త వ్యవస్థలు డాలర్ ద్రవ్యత్వ సమస్యలను ఎదుర్కొంటున్న పక్షంలో తగిన మద్దతు బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ ఒప్పందం నుంచి ఆయా దేశాలకు లభిస్తుంది. బ్రిక్స్ ఫ్రేమ్‌వర్క్ (దృక్పథం/నమూనా)లో భాగంగా కంటింజెంట్ రిజర్వ్ ఒప్పందం, నూతన అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు బ్రిక్స్ దేశాల్లో ‘విత్త స్థిరత్వం’ సాధనకు దోహదపడుతుంది. ఈ కంటింజెంట్ రిజర్వ్ ఒప్పందం 2015, జూలై 30 నుంచి అమల్లోకి వస్తుంది.

సమష్టి కృషితో ముందుకు...
ఏడో బ్రిక్స్ సదస్సులో అయిదు దేశాల నాయకులు బ్రిక్స్ భాగస్వామ్యం, బ్రిక్స్ దేశాల మధ్య సహకారం, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంతోపాటు సమష్టి కృషి ద్వారా మంచి ఫలితాల సాధన అంశాలపై దృష్టిసారించి చర్చలు జరిపారు. ఉమ్మడి బ్రిక్స్ వెబ్‌సైట్ ఏర్పాటు, బ్రిక్స్ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సాంస్కృతిక భాగస్వామ్యం, బ్రిక్స్ దేశాల బ్యాంకులు, నూతన అభివృద్ధి బ్యాంకు మధ్య సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై నేతలు సంతకాలు చేశారు.

ఉఫా డిక్లరేషన్:
అంతర్జాతీయ తీవ్రవాదం, కీలక పరిశ్రమల విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం ఉఫా డిక్లరేషన్‌లోని ప్రధానాంశాలు. 2016లో 8వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌కు తగిన మద్దతు ఇచ్చే అంశాన్ని డిక్లరేషన్‌లో పొందుపరిచారు.

డిక్లరేషన్-ముఖ్యాంశాలు:
  • రాబోయే సవాళ్లను అధిగమించేందుకు బ్రిక్స్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. తద్వారా శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ధిని సాధించాలి.
  • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2010 సంస్కరణ ప్యాకేజీని ఆమోదించే విషయంలో అమెరికా వైఫల్యంపై బ్రిక్స్ దేశాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015, సెప్టెంబర్ నాటికి ప్యాకేజీని ఆమోదించాల్సిందిగా అమెరికాను కోరారు.
  • ఐఎంఎఫ్ ప్యాకేజీలో సంస్థల కోటా పెంపు, అభివృద్ధి చెందుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుకూలంగా కోటా, ఓటింగ్ పవర్‌ను సవరించడం ముఖ్యాంశాలు.
  • 2015, డిసెంబర్ 15-18 మధ్య జరిగే పదో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మినిస్టీరియల్ సదస్సుకు నైరోబీ ఆతిథ్యాన్ని నాయకులు స్వాగతించారు. వివక్షలేని, పారదర్శకతతో కూడిన నియమావళి ఆధారిత బహుళ వాణిజ్య వ్యవస్థ పటిష్టతకు సంఘటితంగా పనిచేయాలి.
  • ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నేతలు గుర్తించారు. దీనికి సంబంధించి బ్రిక్స్ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు.
  • 2016, ఫిబ్రవరిలో బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల మొదటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం శ్రామికులు,ఉపాధి అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఉద్యోగాల కల్పనపై దృష్టిసారిస్తుంది.
  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరాన్ని నేతలు వ్యక్తపరిచారు.
  • బ్రిక్స్ దేశాల్లో సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధనకు పారిశ్రామికాభివృద్ధి ముఖ్య ఆధారమని నేతలు భావించారు. పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం, పారిశ్రామిక పార్కులు, క్లస్టర్ల ఏర్పాటు, కీలక పరిశ్రమలను ప్రోత్సహించడం తదితర అంశాల్లో కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలి.
  • అన్ని ఆర్థిక రంగాల సమతుల్య అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలను ప్రవేశపెట్టడం, విత్త సంస్థల నుంచి వనరుల సమీకరణ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి అంశాలను డిక్లరేషన్‌లో పొందుపరిచారు.

సదస్సుపై దేశాధినేతల అభిప్రాయాలు
నరేంద్ర మోదీ:
  • బ్రిక్స్ దేశాల మధ్య సహకారం అనేక విజయాల సాధనకు దోహదపడింది. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వ్యవసాయం, అవస్థాపన రంగం, శీతోష్ణస్థితిలో మార్పు, ఇతర రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పటిష్టపరచుకోవడానికి భారత్ సమ్మతించింది.
  • ప్రపంచవ్యాప్తంగా ప్రజలు లబ్ధి పొందడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉంది.
  • ఆర్థిక, ఇతర సర్వీసులను అందజేయడంలో డిజిటల్ టెక్నాలజీ ముఖ్య భూమిక పోషించగలదు.
  • నూతన అభివృద్ధి బ్యాంకు నిధులు సమకూర్చే మొదటి కీలక ప్రాజెక్టు క్లీన్ ఎనర్జీకి సంబంధించినదై ఉండాలి.
  • బ్రిక్స్ వ్యవసాయ పరిశ్రమ కేంద్రం ఏర్పాటు ద్వారా ప్రపంచానికి పెద్ద బహుమతిని అందించాలి.
  • సభ్యదేశాల మధ్య కరెన్సీ స్వాప్స్
  • సభ్యదేశాల విత్త సంబంధిత నష్ట భయాన్ని కంటింజెంట్ రిజర్వ్ ఒప్పందం చూసుకోవాలి.
  • బ్రిక్స్ దేశాలకు స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహణ.
  • ప్రపంచ కరెన్సీ లావాదేవీలతో పశ్చిమ దేశాల ఏకస్వామ్యాన్ని తగ్గించేందుకు కంటింజెంట్ రిజర్వ్ ఒప్పందం కింద కరెన్సీ పూల్ చేయడం.

జాకబ్ జూమా:
  • ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయ సంస్థల కార్యాచరణకు అనుగుణంగా అన్ని దేశాల మధ్య సహకారం పెంపొందాలి.
  • అంతర్జాతీయ సమాజంపై అయిదు బ్రిక్స్ దేశాల ప్రభావం బాగానే ఉంది. ఈ క్రమంలో ఆఫ్రికా దేశాల్లో పేదరికం తగ్గింపు, ఇతర అంశాలకు సంబంధించి తగిన సహకారం అందించడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషించగలదు.
  • సభ్యదేశాల ప్రజల లబ్ధి కోసం అవసరమైన సహకార వ్యూహాలను అమలు చేసేందుకు దక్షిణాఫ్రికా తనవంతు సహకారాన్ని అందించగలదు.

వ్లాదిమిర్ పుతిన్:
  • జాతీయ కరెన్సీలను ఇతర బ్రిక్స్ సభ్య దేశాల్లో వినియోగించుకోవడంపై మాస్కో ఆసక్తిగా ఉంది.
  • ప్రపంచ జనాభాలో 50 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో 1/5వ వంతు వాటాలను బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలు 100 బిలియన్ డాలర్ల ప్రాథమిక మూలధనంతో, మరో 100 బిలియన్ డాలర్ల అదనపు కరెన్సీ రిజర్వ్‌తో నూతన అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేశాయి.
  • 100 బిలియన్ డాలర్ల మూలధనంతో ఏర్పాటైన సాధారణ కరెన్సీ రిజర్వ్, విత్త మార్కెట్లో ఏర్పడే ఒడిదుడుకుల నుంచి సభ్య దేశాలు తగిన చర్యలు తీసుకునేందుకు ఉపకరించగలదు.
  • 2015 చివరి నాటికి పెట్టుబడి సహకారానికి సంబంధించి బ్రిక్స్ దేశాలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటాయి.
  • ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, సాంస్కృతిక మార్పిడి తదితర అంశాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెరిగింది.
  • నూతన అభివృద్ధి బ్యాంకు, కంటింజెంట్ రిజర్వ్ ఒప్పందం దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు దోహదపడతాయి. అంతర్జాతీయ అంశాల్లో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం పెరిగేందుకు సహాయపడతాయి.

జిన్‌పింగ్
  • ‘ఉజ్వల భవితకు ఉమ్మడి భాగస్వామ్యం’ నేపథ్యంగా బ్రిక్స్ దేశాలు ప్రయాణం సాగించాలి.
  • బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెంపొందించడానికి జరిగే కృషిలో చైనా తన వంతు పాత్ర పోషిస్తుంది.
  • అధిక అభివృద్ధి సామర్థ్యం ఉన్నప్పటికీ బ్రిక్స్ దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ శాంతిని నెలకొల్పే విషయంలో భాగస్వామ్యాన్ని పటిష్టపరచాల్సిన అవసరం ఉంది.
  • బ్రిక్స్ దేశాల నూతన అభివృద్ధి బ్యాంకుకు సంబంధించి ఆఫ్రికన్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
  • బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయాలి.- 2015 తదుపరి అభివృద్ధి అజెండా, శీతోష్ణస్థితిలో మార్పు వంటి ముఖ్య అంశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో బ్రిక్స్ దేశాల సహకారం అవసరం.
  • బ్రిక్స్ దేశాలు సరళీకరణ విధానాలతోపాటు వాటి సమ్మిళితానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • బ్రిక్స్ దేశాలు ప్రపంచ గవర్నెన్స్ వ్యవస్థలో తమ హోదా మెరుగుపరచుకోవడం, ఆంక్షలు లేని సరళీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, సైబర్ స్పేస్‌లో సహకారం, ఇమ్మిగ్రేషన్ అంశం, ఇతర రంగాలు, బహుళ వాణిజ్య వ్యవస్థకు మద్దతు వంటి విషయాల్లో నిర్మాణాత్మక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తమ స్థితిగతులు మెరుగుపరచుకోవాలి.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు సొంతంగా అభివృద్ధి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంలో తగిన చేయూతను బ్రిక్స్ దేశాలు అందించాలి.
  • ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యమైన సుస్థిర వృద్ధి సాధన, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు పెంపునకు చర్యల ద్వారా బ్రిక్స్ దేశాలు తమ చరిష్మాను పెంచుకోవాలి.

దిల్మా రౌసెఫ్:
  • నూతన అభివృద్ధి బ్యాంకు, కంటింజెంట్ రిజర్వ్ ఒప్పందం ఏర్పాటు చేయాలనే బ్రిక్స్ దేశాల నిర్ణయం సహకారాన్ని పెంపొందించడానికి ముఖ్యమైన చర్యగా భావించవచ్చు.
  • ప్రపంచ స్థితిగతులకు అనుగుణంగా బ్రిక్స్ దేశాలు అభివృద్ధి వ్యూహాలను అమలు చేయాలి.
  • అంతర్జాతీయ విత్త సంస్థల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు బ్రిక్స్ దేశాలు పాటుపడాలి.
Published date : 17 Jul 2015 01:17PM

Photo Stories