Skip to main content

బలం, బలగాలలో చైనాదే పైచేయి!

అమెరికా తర్వాత తిరుగులేని సైనిక శక్తిగా చైనా తన బలాన్ని పెంచుకుంది. దానికోసం విపరీతంగా ఖర్చుచేస్తోంది. 2011లో చైనా రక్షణవ్యవస్థ మీద పెట్టిన ఖర్చు 170 బిలియన్ డాలర్లు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎగుమతులు మందగించి వృద్ధిరేటు 8 శాతానికి పడిపోయినా సైనిక వ్యవస్థ మీద పెట్టే ఖర్చు మాత్రం తగ్గించలేదు. చైనా సాయుధ దళాల సంఖ్య 22,85,000. దానిలో నావికాదళం 2,25,000, వైమానిక దళం 3,30,000. అత్యంత కీలకమైన అణ్వాయుధ విభాగం సంఖ్య 1,00,000. దేశభద్రత కోసం ఇంతటి సైన్యం అవసరం లేదన్నది స్పష్టం. ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయించే లక్ష్యంతోనే చైనా తన సైనిక పాటవాన్ని పెంచుకుంటున్నదన్నది నిర్వివాదం. చైనా పదాతి సైన్యంలో 17 డివిజన్లు, 26 బ్రిగేడ్లు, 5 పర్వత డివిజన్లు, 4 పర్వత బ్రిగేడ్లు, 8 టాంక్ డివిజన్లు, 9 టాంక్ బ్రిగేడ్లు, 4 ఎయిర్ బర్న్ డివిజన్లు, 2 మిశ్రమ డివిజన్లు, 1 మిశ్రమ బ్రిగేడ్, ఒక అటవీ డివిజన్, 7 ప్రత్యేక ఆపరేషన్ యూనిట్స్, 2 శతఘ్ని డివిజన్లు, 16 శతఘ్ని బ్రిగేడ్స్, 21 వైమానిక రక్షణ బ్రిగేడ్స్ ఉన్నాయి.

పదాతిదళంలో అణ్వాయుధాలను మోసుకుపోయే క్షిపణుల వ్యవస్థ బహు విస్తృతమైంది. నాలుగు రకాల ఖండాంతర క్షిపణులను (డీఎఫ్-31, డీఎఫ్- 13ఎ, డీఎఫ్-4, డీఎఫ్-5ఏ) ప్రయోగించేందుకు శిక్షణ పొందిన 7 బ్రిగేడ్స్ ఉన్నాయి. డీఎఫ్-31ఏ క్షిపణి 11,200 కి.మీ. లక్ష్యాన్ని ఛేదిస్తుంది. వీటిని ప్రయోగించడానికి 66 లాంచింగ్ పాడ్స్ ఉన్నాయి. మధ్యతరహా క్షిపణులు (డీఎఫ్-21, డీఎఫ్-21సి, డీఎఫ్-3ఏ)లను ప్రయోగించేందుకు 8 బ్రిగేడ్స్ ఉన్నాయి. వీటిని 118 లాంచింగ్ పాడ్స్ నుంచి ప్రయోగించడానికి వీలుంది. తక్కువ రేంజి క్షిపణులను (డీఎఫ్-11ఎ, డీఎఫ్-15) ప్రయోగించడానికి 10 బ్రిగేడ్స్, 204 లాంచింగ్ పాడ్స్ ఉన్నాయి. ఈ వ్యవస్థలో సీజే-10 క్షిపణులను ప్రయోగించడానికి 2 బ్రిగేడ్స్, 54 లాంచింగ్ పాడ్స్ ఉన్నాయి. ఆ విధంగా చైనా తన భూభాగం నుంచి ఏకకాలంలో 442 లాంచింగ్ పాడ్స్ నుంచి అణ్వా యుధాలను ప్రయోగించగలిగే సామర్థ్యం చైనాకు ఉంది.

ఉత్తర, తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలాల్లో మూడు నేవీ కమాండ్స్ ఉన్నాయి. నావికాదళంలో 65 జలాంతర్గాములు, 28 డెస్ట్రాయర్లు, 52 ఫ్రిగేట్స్ ఉన్నాయి. 253 కోస్టుగార్డు నౌకలు, 69 మైన్ స్వీపర్లు, 290 నౌకాదళ విమానాలు, 83 నౌకాదళ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇటీవలే (25 సెప్టెంబర్ 2012) మొదటి విమాన వాహక నౌక లియోనింగ్ ఉత్తర సముద్రంలో జలప్రవేశం చేసింది. చాలా వేగంగా ప్రయాణించి శ్రతువును ముప్పుతిప్పలు పెట్టే 022 హీబే నౌకలు 80కి పైగా ఉన్నాయి. పాత తరం స్వయం చోదిత వైజే-8 క్షిపణుల స్థానంలో, ఎక్కుక దూరంలోని లక్ష్యాలను ఛేదించగల వైజే-62 క్షిపణులు ప్రవేశ పెట్టారు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే క్షిపణులు 7,200 కి.మీ.లలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేస్తాయి. సముద్రతీరం నుంచి 2,000 కి.మీ. లక్ష్యాలపై ప్రయోగించే క్షిపణి వ్యవస్థలో సీజే-10 స్థానంలో అత్యంత శక్తిమంతమైన డీహెచ్-10 స్వయం చోదిత క్షిపణులను ప్రవేశపెట్టారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో ప్రయాణించే ఏ నౌక కూడా డీహెచ్-10 గురి నుంచి తప్పించుకోలేదు.

చైనా వైమానికదళం కూడా చాలా శక్తిమంతమైంది. దానిలో 29 డివిజన్లు ఉన్నాయి. యుద్ధవిమానాల సంఖ్య 1,617. డీహెచ్-10 క్షిపణులను విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. అన్ని వైమానిక దళ కమాండ్స్‌లో ఈ క్షిపణులు ఉన్నాయి. ఇండియా-జింజియాంగ్, ఇండియా-టిబెట్ సరిహద్దు 2,560 కి.మీ. దీనిలో పాక్ ఆక్రమిత భాగంతో సహా జమ్మూ-కాశ్మీర్ సరిహద్దు 1,050 కి.మీ. హిమాచల్‌ప్రదేశ్-టిబెట్ సరిహద్దు 170 కి.మీ. ఉత్తరాఖండ్ సరిహద్దు 300 కి.మీ. సిక్కిం సరిహద్దు 170 కి.మీ. అరుణాచల్‌ప్రదేశ్- టిబెట్ సరిహద్దు 870 కి.మీ. ఈ సరిహద్దు యావత్తూ చెంగ్డూ మిలిటరీ కమాండ్ పర్యవేక్షణలో ఉంది. లడక్‌లో 37,555 చ.కి.మీ (అక్సాయ్‌చిన్), అరుణాచల్‌ప్రదేశ్‌లో 20,000 చ.కి.మీ, పాకిస్థాన్ ఆక్రమిత భాగం నుంచి చైనాకు దారాదత్తం చేసిన 5,100 చ.కి.మీ. ఈ మిలిటరీ కమాండ్ ఆక్రమణలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో అంతర్భాగమని, అందుచేత అది తమదేనని చైనా వాదన. ఈ మధ్య అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ‘దక్షిణ టిబెట్’ అని పిలుస్తున్నది.

తన సాయుధబలాల లక్ష్యాలు, మోహరింపులో చైనా భారత్-టిబెట్ సరిహద్దుకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. 13వ, 14వ సేనా వాహినులు, 7 రెజిమెంట్స్ మన సరిహద్దు మీద కేంద్రీకృతమై ఉన్నాయి. వీటిలో 2 మోటారు డివిజన్లు, రెండు టాంక్ బ్రిగేడ్లు, 2 శతఘ్ని బ్రిగేడ్లు, 2 ఎయిర్ డిఫెన్స్ బ్రిగేడ్లు, ఒక వైమానిక రెజిమెంట్, ఒక ఫారెస్టు మోటార్ డివిజన్, ఒక స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ ఉన్నాయి. కింఘై రాష్ట్రంలోని దాకైదమ్, జియోకైదమ్, డిలింఘాల వద్ద యునాన్ రాష్ట్రంలోని కన్‌మింగ్, జియాన్‌షుయిల వద్ద అణ్వస్త్రాలను మోసుకుపోయే క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. భారత్‌లోని, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని ఏ లక్ష్యాన్నయినా ధ్వంసం చేసే శక్తి ఈ క్షిపణులకు ఉంది.

టిబెట్‌లో లక్షల కోట్లు కుమ్మరించి తన రహదారులను చైనా మన సరిహద్దుల దాకా విస్తరించింది. రైల్వేలైన్లను నిర్మిస్తుంది. గతంలో లాసా, బొమ్డాలలో మాత్రమే విమానాశ్రయాలుండేవి. ఇప్పుడు నగారి, కామ్‌డో, నియింగ్చి, జింగ్సే రాష్ట్రాలలో కొత్త విమానాశ్రయాలు నిర్మించింది. ప్రతిరోజూ చైనా కవ్వింపు చర్యలకు దిగుతుంది. 2010లో భారత సైనికాధికారి లెఫ్ట్‌నెంట్ జనరల్ బి.యన్.జస్వాల్‌కు చైనా వీసా నిరాకరించింది. కారణం ఆయన ఉద్దంపూర్ (జమ్మూ)లోని నార్తరన్ కమాండ్ చీఫ్ కావడమే. చైనా దృష్టిలో జమ్మూ- కాశ్మీర్ భారత భూభాగం కాదు. అదొక వివాదాస్పద ప్రాంతం. కాశ్మీరులకు వీసాలు ఇచ్చేటప్పుడు, పాస్‌పోర్టులలో ముద్రలు వెయ్యకుండా విడి కాగితాల మీద చైనా వీసాలను మంజూరు చేస్తుంది. ఈ మధ్య అందరికిచ్చే వీసాల్లో, అరుణాచల్ ప్రదేశ్, లడక్‌లు చైనా అంతర్భాగాలుగా చూపుతున్న మ్యాప్‌లను కూడా స్టాంప్ చేస్తున్నారు. పాకిస్థాన్ దురాక్రమణ కింద ఉన్న గిల్జిట్-బాల్టిస్థాన్ (ఉత్తరకాశ్మీర్)లో చైనా సైన్యం, రోడ్లు, డ్యాంలు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది. అందు కోసం సొరంగాలు నిర్మిస్తున్నారు. చైనా వాయువ్య రాష్ట్రమైన జింజియాంగ్‌ను, బెలూచిస్థాన్ తీరంలోని గ్వడర్ ఓడరేవును కలిపే రోడ్డు నిర్మాణంలో ఉంది. గిల్జిట్ భారతదేశపు అంతర్భాగమని తెలిసినా, చైనా దాన్ని ‘ఉత్తర పాకిస్థాన్’ అని పిలుస్తుంది.

మన తీరాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడానికి చైనా వ్యూహరచన చేసింది. దానిలో భాగంగానే మయన్మార్‌లో కవున్‌ప్యు నౌకాదళ స్థావరాన్ని నిర్మించింది. శ్రీలంకలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి హంబన్ తోట వద్ద 2007లో పెద్ద నౌకాస్థావరాన్ని నిర్మించింది. చైనా యుద్ధనౌకలకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. శ్రీలంకకు సైనిక సహాయం అందించటంలో భారత్‌కు గల ఇబ్బందులను చైనా తనకు అనుకూలంగా వాడుకుంది. బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని అందించింది. జియాన్-7 యుద్ధ విమానాలను, విమాన విధ్వంసక శతఘు్నలను, జేవై-1130 రాడార్ పరికరాలను అందించింది.

పాకిస్థాన్ తీరంలో గ్వడర్, పస్ని, ఓమరాల వద్ద నౌకా స్థావరాలను నిర్మించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వద్ద కూడా నౌకా కేంద్రాన్ని నిర్మించింది. అతి చిన్న దేశమైన మాల్దీవులను కూడా చైనా వదలిపెట్టలేదు. లక్ష జనాభా కూడా లేని ఈ దేశంలో చైనా 2011లో తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. వియత్నాం టెరిటోరియల్ జలాల్లో చమురు-గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్‌జీసీ చేస్తున్న అన్వేషణకు చైనా అభ్యంతరం చెబుతుంది. మన నౌకల వెనుక తన యుద్ధ నౌకలను పంపుతుంది. టెరిటోరియల్ జలాలపై తీర దేశాలకు సార్వభౌమాధికారాలుంటాయని 1982 ఐక్యరాజ్య సమితి చట్టం చెబుతున్నది. అయినా చైనా ఖాతరు చేయడం లేదు.

బ్రహ్మపుత్రా నది దక్షిణ టిబెట్‌లో పడమర నుంచి తూర్పునకు మన సరిహద్దుకు సమాంతరంగా ప్రవహించి, జంగ్‌ము వద్ద ఆగ్నేయానికి తిరిగి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. జంగ్‌ము నుంచి మన సరిహద్దు 60 కి.మీ. అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరించి చైనా బ్రహ్మపుత్ర జలాలను హయాంగ్‌హోలో కలపడానికి జంగ్‌ము వద్ద భారీ ప్రాజెక్టును నిర్మించింది. అక్కడ సొరంగాలను తొలిచేందుకు న్యూక్లియర్ ఛార్జెస్‌ను వాడింది. ఇది కేవలం జల విద్యుత్ ప్రాజెక్టని, దీనివల్ల భారత్‌లోకి పోయే జలప్రవాహానికి అంతరాయం కలగదని చైనా బుకాయిస్తుంది. ఇదిగాక, దక్షిణ టిబెట్‌లో బ్రహ్మపుత్ర మీద 12 బ్యారేజీలు నిర్మించింది. దీని వల్ల భవిష్యత్తులో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాంలోని విద్యుత్ ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా అందని పరిస్థితి ఏర్పడుతుంది. పశ్చిమ టిబెట్‌లో సింధు నది మీద కూడా రెండు డ్యాంలు, సట్లెజ్ మీద ఒక డ్యాం నిర్మించి మన దేశానికి వచ్చే నీటిని అడ్డుకుంటుంది.

ఇతర పొరుగు దేశాలతో కూడా చైనా ఇదే విధంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంపై తనకు సార్వభౌమాధికారం ఉందని పేచీ పెడుతుంది. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోని అతి పెద్ద సముద్రాల్లో రెండోది. దాని విస్తీర్ణం 30 లక్షల చ.కి.మీ. దానిలో చిన్న, పెద్ద రేవులు 250 దాకా ఉన్నాయి. ఈ దీవులన్నీ తమవేనని చైనా వాదిస్తుంది. తన ఆధిపత్యాన్ని ఖాయం చేసుకొనేందుకు అత్యాధునిక యుద్ధ పరికరాలతో కూడిన 13 భారీ యుద్ధ నౌకలను చైనా దక్షిణ చైనా సముద్రంలో తిప్పుతున్నది. ఈ దీవుల్లో అపార చమురు గ్యాస్ నిక్షేపాలున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అంతేకాక ప్రపంచ వాణిజ్యంలో 25 శాతం ఈ సముద్రం ద్వారా సాగుతుంది. జపాన్ ఇంధన అవసరాల్లో 75 శాతం అందించే టాంకర్లు ఈ సముద్రం ద్వారా ప్రయాణిస్తుంటాయి. పరాసెల్ దీవులు చైనా-వియత్నాం సరిహద్దుకు సమీపంలో ఉంటాయి. 1974లో చైనా బలప్రయోగం ద్వారా ఈ దీవుల నుంచి వియత్నాంను వెళ్లగొట్టింది. చైనా, ఫిలిప్పీన్స్ మధ్య 1971లో మొదటిసారిగా స్పార్ట్‌లే ద్వీపాల విషయంలో వివాదం ముదిరింది. ఆ తర్వాత ఫిలిప్పీన్స్ తన అధీనంలోని దీవుల్లో సాయుధ దళాలను మోహరించింది. 1999లో మిశ్చీఫ్ రీఫ్ అనే దీవిలో చైనా సైనిక నిర్మాణాలు ప్రారంభించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ దీవులు తమ ఎక్స్‌క్లూసివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోవని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. 2011 ఫిబ్రవరిలో ఫిలిప్పీన్స్ చేపల వేట పడవలపై చైనా కాల్పులు జరిపింది.

తూర్పు చైనా సముద్రంలోని రియాయు దీవుల విషయంలో చైనా, జపాన్‌ల మధ్యవివాదం తలెత్తింది. ఈ దీవులు జపాన్ అధీనంలో ఉన్నాయి. వీటి సమీపంలోకి వచ్చిన ఒక చైనా నౌక కెప్టెన్‌ను జపాన్ 2010 సెప్టెంబర్‌లో అరెస్టు చేసింది. ప్రతీకార చర్యగా చైనా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులను నిలిపేసింది. వివాదం చైనాలోని అనేక జపాన్ పరిశ్రమలు మూతపడేంతగా విస్తరించింది. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి చైనా ఆధిపత్య ధోరణికి కళ్లెం వేయకపోతే ముందు ముందు దక్షిణ, ఆగ్నేయ ఆసియాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు తలెత్తనున్నాయి. యుద్ధాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది.
Published date : 18 Dec 2012 01:54PM

Photo Stories