Skip to main content

భారత్ - పాకిస్థాన్ సంబంధాలు

‘‘ప్రగతికి మనం చేసే కృషి విజయవంతం కావాలంటే ఈ ప్రాంతం (భారత ఉపఖండం)లో శాంతి నెలకొనాలి’’ -పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్

ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే భావనకు ఊతాన్నిచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రి (ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రులు నామినేట్ అయ్యారు) బాధ్యతలు చేపట్టడం ఒకవైపు పాకిస్థాన్‌కు మరోవైపు పొరుగు దేశమైన భారత్‌కు శుభసూచికం. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల ముందు భారతదేశానికి స్నేహ హస్తాన్ని అందించడం హర్షదాయకం. అందుకు తగిన రీతిలోనే మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పందించారు. ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలనే ఆకాంక్ష స్పష్టమౌతుంది. చర్చల ద్వారా ఇరు పక్షాలు ఆమోదయోగ్యంగా సమస్యలను పరిష్కరించుకోవడం భారత ఉప ఖండంతో పాటు ప్రపంచానికి కూడా అవసరం. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం ఇరు దేశాలకు శ్రేయస్కరం.

కాశ్మీర్‌తో మొదలు:
ఇరు దేశాల మధ్య ఆరు దశాబ్దాలకు పైగా సంబంధాలు కాశ్మీర్ వివాదమనే నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వైఖరిలో మార్పు రాలేదు. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని పాకిస్థాన్‌లోని అన్ని ప్రముఖ రాజకీయ పక్షాలు నినదిస్తున్నాయి. వాణిజ్య పరమైన అవరోధాలు, జలవనరుల వినియోగం, ఇరు దేశాల ప్రజల మధ్య రాకపోకల విషయంలో ఆంక్షలు మొదలైనవి కాశ్మీర్ వివాదం పరిష్కారమైతే వాటంతట అవే సమసిపోతాయి. కాశ్మీర్ వివాదం పాకిస్థాన్ రాజకీయ జీవితాన్ని, ఆ దేశ వనరులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. భారత్‌కు వ్యతిరేకంగా ‘జిహాదీ’ కార్యకలాపాలను ప్రోత్సహించడం, ఆఫ్ఘానిస్థాన్‌లో కీలక పాత్ర నిర్వహించాలనే కోరిక, ఇటీవల కాలంలో సింధు నదీ జలాల వినియోగం విషయంలో వివాదాలను లేవనెత్తడం ఇందుకు ఉదాహరణలు. భారత్‌తో పొంచి ఉన్న ప్రమాదం అనే నినాదంతో చైనాకు మరింత దగ్గర కావడం, అణు ఆయుధాలను సమకూర్చుకోవడం, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికలలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం వంటి చర్యలు పాకిస్థాన్
అభద్రతా భావనకు చిహ్నాలు.

విశ్వాసం పెంపొందించే చర్యలు:
పాకిస్థాన్ ఆంతరంగిక, విదేశీ సంఘటనలు కాశ్మీర్ విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 1971 యుద్ధం తర్వాత కుదిరిన ‘సిమ్లా ఒప్పందం’ ఇరు పక్షాలు వాస్తవాధీనరేఖకు కట్టుబడి ఉండటానికి దారి తీసింది. బెనజీర్‌భుట్టో, నవాజ్ షరీఫ్ ప్రభుత్వాలు (1990 దశకంలో) భారత్‌తో భద్రతకు సంబంధించి చర్యలు కొనసాగించడం జరిగింది. పాకిస్థాన్ సైనిక దళాల విముఖత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడకుండా అడ్డుపడుతుంది. పాకిస్థాన్ 1988-90లలో భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సిక్కు ఉగ్రవాదానికి మద్దతునివ్వడాన్ని నిలిపి వేసింది. ఇరుపక్షాలు దేశ భద్రతా విషయంలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు (Confidence building measures) చేపట్టాయి. ఇందుకు అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ చూపారు. పాకిస్థాన్ సైన్యం కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, చివరకు భుట్టో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించింది. ఆ తర్వాత ప్రధాని నవాజ్‌షరీఫ్, భారత ప్రధాని వాజ్‌పాయ్‌లు వెలువరించిన ‘లాహోర్ ప్రకటన’ చారిత్రాత్మకం. ఇందులో భాగంగా న్యూఢిల్లీ-లాహోర్‌ల మధ్య బస్సులు నడపడం, ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఉగ్రవాదాన్ని అణిచివేయడం వంటి చర్యలకు ఆమోదం తెలిపారు.

ముషారఫ్ శకం:
షరీఫ్ ప్రయత్నాలను వమ్ము చేస్తూ పాకిస్థాన్ సైన్యం కార్గిల్ దురాక్రమణకు పాల్పడటం, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకోవడం (1999) పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో ఒక మాయని మచ్చ. ఇది భారత్ - పాకిస్థాన్ సంబంధాలను దెబ్బతీసింది. ముషారఫ్ పాలనలో (1999- 2008) కాశ్మీర్ సమస్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ప్రధాన అవరోధమైంది. 2001లో భారత పార్లమెంట్‌పై లష్కరే తోయిబా(Let), జైషే మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థల దాడి ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. 2004 నాటికి పాకిస్థాన్ గూడచారి సంస్థ ఐఎస్‌ఐ ప్రోత్సాహంతో కాశ్మీర్‌లో రగులుకున్న అల జడి తగ్గుముఖం పట్టింది. వాస్తవాధీన రేఖ ద్వారా ఉగ్రవాదుల చొరబాటు, మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడం, సియాచిన్, సర్‌క్రీక్ వివాదాలపై చర్చలు వంటి చొరవ ఉద్రిక్తతలను తగ్గించాయి. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలనే షరతును ముషారఫ్ ప్రభుత్వం సడలించింది. ఉమ్మడి చర్యల ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమేనని ప్రకటించింది. కానీ ఇది కేవలం అంతర్జాతీయంగా తన నియంతృత్వ ప్రభుత్వం మీదున్న మసకను తొలగించుకోవడానికి వేసిన ఎత్తుగడ మాత్రమే. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే ఎక్కువగా లాభించేది పాకిస్థాన్‌కే అయినప్పటికీ, సైనిక దళాల ప్రయోజనాలు, సరిహద్దు వివాదాలు అవరోధాలుగా నిలిచాయి.

ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు:
ముషారఫ్ ఉద్వాసన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటంతో ఉమ్మడి చర్చలు (Composite Dailouge) తిరిగి ఊపందుకున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ-PPP), పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్(PML-N) భారత్‌తో మెరుగైన సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చాయి. 2008లో ‘ముంబై’ పై జరిగిన ఉగ్రవాదుల దాడి ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతాన్ని కలిగించింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఐఎస్‌ఐ ఈ దుశ్చర్యకు కారకులు. ఐరాస భద్రతా సమితి లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ప్రారంభంలో పాకిస్థాన్ ఈ ఉగ్రవాద చర్యతో తనకేమీ సంబంధం లేదని మభ్య పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, అంతర్జాతీయ ఒత్తిడికి లొంగి జైషే మొహమ్మద్‌ని నిషేధించింది. ఈ సంస్థ నాయకుడైన హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేసింది. కానీ లాహోర్ హైకోర్టు ఉత్తర్వుతో విడుదల చేసింది. ముంబై దాడులకు కారకులైన వారిని గుర్తించి న్యాయస్థానం ముందు హాజరు పరచకపోతే నిల్చిపోయిన ఉమ్మడి చర్చలు ప్రారంభించడానికి వీలుండదని భారత్ స్పష్టం చేసింది. 2010లో భూటాన్ (థింఫు)లో జరిగిన సార్‌‌క సమావేశానికి హాజరైన భారత్, పాకిస్థాన్ ప్రధానులు మన్మోహన్‌సింగ్, యూసఫ్ రజా జిలానీ - ఫలవంతమైన చర్చలు పునఃప్రారంభించడానికి సుముఖత చూపారు.
2011లో పునరుద్ధరించిన ఉమ్మడి చర్చలు అనేక రంగాలలో ప్రగతిని సాధించినప్పటికీ, సియాచిన్, సర్‌క్రీక్, నీటి వివాదాలలో ప్రతిష్టంభన కొనసాగింది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశించిన స్థాయిలో వేళ్లూనకపోవడం, సైనిక దళాల ప్రభావం, వాటి నిర్ణయాత్మక వైఖరికి కొంత వరకు అడ్డంకిగా నిలిచినా, రాజకీయ నాయకుల, పౌర సమాజం (ముఖ్యంగా మీడియా) చొరవ కొంతవరకు చర్చల పురోగతికి దోహదపడ్డాయి. 2010లో ఇరు దేశాల వ్యాపారవేత్తల ఆర్థిక సమావేశం ఆరు రంగాలలో సహకారాన్ని పెంపొందించాలని నిర్ణయించింది. అవి.. ఆరోగ్యం, విద్య- నిపుణత శిక్షణ, సమాచార సాంకేతిక రంగం, ఇంధనం, వ్యవసాయం, జౌళి పరిశ్రమ.

శాంతిని నెలకొల్పడమెలా?
ఎ) ముందుకు సాగడం - పొరుగుదేశాలైన ఈ రెండింటి మధ్య వాణిజ్యం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. భారత్‌తో పాకిస్థాన్ వాణిజ్యం కేవలం ఒక శాతం మాత్రమే ఇటీవలి కాలంలో ప్రత్యక్ష ద్విముఖ వాణిజ్యం పెరిగినప్పటికీ అది కేవలం 3 బిలియన్ డాలర్లలోపే. 40 బిలియన్ డాలర్ల వరకు పెరగడానికి అవకాశముంది. భారత్ పాకిస్థాన్‌కు 1990 దశకంలోనే అత్యంత అనుకూల దేశం (Most favoured Nation) హోదా కల్పించింది. పాకిస్థాన్ ఇటీవల సూత్రప్రాయంగా భారత్‌కు అదే హోదాను కల్పించడానికి ఒప్పుకున్నప్పటికీ, అది అమలు కాలేదు. ఎక్కువ శాతం వ్యాపారం పరోక్షంగా తృతీయ దేశాలైన యూఏఈ, సింగపూర్, ఇరాన్, ఆఫ్ఘానిస్థాన్‌ల ద్వారానే జరుగుతుంది. అక్రమ వాణిజ్యం, మూడు పూవులు, ఆరు కాయలుగా విలసిల్లుతుంది. స్మగ్లర్లు, అవినీతికర కస్టమ్స్ ఉద్యోగులు ఇందుకు కారణం. దిగుమతుల నిషేధం, భారీ సుంకాలు, రాజకీయ కారణాలను బట్టి కొనసాగిస్తున్న కృత్రిమ వాణిజ్య అవరోధాలు, రవాణాలో చౌర్యం మొదలైనవి వాణిజ్యరంగంలో పురోభివృద్ధికి అవరోధాలు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనల మేరకు వాణిజ్య రంగంలో ఎలాంటి వివక్ష చూపకుండా, అన్ని దేశాలకు సమానావకాశాలివ్వాలి. ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి ప్రధాన ప్రతిబంధకాలు- నకారాత్మక, సకారాత్మక జాబితాలు (Negative and possitive lists). క్రమేణా నకారాత్మక జాబితాలో అంశాల సంఖ్య తగ్గుతూ, సకారాత్మక జాబితాలోని అంశాలు పెరుగుతూ వస్తున్నాయి. వాస్తవానికి, ఈ జాబితాలే వాణిజ్య ప్రక్రియ అడ్డుగోడలౌతున్నాయి. వాణిజ్యం పెరగడం వల్ల ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. సాధారణ ప్రజలకు ఉపాధి, నిత్యావసర వస్తువులు చౌకగా లభిస్తాయి. ఈ మార్పు రెండు దేశాల మధ్య సుహృద్భావనను కలిగిస్తాయి. వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ఒక మూలరాయి.
2012లో వాణిజ్య మంత్రుల సమావేశం జరిగింది. దీని ఫలితంగా మూడు ముఖ్య ఒప్పందాలు కుదిరాయి. కస్టమ్స్ రంగంలో సహకారం, వాణిజ్య క్లేశ నివారణ ముఖ్యమైనవి. అంతంతమాత్రంగా ఉన్న రవాణా సదుపాయాలు, మౌలిక సదుపాయాల లేమి, ఆర్థిక వనరుల లోటు, రాజకీయ, ఉద్యోగిస్వామ్య నిరాసక్తత ద్వైపాక్షిక వాణిజ్య పెంపుదలకు అడ్డంకులు. వాణిజ్యం పటిష్టవంతమైతే, రాజకీయ, సైనిక అవరోధాలను కొంతవరకు అధిగమించవచ్చు. ఆర్థికబంధం, మిగిలిన రంగాలను ప్రభావితం చేస్తుంది.
బి) ఆర్థిక సహకారం: ఆర్థిక రంగంలో ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే ‘వీసా’ నిబంధనలను సరళీకృతం చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా విధానం నకారాత్మకంగా ఉంది. పాకిస్థాన్ సరిహద్దు దాటే ప్రతి పాకిస్థానీని ఉగ్రవాదిగా భావించి అనుమతి నిరాకరించడం, ఒక సారి మాత్రమే దేశంలోకి ప్రవేశించడానికి అనుమతినివ్వడం, ప్రవేశించిన పట్టణం నుంచే తిరిగి నిష్ర్కమించాలనే నిబంధన, పోలీస్ స్టేషన్‌లో హాజరు కావడం వంటి నిబంధనలు పాటించడం ద్వారా భారత్ అతిగా వ్యవహరిస్తోందనేది పాకిస్థానీయుల ఆరోపణ. అలాగే భారతదేశ వ్యాపారవేత్తలకు పాకిస్థాన్‌లో పరిశ్రమలు నెలకొల్పే అవకాశమివ్వడం లేదనే వాదన కూడా ఉంది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ పట్టణాల్లో విశాలమైన స్థిరాస్థులు (Real Estate) ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పాకిస్థాన్ సైనికాధికారులు తమ నివాసాలకు, క్లబ్‌లకు విలువైన స్థిరాస్థిని వినియోగించుకుంటున్నారనేది నిర్వివాదాంశం.

సి) నీరు, ఇంధనం: సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఆరు నదులున్నాయి. బియాస్, చీనాబ్, జీలమ్, రావి, సట్లెజ్, సింధు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఈ నదీ జలాల వినియోగం 1960లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడిక మేరకు జరుగుతుంది. సింధు, చీనాబ్, జీలమ్ నదులు నీరు పాకిస్థాన్ వినియోగించుకోవడానికి, మిగిలిన మూడు నదుల నీరు భారత్ ఉపయోగించుకోవడానికి అంతర్జాతీ య ఒడంబడిక అనుమతిస్తుంది. దిగువ దేశంగా (lower riparian state) సింధు నదీ పరివాహక ప్రాంతంలో 80 శాతం నీరు పాకిస్థానీలకు లభిస్తుంది. భారత్‌కు వ్యవసాయ, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి అవసరాల వినియోగానికి మిగిలిన నీరు లభిస్తుంది. 1960లో కుదిరిన ఒప్పందం ఇటీవల కాలంలో కొంత ఒత్తిడికి గురౌతుంది. వ్యవసాయ రంగంలో పాకిస్థాన్ అవసరాలు పెరగడం, భారత్ అవసరాలు కూడా (నదీ జలాల వినియోగం విషయం) పెరగడం వివాదానికి దారితీస్తుంది. ఈ పరివాహక ప్రాంతంలో భారత్ 33 బహుళార్థసాధక డ్యామ్‌లను నిర్మిస్తుంది. వీటిలో వివాదాస్పదమైనవి - వుల్లార్ బ్యారేజ్, కిషన్‌గంగా జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. జమ్మూలోని వుల్లార్ సరస్సు మీద బ్యారేజీ నిర్మాణాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది అంతర్జాతీయ ఒడంబడిక ఉల్లంఘనేనని వాదిస్తుంది. భారత్ చర్యలను అంతర్జాతీయ నదీ జలాల ట్రిబ్యునల్‌లో సవాల్ చేయడం జరిగింది. ట్రిబ్యునల్ తీర్పు మన దేశానికి అనుకూలంగా వచ్చింది. పాకిస్థాన్‌లో 83 శాతం నీటి పారుదల వ్యవస్థ సింధు నది బేసిన్‌పై ఆధారపడి ఉంది. భారత్ ప్రారంభించిన డ్యామ్‌లు పూర్తయితే పాకిస్థాన్‌కు తగినంత నీరు లభించదనే భయముంది. కాశ్మీర్ తర్వాత, నదీ జలాల వివాదం పాకిస్థానీ జీహాదీలకు బలమైన ఆయుధంగా పరిణమిస్తుందనే వాదన కూడా ఉంది. మెరుగుపడుతున్న ఆర్థిక సంబంధాలు, నదీ జలాల వివాద తీవ్రతను కొంత వరకు సడలించవచ్చనే అభిప్రాయం నెలకొంది. ఒక వైపు సైనికదళాలు, ఇంకొకవైపు మత చాంధ సవాదులు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటా నికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నారు. భారత్‌కు MFN హోదా కల్పించడంలో జాప్యానికి పై రెండు శక్తులు ప్రబల కారణం. పాకిస్థాన్ రక్షణ కాశ్మీర్, నదీ జలాల సమస్యల పరిష్కారంతో ముడిపడి ఉందని జనరల్ పర్వేజ్ కయానీ ఎన్నోసార్లు స్పష్టం చేసారు. LeT/JeM ఉగ్రవాద సంస్థలతోపాటు, మతతత్వ రాజకీయ పార్టీలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వ్యవహరిస్తున్నాయి. జమత్-ఐ-ఇస్లామీ పార్టీ ఈ విషయంలో అగ్రగామి.

ఆఫ్ఘాన్ అంశం కూడా ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది. ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్, హక్కాని వర్గం, LeT/JeM, మొదలైనవి కాబూల్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి (2008) చేశాయి. ఆఫ్ఘానిస్థాన్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న భారత ప్రాబల్యం పాకిస్థాన్ సైనిక దళాలకు మింగుడుపడటం లేదు. బెలూచిస్థాన్‌లో వేర్పాటువాద ధోరణి ప్రబలడానికి ఆఫ్ఘానిస్థాన్‌లో భారత దౌత్య కార్యాలయాలు కారణమని ఆరోపిస్తున్నాయి. భారత్-ఆఫ్ఘానిస్తాన్‌ల మధ్య రక్షణ ఒప్పందం (2011) పాకిస్థాన్‌కు రుచించడంలేదు. అమెరికా, నాటో బలగాలు ఉపసంహరించుకున్నాక, ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ ప్రాబల్యం పెరగడం మన దేశానికి సుతారాం ఇష్టం లేదు. పాకిస్థాన్ తన శాయశక్తులా ఆఫ్ఘానిస్థాన్‌లో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఆఫ్ఘానిస్థాన్‌లో అస్థిరత నెలకొల్పడానికి పాకిస్థాన్ కృషి చేస్తుంది.

ఈ నేపథ్యంలో సత్సంబంధాల మెరుగుకు ఉభయ దేశాలు కృషి చేయాలి.

పాకిస్థాన్ తనవంతుగా:
ఎ) భారత్‌కు MFN హోదా కల్పించడం
బి) ముంబై దాడిలో పాల్గొన్న వారిని శిక్షించడం
సి) ఉగ్రవాద సంస్థలను అదుపులో పెట్టడం వంటివి .

భారత్ తనవంతుగా:
ఎ) పాకిస్థాన్ సరకుల దిగుమతి విషయంలో అవరోధంగా నిలుస్తున్న అడ్డంకులను తొలగించడం
బి) కాశ్మీర్‌లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSPA) ఉపసంహరించడం.
సి) కాశ్మీర్‌లో పోలీస్ యంత్రాంగాన్ని జవాబుదారీతనంగావించడం.

రెండుదేశాల, ఉమ్మడిగా:
ఎ) ఇరు దేశాలు తమ భూభాగం ద్వారా రెండో దేశానికి ప్రయాణం, వ్యాపారం చేసుకోవడానికి అనుమతినివ్వడం (Grant over land transist rights)
బి) వీసా నిబంధనలను సడలించడం
సి) నదీజలాల వినియోగంలో తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టడం
డి) పెట్రోలియం ఉత్పత్తులను పైప్‌లైన్ ద్వారా భారత్ నుంచి పాకిస్థాన్‌కు చేరవేయడం.
పైన ప్రస్తావించిన చర్యలతోపాటు రాజకీయ చొరవ, పౌరసమాజం చురుకైన పాత్ర ఎంతైనా అవసరం. ఇరు పక్షాలకు మిత్రదేశం, అగ్రరాజ్యమైన అమెరికా మద్దతు కావాలి. పొరుగు దేశమైన చైనా సహకారం కూడా ఉండాలి.
డా॥ బి. జె. బి. కృపాదానం సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్
Published date : 13 Jun 2013 08:15PM

Photo Stories