Skip to main content

భారత్ - ఆఫ్రికా సదస్సు

భారత్-ఆఫ్రికాల మధ్య శతాబ్దాలుగా వ్యాపార సంబంధాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలుఉన్నాయి. ఈ సత్సంబంధాలను కొనసాగిస్తూ భారత్-ఆఫ్రికా నడుమ సదస్సులు జరుగుతున్నాయి. ఇందులో ప్రముఖంగా భారత్ ఆఫ్రికా సదస్సును పేర్కొనవచ్చు. ఆధునిక ప్రపంచంలో పరస్పర సహకారంతో ఎదుగుతున్న భారత్-ఆఫ్రికా సంబంధాల్లో మూడో ఆఫ్రికా సదస్సుతో నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. అక్టోబరులో జరిగిన భారత్ - ఆఫ్రికా సదస్సుపై ప్రత్యేక కథనం.
భారత్-ఆఫ్రికా సమావేశాలు
  • బాండూంగ్ సమావేశం: 1955లో ఏప్రిల్ 18-24 మధ్య ఇండోనేషియాలోని బాండూంగ్‌లో సమావేశం జరిగింది. మొత్తం 29 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. భారత్-ఆఫ్రికాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలపరచటం, దేశ ఐక్యతపై పరస్పర సహకారం, దేశాల సొంత విషయాల్లో పరస్పర జోక్యం కల్పించుకోకపోవటం - ఈ సమావేశ లక్ష్యాలు.
  • ఆఫ్రో ఏషియన్ సమావేశం: ఇది 1958లో ఇండోనేషియాలో జరిగింది. ఏషియన్ లీగల్ కన్సల్టేటివ్ కమిటీని ఈ సమావేశంలో భాగంగా స్థాపించారు.
  • అలీనోద్యమం: 115 అభివృద్ధి చెందుతున్న దేశాలతో 1961లో బెల్‌గ్రేడ్‌లో స్థాపించారు. అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్నో, ఈజిప్టు రెండో అధ్యక్షుడు గామల్ అబ్దెల్ నాస్సెర్, ఘనా మొదటి అధ్యక్షుడు క్వామె క్రుమా, యుగోస్లేవియా అధ్యక్షుడు జోసిప్ బ్రాజ్ టిటో ఈ ఉద్యమానికి ప్రాతినిథ్యం వహించారు. ప్రచ్ఛన్నయుద్ధం సమయంలో ఏర్పడ్డ పెట్టుబడీదారీ వ్యవస్థకు, కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం నిలిచింది.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్వతంత్రతను నిలుపుకోవాలని, అగ్రరాజ్యాల యుద్ధాల్లో భాగస్వామ్యం లేకుండా, వారి సైనిక సామర్థ్యానికి దన్నుగా నిలవకూడదనేవి ఈ ఉద్యమ లక్ష్యాలు.

భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు
భారతదేశం, ఆఫ్రికాల మధ్య సంబంధాలకు భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సు అధికారిక వేదికగా పేర్కొనవచ్చు. ఇది ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుంది.

మొదటి సదస్సు
భారత్-ఆఫ్రికా ఫోరం మొదటి సదస్సును 2008లో న్యూఢిల్లీలో ఏప్రిల్ 4-8 తేదీల మధ్య నిర్వహించారు. ఆఫ్రికా ఖండం నుంచి 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వ్యాపారం, శక్తి వనరులు, ప్రపంచ సమస్యలైన ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, తీవ్రవాదుల దాడులు, వాతావరణ మార్పు వంటి అంశాల్లో పరస్పర సహకారం పొందటంపై ఈ సదస్సులో చర్చించారు.
  • అల్జీరియా, బర్కినాఫెసో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా, లిబియా, కెన్యా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, ఉగాండా, జాంబియా దేశాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
  • భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సంబంధాల గురించి ఢిల్లీ డిక్లరేషన్‌లో, వివిధ రంగాల్లో భారత్-ఆఫ్రికా దేశాల సహాయ సహకారాలపై పరస్పర సహకారాలను నివేదికలో వివరించారు.

రెండో సదస్సు
రెండో భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు 2011లో ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరిగింది. భారత్‌తోపాటు 15 ఆఫ్రికా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సత్సంబంధాలను విస్తరించటం, మెరుగుపరచటం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.
  • వ్యవసాయ ఉత్పత్తులను పెంచటం, 2015 నాటికి మిలీనియం అభివృద్ధి లక్ష్యాలైన పేదరిక నిర్మూలనను సాధించటం, పౌష్టికాహార లోప సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
  • ఆఫ్రికాలో వివిధ జీవనోపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు భారతదేశం అంగీకరించింది.

మూడో భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సు
  • ఈ సదస్సు 2014 డిసెంబరులో జరగాల్సి ఉండగా దాన్ని 2015కు వాయిదా వేశారు. ఎక్కువ దేశాలను ఈ సదస్సుకు ఆహ్వానించేందుకు వాయిదా వేసినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి తెలిపారు.
  • ఈ సదస్సుకు ఒక లోగోను రూపొందించారు. ఇందులో ఆఫ్రికా, భారత సింహాలు కలిసి ఉంటాయి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం సాహసం, గర్వంతో ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకోవటం అని దీని అర్థం.
  • సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సుమారు 200 మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వైభవంగా ప్రారంభమైంది. ఇది కుటుంబ పునఃకలయికగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అభివర్ణించారు.
  • ఈ సదస్సులో భాగంగా 19 మంది దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ 12 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆఫ్రికా ప్రతినిధులకు, ప్రభుత్వాధినేతలకు ప్రగతి మైదానంలోని క్రాఫ్ట్ ప్రదర్శనశాలలో విందు ఇచ్చారు.

సదస్సు ప్రధానాంశాలు
  • ఆఫ్రికా ప్రాథమిక అవసరాలైన నీటి పారుదల అభివృద్ధి, విద్యుత్, సాంకేతిక, వైజ్ఞానికాభివృద్ధికి భారత్ పూర్తి సహకారాన్ని అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు.
  • రక్షణ సహా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆఫ్రికా దేశాలు భారత్ సహాయాన్ని కోరాయి. అంతర్జాతీయ సమస్యగా మారిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించాయి. అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేకతపై సమగ్ర ఒప్పందాన్ని ఆమోదించాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితికి ఉందని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు.
  • సహజవాయువు, చమురు రంగాల్లో వ్యాపారాన్ని విస్తృత పరచాలని భావించారు.
  • వృత్తి విద్య శిక్షణ, చిన్న తరహా పరిశ్రమల్లో భారత నైపుణ్యాన్ని పంచుకునేందుకు ఆఫ్రికా ఆసక్తిగా ఎదురుచూస్తోందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా తెలిపారు.
  • భారత్-ఆఫ్రికాల మధ్య గత దశాబ్దంలో 7000 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగిందని, దీన్ని మరింత పెంచేందుకు సరళమైన షరతులతో వెయ్యి కోట్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. 60 కోట్ల డాలర్లను గ్రాంటుగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
  • ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని, వీటో అధికార దేశాల పెంపు విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, 21వ శతాబ్ద కాలానికి అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు తీసుకురావాలని జుమా ప్రతిపాదించారు.
  • భారత్-ఆఫ్రికన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌తో పాటు పరస్పర వ్యూహాత్మక సహకార నివేదికలను ఆమోదించారు.
  • పారిస్‌లో జరగబోయే వాతావరణ సదస్సుకు సంబంధించి కర్బన ఉద్గారాల తగ్గింపునకు ధనిక దేశాలు బాధ్యత వహించాలని సదస్సు పేర్కొంది.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు సాంకేతిక, వైజ్ఞానిక, ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ధనిక దేశాలు కట్టుబడి ఉండాలని డిక్లరేషన్ సూచించింది.
  • నైజీరియా జైళ్లలో ఉన్న 11 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా అధ్యక్షుడు బుహారిని కోరగా, త్వరలోనే వారి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
  • భారత్‌లో రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆఫ్రికా దేశాలను మోదీ కోరారు.
  • భారత్ అందించిన 60 కోట్ల డాలర్ల సహాయంలో 10 కోట్ల డాలర్లను భారత్-ఆఫ్రికా సహాయ నిధికి ఖర్చు చేస్తారు. ఈ మొత్తంలో కొంత ఆఫ్రికాలో స్కాలర్‌షిప్‌లకు, భారత్-ఆఫ్రికా ఆరోగ్య నిధికి వినియోగిస్తారు.

బంధం మరింత దృఢంగా
  • ప్రస్తుతం ఆఫ్రికా దేశాలతో చైనా వాణిజ్యం 25,000 కోట్ల డాలర్లు కాగా భారత్-ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యం 7,000 కోట్ల డాలర్లుగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆఫ్రికా-భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తృత పరచాల్సిన ఆవశ్యకత ఉంది.
  • ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 7 ఆఫ్రికాలోనే ఉన్నాయి. మానవాభివృద్ధి సూచీలోనూ అనేక ఆఫ్రికా దేశాలు భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. అనేక దేశాలు ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టటంతో ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఆఫ్రికా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాల్సిన ఆవశ్యకత ఉంది.
  • పెట్టబడులు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ ఆఫ్రికా దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవచ్చు.
ప్రపంచ జనాభాలో మూడో వంతు అయిన భారత్, ఆఫ్రికా దేశాల ప్రజలు సంఘటితమైతే సాధించలేనిది ఏదీ లేదన్న వాస్తవం ప్రతిబింబించేలా భారత్ ఆఫ్రికా సదస్సు జరిగింది. ఆఫ్రికా భారత్‌ల మధ్య నానాటికీ బలపడుతున్న సంబంధాలు మరింత విస్తరించేలా చేయటమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ బంధం మరింత బలపడి, రాబోయే కాలంలో సమగ్రాభివృద్ధికి దోహదపడనుంది.

భారత్-ఆఫ్రికా సంబంధాలు
  • శతాబ్ద ప్రారంభంలో ఒక ప్రముఖ ఆర్థిక రంగ పత్రిక ఆఫ్రికాను ఆశావాదం లేని ప్రదేశంగా అభిర్ణించింది. అదే పత్రిక 13 ఏళ్ల కిందట ఆఫ్రికాను ఆశావాద ఖండంగా పేర్కొంది. ఆఫ్రికాలో జరిగిన వాణిజ్యాభివృద్ధికి మెరుగైన అంతార్జాతీయ సంబంధాలను ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
  • భారతదేశం, ఆఫ్రికా దేశాలు భౌగోళిక, రాజకీయ, చారిత్రక, నాగరికత విషయాల్లో అనేక సారూప్యాలు కలిగి ఉన్నాయి. విదేశీ నావికుల డైరీలు, వైదిక గ్రంథాల్లో భారత్-ఆఫ్రికా మధ్య సమర్థవంతమైన వ్యాపార సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తున్నాయి. భారత్, ఆఫ్రికా దేశాల వాణిజ్యానికి హిందూ మహా సముద్రం వారిధిలా ఉపయోగపడేది.
  • 1893లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఒక భారతదేశం నుంచి ఆఫ్రికాకు వెళ్లారు. కానీ, అక్కడి వర్గ వైషమ్యాలకు వ్యతిరేకంగా ప్రజల రక్షణకై సుమారు రెండు దశాబ్దాలపాటు పోరాడారు.
  • భారత్-ఆఫ్రికా దేశాల జాతీయోద్యమంలో గాంధీ ఉమ్మడి పాత్ర పోషిస్తే, ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు బలపడటానికి నెహ్రూ కృషిచేశారు.
  • అబ్దుల్ కలాం ఉపగ్రహ ఫైబర్ ఆప్టిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా భారత్-ఆఫ్రికా దేశాల మధ్య టెలీ చికిత్స, ఈ-సేవలను అనుసంధానం చేశారు. 2004లో ఈ పథకం అమలుకు భారతదేశం ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ పథకం ద్వారా ఆఫ్రికా ప్రజలు విద్య, వైద్య, వైజ్ఞానిక సేవలు పొందుతున్నారు.
  • భారత్, ఆఫ్రికా దేశాలు ప్రస్తుతం పరస్పరం సహకారంతో ఆర్థికాభివృద్ధితో ముందుకు సాగుతున్నాయి.
  • అలీనోద్యమంలోని సభ్యత్వ దేశాల్లోని సగ భాగం, ఐరాస సభ్యత్వ దేశాల్లోని 1/3 వంతు దేశాలు ఆఫ్రికాలో ఉన్నాయి.
  • అలీనోద్యమం, జీ-15, ఐక్యరాజ్యసమితి వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్, ఆఫ్రికా దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయి.
  • ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నివేదిక ప్రకారం 2009-14 మధ్య కాలంలో ఆఫ్రికా దేశాల్లో భారత్ 6 శాతం, చైనా 3 శాతం, యూరప్ దేశాలు 50 శాతం పెట్టుబడులు పెట్టాయి. భారత్, చైనాల ప్రవేశంతో యూరప్ దేశాల పెట్టుబడులు క్రమంగా తుగ్గుతున్నాయి.
  • ఆఫ్రికా దేశాలు క్షయ, ఎయిడ్స్ వంటి వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌ను భారత్ నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్నాయి.
  • భారత ఫార్మా కంపెనీలు ఆఫ్రికాలోని పేద దేశాలకు 80 శాతం మందులను సరఫరా చేసి అక్కడి ప్రజలను అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తున్నాయి.
Published date : 06 Nov 2015 01:44PM

Photo Stories