Skip to main content

సాంకేతిక విద్యాసంస్థల్లోని కోర్సులకు ‘మార్గదర్శన్‌’

సాక్షి, అమరావతి: దేశంలోని మరిన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలు మరింత పెరుగనున్నాయి.
విద్యార్థులకు ఇంకా ఎక్కువ మేలు జరగనుంది. దేశంలో సాంకేతికవిద్యలో సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినా ప్రమాణాల్లో ఆ మేరకు మెరుగుదల లేదు. పలు విద్యాసంస్థలు అందిస్తున్న కోర్సులకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో కొరగాకుండాపోతున్నాయి. ఆ సంస్థల్లో ఈ కోర్సులు చదివిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల విషయంలోను, ఉద్యోగ, ఉపాధి అంశాల్లోను అవకాశాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని సాంకేతికవిద్య కోర్సులు అందిస్తున్న కాలేజీలు తప్పనిసరిగా ఎన్‌బీఏ గుర్తింపు పొందేలా కేంద్రప్రభుత్వం కొద్దికాలం కిందట ‘మార్గదర్శన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో మార్గదర్శక్‌ పేరుతో ఉన్న ఈ కార్యక్రమానికి జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)–2020లో మరిన్ని మెరుగులు దిద్దింది.

16 శాతం ప్రోగ్రామ్‌లకే గుర్తింపు
ప్రస్తుతం దేశంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గుర్తింపుతో 10,400 విద్యాసంస్థలు వివిధ రకాల కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో కేవలం 922 కాలేజీలు మాత్రమే ఎన్‌బీఏ గుర్తింపుతో 3,145 ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాయి. మిగిలిన సంస్థలు ఎన్‌బీఏ గుర్తింపు లేకుండానే ప్రోగ్రాములు అందిస్తున్నాయి. మొత్తం ప్రోగ్రాముల్లో 16 శాతానికి మాత్రమే ఎన్‌బీఏ గుర్తింపు ఉంది. విద్యాసంస్థల సంఖ్య భారీగా ఉన్నా ఎన్‌బీఏ గుర్తింపు లేకపోవడంతో వాటిలో చదివిన వారికి అంతర్జాతీయ స్థాయిలో సరైన అవకాశాలు దక్కడం లేదు. అక్రిడిటేషన్‌ ఉన్న సాంకేతిక విద్యా డిగ్రీ కోర్సులను తమ దేశాల డిగ్రీ కోర్సులతో సమానంగా గుర్తించేలా 21 దేశాలు 2014లో వాషింగ్టన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని సాంకేతిక విద్యాసంస్థలు ఎన్‌బీఏ గుర్తింపు సాధించేందుకు కేంద్రప్రభుత్వం ‘మార్గదర్శన్‌’ను చేపట్టింది. ప్రస్తుతం 16 శాతంగా ఉన్న అక్రిడిటేషన్‌ ప్రోగ్రాముల సంఖ్యను 2022 నాటికి 50 శాతానికి పెంచాలని నిర్ణయించింది.

గతంలో వినియోగించుకున్నది 400 విద్యాసంస్థలే
2019లో మార్గదర్శక్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏఐసీటీఈ ఆరంభించినా కేవలం 400 విద్యాసంస్థలు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి. 40 మెంటార్‌ సంస్థలకు చెందిన 321 మంది వీటికి మార్గదర్శనం చేస్తున్నారు. అయితే 2020 నూతన విద్యావిధానంలో ఈ కార్యక్రమాన్ని మార్గదర్శన్‌ కింద పేర్కొన్న కేంద్రప్రభుత్వం మరింత విస్తృతస్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది.

ఐఐటీలు, ఎన్‌ఐటీలతో మార్గదర్శనం
విద్యాసంస్థలు ఎన్‌బీఏ గుర్తింపు పొందేందుకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. ఈ సంస్థలు మెంటార్లుగా వ్యవహరిస్తూ తమ పరిధిలోని 10 సాంకేతిక విద్యాసంస్థలు ఎన్‌బీఏ గుర్తింపు పొందేలా మార్గదర్శనం చేయాలి. ఈ సంస్థలు సీనియర్‌ ప్రొఫెసర్లను, ఇతర నిపుణులను ఇందుకు వినియోగిస్తాయి. ఈ మెంటార్‌ సంస్థలకు రూ.50 లక్షలు (ఒక్కో విద్యాసంస్థకు రూ.5 లక్షల వంతున) గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం ఇస్తుంది. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. మెంటార్‌ సంస్థలు ఎన్‌బీఏ సహా అత్యున్నత సంస్థల అక్రిడిటేషన్లను కలిగి ఉండడంతోపాటు అత్యంత మెరుగైన పనితీరును కనబరిచి ఉండాలి. తాము అనుసరిస్తున్న అత్యున్నత విధానాలను తాము ఎంపికచేసుకున్న సాంకేతిక విద్యాసంస్థల్లో అమలు చేయించాలి. అందుకు ముందుగా ఆయా సంస్థలతో ఎంవోయూ చేసుకోవాలి. ఇవి 200 కిలోమీటర్ల లోపులో అందుబాటులో ఉండాలి. వీటిలో బోధనాభ్యసన ప్రక్రియలను మెరుగుపర్చాలి. ఎన్‌బీఏ గుర్తింపు సాధించేలా మార్గదర్శనం చేయాలి. ట్రయినింగ్, వర్కుషాపులు, కాన్ఫరెన్సులను నిర్వహించాలి. మెంటార సంస్థల నుంచి మార్గదర్శకులుగా వెళ్లే ప్రొఫెసర్లు తరచూ ఆయా సంస్థలను సందర్శిస్తూ తగిన సూచనలు అందించాలి. ప్రతి విజిట్‌కు రూ.5 వేల చొప్పున చెల్లిస్తారు.

చ‌ద‌వండి: పిల్లలకు టీకా వస్తే స్కూళ్లు తెరుచుకోవచ్చు: రణదీప్‌ గులేరియా

చ‌ద‌వండి: బధిరుల ఆశ్రమ పాఠశాలలో 2021–22 అడ్మిషన్లు ప్రారంభం

చ‌ద‌వండి: జూలై 17న తెలంగాణ పాలిసెట్‌– 2021 పరీక్ష

చ‌ద‌వండి: జూలై 25న బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ – 2021 ప్రవేశ పరీక్ష
Published date : 29 Jun 2021 04:00PM

Photo Stories