Skip to main content

Vande Bharat Express: సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ‘వందే భారత్‌’ రైలు

సికింద్రాబాద్‌– విశాఖపట్నం మధ్య నడిచే దేశంలో ఎనిమిదో వందేభారత్‌ రైలును జ‌న‌వ‌రి 15న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఢిల్లీ నుంచి ఆయన జెండా ఊపగా, సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి  ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో రైల్వేల పురోగతి అద్భుతంగా సాగిందన్నారు. 2014కు ముందు తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో రూ.250 కోట్ల లోపే కేటాయింపు ఉండేదని, ఇప్పుడు అది రూ.3 వేల కోట్లకు పెరిగిందన్నారు. రైలును చూడని మెదక్‌ లాంటి ప్రాంతాలకు ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ ఏర్పడిందని, ఇది తెలంగాణలో రైల్వేపరంగా పురోగతికి గుర్తని ఆయన వ్యాఖ్యానించారు.
త్వరలోనే తెలంగాణలోని అన్ని బ్రాడ్‌ గేజ్‌ మార్గాల విద్యుదీకరణ
2014కు ముందు ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రాంతంలో కొత్తగా వేసిన రైలు మార్గం 125 కిలో మీటర్ల లోపే ఉండగా, గడిచిన ఎనిమిదేళ్లలో 325 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో ట్రాక్‌ విస్తరణ పనులు 250 కిలోమీటర్లకు పైగా జరిగాయని, విద్యుదీకరణ పనులు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. త్వరలోనే అన్ని బ్రాడ్‌ గేజ్‌ మార్గాల విద్యు దీకరణ పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

MV Ganga Vilas: సుదీర్ఘ నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ ప్రారంభం

ఏపీలో కూడా బలోపేతానికి చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైలు నెట్‌ వర్క్‌ను బలోపేతం చేయటానికి కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. కొద్ది కాలంలోనే 350 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని, 800 కిలోమీటర్ల మేర ట్రాక్‌ గేజ్‌ మార్పిడి పనులను పూర్తి చేయటాన్ని ప్రస్తావించారు. 2014 కు ముందు కాలంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 60 కిలోమీటర్ల మేర మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు ఆ వేగం ఏడాదికి 220 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశీయంగా సొంత పరిజ్ఞానంతో అద్భుతంగా రూపొందిన ఈ రైలు నవ భారత సామర్థ్యానికి, దీక్షకు ఒక చిహ్నం అని ప్రధాని అభివర్ణించారు.  
పక్షం రోజుల్లో రెండోది..
ఈ ఏడాది కేవలం 15 రోజుల్లోనే రెండో వందే భారత్‌ రైలు పట్టాలెక్కిందని పేర్కొంటూ, వందే భారత్‌ రైళ్ళ తయారీలో వేగానికి ఇది నిదర్శనమన్నారు. సికింద్రాబాద్‌ వందే భారత్‌కు పూర్వం పట్టాలెక్కిన 7 వందే భారత్‌ రైళ్ళు 23 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించాయని, ఇది భూమి చుట్టూ 58 ప్రదక్షిణలతో సమానమని పేర్కొన్నారు.
ఇక రోజువారీగా వందేభారత్‌..
ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదుగా ఏపీలోని విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్‌ రైలు సంక్రాంతి కానుకగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. త్వరలో రూ.700 కోట్ల వ్యయంతో ప్రధాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అద్భుతంగా పునర్నిర్మాణం జరగనుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.  

Water Vision@2047: తొలి జలవనరుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు

రైలు న‌డిచే స‌మ‌యాలు
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833. సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు నెంబరు 20834. విశాఖపట్నం నుంచి రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. మధ్యలో రాజమండ్రి (7.55), విజయవాడ (10.00), ఖమ్మం (11.00), వరంగల్ (12.05), సికింద్రాబాద్ (14.15) గంటలకు చేరుకుంటుంది.
మళ్లీ సికింద్రాబాద్ నుంచి 15.00 (మధ్యాహ్నం 3 గంటలు) గంటలకు బయలుదేరి వరంగల్ (16.35), ఖమ్మం (17.45), విజయవాడ (19.00), రాజమండ్రి (20.58), విశాఖపట్నం 23.30 గంటలకు చేరుతుంది. తిరిగి మళ్లీ ఉదయం సర్వీసు యథావిధిగా కొనసాగుతుంది. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ఉంటాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 17 Jan 2023 01:43PM

Photo Stories