Skip to main content

దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఏ దేశ మిలటరీ ప్రకటించింది?

మయన్మార్ పాలన మరోసారి సైనిక జుంటా(మిలటరీ సమూహం) చేతుల్లోకి వెళ్లిపోయింది.

Current Affairs

దేశం ఏడాది పాటు తమ ఆధీనంలో ఉంటుందని ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం ప్రకటించింది. దేశ అగ్రనేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మియింత్ సహా సీనియర్ రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపింది. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ సారథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్ స్వే ఉంటారని సైన్యం ఆధీనంలోని మ్యావద్దీ’ టీవీ తెలిపింది.

కారణం ఇదే...
2020, నవంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం, కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయలేకపోయినందునే అధికారం చేజిక్కించుకుంటున్నట్లు మిలటరీ తెలిపింది. దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లినందున, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కమాండర్ ఇన్ చీఫ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంది. ఏడాదిలో ఎన్నికలు జరిపి, గెలిచిన వారికి అధికారం అప్పగిస్తామని ప్రకటించింది.

మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే..
1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్ వారినుంచి స్వాతంత్రం లభించింది.
1962: మిలటరీ నేత నీ విన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు.
1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు.
1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్ అరెస్టు చేశారు.
1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ బంపర్ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది.
1991, అక్టోబర్: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
2010, నవంబర్ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి.
2010, నవంబర్ 13: దశాబ్దాల హౌస్ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు.
2012: పార్లమెంట్ బైఎలక్షన్‌లో సూకీ విజయం సాధించారు.
2015, నవంబర్ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్ కౌన్సిలర్ పదవి కట్టబెట్టింది.
2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు.
2019, డిసెంబర్ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు.
2020, నవంబర్ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీకి మరోమారు మెజార్టీ దక్కింది.
2021, ఫిబ్రవరి 1: ఎన్నికల్లో జరిగిన అక్రమాల కారణంగా దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : మయన్మార్ పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : మయన్మార్ సైన్యం
ఎందుకు : దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లిందని
Published date : 07 Dec 2021 03:13PM

Photo Stories