Skip to main content

ఆన్‌లైన్ లెర్నింగ్ వైపే...నేటి యువత

దేశంలో విద్యారంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఈ-లెర్నింగ్‌పై విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.
చేతిలో ట్యాబ్‌తో, ఒడిలో ల్యాప్‌ట్యాప్‌తో సమస్త విజ్ఞానాన్ని ఒడిసిపట్టే దిశగా మన యువత పయనిస్తోంది. తరగతిగదిలో కూర్చొని టీచర్ చెప్పే పాఠాలు వినే బదులు.. ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని ప్రఖ్యాత ప్రొఫెసర్ల లెక్చర్స్ వినడంపై ఇష్టం పెరుగుతోంది. సివిల్స్, గ్రూప్స్, జేఈఈ, నీట్, గేట్, క్యాట్... పోటీ పరీక్ష ఏదైనా... ఆన్‌లైన్ లెర్నింగ్‌కే నేటి యువత ఓటు! దేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగం ఏటా 40 శాతం వృద్ధి సాధించనుందనే అంచనాలే ఇందుకు నిదర్శనం!! ఆన్‌లైన్ వీడియోస్, ఈ-ట్యూషన్స్, మాక్ టెస్ట్స్, మోడల్ పేపర్స్.. ఇలా పలు రకాలుగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగం.. కొత్త సంవత్సరంలో మరింతగా దూసుకుపోనుందనే అంచనాల నేపథ్యంలో నిపుణుల విశ్లేషణ...
  • బైజూస్ లెర్నింగ్.. యాప్ మోడల్‌తో ప్రారంభమైన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ ఇది. ఇప్పుడు ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించింది. తాజాగా 540 మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో రూ.25,000 కోట్ల విలువ గల సంస్థగా మారి.. దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్ (ఎడ్‌టెక్ స్టార్టప్)గా నిలిచింది. అకడమిక్‌గా కె-3 స్థాయి నుంచి కె-12 స్థాయి వరకు.. జాతీయస్థాయిలో అన్ని పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థలో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 20 మిలియన్లు!
  • టాపర్ డాట్ కామ్.. దేశంలో మరో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్. దాదాపు అన్ని రాష్ట్రాల బోర్డ్‌లకు సంబంధించిన సిలబస్‌కు అనుగుణంగా.. ఈ-ట్యుటోరియల్స్, టెస్ట్స్‌ను అందిస్తూ.. ఏంజెల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థలో రిజిస్టర్డ్ స్టూడెంట్స్ సంఖ్య మూడు మిలియన్లు!
  • అన్‌అకాడమీ.. సివిల్స్, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, ఐఐటీ జేఈఈ, క్యాట్, గేట్ తదితర పరీక్షలకు ఆన్‌లైన్‌లో వీడియో లెక్చర్స్ అందిస్తున్న మరో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్. ఈ పోర్టల్‌లో ఆన్‌లైన్ వీడియోలు, మాక్‌టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు వంటి వాటిని వీక్షిస్తున్న వారి సంఖ్య 40 మిలియన్లకు పైగానే!!

నేటి టెక్నాలజీ యుగంలో మన దేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పట్ల పెరుగుతున్న ఆదరణకు ప్రత్యక్ష నిదర్శనమే... అన్ అకాడమీ, బైజూస్, టాపర్ డాట్ కామ్ విస్తరణ!!

ఈ మూడు సంస్థలే కాదు.. ప్రస్తుతం మన దేశంలో.. 1800 వరకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు (ఎడ్‌టెక్ స్టార్టప్స్) అందుబాటులో ఉన్నాయంటే.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఎంతలా విస్తరిస్తోందో.. ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో అర్థం చేసుకోవచ్చు.

రానున్న రోజుల్లో భారీ మార్కెట్...
మన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పరిశ్రమ.. ఏటా 40 శాతంపైగా వృద్ధిరేటుతో 2021 నాటికి 1.96 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. ప్రస్తుతం దాదాపు 71 మిలియన్ల మంది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు అంచనా. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై ఆసక్తి, ఆదరణ పెరగడానికి స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరగడం ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటు విద్యార్థుల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెరగడం, అన్ని రకాల సందేహాలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నివృత్తి చేసుకునే అవకాశముండటం మరో కారణంగా చెప్పొచ్చు. ఫలితంగా మన దేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తూ.. యూఎస్, యూకేలతో సైతం పోటీపడే స్థాయికి చేరుకుంది.

ఈ-ట్యుటోరియల్స్ :
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న విభాగం.. ఈ-ట్యుటోరియల్స్. అంటే.. ఆన్‌లైన్ విధానంలోనే నిపుణుల పాఠాలు వినే అవకాశం లభించడం! స్కూల్ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల వరకూ.. అందరూ ‘ఈ లెర్నింగ్’ బాటపడుతున్నారు. కోచింగ్, ట్యూషన్‌లకు వెళ్లాలంటే.. ఎంతో వ్యయప్రయాసలకోర్చాల్సిన పరిస్థితి. కోచింగ్‌కు భారీ ఫీజులే కాకుండా.. ట్రాఫిక్‌లో గంటల పాటు ఎంతో విలువైన సమయం వృథా అవుతోంది. అందుకే స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌ట్యాప్/కంప్యూటర్‌తోపాటు ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఇంట్లోనే కూర్చుని నిపుణుల లెక్చర్స్ వినే అవకాశం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విధానంలో లభిస్తోంది. అందుకే విద్యార్థులు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. స్కూల్ స్థాయి విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రులే చొరవ తీసుకుని ఈ-ట్యుటోరియల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.

క్లాస్ మిస్ అనే టెన్షన్ లేదు :
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో మరో ముఖ్య సౌలభ్యం.. క్లాస్ మిస్ అవుతుందే ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవడం! కారణం.. ఒకసారి సదరు పోర్టల్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న విద్యార్థులకు ప్రీవియస్ లెక్చర్స్‌ను వీక్షించే అవకాశం లభిస్తోంది. వాటికి సంబంధించి అంతకుముందు విద్యార్థులు లేవనెత్తిన సందేహాలు, వాటికి సదరు ఎడ్యుకేటర్స్ ఇచ్చిన సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం లభిస్తోంది. దీంతో ఒక క్లాస్ మిస్ అయినా.. లేదా ఒక క్లాస్‌కు సంబంధించి సందేహాలు ఉన్నా.. క్షణాల్లో నివృత్తి చేసుకునే సదుపాయం కలుగుతోంది. ఒకవేళ సంప్రదాయ పద్ధతిగా పేరు గడించి ట్యూషన్స్‌లో చేరిన విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి తమకు మెచ్చేలా నిపుణుల బోధన లభించడంలేదు. అదే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఈ-ట్యుటోరియల్స్‌లో అయితే... సదరు ట్యూటర్ ప్రొఫైల్, ప్రీవియస్ లెక్చర్స్ వినే అవకాశం ఉంటోంది. దానిద్వారా తమకు నప్పే ట్యూటర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తోంది.

మాక్ టెస్టులు.. వర్చువల్ ల్యాబ్స్ :
ఈ-ఎడ్యుకేషన్ ఫలితంగా విద్యార్థులకు.. తమ నైపుణ్యాలను అంచనా వేసుకునే అవకాశం లభిస్తోంది. అన్ని ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థలు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ఆ తర్వాత వాటి ఫలితాలను వెల్లడించడంతోపాటు ఏఏ అంశాల్లో పట్టు సాధించాలనే విషయంపైనా విద్యార్థులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టుకునే అవకాశం లభిస్తోంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో మరో సదుపాయం.. వర్చువల్ లేబొరేటరీస్. ఏదైనా ఒక అంశానికి సంబంధించి ప్రాక్టికల్ వర్క్ (ల్యాబ్ వర్క్) చేయాలంటే.. అందుకు క్రమపద్ధతిలో అనుసరించాల్సిన విధానాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ల్యాబ్ వర్క్ విషయంలో సైతం ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల విద్యార్థులకు ఇవి అత్యంత ఉపయుక్తంగా ఉంటున్నాయి.

నిష్ణాతులైన ట్యూటర్స్ :
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సదుపాయాన్ని అందిస్తున్న సంస్థలు.. ఈ-ట్యూషన్స్, లెక్చర్స్ పరంగా ట్యూటర్స్‌ను నియమించుకునే క్రమంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సదరు సబ్జెక్ట్‌లో నిష్ణాతులైన వారిని నియమించికొని.. ప్రామాణిక కంటెంట్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాణాలు పాటించకుంటే.. ఇతర ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలతో పోటీలో నిలవలేమని భావిస్తున్నాయి. ప్రమాణాలు పాటించకుంటే.. విద్యార్థులను ఆకట్టుకోవడం కష్టమని, మార్కెట్‌లో రెప్యుటేషన్ సైతం దెబ్బతింటుందనే ఆలోచన చేస్తున్నాయి. కాబట్టి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పరంగా సబ్జెక్ట్ నిపుణుల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని నిపుణుల అభిప్రాయం.

కొత్త సంవత్సరంలో.. సరికొత్తగా
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు భారీగా ఆదరణ ల‌భిస్తుంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు.. మరికొద్ది రోజుల్లో పలకరించనున్న కొత్త సంవత్సరంలో సరికొత్తగా అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు విద్యార్థులనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థలు.. త్వరలో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించేందుకు కూడా సన్నాహాలు ప్రారంభిస్తున్నాయి.

రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ :
వేగంగా మారిపోతున్న టెక్నాలజీ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉద్యోగంలో చేరినా... అందులో నిలదొక్కుకునేందుకు రీ-స్కిల్లింగ్ తప్పనిసరిగా మారింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎడ్‌టెక్ స్టార్టప్స్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు రీ-స్కిల్లింగ్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఉద్యోగులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా కొన్ని ఎడ్యుటెక్ సంస్థలు అడుగులు వేయగా..మిగతా సంస్థలు సైతం ఇదే బాటపడుతున్నాయి. ముఖ్యంగా ఐఓటీ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీపై రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. హెల్త్‌కేర్, టెక్నాలజీ, క్రిమినల్ జస్టిస్, ఆర్ట్స్ అండ్ డిజైన్, హాస్పిటాలిటీ వంటి ముఖ్యమైన విభాగాల్లోని ఉద్యోగులకు ఐటీ, దాని అనుబంధ కోర్సులపై ఈ-ట్యుటోరియల్స్, రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు.. రిజిస్టర్ చేసుకున్న ట్యూటర్స్‌కు సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి.

అన్ని టెస్ట్‌లు ఆన్‌లైన్‌లోనే..
ప్రస్తుతం విద్యారంగంలో ఎక్కువ శాతం పోటీ పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇంటర్ అర్హతతో నిర్వహించే జేఈఈ-మెయిన్ నుంచి క్యాట్, గేట్, జీప్యాట్ తదితర పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల స్థాయిలోనూ ఆన్‌లైన్ విధానం తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఎంసెట్, పీజీఈసెట్, ఐసెట్ తదితర పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇది కూడా దేశంలో ఎడ్‌టెక్ స్టార్టప్స్ విస్తరణకు మార్గంగా మారుతోంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్స్‌లో నమోదు చేసుకుంటున్న వారిలో టెస్ట్ ప్రిపరేషన్ విభాగానిదే పైచేయిగా నిలుస్తోంది.

అకడమిక్ పరీక్షలూ.. ఆన్‌లైన్‌లో?
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. భవిష్యత్తులో అకడమిక్ పరీక్షలు కూడా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే అవకాశం లేకపోలేదు అనేది నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న గేట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షల్లో రెండు, మూడు వాక్యాల్లో సమాధానాలివ్వాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి భవిష్యత్తులో అకడమిక్ స్థాయిలోనూ ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులు టైపింగ్ స్కిల్స్, కీ బోర్డ్ కమాండ్స్ వంటి వాటిపైనా అవగాహన పెంచుకోవడం మేలు చేస్తుంది.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్.. ముఖ్యాంశాలు
  • ఏటా 20 శాతంపైగా వృద్ధి సాధిస్తున్న భారత ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగం
  • టెస్ట్ ప్రిపరేషన్‌కోసం ఆన్‌లైన్ వైపు దృష్టిసారిస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది.
  • ఆ తర్వాత స్థానంలో నిలుస్తున్న ఈ-ట్యుటోరియల్స్ సబ్‌స్క్రైబర్స్.
  • రానున్న రోజుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు కానున్న ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థలు.
  • 2021 నాటికి బిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగం.

పెంచుకోవాల్సిన నైపుణ్యాలు...
రానున్న రోజుల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా వాటిని వినియోగించుకునేందుకు పెంచుకోవాల్సిన నైపుణ్యాలు..
  1. కంప్యూటర్ స్కిల్స్
  2. టైపింగ్ స్కిల్స్
  3. కీ బోర్డ్ షార్ట్‌కట్ కమాండ్స్
  4. లాంగ్వేజ్ స్కిల్స్
  5. చాటింగ్ స్కిల్స్ (ఆన్‌లైన్ లెక్చర్స్‌లో లైవ్ డిస్కషన్స్ కోసం).

ఆదరణ పెరుగుతోంది..
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థుల్లో ఆదరణ విస్తృతంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, యాప్ బేస్డ్ సేవలను సైతం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు అందిస్తుండటమే. మరోవైపు తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్థాయిలో తమ పిల్లలకు నాణ్యమైన బోధన లభించాలని కోరుకుంటున్నారు. వీటి ఫలితమే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విస్తరించడం. విద్యార్థులు కేవలం టెస్ట్ ప్రిపరేషన్ విభాగానికే పరిమితం కాకుండా.. మిగతా సదుపాయాలు కూడా వినియోగించుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
- సంఘమిత్ర భార్గవ్, ఏవీపీ, బైజూస్.

న్యూ ట్రెండ్స్ సహజం :
అన్ని రంగాల మాదిరిగానే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఎడ్‌టెక్ స్టార్టప్స్ కొత్త ట్రెండ్స్ తీసుకు రావాలనుకోవడం, ఈ దిశగా కసరత్తు చేయడం సహజమే. ఈ క్రమంలోనే రీ-స్కిల్లింగ్, వర్కింగ్ ప్రొఫెషనల్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ దిశగా సంస్థలు అడుగులు వేయడాన్ని పేర్కొనొచ్చు. ఇక.. ఇప్పటికే ఉన్న ఈ-ట్యూషన్స్, టెస్ట్ ప్రిపరేషన్ కోణంలోనూ వినూత్న విధానాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
- రోమన్ సైనీ, కో-ఫౌండర్, అన్ అకాడమీ.
Published date : 25 Dec 2018 08:46PM

Photo Stories