Skip to main content

Economic Survey 2025: ఆర్థికసర్వే 2024-25 ఏముంటుంది?

Economic Survey 2025: ఆర్థికసర్వే 2024-25  ఏముంటుంది?
Economic Survey 2025: ఆర్థికసర్వే 2024-25 ఏముంటుంది?

ఆర్థిక సర్వే అనేది ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌కు ముందు విడుదలయ్యే ముఖ్యమైన పత్రం, ఇది దేశ ఆర్థిక పరిస్థితి, ప్రగతి, సవాళ్లు, అవకాశాలపై సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. 2025 ఆర్థిక సర్వేలో ప్రధానంగా కింది అంశాలు ఉండే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న 2025 ఆర్థిక సర్వే గత ఏడాది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై సమగ్ర అంచనాను అందిస్తుంది. కీలక పరిణామాలు, సవాళ్లు, భవిష్యత్తు వృద్ధికి రోడ్ మ్యాప్‌ను ఈ సర్వే వివరిస్తుంది. జీడీపీ వృద్ధిని పెంచడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇది హైలైట్ చేస్తుంది.

ఇదీ చదవండి: Budget 2025 Economic Survey Live Updates: GDP Growth Projected at 6.3-6.8%
 

ఆర్థిక సర్వే ఎప్పుడూ ప్రవేశపెడతారు?
ప్రతి సంవత్సరం ఆర్థిక సర్వే జనవరి 31వ‌ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇది సాధారణంగా బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఉంటుంది. ఈ ఏడాది కూడా బడ్జెట్ ముందు ఆర్థిక సర్వే సమర్పించబడుతుంది.

ఆర్థిక సర్వే ఎవరు తయారు చేస్తారు?
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఈ సర్వే తయారీకి ఆర్థిక వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఆర్థిక విభాగం బాధ్యత వహిస్తుంది. ఈ ప్రక్రియకు అధిపతి ప్రధాన ఆర్థిక సలహాదారు. ఈ ఏడాది ఈ బాధ్యత వి.అనంత నాగేశ్వరన్ భుజాలపై ఉంటుంది. ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ఆర్థిక సలహాదారు ఆ దస్తావేజును పత్రికలకు అందజేస్తారు. 

ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఇదే..
ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును చెబుతారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే వివ‌రిస్తారు.

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..

కేంద్ర బడ్జెట్ 2025

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025లో సమ్మిళిత వృద్ధి, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే అవకాశం ఉంది. భారత స్వాతంత్ర్య శతాబ్దిని పురస్కరించుకుని 2047 నాటికి ‘వికసిత్‌ భారత్(Vikasit Bharat)’ లక్ష్యాన్ని సాధించడానికి బడ్జెట్ సమావేశాలు కొత్త నమ్మకాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బడ్జెట్ సమావేశాల్లో కీలక సంస్కరణలు, నిర్ణయాలను ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు.

ఆర్థిక వృద్ధి: 2024లో భారత జిడిపి వృద్ధి రేటు మందగించిందని నివేదికలు సూచిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, నిరుద్యోగం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచే అంశం సర్వేలో ప్రాముఖ్యత పొందే అవకాశం ఉంది.

పన్ను సంస్కరణలు: మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను తగ్గింపులు, పన్ను సరళీకరణ వంటి అంశాలు సర్వేలో ప్రస్తావించబడవచ్చు. పన్ను రేట్లను సవరించడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉండవచ్చు. 

సబ్సిడీలు: ఆహారం, ఎరువులు, వంటగ్యాస్ వంటి ముఖ్యమైన సబ్సిడీలపై వ్యయాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీల కోసం సుమారు రూ. 4 లక్షల కోట్లను కేటాయించే అవకాశం ఉంది. 

ఉద్యోగావకాశాలు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచే విధానాలు సర్వేలో ప్రాముఖ్యత పొందవచ్చు.

మహిళా సాధికారత: మహిళా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక మినహాయింపులు లేదా ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆర్థికంగా సాధికారత కల్పించే విధానాలు సర్వేలో ఉండవచ్చు. 

మొత్తంగా, 2025 ఆర్థిక సర్వేలో పన్ను సంస్కరణలు, సబ్సిడీలు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత వంటి అంశాలు ప్రాముఖ్యత పొందే అవకాశం ఉంది.
 

Published date : 31 Jan 2025 01:34PM

Photo Stories