Skip to main content

కళ్లలో ఆనందం: జగనన్నా.. కొలువుదక్కిందన్నా..

గుంటూరు ఎడ్యుకేషన్‌: 2008-డీఎస్సీలో అర్హత సాధించి పోస్టింగ్స్‌ పొందలేకపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు కల్పించింది.
13 ఏళ్లుగా ఉపాధ్యాయ నియామకాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థుల కళ్లలో ఆనందం తొణికిసలాడింది. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తమ కష్టాలను చెప్పుకున్న ఫలితంగా ఒకే ఒక్కమాటతో రాష్ట్ర వ్యాప్తంగా 2,193 మంది అభ్యర్థులకు ఉద్యోగాలను ఇచ్చిన హామీకి సలాం చెప్పారు. ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరూ ధ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

గుంటూరు పాత బస్టాండ్‌ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో జూలై 10న‌ జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.ఎస్‌ గంగా భవానీ అధ్యక్షతన నిర్వహించిన 2008–డీఎస్సీ కౌన్సెలింగ్‌ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 167 మంది అభ్యర్థులను సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ)లుగా నియ మిస్తూ పాఠశాలలను కేటాయించారు. రావాల్సిన వారిలో నలుగురు గైర్హాజరయ్యారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అభ్యర్థులకు జూలై 9న‌ సమాచారాన్ని పంపడంతో శనివారం ఉదయం 9.00 గంటల నుంచి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

కాగా 171 మంది అభ్యర్థులతో మెరిట్‌ జాబితా సిద్ధం చేసిన తరువాత పాఠశాలల్లో ఖాళీలను ప్రదర్శించే విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం మధ్యాహ్నం వరకు ఎదురు చూశారు. అనంతరం ఏడు అంశాలతో కూడిన నిబంధనల తో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మధ్యాహ్నం 2.30కు కౌన్సెలింగ్‌ ప్రారంభించిన అధికారులు బ్యాచ్‌కు 25 మంది అభ్యర్థుల చొప్పు న కౌన్సెలింగ్‌ హాల్లోకి పిలిచి పాఠశాలలను కేటాయించారు. నరసరావుపేట డివిజన్‌ పరిధిలోకి వచ్చే పల్నాడు ప్రాంతంలోని మండలాలతో పాటు గుంటూరు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి డివిజన్ల పరిధిలో మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలను డిస్‌ప్లేలో ప్రదర్శించి, అభ్యర్థులు కోరుకున్న పాఠశాలలను కేటాయించారు. 3,4 కేటగిరీలకు చెందిన పాఠశాలలతో పాటు 2వ కేటగిరీకి చెందిన పాఠశాలల్లోని ఖాళీలను సైతం భర్తీ చేశారు.
Published date : 11 Jul 2021 01:49PM

Photo Stories