Skip to main content

టెక్నాలజీ మిషన్

ప్రాంతాలు, సామాజిక వర్గాలకు అతీతంగా టెక్నాలజీ అభివృద్ధి ఫలాలను దేశంలోని ప్రజలందరికీ వేగంగా అందించాలనే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమమే Technology Mission. భారత ప్రభుత్వం 1986లో తొలిసారి టెక్నాలజీ మిషన్ విధానాన్ని రూపొందించి అమలు చేసింది. తర్వాత కాలంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు టెక్నాలజీ మిషన్‌లో కొత్త లక్ష్యాలను చేర్చుతోంది.
టెక్నాలజీ మిషన్ ప్రధాన లక్ష్యాలు
  • ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం. దిగుమతులను తగ్గించేందుకు చర్యలు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వృద్ధి చేయడం ద్వారా ఫలాలు, కూరగాయలు, పుష్పాల ఉత్పత్తిని పెంచి ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేయడం.
  • జమ్ము- కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడం. అత్యాధునిక ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నత, సాంకేతిక విద్యా ప్రమాణాలను పెంపొందించడం.
  • గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలైన.. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, రోడ్ల నిర్మాణం వంటి వాటిని అభివృద్ధి పరచడం.
  • దేశవ్యాప్తంగా 85% అక్షరాస్యత సాధన.
  • ప్రాథమిక వైద్య కేంద్రాలు, వైద్య వాలంటీర్లు, మొబైల్ మెడికల్ యూనిట్స్, టీకాలు, శిశు వైద్యం వంటి వాటిని గ్రామీణ ప్రాంతాలకు త్వరితగతిన విస్తరించి గ్రామీణ ప్రాంత ఆరోగ్య భద్రతను పెంపొందించడం.
  • శీతోష్ణస్థితి మార్పుల వల్ల తలెత్తే వ్యవసాయ, తాగునీటి, ఆరోగ్య రంగ సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేయడం.
  • శక్తి భద్రతను సాధించే దిశలో పునర్వినియోగ శక్తి వనరులను; ముఖ్యంగా సౌర శక్తిని అభివృద్ధి చేయడం, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడం.
  • నానో టెక్నాలజీపై పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఆరోగ్య, నిర్మాణ, శక్తి రంగాల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం.

జాతీయ సైన్స్ విధానం
శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతి ద్వారానే దేశ సామాజిక, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. భావి భారత్‌కు సైన్స్, టెక్నాలజీలు మూల స్తంభాల వంటివని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్వాతంత్య్రానంతరం ఈ రంగంలో అనేక కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు జాతీయ సైన్స్ విధానాన్ని విడుదల చేశారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు ఒక జాతీయ విధానం అవసరం. దీన్ని గుర్తించిన నాటి కేంద్ర ప్రభుత్వం 1958లో తొలిసారి జాతీయ సైన్స్ తీర్మానాన్ని ప్రకటించింది. ఆ తర్వాత అవసరాలు, ఎదురైన సవాళ్ల దృష్ట్యా ఈ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వం 1983, 2003ల్లో నూతన టెక్నాలజీ పాలసీ స్టేట్‌మెంట్‌లను ప్రకటించింది. దేశంలో సైన్స్, టెక్నాలజీలను ప్రోత్సహించడంలోనవీకరణ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని 2013లో Science & Technology, Innovation (STI) విధానాన్ని తీసుకొచ్చింది.

లక్ష్య సాధన-ప్రభుత్వ చర్యలు
1958 నాటి సైన్స్ విధాన తీర్మానంలో శాస్త్ర సాంకేతిక రంగం, మానవ వనరులు, సహజ వనరుల అభివృద్ధి కోసం ఒక జాతీయ విధానం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం సైన్స్ విద్యను ప్రోత్సహించడం, ఉన్నత ప్రమాణాలు కలిగిన శాస్త్రవేత్తలు, పరిశోధకులను అందుబాటులోకి తీసుకురావడం, స్త్రీ పురుషులను సమానంగా ప్రోత్సహించడం, వ్యవసాయ సంరక్షణ, మానవ వనరుల శిక్షణ వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. వీటి సాధనకు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను పెంచింది.
పారిశ్రామిక రంగ అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లభించినా బలహీన వర్గాల్లో నిరుద్యోగ సమస్య కూడా పెరిగింది. హరిత విప్లవం ద్వారా ఆహార భద్రత పెరిగింది. అయితే దాన్ని వర్షాధార ప్రాంతాల్లో విస్తరించకపోవడం వల్ల కరువు తీవ్రత అధికమైంది. శక్తి డిమాండ్లను ముందుగా అంచనా వేయడంలో కూడా ఆలస్యం జరిగింది. కానీ, పునర్వినియోగ వనరుల ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించింది.
ఈ రకమైన సవాళ్లను అధిగమించడం, పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు సంప్రదాయ విజ్ఞానాన్ని, దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం 1983లో సరికొత్త టెక్నాలజీ పాలసీ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో అధిక అభివృద్ధికి తోడ్పడే టెక్నాలజీ రూపకల్పన, పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయ నైపుణ్య ప్రోత్సాహం, పునర్వినియోగ శక్తి వనరుల అభివృద్ధి వంటి లక్ష్యాల సాధనకు అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్ వ్యవస్థల అభివృద్ధి, కరువు నివారణ కార్యక్రమాల అమలు, పర్యావరణ పరిరక్షణ చట్ట రూపకల్పన వంటి వివిధ చర్యలను చేపట్టింది.

జాతీయ సైన్స్ విధానం-2003
సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా ఆహార భద్రత పెరిగినప్పటికీ పోషణ భద్రత ఆశించినంతగా సాధించకలేకపోయాం. శీతోష్ణస్థితి మార్పు సమస్యలు పెరిగి విపత్తులు పెరిగాయి. మేధోసంపత్తి హక్కుల ప్రాధాన్యతను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2003లో కొత్త సైన్‌‌స విధానాన్ని విడుదల చేసింది. ఆయా అంశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తే మినహా దేశీయ టెక్నాలజీ డిమాండ్‌ను చేరుకోలేమన్న భావన ఉంది. దీన్నే 2013లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విధానానికి ప్రేరణగా చెప్పవచ్చు. 2020 నాటికి ప్రపంచ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తొలి ఐదు దేశాల సరసన భారత్‌ను నిలబెట్టడం, దేశ జీడీపీలో పరిశోధనల అభివృద్ధి వ్యయాన్ని 2 శాతానికి పెంచడం, ఐదేళ్లలో దేశంలోని శాస్త్రవేత్తలను 66 శాతానికి పెంచడం వంటివి 2013 ఖీఐ విధాన ప్రధాన లక్ష్యాలు.

Nano Science & Technology Mission (Nano Mission)
దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగా నానో టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 2007 మేలో కేంద్ర ప్రభుత్వం Nano- Science & Technology Missionను ప్రారంభించింది. సీఎన్‌ఆర్ రావు అధ్యక్షుడిగా ఉన్న నానో మిషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలవుతోంది. ఇందులో భాగంగా సలహాదారు సంస్థలైన Nano Science Advisory Technology Advisory Group (NSAG), Nano Applications and Technology Advisory Group (NATAG)లు టెక్నికల్ కార్యక్రమాలను అమలు చేస్తాయి.

నానో మిషన్ - ప్రధాన లక్ష్యాలు
  • పదార్థాన్ని ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకొని నానోమీటర్ స్థాయిలో దాన్ని వినియోగించేందుకు కృషి చేయడం.
  • నానో టెక్నాలజీ అభివృద్ధికి కావాల్సిన Transmission Electron Microscope (TEM), Scanning Probe Microscope (SPM), Optimal Tweezer వంటి పరికరాలను అభివృద్ధి చేయడం.
  • నానో టెక్నాలజీ అభివృద్ధికి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.
  • ఈ రంగంలో నిష్ణాతులైన మానవ వనరులను అందుబాటులోకి తేవడంతోపాటు నానో క్రిస్టల్స్, నానో ట్యూబ్స్ అభివృద్ధికి కృషి చేయడం.
నిర్వహించిన కార్యక్రమాలు
అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, జపాన్ వంటి దేశాలతో నానో టెక్నాలజీ అభివృద్ధికి ఉద్దేశించిన సహకార కార్యక్రమాలను ప్రారంభించారు.
చెన్నైలో Nano Functional Material Technology Centre (NFMTC) ఏర్పాటు చేశారు. సెరామిక్స్ ఉత్పాదనలో అవసరమ య్యే నానో క్రిస్టలైన్ ఆక్సైడ్ పౌడర్స్, కార్బన్ నానో ట్యూబ్స్‌ను అభివృద్ధి చేశారు.
 టైర్ ఇంజనీరింగ్‌లో ఉపయోగపడే హై పర్ ఫార్మేన్స్ రబ్బరు నానో కాంపోజిట్స్ అభివృద్ధి. మొహాలి, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతాల్లో Institute of Nano Science and TechnologyËను ఏర్పాటు చేశారు.
 
సైన్స్ విధానం (2003) - వ్యూహాలు
దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులను సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికల్లో భాగస్వాములను చేయడం. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక ప్రగతికి ఉద్దేశించిన సైన్స్ విధానాలు కార్యక్రమాల రూపకల్పనలో దేశంలోని ప్రధాన పరిశోధనా సంస్థలు, కేంద్రాలను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలి. వివిధ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా కార్యక్రమాలను రూపొందించాలి. విశ్వవిద్యాలయాలు, R&D యూనిట్‌లు, అన్ని S&T వ్యవస్థలకు పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తిని కల్పించి వాటిని బలోపేతం చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థ అభివృద్ధికి మారుతున్న అవసరాలకు అనుగుణంగా తగిన మార్పులను ఎప్పటికప్పుడు తీసుకురావాలి. సైన్స్ ఆధారిత మంత్రిత్వ శాఖలు, విభాగాలన్నింటినీ సైంటిస్టులు, టెక్నాలజిస్టుల ఆధ్వర్యంలో నడిచే విధంగా చూడాలి. వీటితోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సాంకేతిక సలహా కమిటీలను ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య, S&T అభివృద్ధికి బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండాలి. GDPలో 2% మేర S&T రంగంలో పెట్టుబడులను పెంచాలి. అదే విధంగా పారిశ్రామిక రంగం కూడా R&D విభాగంపై పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన చర్యల ద్వారా దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా డిజిటల్ అక్షరాస్యతను సాధించే లక్ష్యంతో 2014 ఆగస్టు 21న జాతీయ డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిజిటల్ సాక్షరత అభియాన్ (DISHA) అని నామకరణం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడంతోపాటు సమాచార సాంకేతికత ద్వారా గ్రామీణుల్లో సాధికారత సాధించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, రేషన్ డీలర్లతో పాటు సుమారు 52.5 లక్షల మందికి ఐటీ శిక్షణ అందించనున్నారు.
 దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ మిషన్ అమల్లో ఉంటుంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 3 విభాగాలుగా విభజించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 14 నుంచి 60 ఏళ్లలోపు డిజిటల్ నిరక్షరాస్యులు అంతా ఈ కార్యక్రమం కింద శిక్షణ పొందవచ్చు.
 డిజిటల్ లిటరసీ మిషన్‌లో అందించే ఐటీ శిక్షణకు ఉద్దేశించిన ట్రైనింగ్ మెటీరియల్‌ను నాస్‌కామ్ ఫౌండేషన్ అభివృద్ధి చేసింది. Basics of Digital Literacy కరిక్యులంను ఏడు మాడ్యుల్స్‌గా విభజించారు. అవి..
 1. పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్
 2. ఇంటర్నెట్
 3. ఇ-మెయిల్ అండ్ సోషల్ మీడియా
 4. ఉపయోగిత సమాచారం
 5. ప్రభుత్వం
 6. ఈ- కామర్స్
 7. ఐటీ సెక్యూరిటీ
 ఈ కార్యక్రమానికి ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థల నుంచి సహకారం లభించింది. కాగ్నిజెంట్ టెక్నాలజీ వంటి సంస్థలకు చెందిన వాలంటీర్లు.. ట్రైనింగ్ కంటెంట్‌ను స్థానిక భాషల్లోకి అనువదించడంలో కీలకపాత్రను పోషించారు.
Published date : 03 Aug 2016 03:30PM

Photo Stories