Skip to main content

భారతదేశం- పేదరికం

ఏ దేశంలోనైతే అధిక జనాభా, పేదరికంతో బాధపడుతుంటారో ఆయా దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవని అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ 1776లో Wealth of Nations గ్రంథంలో పేర్కొన్నాడు. ప్రపంచంలో రోజుకు ఒక డాలర్ కూడా ఆదాయం లభించని ప్రజానీకం సుమారు 1.2 బిలియన్లని అంచనా.
ఎవరైతే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేక పోతున్నారో వారిని పేదవారుగా పరిగణించవచ్చు.- ప్రపంచ బ్యాంకు.
 
‘పేదరికం అనుభవించేవారి బాధను గుడ్డివారు కూడా చూడగలరు’’ - ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్
 
‘పేదరికమనే సముద్రపు దీవుల్లో మనం ఎంతమాత్రం సంతోషంగా జీవించలేం’ - ఎం.ఎస్. స్వామినాథన్
 
పేదరికం అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన - జస్టిస్. కె.జి. బాలక్రిష్ణన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
 
పోషకాహారలోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు సతమతమవుతున్నాయి. ఆయా దేశాల్లో ఎంతో కొంత అభివృద్ధి జరిగినా, దాని ప్రతిఫలం మాత్రం అతి కొద్ది మందికే దక్కడం వల్ల ఆదాయ అసమానతలు అధికమవుతున్నాయి. దేశంలో భూమి, మూలధనం వంటి ఆస్తులు, ఆదాయ పంపిణీలో తీవ్రమైన అసమానతల వల్ల అధిక సంఖ్యాక ప్రజలు పేదరికానికి గురవుతున్నారు.
 
పేదరికాన్ని కేవలం ఆర్థికపరమైన సమస్యగానే కాకుండా సాంఘిక సమస్యగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. మానవాభివృద్ధి నివేదిక ప్రకారం.. ‘దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కావాల్సిన సౌకర్యాలు, స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుంచి గౌరవం కొరవడటమే పేదరికం’. ‘అధిక పేదరికం, అధిక సంపదలు సమాజంలో వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకి అవుతాయి, ప్రపంచంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులంతా మధ్య తరగతి నుంచివచ్చినవారే. అందుకే ఆర్థిక శక్తులు సమానంగా, సంతులితంగా సమాజంలో సర్దుబాటు కావాలి’ అని స్వామి వివేకానంద పేర్కొన్నారు.
 
 పేదరికాన్ని రెండు రకాలుగా పేర్కొనొచ్చు. అవి.. 
 1. నిరపేక్ష పేదరికం
 2. సాపేక్ష పేదరికం.
 
1. నిరపేక్ష పేదరికం: దేశంలోని ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని, జీవనాధార వ్యయాన్ని కూడా చేయలేని పరిస్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమైన పేదరికం ఉంటుంది.
 
2. సాపేక్ష పేదరికం:వివిధ వ్యక్తులకు లేదా గ్రూపులకు అందుబాటులో ఉన్న వనరులు, వేతనం, సంపద తదితర అంశాల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. సమాజంలో 5% నుంచి 10%  మంది సంపన్న వర్గాల ప్రజల జీవన ప్రమాణంతో పోల్చితే కింది స్థాయిలోని 5% నుంచి10% ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. సంపన్న వర్గంలోని ప్రజల ఆదాయాలతో పోల్చితే దిగువ వర్గంలోని వారి ఆదాయాలు తక్కువగా ఉన్నప్పటికీ వారు దారిద్య్రాన్ని అనుభవిస్తున్నవారు కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రకమైన పేదరికం ఉంటుంది. దీన్ని లారెంజ్ వ్యతిరేక లేదా గిని గుణకం ద్వారా లెక్కిస్తారు.
 
భారతదేశం పేదరికం - అంచనాలు
స్వాతంత్య్రానికి పూర్వం దాదాబాయ్ నౌరోజీ తన గ్రంథమైన "Poverty and Unbritish Rule in India" లో జైళ్లలోని ఖైదీల కనీస పౌష్టికాహారం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. స్వాతంత్య్రానంతరం అనేక మంది ఆర్థికవేత్తలు పేదరికాన్ని అంచనా వేశారు. వారిలో పి.డి. ఓఝా, దండేకర్, నీలకంఠ రాథ్, మిన్హాస్, పీకే బర్దన్, మాంటెక్‌సింగ్ ఆహ్లూవాలియా, గౌరవదత్, రావెల్లిస్, లక్డవాలా (D.T. Lakdawala- Expert Group Chairman 1989) తదితరులు ముఖ్యులు.
 
1960 పూర్వం పేదరికానికి సంబంధించిన అంచనాల్లో వ్యత్యాసాలున్నాయి. ఆయా అంచనాలు వరుసగా.. మిన్హాస్ 37.1% , ఆహ్లూవాలియా 56.5%, పీకే బర్దన్ 54% , దండేకర్, నీలకంఠ రాథ్ 40% (196869). ఈ వ్యత్యాసాలకు ప్రధాన కారణం వారు తీసుకున్న గణాంకాల్లో తేడా లేనప్పటికీ వారు గణించే పద్ధతుల్లో తేడా ఉండడమే.
 
పేదరిక రేఖ (Poverty Line): ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సిన కనీస జీవన వ్యయం ఆధారంగా పేదరిక రేఖను నిర్ణయిస్తారు. దీని కోసం ప్రణాళికాసంఘం 1989, సెప్టెంబర్‌లో డి.టి. లక్డవాలా అధ్యక్షతన నిపుణుల సంఘాన్ని నియమించింది. ఆ కమిటీ 1993 జూలైలో తమ నివేదికను సమర్పించింది. పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు లభ్యమయ్యే కేలరీల శక్తిని బట్టి కనీస పోషకాహార స్థాయిని, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీలను ప్రాతిపదికగా తీసుకొన్నారు. 1973-74ను ఆధార సంవత్సరంగా తీసుకొని నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని (Monthly Per capita Consumption Expenditure - MPCE) గ్రామీణ ప్రాంతానికి రూ. 49, పట్టణ ప్రాంతానికి రూ. 56 నిర్ణయించారు. 2004-05కు గానూ గ్రామీణ ప్రాంతానికి రూ. 356.30, పట్ణణ ప్రాంతానికి రూ.538.60, 2009-10 నాటికి గ్రామీణ ప్రాంతానికి (రోజుకు-రూ. 22.42) రూ. 672.80, పట్టణ ప్రాంతానికి (రోజుకు- రూ.28.65) రూ.859.60 నెలసరి తలసరి వినియోగ వ్యయాలుగా ఉన్నాయి. దీన్ని గమనిస్తే కాలానుగుణంగా నెలసరి తలసరి వినియోగ వ్యయం పెరుగుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ Large Sample Survey ద్వారా కుటుంబం వ్యయాన్ని అంచనా వేస్తున్నారు.
నిపుణుల సంఘం 1973-74 నుంచి 1987-88 వరకు14 ఏళ్ల కాల వ్యవధిలో రూపొందించిన పేదరిక అంచనాలు కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
 

పై టేబుల్‌ను పరిశీలిస్తే గ్రామీణ పేదరికం  56.4%  నుంచి 39.1% నికి తగ్గగా, పట్టణ పేదరికం 49.2%  నుంచి40.1% నికి మాత్రమే తగ్గింది. 198788 నాటికి గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరికమే ఎక్కువగా ఉంది. ఈ 14 ఏళ్ల కాలంలో మొత్తం పేదరికం 54.9% నుంచి 39.3% నికి తగ్గింది. అంటే పేదరికం 15.6%  తగ్గగా సాలీనా ఇది 1.2% తగ్గింది.
 
1993లో లక్డవాలా అధ్యక్షతన పేదరికంపై నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ రాష్ట్రాల మధ్య ఉండే ధరల వ్యత్యాసాన్ని బట్టి ఆయా రాష్ట్రాల ప్రత్యేక వినియోగ ధరల సూచీ ఆధారంగా పేదరికాన్ని లెక్కించాలని సూచించింది.
 
 నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్.. వివిధ రౌండ్‌ల్లో ఇచ్చిన జనాభా శాతం, పేదరిక జనాభా వివరాలు..
 50వ రౌండ్ (1993-94) పేదరికం 36% , పేదల జనాభా 32 కోట్లు
 55వ రౌండ్ (1999-2000) పేదరికం 26%, పేదల జనాభా 26 కోట్లు
 61వ రౌండ్ (2004-05) పేదరికం 27.5%, పేదల జనాభా 30 కోట్లు
 66వ రౌండ్ (2009-10) పేదరికం 29.8%, పేదల జనాభా 35 కోట్లు
 
2004-05 లో NSSO-61వ రౌండ్‌లో పేదరికాన్ని రెండు రకాలుగా లెక్కించారు. అవి..
1.  URP (Uniform Recall Period): దీనిలో అన్ని వస్తువులపై చేసే వ్యయాన్ని 30 రోజుల రీకాల్ పద్ధతిలో తీసుకుంటారు.అంటే మొదటి నెలలో చేసిన వ్యయాన్ని ప్రతి నెలా చేస్తారని భావించి లెక్కిస్తారు.
 
2.  MRP (Mixed Recall Period): ఇందులో తరచుగా కొనుగోలు చేయని వస్తువులైన వస్త్రాలు, పాదరక్షలు, మన్నికగల వస్తువులు, విద్య, ఆరోగ్యం తదితర 5 రకాల వాటిపై చేసే వ్యయాన్ని 365 రోజులు ప్రాతిపదికపైన, మిగిలినవాటిని 30 రోజుల ప్రాతిపదికపైన పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేశారు.
 
2004-05లో URP పద్ధతి ప్రకారం పేదరికం 27.5% కాగా, MRP పద్ధతి ప్రకారం 21.8% . 2012, మార్చి 19న ప్రణాళికా సంఘం NSSO 66వ రౌండ్ గణాంకాలను విడుదల చేసింది. పేదరిక రేఖ నిర్ధారణకు గ్రామీణ ప్రాంతంలో రూ. 672.80 నెలసరి వినియోగ వ్యయం (రోజుకు రూ. 22.40 ) కాగా, పట్టణ ప్రాంతంలో నెలసరి వినియోగ వ్యయం రూ. 859.60 (రోజుకు రూ.28.60)గా నిర్ణయించారు. దీని ప్రకారం 2009-10లో మన దేశంలో 29.8% జనాభా పేదరికంలో ఉంది. ఇందులో గ్రామీణ పేదరికం 33.8% కాగా, పట్టణ పేదరికం 20.9%గా నమోదైంది.
 
సురేశ్ టెండూల్కర్ కమిటీ
పేదరిక అంచనా పద్ధతిని సమీక్షించేందుకు నియమించిన సురేశ్ టెండూల్కర్ కమిటీ తన నివేదికను 2009లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో కమిటీ పేదరిక రేఖను నిర్ణయించడానికి మన్నిక గల వస్తువులతోపాటు విద్య, ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని, పేదరిక రేఖను నిర్ణయించడానికి కేలరీల బదులు జీవన వ్యయ సూచీని ఉపయోగించాలని సిఫార్సు చేసింది. వాటితోపాటు ప్రస్తుతమున్న Uniform Recall Period బదులు  Mixed Recall Period పద్ధతిని అనుసరించాలని పేర్కొంది. 2004-05గాను నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రామాల్లో రూ.446.68 కాగా, పట్టణాల్లో రూ. 578.80. దీని ప్రకారం గ్రామీణ పేదరికం 41.8%గా, పట్టణ పేదరికం 25.7%గా నమోదైంది. భారతదేశ పేదరికాన్ని 37.2%గా లెక్కించారు.
 
ప్రణాళిక సంఘం అనుసరిస్తున్న సురేశ్ టెండూల్కర్ కమిటీ సూచించిన పేదరిక అధ్యయన పద్ధతిని సమీక్షించేందుకు 2012లో రంగరాజన్ అధ్యక్షతన కమిటీని నియమించారు. ఈ కమిటీ తన రిపోర్టులో ప్రతి పది మందిలో ముగ్గురు పేదరికంలో ఉన్నట్లు అంచనా వేసింది. దాంతోపాటు సురేశ్ టెండూల్కర్ కమిటీ నిర్ణయించిన పట్టణ రోజువారీ వినియోగ వ్యయాన్ని రూ. 33 నుంచి రూ. 47లకు, గ్రామీణ రోజువారీ వినియోగ వ్యయాన్ని రూ.27 నుంచి రూ.32 లకు పెంచింది.
సురేశ్ టెండూల్కర్ కమిటీ ప్రకారం2011-12 లో పేదరిక జనాభా 21.9% కాగా, రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5%. రెండు కమిటీలు తీసుకున్న రోజువారీ, నెలవారీ, తలసరి వినియోగ వ్యయ వ్యత్యాసాలను ఈ కింది పట్టికలో  గమనించవచ్చు.
 
TSPSC syllabus
Published date : 14 Sep 2016 04:30PM

Photo Stories