Skip to main content

భారత పంచవర్ష ప్రణాళికలు

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి, దేశ ఆర్థికాభివృద్ధిని శీఘ్రగతిన సాధించడానికి, ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను వ్యూహం ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో సాధించడానికి ఒక దేశంఅనుసరించే విధానమే ఆర్థిక ప్రణాళిక.
ఆర్థికాభివృద్ధిని త్వరితగతిన సాధించడంతోపాటు, దేశంలో లభించే పరిమిత వనరులను అభిలషణీయంగా వినియోగించడానికి, వాటి కేటాయింపుల ద్వారా సాంఘిక న్యాయం పెంపొందించడానికి ఆర్థిక ప్రణాళికలు తోడ్పడతాయి.

సాధారణంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వనరుల కేటాయింపు, ఉత్పత్తి తీరు తెన్నులను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయి. అందువల్ల ఈ వ్యవస్థలో వనరుల కేటాయింపు ప్రజాసంక్షేమం దృష్టితో కాకుండా లాభాపేక్ష దృష్టితో జరుగుతుంది. దీనివల్ల ఉన్నతాదాయ వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. అల్పాదాయ వర్గాలను విస్మరించడం వల్ల సాంఘిక న్యాయం సిద్ధించదు.

అందువల్ల పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ప్రణాళిక రహిత వ్యవస్థగా పేర్కొంటారు. ఈ వ్యవస్థలో వనరుల కేటాయింపు పరోక్షంగా జరగడం, దానిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల ఆదాయం, సంపద పంపిణీల్లో అసమానతలు ఏర్పడతాయి. కాలం గడిచేకొద్దీ వ్యత్యాసాలు తీవ్రమై సాంఘిక న్యాయం లేకుండా పోతుంది.

దేశంలో లభించే వనరుల కేటాయింపు ప్రభుత్వ నియంత్రణలో ఉండి, ప్రజా సంక్షేమం దృష్టితో ప్రత్యక్షంగా జరిగితే సాంఘిక న్యాయం చేకూరుతుంది. అందువల్ల ఈ కేటాయింపులు ప్రణాళికాబద్ధంగా జరపాల్సి ఉంటుంది.

ప్రపంచంలో తొలి ప్రాంతీయ ప్రణాళికను 1916లో అమెరికాలో Tennessee Valley Authority (TVA) స్థాపించినప్పుడు అమలు చేశారు.

ప్రపంచంలో తొలిసారి జాతీయ ప్రణాళికను పంచవర్ష ప్రణాళిక రూపంలో 1928-33 మధ్య రష్యాలో గోస్‌ప్లాన్ ఆధ్వర్యంలో అమలు చేశారు. సత్వర పారిశ్రామికీకరణ సాధనకు జాతీయ ప్రణాళికను అమలు చేయడం తప్పనిసరి అని స్టాలిన్ భావించారు.

1929లో సంభవించిన ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసినా దాని ప్రభావం రష్యాపై పడకపోవడానికి కారణం ఆ దేశం ఆర్థిక ప్రణాళికలను ఆచరించడమే.

రష్యాలో ఉత్పత్తి కారకాల యాజమాన్యం, ఉత్పత్తి నిర్ణయాలు, వనరుల కేటాయింపు ప్రభుత్వం చేతుల్లో ఉండటం వల్ల నిర్ణయించుకున్న లక్ష్యాల సాధనకు ప్రణాళికలు తోడ్పడ్డాయి. ఆ దేశం అనుసరించిన ప్రణాళికలను కేంద్రీకృత (Centralized), నిర్దేశక (Imperative) ప్రణాళికలుగా పేర్కొంటారు.

రష్యా అనుసరించిన ఈ ప్రణాళికలను పోలెండ్, హంగేరీ, ఆస్ట్రియా, రుమేనియా, చైనా తదితర దేశాలు అమలు చేశాయి.

1940లో ఫ్రాన్స్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిన తర్వాత, 1947లో ఆరేళ్ల ప్రణాళిక (Six years Plan)ను సూచనాత్మక ప్రణాళిక (Indicating Plan) రూపంలో ప్రకటించింది.

ఫ్రాన్స్ లో అప్పటి జనరల్ ప్లానింగ్ చైర్మన్, ప్రణాళిక మంత్రి అయిన మొన్నెట్ ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రణాళికను ‘మొన్నెట్ ప్రణాళిక’గా పేర్కొంటారు.

రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం సాధించిన దేశాలన్నీ దాదాపుగా సూచనాత్మక ప్రణాళికలనే రూపొందించుకున్నాయి.

ప్రస్తుతం ప్రణాళికలను అనుసరిస్తున్న దేశాలు ఆర్థికాభివృద్ధిలో మార్కెట్ పాత్ర చాలా కీలకమైందిగా గుర్తించడం వల్ల సూచనాత్మక ప్రణాళికలను ఆచరిస్తున్నాయి.

ప్రణాళికల అమల్లో విస్తీర్ణత దృష్ట్యా ప్రాంతీయ, జాతీయ ప్రణాళికలు, రాజకీయ దృష్ట్యా కేంద్ర, రాష్ర్ట, స్థానిక ప్రణాళికలు, నిమగ్నత దృష్ట్యా కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళికలు, కాలవ్యవధి దృష్ట్యా స్వల్పకాల, దీర్ఘకాల ప్రణాళికలుగా వర్గీకరించవచ్చు.

మనదేశంలో ప్రణాళికలకు సంబంధించి 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 'Planned Economy for India' అనే గ్రంథంలో ప్రణాళిక నమూనాను పేర్కొన్నారు. వ్యవసాయ రంగ శ్రామికులను పారిశ్రామిక రంగానికి తరలించడం ద్వారా దశాబ్ద కాలంలోనే జాతీయాదాయాన్ని రెట్టింపు చేయవచ్చని అందులో వివరించారు.

అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ నమూనాపై స్పందించలేదు. కానీ, స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి అమలుపర్చడానికి ఈ నమూనా తోడ్పడింది.

1938 అక్టోబర్ 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన ప్రొవిజనల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సమావేశంలో అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ జాతీయ ప్రణాళిక ఆవశ్యకతను ప్రస్తావించారు. ఈ సమావేశం ఫలితంగానే 1938 అక్టోబర్‌లో నెహ్రూ అధ్యక్షతన, కె.టి. షా ప్రధాన కార్యదర్శిగా ‘నేషనల్ ప్లానింగ్ కమిటీ’ని ఏర్పాటు చేశారు.

15 మంది సభ్యులున్న నేషనల్ ప్లానింగ్ కమిటీ, 29 ఉప కమిటీలతో కలిపి మొత్తం 350 మందితో 29 సంపుటాలతో ప్రతిపాదనలను రూపొందించింది.

1944లో 8 మంది బొంబాయి పారిశ్రామికవేత్తలు ‘బొంబాయి ప్లాన్’ను రూపొందించారు.
బొంబాయి ప్లాన్ సభ్యులు:
1. అర్దేశిర్ దలాల్
2. జె.ఆర్.డి. టాటా
3. జి.డి. బిర్లా
4. పురుషోత్తమ్‌దాస్ ఠాకూర్‌దాస్
5. లాలా శ్రీరామ్
6. ఎ.డి. ష్రాఫ్
7. కస్తూర్‌భాయ్ లాల్‌భాయ్
8. జాన్ మతాయ్

1944లోనే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అర్దేశిర్ దలాల్ అధ్యక్షతన ప్రణాళిక, అభివృద్ధి శాఖ (Planning and Development Department) ను నియమించింది. కానీ 1946లో దీన్ని రద్దు చేశారు.

నేషనల్ ప్లానింగ్ కమిటీ, బొంబాయ్ ప్లాన్ రెండింటిలో సారూప్యం ఉన్న ప్రధాన లక్ష్యాలే మనదేశ స్వాతంత్య్రానంతరం ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించాయి.

గాంధీ ఆలోచనా విధానానికి అనుగుణంగా 1944లో శ్రీమాన్ నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించారు. ఇది వికేంద్రీకరణకు, గ్రామీణ స్వయం పోషక త్వానికి వ్యవసాయ రంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.

1945లో భారతీయ ట్రేడ్ యూనియన్ చైర్మన్ ఎం.ఎన్. రాయ్ ‘పీపుల్స్ ప్లాన్’ను రూపొందించారు. ఇందులో మార్క్సిజం, సామ్యవాదం ప్రాతిపదికగా ప్రజలు జీవించడానికి కావాల్సిన కనీస అవసరాలు కల్పిస్తూ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ఆర్థికాభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలను అమలుపర్చాలని నిర్ణయించిన సమయంలోనే 1950 జనవరిలో జయప్రకాశ్ నారాయణ్ స్వతంత్రంగా ‘సర్వోదయ ప్రణాళిక’ను రూపొందించారు. ఈ ప్రణాళికను గాంధీ, వినోబాభావే ఆలోచనల మిళితంగా పేర్కొనవచ్చు.

స్వాతంత్య్రం వచ్చేనాటికి మనదేశం, పేదరికం, ఆదాయ, ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగిత తదితర అనేక ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది.

ఈ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను ఆచరించడమే ఏకైక మార్గమని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భావించారు. అందుకనుగుణంగా 1948 ఏప్రిల్, 6న ప్రకటించిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు.

పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికా 200 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని, రష్యా కేవలం 30 ఏళ్లలో సాధించడం; ఆర్థిక మాంద్యం దుష్ఫలితాలు రష్యాపై ప్రభావం చూపకపోవడం తదితర కారణాలవల్ల మనదేశం ఆర్థిక ప్రణాళికల ఆచరణ పట్ల మొగ్గు చూపింది.

స్వాతంత్య్రానంతరం మనదేశంలో ప్రణాళిక సలహా సంఘం విజ్ఞప్తి మేరకు ఆదేశిక సూత్రాల్లోని 39వ రాజ్యాంగ నిబంధన ప్రకారం 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి ఉంటారు.

ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి, ఆమోదించడానికి 1952 ఆగస్టులో ‘జాతీయాభివృద్ధి మండలి’ని ఏర్పాటు చేశారు.

జాతీయాభివృద్ధి మండలిలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, కేంద్ర కేబినెట్ మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు, ప్రణాళికా సంఘం సభ్యులు తదితరులు సభ్యులుగా వ్యవహరిస్తారు.

నీతి ఆయోగ్
మనదేశ ఆర్థికాభివృద్ధిలో 65 ఏళ్లుగా అమల్లో ఉన్న ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 1 న ‘నీతి (National Institution for Transforming India) ఆయోగ్’ను ఏర్పాటు చేసింది.జనవరి 5న ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియాను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నియమించారు.
ప్రణాళికా సంఘానికి చివరి ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా.
ఆర్థికవేత్త అయిన అరవింద్ పనగరియా కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు. ఈయన అమెరికాలోని ప్రిన్‌‌సటన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఇప్పటివరకు 15 పుస్తకాలు రాశారు. ‘ఇండియా: ది ఎమర్జింగ్ జైంట్’ అనే పుస్తకాన్ని 2008 మార్చిలో న్యూయార్క్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ ప్రచురణాలయం ప్రచురించింది.

నీతి ఆయోగ్‌లో ఇతర సభ్యులు
పూర్తికాల (శాశ్వత) సభ్యులు:
బిబేక్ డిబ్రోయ్ (ఆర్థిక వేత్త), వి.కె. సారస్వత్ (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్), ప్రొఫెసర్ రమేష్ చంద్

నీతి ఆయోగ్‌లో రెండు హబ్‌లున్నాయి. అవి..
1. Team India Hub: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను సమన్వయపరుస్తూ కార్యాచరణను రూపొందిస్తుంది.

2.Knowledge and Innovation Hub: దేశాభివృద్ధికి అవసరమైన పరిశోధనలు, ఆవిష్కరణలను రూపొందిస్తూ ప్రభుత్వానికి కావాల్సిన వ్యూహాత్మక విధానాలు అందిస్తుంది. ఇది మేధోనిధిగా వ్యవహరిస్తుంది.

మనదేశంలో 1951 నుంచి 2012 నాటికి పదకొండు పంచవర్ష ప్రణాళికలు అమలయ్యాయి.
2017 నాటికి పన్నెండో పంచవర్ష ప్రణాళిక పూర్తి కానుంది.
మనదేశంలో ఏడో ప్రణాళిక వరకు కేంద్రీకృత ప్రణాళిక విధానాన్ని అనుసరించగా ఎనిమిదో ప్రణాళిక నుంచి సూచనాత్మక ప్రణాళికను అమలుచేశారు.

మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికను 1951-52లో ప్రారంభించగా, 2012 నాటికి మొత్తం 11 ప్రణాళికలు అమలయ్యాయి. ప్రస్తుతం 12వ ప్రణాళిక కొనసాగుతోంది. 1966-69, 1978-80, 1990-92 మధ్య మొత్తం ఏడేళ్లపాటు వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. ఏడో ప్రణాళిక వరకు కేంద్రీకృత ప్రణాళిక విధానాన్ని అనుసరించగా, ఎనిమిదో ప్రణాళిక నుంచి సూచనాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)
  • ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ధరల స్థిరత్వం, రవాణా, నీటి పారుదల సౌకర్యాల కల్పన లాంటి అంశాలకు ప్రాముఖ్యత లభించింది.
  • హారడ్-డోమర్ నమూనా ఆధారంగా ఈ ప్రణాళికను రూపొందించారు. దీని ప్రారంభం నాటికి శరణార్థుల వలస, ఆహార ధాన్యాల కొరత, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను దేశం ఎదుర్కొంటోంది.
  • సింద్రీ ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్ లోకోమోటివ్ కర్మాగారాలను ఈ ప్రణాళిక కాలంలో నిర్మించారు. భాక్రానంగల్, హిరాకుడ్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైంది.
  • 1956 చివరి నాటికి ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలను ప్రారంభించారు.
  • రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైన ఇనుము-ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన ఒప్పందాలు ఈ ప్రణాళిక కాలంలోనే జరిగాయి.
  • ఈ ప్రణాళిక కాలంలో చివరి రెండేళ్లు పంటలు బాగా పండటంతో ఇది విజయవంతమైంది. మొదటి ప్రణాళిక వృద్ధి లక్ష్యం 2.1 శాతం కాగా, 3.6 శాతం వృద్ధిరేటు నమోదైంది.
2వ పంచవర్ష ప్రణాళిక (1956-61)
  • ఈ ప్రణాళికలో మౌలిక, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రముఖ గణాంక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ 1953లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో రూపొందించిన వృద్ధి నమూనా ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు.
  • ఈ ప్రణాళిక కాలంలో రూర్కెలా (పశ్చిమ జర్మనీ సహకారంతో), భిలాయ్ (రష్యా సహకారంతో), దుర్గాపూర్ (బ్రిటన్ సహకారంతో)లలో మూడు ఉక్కు కర్మాగారాల నిర్మాణం జరిగింది.
  • దీన్ని ధైర్యంతో కూడిన ప్రణాళికగా, (Plan of Industry and Transport)గా పేర్కొంటారు.
  • 1956 రెండో పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా దీన్ని రూపొందించారు.
  • పణాళిక వృద్ధి లక్ష్యం 4.5 శాతం కాగా, 4.27 శాతం వృద్ధి నమోదైంది.
3వ పంచవర్ష ప్రణాళిక (1961-66)
  • స్వయం సమృద్ధి, స్వావలంబన ప్రధాన లక్ష్యం.
  • ఈ ప్రణాళిక సమయానికి భారతదేశం ప్లవన దశకు చేరుకోవడానికి సిద్ధంగా ఉందని భావించారు. స్వయం సమృద్ధి, స్వావలంబన సాధనకు వీలుగా నిధులు కేటాయించారు.
  • రుతుపవనాల అననుకూలత, 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల వల్ల ఈ ప్రణాళిక లక్ష్యాలు నెరవేరలేదు. అందువల్ల దీన్ని విఫలమైన ప్రణాళికగా పేర్కొనవచ్చు.
  • ఈ ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6 శాతం కాగా, 2.8 శాతం వృద్ధి నమోదైంది.
వార్షిక ప్రణాళికలు (1966-69)
  • మూడో ప్రణాళిక ముగిసిన తర్వాత దేశంలో నాలుగో పంచవర్ష ప్రణాళికను అమలుచేసే పరిస్థితులు లేవు. అందువల్ల 1966-69 మధ్య కాలంలో మూడు వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. ఈ కాలాన్ని ప్రణాళిక విరామం (plan gap) లేదా ప్రణాళిక సెలవు (plan Holiday) అంటారు.
  • ఈ సమయంలో నూతన వ్యవసాయక వ్యూహాన్ని అమలు చేశారు.
  • మూడో ప్రణాళిక కాలంలో సంభవించిన ఒడిదొడుకులను వార్షిక ప్రణాళికల కాలంలో సరిదిద్దారు.
4వ పంచవర్ష ప్రణాళిక (1969-74)
  • సుస్థిర వృద్ధి, స్వయం పోషకత్వాలను ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.
  • దీన్ని గాడ్గిల్ వ్యూహం ఆధారంగా రూపొందించారు. ఈ ప్రణాళిక కాలంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం (1971) ఇచ్చారు.
  • 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు.
  • రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 1974, మే 18న అణు పరీక్ష నిర్వహించారు.
  • దీన్ని విఫలమైన ప్రణాళికగా పేర్కొనవచ్చు.
  • ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.7 శాతం కాగా, 3.3 శాతం వృద్ధి నమోదైంది.
5వ పంచవర్ష ప్రణాళిక (1974-78)
  • పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు.
  • కనీస అవసరాలు తీర్చే కార్యక్రమం (Minimum Needs programme), 20 అంశాల ఆర్థిక కార్యక్రమం లాంటి పథకాలను ప్రారంభించారు.
  • 1975లో అత్యవసర పరిస్థితి విధించడం, 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏడాది ముందుగానే (1978లో) ఈ ప్రణాళికను ముగించారు.
  • ప్రణాళిక వృద్ధి లక్ష్యం 4.4 శాతం కాగా, 4.7 శాతం వృద్ధి నమోదైంది.
  • నిరంతర ప్రణాళిక (1978-80)
  • 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 1978-83 మధ్య 6వ పంచవర్ష ప్రణాళికను నిరంతర ప్రణాళిక (Rolling Plan) రూపంలో అమలు చేసేందుకు రూపకల్పన చేసింది.
  • నిరంతర ప్రణాళిక భావనను స్వీడన్ దేశస్తుడైనగున్నార్ మిర్ధాల్ ప్రతిపాదించారు.
  • అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డి.టి. లక్డావాలా నేతృత్వంలో ఈ ప్రణాళిక రూపకల్పన జరిగింది.
  • కొంత కాలానికే జనతా ప్రభుత్వం పడిపోవ డం, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో 6వ ప్రణాళిక పూర్తి కాలం కొనసాగలేదు.
  • జనతా ప్రభుత్వ పాలనా కాలంలోని రెండు ఏళ్లలో (1978-79, 1979-80) అమలు చేసిన వాటిని వార్షిక ప్రణాళికలుగా పరిగణిస్తారు.
6వ పంచవర్ష ప్రణాళిక (1980-85)
  • నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చారు.
  • ఉపాధి కల్పన కోసం ఐఆర్‌డీపీ, ఎన్‌ఆర్‌ఈపీ, ఆర్‌ఎల్‌ఈజీపీ లాంటి పథకాలను చేపట్టారు.
  • శివరామన్ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా 1982, జూలై 12న నాబార్‌‌డను స్థాపించారు.
  • ప్రణాళిక ప్రారంభంలో 47 శాతం ఉన్న పేదరికం 37 శాతానికి తగ్గింది.
  • ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.2 శాతం కాగా 5.7 శాతం వృద్ధి నమోదైంది.
  • ఇది విజయవంతమైన ప్రణాళిక
7వ పంచవర్ష ప్రణాళిక (1985-90)
  • ఆహారం, పని, ఉత్పాదకతలను మౌలిక ప్రాధాన్యతలుగా గుర్తించారు.
  • 1989లో జవహర్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు.
  • ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5 శాతం కాగా, 6.01 శాతం వృద్ధి నమోదైంది.
  • ఈ ప్రణాళిక వృద్ధిరేటు హిందూ వృద్ధిరేటును అధిగమించింది.
వార్షిక ప్రణాళికలు (1990-92)
  • రాజకీయ అస్థిరత కారణంగా 1990-91, 1991-92ల్లో వార్షిక ప్రణాళికలను అమలు చేశారు.
8వ పంచవర్ష ప్రణాళిక (1992-97)
  • మానవ వనరుల అభివృద్ధితోపాటు పేదరికం, నిరుద్యోగ నిర్మూలనను ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.
  • 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా ప్రభుత్వరంగం కంటే ప్రైవేటు రంగానికి అధిక కేటాయింపులు చేశారు.
  • పరిశ్రమల ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు.
  • జనాభా నియంత్రణ, పేదరికం తగ్గింపు, అవస్థాపనా సౌకర్యాలను మెరుగుపర్చడం, మానవ వనరుల అభివృద్ధి లాంటి అంశాల్లో పంచాయతీరాజ్, నగరపాలక సంస్థలు, ఎన్‌జీవోలను నిమగ్నం చేయడం ద్వారా ప్రణాళిక కార్యక్రమాలను వికేంద్రీకరించారు.
  • 1995, జనవరి 1న మనదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ (World Trade Organisation)లో సభ్యత్వం పొందింది.
  • ఈ ప్రణాళిక నుంచి సూచనాత్మక ప్రణాళికను అమలు చేశారు.
  • ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6 శాతం కాగా, 6.8 శాతం వృద్ధి నమోదైంది.
9వ పంచవర్ష ప్రణాళిక (1997-2002)
  • సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడుకున్న వృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సంయుక్తంగా కృషిచేయాలని నిర్ణయించారు.
  • ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (SAP)లను రూపొందించారు. ఇందులో సమాచార సాంకేతిక విజ్ఞానం, వ్యవసాయం, సామాజిక అవస్థాపనా సౌకర్యాలను చేర్చారు.
  • వ్యవసాయ వృద్ధి లక్ష్యం 3 శాతం కాగా, సాధించిన వృద్ధి 4.5 శాతం.
  • పారిశ్రామిక వృద్ధి లక్ష్యం 4.2 శాతం కాగా, సాధించిన వృద్ధి 2.1 శాతం మాత్రమే.
  • సేవల రంగం వృద్ధి రేటు 7.8 శాతం
  • ప్రణాళిక వృద్ధి లక్ష్యం 6.5 శాతం కాగా, 5.5 శాతం వృద్ధి నమోదైంది.
10వ పంచవర్ష ప్రణాళిక (2002-07)
  • ప్రాంతీయ అసమానతల తొలగింపును ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
  • ఆర్థికాభివృద్ధి సాధనకు 11 రకాల Monitorable Targets నిర్ణయించారు.
  • వేతనాలు, అక్షరాస్యతలో లింగభేదాన్ని కనీసం 50 శాతం తగ్గించడం
  • శిశు మరణాలను ప్రతి 1000కి 45కి తగ్గించడం, మాతా మరణాలను 1000కి రెండు నుంచి ఒకటికి తగ్గించడం
  • అక్షరాస్యతను 75 శాతానికి పెంచడం
  • కలుషిత నదీ జలాలను శుద్ధి చేయడం
  • దశాబ్ద కాలంలో (2001-2011) జనాభా పెరుగుదల రేటును 16.2 శాతం (సాలీనా 1.62) తగ్గించడం
  • రూ.800 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
  • ఎఫ్‌డీఐలు ఏటా 7.5 బిలియన్ డాలర్లు పెరిగేలా చూడటం
  • భూ వినియోగంలో 33 శాతం అడవి, చెట్లతో ఉండేలా కార్యక్రమాలను రూపొందించడం
  • పేదరికాన్ని 21 శాతం తగ్గించడం తదితర నిర్ణయాలు తీసుకున్నారు.
  • ప్రణాళిక వృద్ధి లక్ష్యం 8 శాతం కాగా, 7.6 శాతం వృద్ధి నమోదైంది.
11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)
  • అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధిరేటును సాధించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
  • 70 మిలియన్ల కొత్త ఉద్యోగాల కల్పన
  • విద్యావంతుల నిరుద్యోగితను 5 శాతం దిగువకు తగ్గించడం
  • శిశు మరణాలను ప్రతి 1000కి 28కి తగ్గించడం, మాతా మరణాలను 1000కి ఒకటికి తగ్గించడం
  • వ్యవసాయోత్పత్తులను పెంచేందుకు రెండో హరిత విప్లవాన్ని తీసుకురావడం
  • పేదరిక నిర్మూలన, అత్యవసర సేవలు, విద్యా, వైద్య సౌకర్యాలు అందరికీ అందేలా చూడటం
  • అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం
  • 7 ఏళ్లు పైబడిన వారి అక్షరాస్యతను 85 శాతానికి పెంచడం లక్ష్యాలుగా పెట్టుకున్నారు.
  • ఈ ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 9 శాతం కాగా, 8.1 శాతం వృద్ధి నమోదైంది.
వివిధ ప్రణాళికల వృద్ధి రేటు లక్ష్యాలు - విజయాలు
ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం నమోదైన వృద్ధి రేటు
1 2.1 శాతం 3.6 శాతం
2 4.5 శాతం 4.27 శాతం
3 5.6 శాతం 2.8 శాతం
4 5.7 శాతం 3.3 శాతం
5 4.4 శాతం 4.7 శాతం
6 5.2 శాతం 5.7 శాతం
7 5 శాతం 6.1 శాతం
8 5.6 శాతం 6.8 శాతం
9 6.5 శాతం 5.5 శాతం
10 8 శాతం 7.6 శాతం
11 9 శాతం 8.1 శాతం
Published date : 28 Dec 2016 05:15PM

Photo Stories