Skip to main content

AP EAPCET 2023: ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌–2023 ఫలితాల్లో అత్యధిక శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ. బొత్స సత్యనారాయణ తెలిపారు.
AP EAPCET 2023
ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

జూన్ 14న‌ విజయవాడ బందర్ రోడ్డులోని లెమట్ ట్రీ ప్రీమియర్ హోటల్ లో ఏపీ ఈఏపీ సెట్ -2023 ఫలితాల విడుదల అనంతరం మంత్రి శ్రీ. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అనంతపురం జేఎన్‌టీయూ - ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్-2023 పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మంది (3,14,797) విద్యార్థులు హాజరయ్యారన్నారు. విద్యార్థులు ఇంటర్‌ లో సాధించిన మార్కుల ప్రకారం వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీ సెట్‌ -2023 ర్యాంకులను ప్రకటించామన్నారు. 

ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో  అబ్బాయిల కంటే అత్యధికంగా అమ్మాయిలు  ఉత్తీర్ణత (3.99 శాతం) సాధించగా, ఇంజినీరింగ్ విభాగంలో తొలి పది స్థానాల్లో బాలురు, అగ్రికల్చర్ విభాగంలో తొలి 10 స్థానాల్లో 8 మంది బాలురు, ఇద్దరు బాలికలు నిలిచారని పేర్కొన్నారు. 

ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది పరీక్షలు హాజరు కాగా అందులో 1,71,514 మంది (76.32 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. అగ్రికల్చర్ విభాగంలో 90,573 మంది అభ్యర్థులు హాజరుకాగా 81,203 మంది (89.65 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ప్రవేశాలకు అర్హత పొందారని వెల్లడించారు. 

☛ College Predictor - 2023 - AP EAPCET TS EAMCET

ఇంజినీరింగ్ విభాగంలో చల్లా ఉమేష్ వరుణ్ 160 మార్కులకు గానూ 158 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, బిక్కిన అభినవ్ చౌదరి (157/160) రెండో స్థానంలో, నందిపాటి సాయి దుర్గారెడ్డి (155/160)  మూడో స్థానంలో, చింతపర్తి బాబు సుజన్ రెడ్డి(155/160) నాలుగో స్థానంలో, దుగ్గినేని వెంకట యుగేష్ (154/160) ఐదో స్థానం, అడ్డగడ వెంకట శివరామ్ (153/160) ఆరో స్థానం, యక్కంటి ఫణి వెంకట మణీందర్ రెడ్డి (154/160) ఏడో స్థానం, మేడాపురం లక్ష్మీనర్సింహ మాధవ్ భరద్వాజ్ (153/160) ఎనిమిదో స్థానం,  పిన్ను శశాంక్ రెడ్డి తొమ్మిదో స్థానం(152/160), ఎం. శ్రీకాంత్ (152/160) మార్కులతో పదో స్థానం సాధించారని వివరించారు.

అగ్రి కల్చర్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ 160 కి గానూ 153 మార్కులతో  మొదటి ర్యాంకు సాధించగా, బోరా వరుణ్ చక్రవర్తి (151/160) రెండో ర్యాంకు, కొన్ని రాజ్ కుమార్ (151/160) మూడో ర్యాంకు, వలేటి సాయి అభినవ్ (149/160) నాలుగో ర్యాంకు, దుర్గెంపూడి కార్తికేయరెడ్డి(150/160) ఐదో ర్యాంకు, రాజేశ్వరి కుచూరు (149/160) ఆరో ర్యాంకు, తడ్డి సాయి వెంకట యశ్వంత్ నాయుడు(148/160) ఏడో ర్యాంకు, గుడిపూడి కీర్తి (147/160) ఎనిమిదో ర్యాంకు,  పొట్నూరు ఆశిష్ (148/160) తొమ్మిదో ర్యాంకు, దేరాంగుల అభిజిత్ సాయి (147/160) పదో ర్యాంకు సాధించినట్లు వివరించారు. 

ఏపీ ఈఏపీసెట్-2023 కు ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2,07,787 మంది అభ్యర్థులు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 1,10,887, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 16,056, నాన్ లోకల్ విభాగంలో 4009 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఓసీలు 1,05,556, బీసీ-ఏ 46,864, బీసీ- బీ2,221, బీసీ-సీ 61,126, బీసీ-డీ 17,235, బీసీ-ఈ 53,521 , ఎస్సీ, ఎస్టీలు కలిపి 11,383 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు గణాంకాలను మంత్రి వివరించారు.

2023 మే 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 2,38,180 మంది ఇంజినీరింగ్ విభాగంలో, 1,00,559 మంది అభ్యర్థులు అగ్రికల్చర్ విభాగంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 1,69,302 మంది  అమ్మాయిల్లో  ఇంజినీరింగ్ విభాగంలో 97,659 మంది, అగ్రికల్చర్ విభాగంలో 71.643 మంది  ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా 1,69,437 మంది అబ్బాయిల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1,40,521, అగ్రికల్చర్ విభాగంలో 28,916 మంది ఉన్నారన్నారు.

10 మార్చి, 2023న ఏపీ ఈఏపీసెట్-2023కు నోటిఫికేషన్ విడుదల చేశామని,  మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగాలకు తెలుగు రాష్ట్రాల్లో 25 జోన్లుగా విభజించి 136 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 15 జులై, 2023  నుండి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని అందువల్లే సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఈఏపీ సెట్ -2023 లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందలు తెలిపారు.  రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదగాలన్నది  ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయమని, విద్యలో తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రవేశపెట్టిన పథకాలు విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమేనని మంత్రి వెల్లడించారు. భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, దేశంలోనే విద్యా రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. విద్యార్థులంతా బాగా చదివి కుటుంబానికి, దేశానికి, రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్క విద్యార్థి సత్యనాదెళ్లలా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి  తీసుకుంటన్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల చేరిక శాతం, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందన్నారు. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు,  నూతన విద్యా విధానం, కరికులమ్ లో, ఉన్నత విద్యాశాఖలో తీసుకొస్తున్న మార్పుల వల్ల సత్ఫలితాలు వెలువడుతున్నాయన్నారు.విద్య కోసం చేసిన ఖర్చు మానవ వనరులపై పెట్టిన పెట్టుబడి అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.రామ్మోహన్ రావు, జేఎన్ టీయూ (అనంతపురం ) వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ జి. రంగా జనార్ధన, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ వై. నజీర్ అహ్మద్, ఏపీఈఏపీ సెట్-2023 కన్వీనర్ ప్రొఫెసర్ సి. శోభా బిందు, ఉన్నత విద్యా మండలి స్పెషల్  ఆఫీసర్ ప్రొఫెసర్ ఎం. సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Published date : 14 Jun 2023 04:13PM

Photo Stories