Collector P Pravinya: గురుకులంలో కలెక్టర్‌ రాత్రి బస

కమలాపూర్‌: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సెప్టెంబ‌ర్ 12న‌ కలెక్టర్‌ పి.ప్రావీణ్య సందర్శించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలలో ఒకరోజు విద్యార్థులతో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి రాత్రి బస చేశారు. ముందుగా కలెక్టర్‌కు ఎన్‌సీసీ విద్యార్థినులు, బ్యాండ్‌ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కలెక్టర్‌ గురుకుల పాఠశాల, పరిసరాల్లో మొత్తం కలియదిరిగారు.

తరగతి గదులు, బాలికల డార్మెటరీ, కిచెన్‌, స్టోర్‌ రూం, వంట సామగ్రి, డైనింగ్‌ హాల్‌తో పాటు పాఠశాల పరిసరాలను, అక్కడి వసతులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి గురుకుల పాఠశాల స్టాఫ్‌, విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చదవండి: NAS Exam: జిల్లా విద్యార్థులు సత్తా చాటాలి

విద్యార్థులతో మాట్లాడి రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? లేదా? అని, ఇతరత్రా వారికున్న సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.

వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాల డార్మెటరీలో విద్యార్థినులు, ఉపాధ్యాయినులతో కలిసి రాత్రి అక్కడే నిద్రించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, ఆర్డీఓ వెంకటేశ్‌, ఎంజేపీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీఓ మోతె రాజ్‌కుమార్‌, బాలికల, బాలుర గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు సౌజన్య, రవీందర్‌, తహసీల్దార్‌ సురేశ్‌కుమార్‌, ఎంపీడీఓ గుండె బాబు, ఎంపీఓ రవి, పలు శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags