Palle Anantha Reddy: శిథిలమైన బడిని.. గుడిని చేసిన పల్లె అనంతరెడ్డి

షాబాద్‌: పల్లె అనంతరెడ్డి.. హైతాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్‌.. చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పలక, బలపం కొనిచ్చే పరిస్థితి కూడా లేదు.

ఆ సమయంలోనే అతని గురువులు సాయం చేశారు. అన్నీ సమకూర్చారు. దీన్నే అనంతరెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారు. పేద విద్యార్థుల కోసం తన జీతంతోపాటు జీవితాన్ని అంకితం చేశారు. ‘నేను విధుల్లో చేరినప్పుడు కొండాపూర్‌ యూపీఎస్‌ శిథిలమైన గదుల్లో కొనసాగుతోంది.

1 నుంచి 7వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో స్కూల్‌ ఆవరణలో తడకలు వేయించి పాఠాలు చెప్పా. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు, దాతల ద్వారా రూ.70 లక్షలతో ఏడు రూమ్‌లు నిర్మించాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మరో రూ.30 లక్షలు పెట్టి సకల సౌకర్యాలు సమకూర్చాం.

చదవండి: National Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..

కరోనాలో పేద ప్రజలకు రూ.60 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశాం. స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు ఇప్పించి విద్యార్థులకు డిజిటల్‌ బోధన కొనసాగించాను. హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయించా. ప్రస్తుతం అక్కడ 1,100 మంది చదువుతున్నారు’అని అనంతరెడ్డి చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో అనంతమైన సంతృప్తి కనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఆయన హైతాబాద్‌ పాఠశాలకు బదిలీ అయ్యారు.

అంతేకాదు.. నిరుపేద విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడూ తన వంతు సాయాన్ని అందిస్తూ అనంతరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

#Tags