Talliki Vandanam Scheme 2024 Full Stop : ఇక ‘తల్లికి వందనం’ యూటర్న్.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే..?
వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమలులోకి తీసుకోస్తామన్నారు. ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో.. తల్లికి వందనంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు సరిగా జరగలేదు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరలేదు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేరలేదో సమీక్ష చేయాలి. అలాగే, తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుపరుస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మందికి ఇవ్వడంపై చర్చించాల్సి ఉంది. తల్లిదండ్రులు, మేధావులతో చర్చించి ఈ పథకాన్ని అమలుపరుస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.
ప్రతి బిడ్డకు అని చెప్పి.. నేడు మాత్రం..
కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై దొంగాట ఆడుతోంది. ఇందుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 29లో ‘ఈచ్ మదర్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.., ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని బొంకుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి బిడ్డకు, ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తామని గానీ, మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఇస్తామని గానీ చెప్పడం లేదు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ముందుకునెట్టి ఈ పథకంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని చెప్పించి.. చేయబోయే మోసంపై దాటవేత ధోరణి అవలంబించారు.
నేడు విద్యార్థులు లేక.. ప్రభుత్వ స్కూల్స్ ఖాళీ..!
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ స్కూల్స్.. నేడు విద్యార్థులు లేక.. ఖాళీ అవుతున్నాయి. ఎందుకంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టైమ్కి అమ్మ ఒడి పథకం ద్వారా 15,000 ఆర్థిక సహాయం ఇచ్చేవారు. అలాగే గత ప్రభుత్వం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మంచి విద్యను అందించేవారు. దీంతో విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్స్పై మంచి నమ్మకం.. భరోస ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా ఏ పిల్లవాడికి కూడా ఇవ్వలేదు. అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కూడా అందించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఘోరంగా మారింది. విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్స్పై నమ్మకం పోతుంది.
6216 స్కూళ్లలో 10మందిలోపే..
మొత్తం 44వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను 6216 స్కూళ్లలో 10మందిలోపే విద్యార్థులున్నారు. 104 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. 81 స్కూళ్లు కేవలం ఒకే విద్యార్థితో నడుస్తున్నాయి. సర్కారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే పరిస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.