AP RGUKT IIIT Selection List 2024 : ఏపీలోని ట్రిపుల్ ఐటీ ఎంపిక జాబితా విడుదల తేదీ ఇదే..! సర్టిఫికేట్ వెరిపికేషన్ తేదీలు ఇవే..
ఈ మేరకు ట్రిపుల్ ఐటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక జాబితా విడుదలైన తర్వాత చోటు దక్కించుకున్న విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.
సర్టిఫికేట్ వెరిపికేషన్ తేదీలు ఇవే..
ఎంపిక చేసిన విద్యార్థులకు నూజివీడు క్యాంపస్లో జులై 22, 23వ తేదీల్లో సర్టిఫికేట్ వెరిపికేషన్ ఉంటుంది. ఇక ఇడుపులపాయ క్యాంపస్లో జులై 22, 23, ఒంగోలు క్యాంపస్లో జులై 24, 25 తేదీల్లో పరిశీలన ఉంటుంది. శ్రీకాకుళం క్యాంపస్లో జులై 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు.స్పెషల్ కేటగిరీ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జులై 5వ తేదీతో పూర్తి అయింది. ఇందులో స్పోర్ట్స్, బీఎస్జీ, పీహెచ్, ఎన్సీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. సీట్ల కేటాయింపు తర్వాత జులై మూడో వారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్..
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్కు పిలుస్తారు. ఆర్జీయూకేటీ వెబ్సైట్ నుంచి విద్యార్థులు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్కు హాజరుకావల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. హాస్టల్ వసతి ఉంటుంది.
ఒక్కొ ట్రిపుల్ ఐటీకి 1,000 సీట్లు చొప్పున..
ఈ ఏడాది ఏకంగా 53,863 దరఖాస్తులు వచ్చాయి. ఈ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కొ ట్రిపుల్ ఐటీకి 1,000 సీట్లు చొప్పున మొత్తం నాలుగు వేలు సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 400 సీట్లు ఉన్నాయి. మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సీట్లకు 53,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో సీటుకు దాదాపు 13 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో ప్రభుత్వ స్కూల్స్ నుంచి 34,154 మంది, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 19,671 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 23,006 మంది బాలురు కాగా, 30,857 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 50,132 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ విద్యార్థులు 3,693 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాల విద్యార్థులు 38 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే..
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ఇందులో పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. అలాగే ఆర్థికంగా వెనునకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 25 శాతం సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయి.