AP TET 2024 Hall Ticket Download : ఏపీ టెట్‌-2024 హాల్ టికెట్లు విడుదల... ఎప్పుడంటే..? ఈ సారి రిజ‌ల్డ్స్‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ టెట్‌-2024 ప‌రీక్ష‌ అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఉదయం మొదటి సెషన్‌ 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండో సెషన్‌ 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లుల‌ను చేస్తుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

టెట్ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో..
ఏపీ టెట్ 2024కు సంబంధించిన హాల్‌టికెట్లు సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత అందుబాటులో రానున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. 

ఏపీ టెట్ 2024 కీ కూడా..
ఏపీ టెట్ 2024 పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత.. అంటే అక్టోబర్ 4వ తేదీ తర్వాత నుంచి ఆ ముందు రోజుల ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి కీ పై అభ్యంతరాల స్వీకరిస్తారు. అక్టోబర్‌ 27వ తేదీ తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల అవుతుంది. 

ఏపీ టెట్ ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..
ఏపీ టెట్‌ ఫలితాలు 2024 నవంబర్ 2వ తేదీ ప్రకటిస్తారు. క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు.. ఓసీ (జనరల్‌) కేటగిరీలో 60 శాతం ఆపైన‌ మార్కులు, బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు ఆపైన‌, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ కేటగిరీల వారికి 40 శాతం మార్కులు ఆపైన‌ వస్తేనే టెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు ఈసారి భారీగా పోటీపడుతున్నారు.

మొత్తం 4,27,300 మంది..

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు.

టెట్‌.. నాలుగు పేపర్లు..
➨    ఏపీ టెట్‌ను పేపర్‌–1ఎ,1బి,పేపర్‌–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లు­గా నిర్వహిస్తారు. బోధన తరగతుల వా­రీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు. 
➨    పేపర్‌–1ఎ: 1–5వ తరగతి వరకు ఉపాధ్యాయులకు అవసరమైన పరీక్ష.
➨    పేపర్‌–1బి: 1–5వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌కు అవసరమైన పరీక్ష.
➨    పేపర్‌–2ఎ: 6 నుంచి 8వ తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్‌.
➨    పేపర్‌–2బి: 6 నుంచి 8వ వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష.

అర్హతలివే..
పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీతోపాటు డీఈడీ/ బీఈడీ/లాంగ్వేజ్‌ పండిట్‌ తత్సమాన అర్హతలు ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తుకు అర్హులే.
పరీక్ష విధానాలు : 
➨    పేపర్‌–1ఎ, 1బి: పేపర్‌–1ఎ,పేపర్‌–1బిలను 5 విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి; లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌), మ్యాథమెటిక్స్‌; ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 150ప్రశ్నలు అడుగుతారు.ప్రతి ప్రశ్న­కు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.లాంగ్వేజ్‌–1 సబ్జెక్ట్‌ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమి­ళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.

పేపర్‌–2ఎ
➨    ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు (చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 ప్రశ్నలు– 30 మార్కులు); లాంగ్వేజ్‌–1 (30 ప్రశ్నలు–30 మార్కులు); లాంగ్వేజ్‌–2 ఇంగ్లిష్‌ (30 ప్రశ్నలు–30 మార్కులు); సంబంధిత సబ్జెక్ట్‌ (60 ప్రశ్నలు–60 మార్కులు)గా పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
➨    సబ్జెక్ట్‌ విభాగానికి సంబంధించి మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థులు మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ విభాగాన్ని, సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని, లాంగ్వేజ్‌ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్‌ను ఎంచుకుని పరీక్ష రాయాలి. అదే విధంగా సబ్జెక్ట్‌ పేపర్‌లో మ్యాథమెటిక్స్‌లో.. 24 కంటెంట్‌– 6 పెడగాజి ప్రశ్నలు ఉంటాయి. 
సైన్స్‌ సబ్జెక్ట్‌లో.. ఫిజికల్‌ సైన్స్‌ నుంచి 12 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా 3 ప్రశ్నలు సైన్స్‌ పెడగాజి నుంచి ఉంటాయి. సోషల్‌ విభాగంలో 48 కంటెంట్‌ ప్రశ్నలు–12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌ మెథడాలజీకి సంబంధించి 48 కంటెంట్‌–12 పెడగాజి ప్రశ్నలు ఉంటాయి. 

పేపర్‌–2బి
➨    పేపర్‌–2బిని కూడా పేపర్‌–2ఎ మాదిరిగా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. మొదటి మూడు విభాగాలు పేపర్‌–2ఎలోవే ఉంటాయి. నాలుగో విభాగంగా మాత్రం డిజేబిలిటీ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌ అండ్‌ పెడగాజి ఉంటుంది. ఈ విభాగంలో 60 మార్కులకు 60 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాలు కలిపి 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
➨    నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌ నుంచి 48 కంటెంట్, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు. 

టెట్‌ పరీక్షలో రాణించేలా..
చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి
శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు;శిశువు ప్రవర్తనలో మా­ర్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యస­న బదలాయింపు; ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం– నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. 

లాంగ్వేజ్‌
లాంగ్వేజ్‌–1లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో.. అదే విధంగా లాంగ్వేజ్‌–2గా పేర్కొన్న ఇంగ్లిష్‌లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్‌ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్‌ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి నుంచి అయిదో తరగతి వరకు; ఎన్విరాన్‌మెంటల్‌ పేపర్‌లో సైన్స్, సమకాలీన అంశాలపైనా దృష్టి పెట్టాలి.
➨    సైన్స్‌: ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్‌–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్‌ వంటి వాటిపై దృష్టిపెట్టాలి. 
➨    సోషల్‌ స్టడీస్‌: హైస్కూల్‌ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ చదవాలి. 
➨    మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. 


టెట్‌తోపాటే డీఎస్సీకి ప్రిపరేషన్‌ ఇలా..
➨    టెట్‌తోపాటు డీఎస్సీకి సమాంతర ప్రిపరేషన్‌ సాగించడం మేలు. అందుకోసం ఎస్‌జీటీ అభ్యర్థులు జీకే, కరెంట్‌ అఫైర్స్‌ సిలబస్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు–రాజధానులు, ప్రపంచంలో తొలి సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ అంశాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తెలుసుకోవాలి.
➨    అదే విధంగా విద్యా దృక్పథాలు; విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంపై పూర్తి అవగాహన పొందాలి. కంటెంట్‌కు సంబంధించి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి.

#Tags