Free training for women: మహిళలకు ఉచిత శిక్షణ
అమలాపురం టౌన్: హైదరాబాద్ గ్రామీణ బ్యాంకర్లు, ఔత్సాహిక అభివృద్ధి సంస్థ సహకారంతో జిల్లా శ్రీ సత్యసాయి సేవ సంస్థల పర్యవేక్షణలో అమలాపురంలోని శ్రీ సత్యసాయి కల్యాణ మంటపంలో మహిళా యువతకు మగ్గం, జర్దోసిలో ఉచిత శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. 37 రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమానికి కోనసీమ వ్యాప్తంగా 80 మంది మహిళలు శిక్షణకు వచ్చారు.
తరగతులను అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, హైదరాబాద్ బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహిక అభివృద్ధి సంస్థ అసిస్టింట్ డైరెక్టర్ జి.రామారావు ప్రారంభించారు. జిల్లా శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు అడబాల కొండబాబు, అమలాపురం డివిజన్ కన్వీనర్ డాక్టర్ జి.ప్రభాకర్రాజు పర్యవేక్షణలో శిక్షణ తరగతులు మొదలయ్యాయి.
మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించామని ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ రామారావు అన్నారు. మహిళల వస్త్ర అలంకారంలో మగ్గం, జర్దోసి పనులకు విపరీతమైన గిరాకీ ఏర్పడిన క్రమంలో వారి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు ఈ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు శ్రీసత్యసాయి సేవా సంస్థల ప్రతినిధి డాక్టర్ ప్రభాకర్రాజు పేర్కొన్నారు.
వివిధ బ్యాంక్ల ఉన్నతాధికారులు కేశవవర్మ, సుధాకర్ పాల్గొన్నారు. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి నలుగురు ఫ్యాకల్టీలు వచ్చారు. వీరు 37 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు.