Pariksha Pe Charcha Highlights 2024 : ప‌రీక్షా స‌మ‌యంలో.. ప్రధాని మోదీ విద్యార్థుల‌కు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే.. ఇవి ఫాలో అయితే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌తి ఏడాది ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలో విద్యార్థులకు భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విలువైన స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్న విష‌యం తెల్సిందే. 2024 ఏడాది కూడా పీఎం మోదీ విద్యార్థుల‌కు విలువైన స‌ల‌హాలు ఇచ్చారు.

దేశ రాజధానిలోని భారత మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొందరు పాల్గొనగా కోట్లాది మంది ఆన్‌లైన్‌లో వీక్షించారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదని ఈ సందర్భంగా.. మోదీ సూచించారు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువని, అందువల్ల ఈ ప్రోగ్రామ్ తనకు సైతం పరీక్ష లాంటిదేనని అన్నారు. 2024 ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చ  కార్యక్రమానికి 2.26 కోట్ల మంది నమోదు చేసుకున్నారు.

పీఎం మోదీ విద్యార్థుల‌కు ఇచ్చిన బెస్ట్ స‌ల‌హాలు-సూచ‌న‌లు ఇవే..
☛ ఇతరులపై దృష్టి పెట్టకుండా, మీపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఇది మీ ప్రశ్నపత్రంపై దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. క్రమంగా సమాధానాలను కనుగొనడానికి దారి తీస్తుంది. చివరికి సానుకూల ఫలితాలు వస్తాయి.

☛ ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని చెప్పారు. కరోనా కాలాన్ని కూడా ప్రస్తావించారు. కష్ట సమయాలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పారు. కరోనా కాలంలో దేశప్రజలను చప్పట్లు కొట్టమని కోరాను. అయితే ఇది కరోనాను తొలగించదు కానీ సమిష్టి శక్తిని పెంచుతుంది. ఆట స్థలానికి వెళ్లినవారు కొన్నిసార్లు విజేతగా తిరిగి వస్తారు. చాలా మంది ఓటమి పాలవుతారు. ఎవరికి ఏ శక్తి ఉందో దానిని సక్రమంగా వినియోగించుకోవాలి. మంచి ప్రభుత్వాన్ని నడపడానికి, ఈ సమస్యలను పరిష్కరించడానికి సరైన సమాచారం, మార్గదర్శకత్వం క్షేత్రస్థాయి నుంచి రావాలని ప్రధాని చెప్పారు. ఎంతటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా మీరు భయాందోళనలకు గురికావద్దని ప్రధాని పిల్లలకు సూచించారు. దాన్ని ఎదుర్కొని విజయం సాధించాలని సూచనలు చేశారు.

☛ ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొన్ని వారాల్లో పరీక్షలు జరగనున్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టే నిమిత్తం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోదీ ఈవిధంగా సలహా ఇచ్చారు. నేను అవసరం ఉంటేనే ఫోన్ వాడతాను. మొబైల్‌ వినియోగాన్ని తగ్గించుకునేందుకు.. మీ  ఫోన్లలో స్క్రీన్‌ టైం అలర్ట్‌ టూల్స్‌ను ఉపయోగించండి. మొబైల్స్‌ చూస్తూ సమయాన్ని మర్చిపోకూడదు. మనం సమయాన్ని గౌరవించాలి. 

అలాగే పిల్లల ఫోన్ల పాస్‌వర్డ్‌లు కుటుంబసభ్యులు తప్పకుండా తెలుసుకోవాలి.  టెక్నాలజీ నుంచి ఎప్పుడూ దూరంగా జరగకూడదు. కానీ దానిని సానుకూల ప్రభావం చూపేలా మాత్రమే వాడాలి అని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు చేశారు. పరీక్షలకు సన్నద్ధమవుతోన్న తరుణంలో పిల్లలు చిన్నచిన్న లక్ష్యాలు విధించుకొని, క్రమంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. ఈ రకంగా చదువుతూ వెళితే.. పరీక్షలకు పూర్తిగా సిద్ధం అవుతారు అని ప్రధాని తెలిపారు. సరిగా పనిచేయాలంటే మొబైల్ ఫోన్ల లాగే మనిషి శరీరానికీ రీఛార్జింగ్‌ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  విద్యలో ప్రతిభచాటాలంటే శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు.  

☛ ఆరోగ్యకరమైన ఆలోచనల కోసం శారీరక ఆరోగ్యం చాలా చాలా అవసరం. ఇందుకోసం సూర్యకాంతిలో కొంత సమయం పాటు నిలబడటంతో పాటు రోజూ తగినంత నిద్రపోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే సరిపోదు.. రోజూ వ్యాయామం వంటి కార్యకలాపాలు ఫిట్‌నెస్‌కు అవసరం అని ప్ర‌ధాని మోది తెలిపారు.

#Tags