Skip to main content

పంచాయతీరాజ్ వ్యవస్థ - మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌లు

పంచాయతీరాజ్ సంస్కరణల అమలులో కేరళ మొదటి స్థానంలో ఉంది. కర్ణాటక, సిక్కిం రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టంతో పంచాయతీరాజ్ వ్యవస్థను మూడు అంచెలుగా మార్చారు. ఈ చట్టం అమలు తీరును పరిశీలించడానికి బి.ఎస్. రమాదేవి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బిహార్ పంచాయతీరాజ్ వ్యవస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను అధ్యయనం చేయడానికి పలు కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమైనవి..
పురుషోత్తం పాయి కమిటీ (1963), ఎం.టి రాజ్ కమిటీ (1968), జలగం వెంగళరావు కమిటీ (1968), నరసింహం కమిటీ (1971), బీపీఆర్ విఠల్ కమిటీ (1991), నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి.కె. సమరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ (1991). ‘గ్రామ సర్పంచ్‌ను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి, పంచాయతీ సమితీలకు పరోక్ష ఎన్నికలు జరగాలి, గ్రామ పంచాయతీలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి, రాష్ర్ట స్థాయిలో ఆర్థిక సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని సి. నరసింహం కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
పంచాయతీరాజ్‌లో కింది స్థాయి వ్యవస్థ గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కావాల్సిన కనీస జనాభా 500 మంది. ఐటీడీఏ ప్రాంతాల్లో 250 మంది ఉంటే గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయొచ్చు. వార్షికాదాయం రూ . 60 వేలు ఉంటే నోటిఫైడ్ గ్రామ పంచాయతీ, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వాటిని నాన్-నోటిఫైడ్ గ్రామ పంచాయతీలుగా పేర్కొంటారు. 243వ రాజ్యాంగ అధికరణం.. పంచాయతీరాజ్ వ్యవస్థను గ్రామం, గ్రామ పంచాయతీ, మాధ్యమిక స్థాయి, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అని నిర్వచిస్తుంది.

గ్రామసభ
గ్రామసభలో గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. ఈ సభ సంవత్సరానికి రెండుసార్లు సర్పంచ్ అధ్యక్షతన సమావేశమవుతుంది. గ్రామసభ స్విట్జర్లాండ్‌లోని ‘ల్యాంన్స్ గమండ్’ను పోలి ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు గ్రామ సభ నిర్వహించకుంటే సర్పంచ్ పదవి ఖాళీగా ఉందని ప్రకటించవచ్చు. గ్రామంలోని 50 శాతం మంది ఓటర్లు లేదా జనాభాలో పది శాతం ప్రజలు కోరితే గ్రామ సభ నిర్వహించాలి.
గ్రామసభ విధులు
  1. గ్రామ పంచాయతీలో అభివృద్ధి పథకాలలబ్ధిదారుల గుర్తింపు.
  2. పంచాయతీ ‘ఆడిట్’ (తనిఖీ) నివేదికలను ఆమోదించడం.
  3. గ్రామీణాభివృద్ధికి నూతన ప్రణాళికల రూపకల్పన
  4. పన్ను బకాయిదారుల జాబితా ప్రకటించడం
కౌన్సిల్
గ్రామ పంచాయతీకి కౌన్సిల్ శాసనపరమైన విభాగం. కౌన్సిల్‌లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు సభ్యులుగా ఉంటారు. వార్డు సభ్యులు నెలకోసారి సమావేశం కావాలి. గరిష్టంగా 90 రోజుల్లో సమావేశం నిర్వహించాలి. సభ్యులు మూడు నెలల్లో ఒక్కసారైన హాజరు కాకుంటే సభ్యత్వం కోల్పోతారు. గ్రామ పంచాయతీలో కనిష్ట సభ్యుల సంఖ్య అయిదు. గరిష్ట సభ్యుల సంఖ్య 21. పంచాయతీ జనాభా ఆధారంగా వార్డు సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు.

జనాభా

వార్డు సభ్యుల సంఖ్య

300

5

300-500

7

500-1500

9

1500- 3000

11

3000- 5000

13

5000 - 10,000

15

10,000-15000

17

15,000 పైనా

19 నుంచి 21

గ్రామ కార్యదర్శి
గ్రామ సచివాలయ వ్యవస్థను 2002 జనవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పాలనా అధిపతిగా కార్యదర్శి వ్యవహరిస్తారు. గ్రామ పంచాయతీ సమావేశాల అజెండాను సర్పంచ్‌తో సంప్రదించి రూపొందిస్తాడు. గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించి పంచాయతీ సభ్యుల పరిశీలనకు పంపుతాడు. గ్రామసభల సమావేశాల తీర్మానాల అమలుకు చర్యలు తీసుకుంటాడు. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆస్తులపై అతడికి పూర్తి నియంత్రణ అధికారం ఉంటుంది.
గ్రామ పంచాయతీ విధులు
11వ షెడ్యూల్‌లో పొందుపర్చిన 29 అంశాలకు సంబంధించిన విధులను గ్రామ పంచాయతీ నిర్వహిస్తోంది. గ్రామ పంచాయతీ విధులు రెండు రకాలు. అవి.. 1.ఆవశ్యక విధులు, 2. వివేచానాత్మక విధులు.
ఆవశ్యక విధులు
  1. రహదారులు, భవనాలు, పబ్లిక్ టాయిలెట్లు, బావులు, చెరువుల నిర్మాణం, మరమ్మతులు.
  2. శ్మశాన వాటికల నిర్వహణ
  3. జనన మరణాల నమోదు
  4. అంటువ్యాధుల నివారణ, చికిత్స.
  5. కంపోస్ట్ ఎరువుల తయారీ
  6. పశుక్షేత్రాల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ, బందెల దొడ్ల నిర్మాణం, వివాహాల రిజిస్ట్రేషన్, రాష్ర్ట శాసనసభ సూచించిన ఇతర విధులు.
వివేచనాత్మక విధులు
  • సమాజాభివృద్ధి పనుల కోసం స్వచ్ఛంద, శ్రమదాన శిబిరాల నిర్వహణ.
  • విశ్రాంతి గృహల నిర్మాణం, నిర్వహణ.
  • ప్రాథమిక పాఠశాలలు, వైద్యశాలలు, గ్రంథాలయాలు, మందిరాలు, పార్కులు, మార్కెట్ స్థలాల నిర్మాణం, నిర్వహణ.
  • ప్రసూతి, శిశు సంక్షేమ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ.
  • భూ సంస్కరణల అమలు.
  • ఆధునిక సేద్య పద్ధతులపై ప్రచారం.
  • ధాన్యాగారాలు, గిడ్డంగుల నిర్మాణం.
  • వికలాంగులు, అనాథలు, వ్యాధి గ్రస్థులకు చేయూతనివ్వడం
  • వ్యాయామశాలల స్థాపన, ఆటస్థలాలు, సంతలు, జాతరలు, ఉత్సవాల నిర్వహణ, నిరుద్యోగ గణాంకాల నమోదు, విపత్తు సహాయక చర్యలు, రక్షణ ఏర్పాట్లు
  • సహకార సంఘాలకు తోడ్పాటు.
గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు
  • కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్లు, రాష్ర్ట ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసే నిధులు.
  • పన్నుల ద్వారా వచ్చే ఆదాయం (ఇంటిపన్ను, ఆస్తుల బదిలీ పన్ను, ప్రకటనలపై పన్ను, వృత్తి పన్ను, జంతువులపై పన్ను, దుకాణాలపై పన్నులు మొదలైనవి)
  • మూలధనంపై వచ్చే ఆదాయం (విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్లపై వచ్చే అద్దె మొదలైనవి)

మండల పరిషత్

మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మండల పరిషత్ మధ్యస్థ అంచె. 1986లో ఎన్టీరామారావు హయాంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 330 పంచాయతీ సమితిల స్థానంలో 1104 మండలాలను ఏర్పాటు చేశారు. మండల పరిషత్‌లో సుమారు 15 నుంచి 18 గ్రామ పంచాయతీలు, 35 వేల నుంచి 55 వేల జనాభా ఉంటుంది. మండల పంచాయతీని ఒక్కో రాష్ర్టంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. గుజరాత్, కర్ణాటకల్లో తాలుకా పంచాయతీ అని, మధ్యప్రదేశ్‌లో జన్‌పథ్ పంచాయతీ, తమిళనాడులో పంచాయతీ సంఘం, అరుణాచల్ ప్రదేశ్‌లో అంచల్ కమిటీ, ఉత్తరప్రదేశ్‌లో క్షేత్ర పంచాయతీ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మండల పరిషత్ అని వ్యవహరిస్తారు.

మండల పరిషత్‌లోని సభ్యులు
  • ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఓటర్లతో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు(ఎంపీటీసీ).
  • స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఆ ప్రాంతంలో రిజిస్టర్ అయిన ఎమ్మెల్సీ, రాజ్యసభ మెంబర్ సభ్యులుగా ఉంటారు.
  • ఎంపీటీసీ సభ్యులు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ఒకరిని కో ఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకుంటారు.
  • మండల పరిషత్ సమావేశాలకు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. వీరికి ఓటు హక్కు ఉండదు.
  • 3 నుంచి 4 వేల జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక ప్రాదేశిక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు.
  • ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల పదవీ కాలం అయిదేళ్లు.
  • కలెక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు మండల పరిషత్‌లో శాశ్వత ఆహ్వానితులు. వీరికి ఓటు వేసే అధికారం లేదు.
  • ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవస్థను 1986 జూన్‌లో ఏర్పాటు చేశారు.
1987 జనవరి 7న నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

విధులు
గ్రామ పంచాయతీ, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో మండల పరిషత్ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం విత్తనాలు, ఎరువుల సరఫరా, నీటి సౌకర్యం కల్పించి బీడు భూములను సాగులోకి తేవడం, అడవుల పెంపకం, పశుగణాభివృద్ధి, ఆరోగ్యం, పారిశుధ్య నిర్వహణ, ప్రసూతి కేంద్రాలు, టీకాలు, అంటు రోగాల నివారణ, ప్రాథమిక విద్యా సౌకర్యాల కల్పన, పర్యవేక్షణ.
ఆర్థిక వనరులు
  • భూమి శిస్తు, రాష్ర్టం విధించే పన్నులు, ఫీజుల నుంచి వచ్చే వాటా.
  • సామాజిక అభివృద్ధికి సంబంధించిన నిధులు.
  • కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, అఖిల భారత సంస్థలు ఇచ్చే గ్రాంట్లు.
  • మండల పరిషత్ విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం
  • దాతలు ఇచ్చే విరాళాలు
  • మండల పరిషత్ కార్యనిర్వహణాధికారిగా మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీవో)ని రాష్ర్ట ప్రభుత్వం నియమిస్తుంది.

జిల్లా పరిషత్

జిల్లా పరిషత్‌ను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో 9 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌కు జిల్లా పరిషత్ లేదు.

జిల్లా పరిషత్‌లోని సభ్యులు
  • ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ఓటర్లతో ఎన్నికైన సభ్యులు (జెడ్పీటీసీలు)
  • జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు.
  • అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు.
  • జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్‌గా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
  • ప్రతి జిల్లా పరిషత్‌లో జిల్లా మహాసభ ఉంటుంది. ఇందులో జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు.
  • జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)ని రాష్ర్ట ప్రభుత్వం నియమిస్తుంది. ఇతడు జిల్లా పరిషత్‌కు పాలనా పరమైన అధికారిగా విధులు నిర్వహిస్తాడు.
జిల్లా పరిషత్ స్థాయి సంఘాలు
1. ప్రణాళికా, ఆర్థిక స్టాండింగ్ కమిటీ
2. గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ
3. వ్యవసాయ స్టాండింగ్ కమిటీ
4. విద్య, వైద్య సేవల స్టాండింగ్ కమిటీ
5. స్త్రీ, సంక్షేమ స్టాండింగ్ కమిటీ
6. సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ
7. పన్నుల స్టాండింగ్ కమిటీ
  • ప్రతి స్థాయి కమిటీలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవీరీత్యా సభ్యుడిగా ఉంటాడు. కానీ అతడికి ఓటు వేసే అధికారం ఉండదు. ఇతర సభ్యులను నామినేట్ చేస్తాడు.
  • జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల సమావేశాలకు జిల్లా కలెక్టర్ హాజరు కావొచ్చు. కానీ ఓటు హక్కు ఉండదు.
జిల్లా పరిషత్ విధులు
  • జిల్లా పరిషత్ జిల్లాలోని మండల పరిషత్‌ల వార్షిక బడ్జెట్లను ఆమోదిస్తుంది.
  • కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేస్తుంది.
  • కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశాల అమలు.
  • గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల ఆర్థిక విషయాలపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంది.
  • కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు అవసరమయ్యే గణాంక సమాచారాన్ని అందిస్తుంది.
  • జిల్లాలో సెకండరీ పాఠశాలలు, వృత్తి విద్యా పాఠశాలలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంది.
  • జిల్లాలో వైద్య సౌకర్యాల నిర్వహణ.
ఆర్థిక వనరులు
1. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు.
2. అఖిల భారత సంస్థలు అందించే గ్రాంట్లు
3. భూమి పన్ను.
4. ఎండోమెంట్స్,ట్రస్టుల ద్వారా వచ్చే ఆదాయం.
5. ఫీజులు.
6. ప్రజలు, సంస్థలు ఇచ్చే విరాళాలు.
7. మండల పరిషత్‌ల నుంచి వచ్చే కంట్రిబ్యూషన్లు.
8. లాభసాటి సంస్థల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం.
  • 243 (జె) అధికరణం ద్వారా పంచాయతీల ఖర్చులను రికార్డ్ చేయడం. ఆడిటింగ్‌కు సంబంధించి తగిన శాసనాన్ని శాసనసభ చేయాలి.
  • 243 (జెడ్‌డీ) అధికరణం ప్రకారం జిల్లా ప్రణాళికా అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలి.
  • ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రదేశాల్లో పంచాయతీరాజ్ విధానం అమలు కోసం 1994లో ‘దిలీప్‌సింగ్ బురియా’ కమిటీని ఏర్పాటు చేశారు.
  • దిలీప్‌సింగ్ బురియా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం 1996 డిసెంబర్ 24న ఆమోదించింది.
ఈ కమిటీ ప్రతిపాదించిన మూడంచెలు
1. గ్రామసభ
2. గ్రామ పంచాయతీ
3. పంచాయతీ సమితి/ తాలుకా పంచాయతీ
Published date : 09 Oct 2015 03:27PM

Photo Stories