Skip to main content

భారత రాజ్యాంగం లౌకిక స్వభావం-పరిశీలన

భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసం లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వాసాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే. లౌకిక రాజ్యమంటే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు, పరిపాలన.. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం, పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించి ఊహించి చెప్పే ప్రయత్నం చేస్తుంది.

లౌకికవాదం అనే పదాన్ని 19వ శతాబ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్ హోలియోక్ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్ భాషలోని Seculum (సెక్యులమ్) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్) అని దీని అర్థం. ఆ తర్వాత వాడుకలో ప్రభుత్వాన్ని, పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం.. పాలన చట్టం, రాజ్యాంగం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి.

లౌకిక భావన, వివిధ పార్శ్వాలు
లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ. పూర్వకాలంలో ప్రజల అన్ని విషయాలను మతం, మతాచార్యులే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు. సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు.

భారతీయ భావన భిన్నం
పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణామాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు, విశ్వాసాలు, జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యాలుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం, రెండోది భిన్న మతాల మధ్య సామరస్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు.
ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు.
  • ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు. విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’.
లక్షణాలు
  • ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు.
  • అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు.
  • మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం.
  • న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం.
  • మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం
లౌకికతత్వం (సెక్యులర్) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది.

లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు
రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమాలలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరుడు కలిగి ఉండాలని కోరడం, లౌకికతత్వానికి మచ్చుతునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు.

ప్రవేశిక - లౌకిక భావన
భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన, విశ్వాసం, నమ్మకం అనే అంశాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు.

ప్రాథమిక హక్కులు- లౌకికతత్వం
రాజ్యాంగం మూడో భాగంలో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి. ముఖ్యంగా..
  • ప్రకరణ-14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ.
  • ప్రకరణ-15 ప్రకారం మత ప్రాతిపదికపై ప్రజల పట్ల వివక్షను నిషేధించడం.
  • ప్రకరణ-16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొన్ని మినహాయింపులు తప్ప అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం.
  • ప్రకరణ-25 ప్రకారం ప్రతి వ్యక్తి తన ఆత్మ ప్రబోధం మేరకు తనకు నచ్చిన మతాన్ని అవలంబించడం, ఆచరించడం, ప్రచారం చేసుకోవడం, మత మార్పును చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పించడం.
  • ప్రకరణ-26 ప్రకారం మత సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే హక్కును గుర్తించడం.
  • ప్రకరణ-27 ప్రకారం మతం ఆధారంగా పన్నులు విధించకుండా నిషేధించడం.
  • ప్రకరణ-28 ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధించడం.
  • మొదలైన హక్కులు, స్వేచ్ఛలు లౌకి క తత్వానికి ఆచరణాత్మక అంశాలు.
  • నిర్దేశిక నియమాల్లో ప్రకరణ 44 ప్రకారం ఉమ్మడి పౌర నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేయడం ద్వారా దేశ ఐక్యత, సమగ్రతలకు మత విశ్వాసాలు సమస్యగా పరిణమించకుండా నియంత్రించొచ్చు.
రాజ్యాంగం ప్రకారం ఏ ప్రజా ప్రతినిధికి పోటీ చేయడానికైనా మతం అడ్డంకి కాదు. ఉదా:
  • రాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-58)
  • ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-66)
  • గవర్నర్ నియామకం (ప్రకరణ-155)
  • పార్లమెంట్, శాసనసభలకు పోటీ చేయడం (ప్రకరణ 80, 173) మొదలైన అంశాలు.
  • అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించడం (ప్రకరణ-325) కూడా లౌకికవాదానికి ఉదాహరణలుగా చెప్పొచ్చు.
లౌకికతత్వం, వివాదాలు, సుప్రీంకోర్టు తీర్పులు
రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం ప్రత్యక్షంగా పేర్కొననప్పటికీ భారతదేశం లౌకిక రాజ్యమే అని ప్రాథమిక హక్కుల్లోని ప్రకరణలు 25 నుంచి 28 వరకు స్పష్టంగా తెలియజేస్తున్నాయని సుప్రీంకోర్టు.. జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు (1974)లో తీర్పు చెప్పింది. అదేవిధంగా 1994లో ఎస్‌ఆర్ బొమ్మాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో లౌకికతత్వం రాజ్యాంగంలోని మౌలిక సారాంశంలో అంతర్భాగమని, లౌకికతత్వాన్ని ఉల్లంఘించే రాష్ట్రాలపై ప్రకరణ 356 ప్రకారం చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. లౌకికతత్వాన్ని సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా చూడాలని, పాఠశాలలో వివిధ మత విలువలను విద్యార్థులకు బోధించడం ద్వారా ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటానికి, పరమత సహనానికి తోడ్పడుతుందని అది లౌకికతత్వానికి విఘాతం కాదని 2003లో అరుణారాయ్ వర్సెస్ ఇండియన్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది.

లౌకికతత్వాన్ని పెంపొందించే అంశాలు
  • శాస్త్రీయ విద్యను, తార్కిక ఆలోచనను ప్రోత్సహించాలి.
  • రాజకీయాల్లో మత సంస్థలు పాల్గొనరాదు.
  • మత విశ్వాసాలతో కూడిన మత ప్రదర్శనలను నిషేధించాలి.
  • అధికార హోదాలో ఎవరూ మత ప్రదేశాలను సందర్శించరాదు.
  • వ్యక్తి ప్రజా జీవితంలో తాము నిర్వహించే పాత్రలో తన వ్యక్తిగత మత విశ్వాసాలను చొప్పించరాదు.
ఏది ఏమైనా మొత్తానికి మత స్వేచ్ఛ, నమ్మకాలు వ్యక్తిగత ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడినంతవరకు ఫర్వాలేదు కానీ మత స్వేచ్ఛల పేరుతో మత సామరస్యానికి చేటు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే ప్రతి చిన్న విషయం అలజడికి కారణమై దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమించవచ్చు. కారల్‌మార్క్స్ అన్నట్లు మతం మత్తు మందుగా మారుతుంది. మతోన్మాదానికి దారితీస్తుంది. ఉన్మాదంగా చెలరేగుతుంది. మానవ సంస్కృతిని మింగేస్తుంది. దీనికి చరిత్రలో చాలా ఆధారాలున్నాయి. మతోన్మాద చరిత్ర ఎప్పటికీ పునరావృతం కారాదు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే అవి పునరావృతం అవుతాయి. లౌకికతత్వం వర్ధిల్లాలి. రాజ్యాంగ, చట్టపాలన కొనసాగాలి.
Published date : 23 Jun 2016 05:21PM

Photo Stories