Skip to main content

ప్రాంతీయ అసమానతలు

ఒక దేశ అభివృద్ధి, సమైక్యతకు సంతులిత ప్రాంతీయాభివృద్ధి తప్పనిసరి. ప్రాంతాల మధ్య అసమానతలు.. ఆయా ప్రాంతాల మధ్య వైషమ్యాలను పెంచి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయి.మన దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందగా, మరికొన్ని రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. ఒక రాష్ర్టంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించేందుకు పంచవర్ష ప్రణాళికల లక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయాభివృద్ధిని కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ప్రాంతాల మధ్య అసమానతలకు కారణాలు
  1. సహజసిద్ధ అంశాలు
  2. చారిత్రక అంశాలు
  3. సహజ వనరులు
  4. ప్రభుత్వ విధానం
  5. కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
  6. ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
  7. పాలనా వ్యవస్థ
  8. హరిత విప్లవం

ప్రాంతీయ అసమానతల కొలమానాలు
  1. రాష్ర్ట తలసరి ఆదాయం
  2. పేదరిక స్థాయి
  3. మానవాభివృద్ధి సూచిక
  4. పారిశ్రామిక ఉద్యోగిత
  5. సహజ వనరుల లభ్యత, నీటిపారుదల సౌకర్యాలు
  6. పట్టణీకరణ
  7. విద్యుచ్ఛక్తి వినియోగం
  8. బ్యాంకు డిపాజిట్లు

రాష్ర్ట తలసరి ఆదాయం
  • 2012-13 ధరల్లో తలసరి ఆదాయ జాతీయ సగటు రూ.67,839 ఉండగా, హర్యానా రూ.1,19,158 తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ర్ట (రూ.1,03,991), తమిళనాడు (రూ.98,628), గుజరాత్ (రూ.96,976), కేరళ (రూ.88,527), పంజాబ్ (రూ.84,526), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (రూ.78,958), కర్ణాటక (రూ.76,578)లు ఉన్నాయి. వీటి తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువ.
  • బిహార్ (రూ.27,202), ఉత్తరప్రదేశ్ (రూ. 33,616), అసోం (రూ.40,475), మధ్యప్రదేశ్ (రూ.44,989), ఒడిశా (రూ.49,241)లు జాతీయ సగటు కంటే తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి.
  • రాష్ర్ట తలసరి ఆదాయాన్ని సూచికగా తీసుకుంటే ఆయా రాష్ట్రాల మధ్య అసమానతలు తెలుస్తాయి. కానీ, ఈ పద్ధతిలో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలను తెలుసుకోవడానికి వీలు కాదు.

పేదరిక స్థాయి
  • రిజర్‌‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన Handbook of Statistics on Indian Economy 2013-14 ప్రకారం 2011-12 లో పేదరిక రేఖకు దిగువన ఉన్న దేశ జనాభా 21.9 శాతం.
  • పేదరిక రేఖకు దిగువన ఉన్న జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు.. కేరళ (7.1%), హిమాచల్‌ప్రదేశ్ (8.1%), పంజాబ్ (8.3%), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (9.2%), హర్యానా (11.2%).
  • పేదరిక రేఖకు దిగువన ఉన్న జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు.. బిహార్ (33.7%), ఒడిశా (32.6%), అసోం (32%), మధ్యప్రదేశ్ (31.7%), ఉత్తరప్రదేశ్ (29.4%)

మానవాభివృద్ధి సూచిక
  • ప్రాంతీయ అసమానతలను పరిశీలించే క్రమంలో ఆదాయ అసమానతలతోపాటు మానవాభివృద్ధిని నిర్ణయించే అక్షరాస్యత, లింగ నిష్పత్తి, శిశు మరణాలు మొదలైన అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ అక్షరాస్యత 74.04% కాగా, 93.91% అక్ష్యరాస్యతతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దీంతోపాటు ఆ రాష్ర్టంలో స్త్రీల అక్షరాస్యత 91.98%గా, స్త్రీల జనాభా ప్రతి 1000 మంది పురుషులకు 1084గా, శిశు మరణాల రేటు ప్రతి 1000కి 12 (2009)గా ఉంది.
  • అక్షరాస్యతలో బిహార్ 63.82 శాతంతో, స్త్రీల అక్షరాస్యతలో రాజస్థాన్ 52.66 శాతంతో అట్టడుగున ఉన్నాయి. దీంతోపాటు స్త్రీల జనాభా హర్యానాలో ప్రతి 1000 మంది పురుషులకు 877గా, శిశు మరణాలు ప్రతి వెయ్యికి 67గా (చివరి స్థానం) ఉంది.
  • బీమారు రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్, అసోం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వృద్ధిరేటులో మెరుగుదల ఉన్నా, మానవాభివృద్ధిని నిర్ణయించే సూచికల్లో మెరుగుదల లేదు.
  • తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న హర్యానా, పంజాబ్‌లలో అక్షరాస్యత, స్త్రీల జనాభా విషయంలో ప్రతికూల గణాంకాలు నమోదయ్యాయి.
  • మానవాభివృద్ధి 2007-08లో జాతీయ స్థాయిలో 0.467 ఉండగా, కేరళ (0.790), ఢిల్లీ (0.750), హిమాచల్‌ప్రదేశ్ (0.652), గోవా (0.617), పంజాబ్ (0.605)లు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఛత్తీస్‌గఢ్ (0.358), ఒడిశా (0.362), బిహార్ (0.367), మధ్యప్రదేశ్ (0.375), జార్ఖండ్ (0.376)లు చివరి స్థానాల్లో ఉన్నాయి.

పారిశ్రామికాభివృద్ధి - ఉద్యోగిత
  • పారిశ్రామిక స్థిర మూలధనంలో పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ర్ట, గుజరాత్‌లు 34.60%, పశ్చిమబెంగాల్ 24.65% వాటా కలిగి ఉన్నాయి. అంటే ఈ మూడు రాష్ట్రాలే 59.25% వాటాను కలిగి ఉన్నట్లు అర్థమవుతుంది.
  • ఇవి 63.03% ఉద్యోగిత, 63.95% పారిశ్రామికోత్పత్తి కలిగి ఉండటం తీవ్ర అసమానతలను తెలుపుతుంది.

సహజ వనరుల లభ్యత
  • పంజాబ్, హర్యానా మొదలైన రాష్ట్రాల్లో నీటిపారుదల సౌకర్యాలు, సహజ వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల అక్కడ వ్యవసాయాభివృద్ధి జరిగింది.
  • ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాలు కూడా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాయి.

పట్టణీకరణ
  • అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీకరణ పెరిగి, పట్టణ జనాభా ఎక్కువగా ఉంటుంది.
  • జాతీయ స్థాయి పట్టణ జనాభా 31.2% కాగా, ఇది తమిళనాడులో 48.4%, మహారాష్ర్టలో 45.2%, గుజరాత్‌లో 42.6%, కర్ణాటకలో 38.6%, పంజాబ్‌లో 37.5% ఉంది.
  • బిహార్ (11.3%), అసోం (14.1%), ఒడిశా (16.7%), ఉత్తరప్రదేశ్ (22.3%) లాంటి రాష్ట్రాల్లో పట్టణ జనాభా తక్కువగా ఉంది.

విద్యుచ్ఛక్తి వినియోగం
  • 2009-10 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయి తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం 121.2 కిలోవాట్లు కాగా, జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు.. ఢిల్లీ (508.8 కిలోవాట్లు), పంజాబ్ (257.3 కిలోవాట్లు), తమిళనాడు (208.5 కిలోవాట్లు).
  • విద్యుచ్ఛక్తి వినియోగం తక్కువగా ఉన్న రాష్ట్రాలు.. బిహార్ (20.5 కిలోవాట్లు), ఉత్తర ప్రదేశ్ (83.4 కిలోవాట్లు), మధ్యప్రదేశ్ (73.4 కిలోవాట్లు).

వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
  • జాతీయ స్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011, మార్చి నాటికి రూ.33,174.
  • వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు ఎక్కువగా ఢిల్లీలో (రూ.2,85,400), మహారాష్ర్టలో (రూ. 82,380) ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు ల డిపాజిట్లు తక్కువగా ఉన్న రాష్ట్రాలు.. బిహార్ (రూ..9,667, అసోం రూ.16,393).

ప్రాంతీయ అసమానతలు- ప్రణాళికలు
  • మన దేశంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను మళ్లించేందుకు వీలుగా, ఆయా ప్రాంతాల్లో సంస్థల ను స్థాపించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తుంది.
  • వెనుకబడిన ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, నీటి వసతి, నైపుణ్యం గల శ్రామికుల లభ్యతలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది.
  • మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల గురించి ప్రస్తావన లేదు. రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాంతీయ అసమానతల తగ్గింపు అవసరాన్ని గుర్తించారు. దానికి అనుగుణంగా వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులను పెంచి సంతులిత ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు.
  • మూడో పంచవర్ష ప్రణాళికలో సంతులిత ప్రాంతీయాభివృద్ధికి సంబంధించి 9వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
  • నాలుగో పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా సన్నకారు రైతుల అభివృద్ధి ఏజెన్సీ (FDA), ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికుల ఏజెన్సీ (MFAL), వర్షాభావ ప్రాంతాల కార్యక్రమం (DPAP), క్యాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ (CSRE) తదితర కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.
  • ఐదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు నాలుగో పంచవర్ష ప్రణాళికలోని కార్యక్రమాలను కొనసాగించారు.
  • ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించారు. అందులో భాగంగా ప్రాంతీయ ప్రణాళికలు, ఉప ప్రణాళికలను అమలుచేసి జాతీయాభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేశారు.
  • ఏడో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభి వృద్ధికి రెండు అంశాలను గుర్తించారు. అవి..
  1. వ్యవసాయ ఉత్పాదకత, మానవ వనరుల సామర్థ్యం పెంపు.
  2. ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం. వీటికి అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ఎనిమిదో ప్రణాళిక నుంచి ప్రణాళిక వ్యూహం సూచనాత్మక ప్రణాళికకు మారింది. ఈ క్రమంలో ప్రాంతీయ అసమానతల తగ్గింపునకు సంబంధించి చొరవ తగ్గినా, అందుకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారు. అవి..
పర్వత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (హిల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) ఈశాన్య కౌన్సిల్ (నార్‌‌త ఈస్టర్‌‌న కౌన్సిల్)
  • సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)
  • ఎడారి అభివృద్ధి కార్యక్రమం (డిజర్‌‌ట డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)
  • తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు ప్రైవేటు పెట్టుబడులు తోడ్పడలేదని, కాబట్టి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు.
  • పదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభివృద్ధి కోసం రాష్ట్రాల వారీగా వృద్ధి లక్ష్యాలను నిర్ణయించారు.
  • పదకొండో ప్రణాళికలో వెనుకబడిన ప్రాంతాల కోసం వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధిని (బ్యాక్‌వార్‌‌డ రీజియన్‌‌స గ్రాంట్ ఫండ్- BRGF) ఏర్పాటు చేశారు.
  • పన్నెండో ప్రణాళికలో BRGF నిధుల వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు.
  • పారిశ్రామికంగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి నిధులను వినియోగించాలని పేర్కొన్నారు.
Published date : 12 Jan 2017 03:28PM

Photo Stories