Skip to main content

బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపం

బ్యాంకులు ద్రవ్యం (డబ్బు)తో వ్యాపారం చేస్తూ లాభాలు గడించే వ్యాపార సంస్థలు. ఇవి ప్రజల నుంచి డబ్బు రూపంలో డిపాజిట్లు సేకరిస్తాయి. వ్యవసాయదారులు, పరిశ్రమలు, వ్యాపారస్తులు, వ్యక్తులకు రుణ పరపతిని సమకూరుస్తాయి. ప్రజా సంక్షేమానికి, ప్రభుత్వ విధులకు ఖర్చుచేసే ప్రభుత్వ వ్యయమంతా బ్యాంకుల ద్వారానే క్షేత్ర స్థాయికి చేరుతుంది. ప్రపంచంలో రెండు రకాలైన బ్యాంకింగ్ వ్యవస్థలున్నాయి. అవి..
1) బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ: కేంద్రీకృత ప్రధాన కార్యాలయం ఆధారంగా వివిధ ప్రదేశాల్లో బ్రాంచ్‌లను విస్తరించి బ్యాంకింగ్ విధులను నిర్వర్తించే వ్యవస్థ. ఇది ఇంగ్లండ్, ఇండియాల్లో అమలులో ఉంది.
2) యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ: ఒక్కో బ్యాంక్‌ను విడివిడిగా స్థాపించి, వాటి నిర్వహణ, అస్తిత్వం ప్రత్యేకంగా ఉండే వ్యవస్థ. వీటికి బ్రాంచ్‌లు ఉండవు. అమెరికాలోని బ్యాంకులు ఈ రకానికి చెందినవి.
 
కేంద్ర బ్యాంక్ - భారత రిజర్వ్ బ్యాంక్
బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యున్నతమైంది కేంద్ర బ్యాంక్. దేశంలోని మిగిలిన బ్యాంకులన్నీ దీని ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాలకనుగుణంగా కోశ వ్యవహారాలను నిర్వహిస్తూ బ్యాంకింగ్, ద్రవ్య మార్కెట్‌లను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ, క్రమబద్ధీకరించే సంస్థను కేంద్ర బ్యాంక్ అంటారు.
ప్రపంచంలో అతి ప్రాచీన కేంద్ర బ్యాంక్ ‘రిగ్స్ బ్యాంక్’. దీన్ని క్రీ.శ.1656లో స్వీడన్‌లో నెలకొల్పారు. ఇంగ్లండ్‌లోని కేంద్ర బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ (1694) నమూనాలో జేఎం కీన్స్ ప్రణాళిక ఆధారంగా మన దేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను 1935 ఏప్రిల్ 1న నెలకొల్పారు. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934 ప్రకారం మొదట రూ.5 కోట్ల మూల ధనంతో ప్రారంభించారు. ఇది భారతదేశపు కేంద్ర బ్యాంక్. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అలాగే ముంబై, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ఆర్‌బీఐ కార్యకలాపాలను నిర్వర్తించే కార్యనిర్వహణాధికారిని గవర్నర్ అంటారు. 1949 జనవరి 1న ఆర్‌బీఐని జాతీయం చేశారు.
 
ఆర్‌బీఐ ముఖ్య విధులు

1) కరెన్సీ నోట్ల జారీ: దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించి, జారీ చేసే అధికారం ఆర్‌బీఐకు మాత్రమే ఉంది. దీన్ని ద్రవ్య విధానం అంటారు. ద్రవ్య సరఫరా పెరిగితే మార్కెట్లో వడ్డీరేటు తగ్గుతుంది. ద్రవ్య సరఫరాను ఆర్‌బీఐ తగ్గిస్తే మార్కెట్లో వడ్డీ రేటు పెరుగుతుంది. ప్రారంభంలో ఆర్‌బీఐ అనుపాత నిల్వల పద్ధతి ఆధారంగా కరెన్సీ నోట్లను జారీ చేసేది. బంగారాన్ని ప్రామాణికంగా తీసుకొని కరెన్సీ నోట్లను ముద్రించేది. ద్రవ్యం యూనిట్ విలువ, నిర్దేశిత బరువుగల బంగారం విలువకు సమానంగా చూసే పద్ధతిని స్వర్ణ ప్రమాణం అంటారు. ఈ స్వర్ణ ప్రమాణాన్ని 1957లో రద్దు చేశారు. కరెన్సీ నోట్ల జారీలో ఆర్‌బీఐ 1956 నుంచి ‘కనీస నిల్వల పద్ధతి’ (Minimum reserve system)ని అనుసరిస్తోంది. ప్రస్తుతం ఈ పద్ధతే అమల్లో ఉంది. ఈ పద్ధతిలో 1957 నుంచి రూ.200 కోట్ల కనిష్ట నిధిని నిర్ణయించారు. దీనిలో రూ.115 కోట్లు బంగారం రూపంలో, రూ.85 కోట్లు విదేశీ మారకం రూపంలో నిల్వ ఉంచుకొని ఆర్‌బీఐ కరెన్సీని జారీ చేస్తుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ రూ.1000, రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10, రూ.5, రూ.2 కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. నల్ల ధనాన్ని అదుపులో ఉంచేందుకు 1978లో రూ.1000 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ ఉపసంహరించింది. తర్వాత 2000 అక్టోబర్ 9 నుంచి తిరిగి రూ.1000 నోట్ల జారీని ప్రవేశపెట్టింది.
 
రూ.1 నోటు, నాణేలను, అంతకన్నా తక్కువ విలువ గల నాణేలను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. ఆర్‌బీఐ వాటిని చెలామణీలో ఉంచుతుంది. రూ.1 నోటుపై భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఇతర కరెన్సీ నోట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది.
 
 2) ప్రభుత్వానికి బ్యాంకర్: ఆర్‌బీఐని భారత ప్రభుత్వానికి బ్యాంకర్‌గా వ్యవహరిస్తారు. ఇది ఆర్థిక విషయాల్లో భారత ప్రభుత్వానికి సలహాదారుగా, ప్రతినిధి (ఏజెంట్)గా సహకారం అందిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు (జమ్మూ కశ్మీర్ మినహా) ఆర్థిక ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ప్రభుత్వాల తరఫున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది. చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వానికి ఆర్‌బీఐ విదేశీ మారక ద్రవ్యాన్ని సరఫరా చేస్తుంది. ప్రభుత్వం తరఫున విదేశీ కరెన్సీని కొంటుంది, అమ్ముతుంది. 
 
3) బ్యాంకులకు బ్యాంకర్: ఆర్‌బీఐ తన ఆధీనంలోని బ్యాంకులకు కూడా బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ చట్టం ప్రకారం తమ దగ్గరున్న మొత్తం డిపాజిట్ల విలువలో నిర్ణీత శాతాన్ని ఆర్‌బీఐ వద్ద నగదు నిల్వలుగా ఉంచాలి. దీన్ని ’నగదు నిల్వల నిష్పత్తి’ (Cash Reserve Ratio-CRR) అంటారు. దీన్ని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. ఇది 3 నుంచి 15 శాతం మధ్య ఉంటుంది. మార్కెట్లో ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడమే దీని ప్రధాన ఉద్దేశం. అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులకు రుణ సౌకర్యం కల్పించి ఆర్‌బీఐ అంతిమ రుణ దాతగా వ్యవహరిస్తుంది. 
 
4)విదేశీ మారక నిల్వల సంరక్షణ కర్త: ఆర్‌బీఐ విదేశీ మారక నిల్వలను పరిరక్షిస్తుంది. ఇతర దేశాల కరెన్సీతో మన దేశ కరెన్సీ మారకపు రేటును స్థిరంగా ఉంచడానికి ఆర్‌బీఐ ప్రయత్నిస్తుంది. దేశంలో విదేశీ మారక ద్రవ్య వినియోగాన్ని క్రమబద్ధం చేస్తుంది.
 
 5) పరపతి నియంత్రణ: వాణిజ్య బ్యాంకులిచ్చే పరపతి (రుణాల)ని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. ఈ చర్యల ద్వారా ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులను అదుపు చేయొచ్చు. 
 
6) క్లియరింగ్ హౌస్‌ల నిర్వహణ: ప్రతి వాణిజ్య బ్యాంక్ ఆర్‌బీఐ వద్ద ‘ఖాతా’ కలిగి ఉంటుంది. ఏదైనా వాణిజ్య బ్యాంక్ ఖాతాదారు మరో బ్యాంక్‌కు చెందిన చెక్కును తన ఖాతాలో జమ చేసినప్పుడు, ఆ ఖాతాదారుకు చెందిన బ్యాంక్ ఆర్‌బీఐ వద్దకు దాన్ని క్లియర్ చేయడానికి పంపిస్తుంది. ఆర్‌బీఐ తన వద్ద ఉన్న సంబంధిత వాణిజ్య బ్యాంక్ ఖాతా నుంచి ఆ సొమ్ము ను, చెక్‌ను క్లియరింగ్‌కు పంపించిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ సర్దుబాటంతా స్వ ల్ప కాలంలోనే జరుగుతుంది. ఈ ప్రక్రియను క్లియరింగ్ హౌస్‌లు నిర్వహిస్తాయి. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, కాన్పూర్, నాగ్‌పూర్, పట్నా, న్యూఢిల్లీల్లో క్లియరింగ్ హౌస్‌లను ఆర్‌బీఐ నెలకొల్పింది. 
 
7) వ్యవస్థాపక విధులు: నూతన బ్యాంక్ శాఖల ఏర్పాటుకు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పరపతి అవసరాలను తీర్చడానికి, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన విత్తాన్ని సమకూర్చడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ   NABARD, IDBI, SIDBI, IIBI, IFCI వంటి సంస్థలను స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధిని పటిష్టం చేస్తోంది. 
Published date : 09 Sep 2016 02:43PM

Photo Stories