Skip to main content

కావ్య స్వరూపం - ప్రయోజనాలు -శైలి

కావ్య స్వరూపం
‘కవిః కర్మమ్ కావ్యమ్’ - కవి కలం నుంచి జాలువారిన అపూర్వ సృష్టి కావ్యం. కవి ఆత్మీయతలు కావ్యంలో ప్రతిఫలిస్తాయి. ప్రాచీనుల దృష్టిలో కవిత్వం అంటే కేవలం ఛందోబద్ధ రచనగా రూఢమైంది. పద్యం, గద్యం, పద్య గద్యాత్మక చంపూ కావ్యమైనా కావ్యమే.
కాంతా సమ్మితమైన కావ్యానికి భారతీయ ఆలంకారికులు, పాశ్చాత్య విమర్శకులు ఇచ్చిన నిర్వచనాల ద్వారా కావ్య స్వరూపాన్ని నిర్ధారించొచ్చు.

భారతీయ ఆలంకారికుల కావ్య నిర్వచనాలు
భరతుడు:
‘ఇతివృత్తంతు కావ్య శరీరమ్’.. నాట్యశాస్త్రంలో ఇతివృత్తమే కావ్య శరీరమని చెప్పారు.
దండి: ‘కావ్యాదర్శం’లో ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కావ్యమ్’.. మనోహరమైన అర్థంతో కూడిన పదాల సమూహమే కావ్యమన్నారు.
భామహుడు: ‘కావ్యాలంకారం’లో ‘శబ్దార్థౌసహితౌ కావ్యమ్’.. హితంతో కూడిన శబ్దార్థాల సమూహమే కావ్యమని చెప్పారు.
రుద్రటుడు: శబ్దార్థాల సమాహారమే కావ్యమన్నారు.
భోజుడు: సరస్వతీ కంఠాభరణంలో ‘నిర్దోషం గుణవత్కావ్యమలంకృతై రలంకృతమ్ రసాన్వితం కవిః కుర్వన్ కీర్తిం ప్రీతించవిదంతి’.. దోషరహితంగా, గుణసహితంగా, అలంకార యుక్తంగా రసాన్వితమైన కావ్యాన్ని రచించిన కవి యశాన్ని, ఆహ్లాదాన్ని పొందగలడు.
మమ్మటుడు: ‘తదదోషౌశబ్దార్థౌ సగుణావనలంకృతే పునఃక్వాపికావ్యమ్’.. దోష రహితంగా, గుణ సహితంగా ఉన్న శబ్దార్థాలే కావ్యమని, ఒక్కొక్కసారి అలంకార రహితమైనా దాన్ని కావ్యంగా పరిగణించవచ్చని చెప్పారు.
హేమచంద్రుడు: మమ్మటుడిలా మరింత స్పష్టంగా ‘అదోషౌసగుణౌ సాలంకారౌచ శబ్దార్థౌ కావ్యమ్’.. దోష రహితమైన, గుణసహితమైన, సాలంకారమైన శబ్దార్థాలే కావ్యమని చెప్పారు.
విశ్వనాథుడు: సాహిత్య దర్పణంలో మమ్మటుడు, హేమచంద్రుడు చెప్పిన నిర్వచనాలను ఖండించారు. ఆయన అభిప్రాయంలో రస సంబంధ దోషమే దోషమని, శాబ్దిక దోషాలున్నా కావ్యత్వ హాని జరగదని రస ప్రాధాన్యంలో ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నారు. రస ప్రాధాన్య దృష్టితో రసవత్తరమైన ఒక మహావాక్యమే కావ్యమన్నారు.
జగన్నాథ పండిత రాయలు: విశ్వనాథుడి నిర్వచనంలో అతివ్యాప్తి, అవ్యాప్తి దోషాలున్నాయని జగన్నాథ పండిత రాయలు విమర్శించారు. రసం లేకున్నా లోకోత్తర చమత్కార జనకాలైన వ్యంగ్య రచనలు లోకంలో కావ్యాలుగా గొప్పగా విలసిల్లుతున్నాయన్నారు. ఆయన ‘రమణీయార్థక ప్రతిపాదక శబ్దఃకావ్యమ్’.. రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దాల సమూహమే కావ్యమన్నారు.
రమణీయమైంది రసవత్తరం కాకపోదని, విశ్వనాథుడి రస ప్రాధాన్యం కూడా ఇందులో ఉన్నందువల్ల దీన్ని నిర్దుష్టమైన నిర్వచనంగా ఆలంకారికులు నిర్ధారించారు.
వామనుడు ‘రీతి’ని కావ్యాత్మగా నిర్వచించారు. ఆనంద వర్థనుడు ‘ధ్వని’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పీయూష వర్థనుడు పండిత రాయల అభిప్రాయానికి అనుగుణంగా కావ్యాన్ని నిర్వచించారు. శౌద్ధోదని.. విశ్వనాథుడి రస సిద్ధాంతానికి అనుగుణంగా కావ్యాన్ని ప్రతిపాదించారు. కుంతకుడు వక్రోక్తి సిద్ధాంతాన్ని వ్యక్తీకరించారు. క్షేమేంద్రుడు ఔచిత్య సిద్ధాంతాన్ని నిర్వచించారు.
భారతీయ ఆలంకారికుల అభిప్రాయాలను అనుసరించి దోష రహితమైన, గుణ సహితమైన, రసవత్తరమైన రమణీయ శబ్దార్థాల సముదాయాన్ని కావ్యంగా పరిగణించడం సమంజసంగా ఉంటుంది.

పాశ్చాత్య విమర్శకులు - కావ్య నిర్వచనాలు
శామ్యూల్ జాన్సన్:
కవిత్వమంటే ఛందోబద్ధమైన రచన అన్నారు. బుద్ధి భావనలతో ఆనంద సత్యాలను సమైక్యంగా సంఘటించే కళగా పేర్కొన్నారు.
వ‌ర్డ్స్‌వ‌ర్త్‌: ప్రశాంత మానసిక స్థితిలో ఉద్రిక్తత నుంచి ఆవిర్భవించే తీవ్ర అనుభూతుల స్వచ్ఛంద విజృంభణమే కవిత్వమని చెప్పారు.
షెల్లీ: సాధారణంగా భావానుగుణమైన వ్యక్తీకరణమే కవిత్వం అన్నారు.
హాజ్లిట్: షెల్లీ అభిప్రాయాన్ని మరికొంత స్పష్టంగా వివరిస్తూ భావనాశక్తికి అనుకూలమైన శబ్ద సముదాయమే కవిత్వం అని చెప్పారు.
కార్లయిల్: సంగీత లయాత్మక భావనే కవిత్వం అన్నారు.
మాథ్యూ ఆర్నాల్డ్: ‘సత్య నిబంధనలతో కూడిన జీవిత విమర్శనమే కవిత్వం’ అన్నారు.
కోల్‌రిడ్జి: ఉత్తమ పదాలను సముచిత రీతిలో అమర్చడమే కవిత్వం అని చెప్పారు.
ఎడ్గార్ ఎలెన్ పో: లయాత్మక సౌందర్య సృష్టి కవిత్వం అని చెప్పారు.
పాశ్చాత్య విమర్శకుల్లో ఎడ్గార్ ఎలెన్ పో నిర్వచనాన్ని ఉత్తమమైందిగా విమర్శకులు పరిగణించారు.

కావ్య ప్రయోజనాలు
ఆలంకారికుల్లో మమ్మటుడు, అభినవ గుప్తుడు, ఆనంద వర్థనుడు, భామహుడు, జగన్నాథ పండిత రాయలు వంటివారు కావ్య ప్రయోజనాలను సవివరంగా చర్చించారు. పాశ్చాత్య విమర్శకులు లోవెల్, జాన్ డ్రెడైన్, స్కాలిజర్ వంటివారు కావ్య ప్రయోజనాలను వివరించారు. వాటిని పరిశీలిద్దాం.
మమ్మటుడు:
1) యశస్సు, అర్థం లభిస్తుంది.
2) వ్యవహార జ్ఞానం సిద్ధిస్తుంది.
3) అమంగళ పరిహారం కలుగుతుంది.
4) జీవన్ముక్తి ప్రదాయకాలైన ఆహ్లాద తన్మయత్వాలు కలుగుతాయి.
అభినవ గుప్తుడు: కావ్యం కాంతా సమ్మితంగా ఉపదేశం చేస్తుంది.
భామహుడు:
1) సత్కావ్యం ధర్మార్థ కామమోక్షాదులైన చతుర్విధ పురుషార్థాలను కలిగిస్తుంది.
2) లలిత కళా పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
3) సత్కీర్తిని, నిరంతర ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
జగన్నాథ పండిత రాయలు: సాహితీవ్రతుడైన కవికి ఎనలేని గౌరవం కలుగుతుందని చెప్పారు. సాహితీవ్రతుడు కానివాడు వ్యాసుడైనా, గౌతముడైనా, పతంజలైనా కానిమ్ము వానికి తిరస్కారం, పురస్కారం చూపక నా శిరస్సు ఉదాసీనతను ప్రకటిస్తుందన్నారు.
లోవెల్: కావ్యంలో తత్వబోధ ఉండాలన్నారు. తత్వబోధ లేని కావ్యం తనకు పాధేయం కాదన్నారు.
జాన్ డ్రెడైన్: కావ్యానికి ముఖ్య ప్రయోజనం ఆనందం అని, అనుషంగిక ప్రయోజనం ఉపదేశమని చెప్పారు.
స్కాలిజర్: ‘ఆనందకరమైన బోధనే’ కావ్య ప్రయోజనం అన్నారు.
పాశ్చాత్య విమర్శకులు ఆనందం, ఉపదేశం, తాత్వికత, బోధనలను కావ్య ప్రయోజనాలుగా భావించారు.

కావ్య శైలి
ఆలంకారికులు కావ్య శైలికి సంబంధించి గుణాలు, రీతులు, పాకాలను పేర్కొన్నారు. ప్రాచీన, ఆధునిక పద్య కావ్యాల శైలికి సంబంధించి ఇవి ప్రామాణికాలు. ఆధునిక సృజనాత్మక వచన ప్రక్రియలైన కథానిక, నవల, నాటకం వంటి వాటిలో శైలికి సంబంధించి కథన చాతుర్యం, పాత్రలు, సంభాషణలు వంటివి ప్రధానమైనవి. ఆంగ్లంలో ‘స్టైల్’ అనే పదానికి సమానార్థకంగా ‘శైలి’ పదాన్ని విమర్శకులు పరిగణిస్తున్నారు.
ఆలంకారికుల్లో భామహుడు మూడు కావ్య గుణాలను పేర్కొన్నారు.
1) ప్రసాదం
2) ఓజస్సు
3) మాధుర్యం.
1. ప్రసాదం: ప్రసిద్ధ పదాల ప్రయోగంతో, సులువుగా అర్థాన్ని స్ఫురింపజేసే రచన ప్రసాద గుణం.
ఉదా: మొల్ల, వేమన, కరుణశ్రీ వంటి వారి పద్య రచనలు ప్రసాద గుణభరితాలు.
2. ఓజస్సు: క్లిష్టమైన అక్షరాల కూర్పుతో, దీర్ఘ సమాస భూయిష్టమైన రచన ఓజో గుణం.
ఉదా: శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు, భట్టుమూర్తి వంటి వారి పద్య రచనలు ఓజో గుణ ప్రధానాలు.
3. మాధుర్య గుణం: స్పష్టంగా అర్థమయ్యే విడివిడి పదాలతో కూడిన రచన మాధుర్య గుణం. తిక్కన, పోతన, కరుణశ్రీ వంటి వారి రచనలు మాధుర్య గుణభరితాలు.
రీతులు: వామనుడు కావ్యాత్మగా రీతిని ప్రతిపాదించాడు. విశిష్ట పద రచనతో కూడిన కావ్యం రీతి ప్రధానం. రీతులు మూడు విధాలు. అవి..
1) వైదర్భీ రీతి
2) గౌఢీ రీతి
3) పాంచాలి రీతి
1. వైదర్భీ రీతి: సమాస రహితమైన, సరళమైన అక్షరాల కూర్పుతో కూడిన రచన వైదర్భీ రీతి.
ఉదా: మొల్ల రామాయణం, వేమన పద్యాలు.
2. గౌఢీ రీతి: పరుషమైన అక్షరాల కూర్పుతో, మహా ప్రాణాక్షరాల బంధంగా, దీర్ఘ సమా స భూయిష్టమైన రచన గౌఢీ రీతి. కాశీఖండం, భీమ ఖండం, ఆముక్తమాల్యద, వసు చరిత్ర, పాండురంగ మహాత్మ్యం, శ్రీమద్రామాయణ కల్పవృక్షం వంటి కావ్యాలు ఈ రీతికి ఉదాహరణలు.
3. పాంచాలి రీతి: కొంత సరళంగా, కొంత కఠినంగా, పై రెండు రీతులు కలయికగా ఉండే రచన ‘పాంచాలి రీతి’. తిక్కన భారతం, పోతన భాగవతం, శివ భారతం వంటి కావ్యాలు ఉదాహరణలు.
వృత్తులు: ఆలంకారికులు మూడు వృత్తులను పేర్కొన్నారు. కావ్య శైలికి సంబంధించిన రచనా విధానాలు వృత్తులు.
1) కైశికీ వృత్తి
2) సాత్వతీ వృత్తి
3) ఆరభటీ వృత్తి
1. కైశికీ వృత్తి: సరళమైన విడి పదాలతో కూడిన రచనా శైలి కైశికీ వృత్తి. శృంగార రస శైలికి అనువైంది.
2. సాత్వతీ వృత్తి: మరీ క్లిష్టంగా, మరీ సరళంగా కాకుండా మధ్యస్థంగా ఉండే శైలీ విధానానికి సంబంధించింది.. సాత్వతీ వృత్తి. వీర రస ప్రధానమైన రచనలకు అనువైంది.
3. ఆరభటీ వృత్తి: ప్రౌఢమైన సమాస భూయిష్టమైన రచనా శైలికి సంబంధించింది.. ఆరభటీ వృత్తి. బీభత్స, భయానక రసాలకు అనువైంది.
పాకాలు: రసోచిత శబ్దార్థాల సమ్మేళనాలే కావ్య శైలికి సంబంధించిన పాకాలు. కావ్య గుణాలు, కావ్య రీతులు, వృత్తులు కలిపి పాకాలుగా ఏర్పడతాయి. ఆలంకారికులు మూడు పాకాలను పేర్కొన్నారు.
1) ద్రాక్షాపాకం
2) కదళీపాకం
3) నారికేళపాకం
1. ద్రాక్షాపాకం: సులువుగా అర్థమయ్యే రచనా శైలి ద్రాక్షాపాకం. మాధుర్య గుణం + వైదర్భీ రీతి + కైశికీ వృత్తుల సమ్మేళనమే ద్రాక్షాపాకం. శృంగార రసానికి అనువైన శైలి ద్రాక్షాపాకం.
2. కదళీపాకం: కొంత కఠినంగా, కొంత సరళంగా ఉండే రచనా శైలి కదళీపాకం. ప్రసాద గుణం + పాంచాలి రీతి + సాత్వతీ వృత్తుల కలయిక కదళీపాక శైలి. వీర రస స్ఫోరకమైన రచనలకు అనుకూలమైంది.
3. నారికేళపాకం: ప్రౌఢ రీతిలో ఉన్న పద్య శైలీ రచన నారికేళ పాకం. ఓజో గుణం + గౌఢీ రీతి + ఆరభటీ వృత్తుల కలయిక నారికేళ పాకం. బీభత్స, భయానక రసాలకు అనువైన శైలి.

గత డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు

  1. విశ్వనాథుడి కావ్య నిర్వచనం?
    1) ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కావ్యం
    2) రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం
    3) శబ్ధార్థౌ సహితౌ కావ్యం
    4) వాక్యం రసాత్మకం కావ్యం
  2. వేద పురాణ కావ్యాలు వరుసగా?
    1) ప్రభు కాంతా మిత్ర సమ్మితాలు
    2) కాంతా ప్రభు మిత్ర సమ్మితాలు
    3) మిత్ర కాంతా ప్రభు సమ్మితాలు
    4) ప్రభు మిత్ర కాంతా సమ్మితాలు
  3. జగన్నాథ పండితరాయల కావ్య నిర్వచనం?
    1) నను శబ్దార్దేః కావ్యం
    2) నిర్దోష లక్షణ వతీస కావ్య శబ్దభాక్
    3) ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కావ్యం
    4) రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యం

సమాధానాలు

1) 4

2) 4 3) 4

మాదిరి ప్రశ్నలు

  1. ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కావ్యం’ అని చెప్పిన ఆలంకారికుడు?
    1) విశ్వనాథుడు
    2) దండి
    3) భోజుడు
    4) భామహుడు
  2. ‘శబ్దార్థౌ సహితౌ కావ్యం’ అని నిర్వచించిన ఆలంకారికుడు?
    1) అభినవ గుప్తుడు
    2) దండి
    3) భామహుడు
    4) భరతుడు
  3. ‘నిర్దోషం గుణ వత్కావ్య మలంకారై రలంకృతమ్’ అని చెప్పిన ఆలంకారికుడు?
    1) రుద్రటుడు
    2) భోజుడు
    3) వామనుడు
    4) మమ్మటుడు
  4. ‘అపారే కావ్య సంసారే కవి రేవ ప్రజాపతిః’ అని చెప్పిన ఆలంకారికుడు?
    1) విద్యాధరుడు
    2) భట్టతౌతుడు
    3) ఆనంద వర్థనుడు
    4) వామనుడు
  5. శృంగార రసానికి అనువైన కవిత్వ పాకం?
    1) నారికేళ పాకం
    2) కదళీ పాకం
    3) ద్రాక్షాపాకం
    4) కైశికి పాకం

సమాధానాలు

1) 2 2) 3 3) 2 4) 3 5) 3
Published date : 29 Jan 2015 05:42PM

Photo Stories