Skip to main content

భాష - లక్షణం

శాసన భాష
శాసనాల్లో వినియోగించిన భాషనే శాసన భాష అంటారు. ప్రాజ్ఞ్నన్నయ యుగం నాటి ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని గుర్తించడానికి శాసనాలు ముఖ్య ఆధారాలు. క్రీ.పూ 200 నుంచి క్రీ.శ 1000 వరకున్న కాలాన్ని సాహితీ చరిత్ర కారులు ప్రాజ్ఞ్నన్నయ యుగంగా నిర్ధారించారు. నన్నయకు పూర్వం రాజులు, సామంతరాజులు తమ జైత్రయాత్రల్లో కొత్త రాజ్యాలు, భూభాగాలను గెలిచినప్పుడు పండితులు, పురోహితులకు అగ్రహారాలు దానం చేసేవారు. మత ధార్మిక విషయాలను చాటిచెప్పేందుకు శాసనాలు వేయించేవారు. శాసనాలు రెండు రకాలు. ఒకటి శిలా శాసనాలు. రెండు తామ్ర శాసనాలు.

శాసనాల స్వరూపాన్ని బట్టి భాషావేత్తలు ప్రాజ్ఞ్నన్నయ యుగాన్ని రెండు భాగాలుగా వర్గీకరించారు. క్రీ.పూ 200 నుంచి క్రీ.శ 575 వరకు ఉన్న కాలాన్ని తొలి దశగా, క్రీ.శ 575 నుంచి క్రీ.శ 1000 వరకు ఉన్న కాలాన్ని మలిదశగా పేర్కొన్నారు. తొలిదశలో శాసనాలన్నీ సంస్కృత, ప్రాకృత శాసనాలు. వాటిలో అక్కడక్కడా వ్యక్తి నామాలు, గ్రామ నామాలు, సంఖ్యా వాచకా లు, విశేషణాలు మాత్రం తెలుగులో ఉన్నాయి. క్రీ.శ 575లో కడప జిల్లా కమలాపురంలో ఎరుకల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడి పాడు శాసనాన్ని తొలి గద్య శాసనంగా భాషా వేత్తలు గుర్తించారు. అదే కాలానికి చెందిన ధనుంజయుని కలమళ్ల శాసనాన్ని ఇటీవల కొందరు పరిశీలకులు తొలి గద్య శాసనంగా పేర్కొన్నారు. దీన్ని భాషావేత్తలు నిర్ధారించాల్సి ఉంది. పుణ్యకుమారుడి పొట్లదుర్తి మాలెపాడు శాసనం (క్రీ.శ 610)లో ఎక్కువ తెలుగు పదాలు ఉన్నాయి. జయసింహవల్లభుని విప్పర్ల శాసనం (క్రీ.శ 640)లో తెలుగు, సంస్కృతం కలిసిన పదాలు ఉన్నాయి.

తెలుగులో తొలి పద్య శాసనం అద్దంకి పండరంగని శాసనం (క్రీ.శ 848). అందులో తరువోజ పద్యాలు ఉన్నాయి. అదే కాలానికి చెందిన గుణగ విజయాదిత్యుని కందుకూరి శాసనం (క్రీ.శ 848)లో సీస పద్యం ఉంది.

బెజవాడ యుద్ధమల్లుని శాసనంలో (క్రీ.శ 885) మధ్యాక్కర పద్యాలు ఉన్నాయి. గూడూరు విరియాల కామసాని శాసనంలో (క్రీ.శ 1000) చంపక, ఉత్పలమాలలు ఉన్నాయి. ధర్మవరం శాసనంలో ఆటవెలది పద్యాలు ఉన్నాయి. కె.వి.సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రచురించిన దక్షిణ హిందూ దేశ శాసనాల సప్తమ సంపుటి లో 27 తెలుగు శాసనాలు ఉన్నాయి. డా. బూదరాజు రాధాకృష్ణ ప్రాజ్ఞ్నన్నయ యుగంలోని 269 తామ్ర శాసనాలను నిశితంగా పరిశోధించి ప్రచురించారు. జయంతి రామయ్య పంతులు సంపాదకత్వంలో దక్షిణ హిందూ దేశ శాసనాల పదో సంపుటిలో 781 తెలుగు శాసనాలను ప్రచురించారు. 14వ శతాబ్దం నాటికి దాదాపు రెండువేల శాసనాలు ప్రచురితమైనట్లు భాషావేత్తలు నిర్ధారించారు. తొలిదశ శాసనాల్లో కొన్నింటిలో బ్రాహ్మీలిపి, ఇంకొన్నింటిలో కొంత భాగం దేవనాగరిలిపి, మరికొంత భాగం తెలుగు-కన్నడ లిపి ఉన్నాయి. కొన్ని శాసనాలు వేంగీచాళుక్యుల లిపిలో ఉన్నాయి. అప్పట్లో భాష ద్రవరూపంలో ఉన్నందున స్పష్టత, నిబద్ధత శాసన భాషలో కనిపించదు. శాసన భాషలో 23 హల్లులు, 10 అచ్చులు గల దేశ్య వర్ణమాల ఉండేది. వీటిలో లేఖన దోషాలు విరివిగా కనిపి స్తాయి. రేఫ బదులు వలపలి గిలక ఉపయోగిం చేవారు.

  • శాసన భాషలో కనిపించే ‘ఱ’ వర్ణం క్రమేపి తెలుగులో డ కారంగా, రేఫగా మారింది.
    శాసనభాషలో అనుస్వరానికి బదులు వర్గ పంచమాక్షరాన్ని సంయుక్తంగా రాసేవాళ్లు.
    ఉదాహరణ: పణ్డూ (పండు)
  • శాసనభాషలో శకట రేఫ ప్రయోగం విరివిగా ఉంది.
  • నేటి భాషలో శకట రేఫకు బదులు సాధు రేఫను ఉపయోగిస్తున్నారు. శకట రేఫ అదృ శ్యమైపోయింది.
  • శాసన భాషలో ఉన్న ‘ణ’, ‘ళ’లు నేటి భాషలో ‘న’, ‘ల’ లుగా మారాయి.
    ఉదా: ఆణతి - (ఆనతి), సంవత్సరంబుళు (సంవత్సరంబులు).
  • సంస్కృత శాసనాల్లో గ్రామ నామాలను సంస్కృతీకరించిన రూపాలున్నాయి. ఉదా: చేబ్రోలు (తామ్రపురీ), కొలను (సారసపురీ)
  • శాసన భాషలో ఎన్నో భాషా విశేషాలు గమనించవచ్చు.
  • తొలి తెలుగు మాట ‘నాగబు’ పదం (క్రీ.శ.మొదటి శతాబ్ది) అని వేటూరి ప్రభాకరశాస్త్రి నిర్ధారించారు.
  • తెలుగు భాష ప్రాచీనతను నిర్ధారించే సం దర్భంలో ఫిబ్రవరి, 2006లో కొత్తూరు శాస నం (క్రీ.పూ 2 వ శతాబ్ది)లోని ‘తమ్బయ’ పదాన్ని తొలి తెలుగు మాటగా భాషా వేత్త లు నిర్ధారించారు.
గాంథిక భాష
ఆదికవి నన్నయ నుంచి చిన్నయసూరి వరకు కావ్య రచనలో ఉపయోగించిన వ్యాకరణ నియమబద్ధమైన భాషనే గ్రాంథిక భాష అంటారు. 19వ శతాబ్ది ఉత్తరార్థం నాటికి గ్రాంథిక భాషే ప్రామాణిక భాషగా ఉండేది. గ్రాంథిక భాషను సమర్థిస్తూ, వ్యావహారిక భాషను నిరసిస్తూ జయంతి రామయ్య పంతులు ఆధ్వర్యంలో కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థ ఏర్పడింది. వేదం వేంకటరాయశాస్త్రి, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, వావిలకొలను సుబ్బారావు త దితరులు దీనిలో సభ్యులు. గ్రాంథిక భాషను సమర్థిస్తూ, గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పా రావుల వ్యావహారిక భాషోద్యమాన్ని అవహేళన చేస్తూ పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘గ్రామ్య వాదుల భాషాపవాదం’ అనే గ్రంథాన్ని రచిం చారు.

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1912, డిసెంబరు 11, 12 తేదీల్లో వావిలకొలను సుబ్బారావు అధ్యక్ష తన జరిగిన సదస్సులో తెలుగు భాష ఔన్నత్యాన్ని గొప్పగా ప్రశంసించారు. అక్షరసంఖ్యను బట్టి చూసినా తెలుగు.. ఇంగ్లిష్ భాష కంటే అభివృద్ధి చెందిందని అన్నారు. గ్రాంథిక భాష ఉత్కృష్టతను వివరిస్తూ. ఆ భాషలో అన్యదేశ్యాలు కొద్దిగా ఉన్నా మాండలి కాలు లేవన్నారు. వ్యావహారిక భాషకు వ్యాకర ణం, నిఘంటువు లేనందున వ్యావహారికంలో రచనలు చేయడం తగదని అధిక్షేపించారు.

జయంతి రామయ్య పంతులు.. గిడుగు వారి ‘ఎ మెమోరాండమ్ ఆఫ్ మోడరన్ తెలుగు’ వ్యాసాన్ని ఖండిస్తూ ‘ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు’ అనే వ్యాసాన్ని ప్రచురించారు.

గ్రాంథిక భాష మహాకవుల ప్రయోగాల నుంచి సిద్ధించినందున అది గొప్పదని, దాన్ని అనుసరించడం మంచిదని వాదించేవారు. వ్యావహారిక భాష శిష్టేతరుల వ్యవహారికం నుంచి సిద్ధించినందున దానికి ప్రామాణికత, సంస్కారం లేవని వారి ఆరోపణ. గ్రాంథిక భాష నన్నయ నుంచి ఆధునిక యుగం వరకు మారకుండా స్థిరంగా ఉన్నందున ప్రామాణిక వ్యవహారానికి అది అనుకూలమని వారి అభిప్రాయం. కందుకూరి వీరేశలింగం గారి ప్రత్యర్థి కొక్కొండ వెంకటరత్నం పంతులు నిత్య వ్యవహారంలో గ్రాంథిక భాషనే మాట్లాడేవారు.

సరళ గ్రాంథిక భాష
గాంథికభాషలో మారుమూల తెలుగు పదాలు, కన్నడ పదాలతో అర్థం కాని సంస్కృత పదాలు, కఠోరమైన వ్యాకరణ నియమాలు, అన్యదేశ్యాలున్నందున గ్రాంథిక భాషావాదులు పనికట్టుకొని వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. పెద్ద సంక్లిష్ట వాక్య నిర్మాణాలతో గ్రాంథిక భాష చదివేందుకు, రాసేందుకు కఠినంగా ఉన్నందున ఈ లోపాలను సవరించాలన్న నిర్ణయంతో సరళగ్రాంథిక వాదులు చిన్నచిన్న సమాసాలు, సరళమైన సామాన్య వాక్యాలు, ప్రసిద్ధమైన తెలుగు, సంస్కృత పదాలతో రచనలు చేయాలని నిర్ణయించారు. అందమైన తెలుగు నుడికారాలు, జాతీయాలు, సామెతలతో, ఆకర్షణీయమైన శైలిలో తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, దివాకర్ల వేంకటావధాని, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి మొదలైనవారు సరళ గ్రాంథిక శైలిలో రచనలు చేసి పాఠకులను కొంతమేర ఆకర్షించ గలిగారు. 20వ శతాబ్ది పూర్వార్థంలో నవలలు, కథానికలు, పత్రికా ర చనలు, ఆధునిక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యాసాలు సరళ గ్రాంథిక శైలిలో వచ్చాయి.

గ్రాంథిక భాషా సమర్థనతో వచ్చిన రచనలు
  1. ఎ డిఫెన్స్ ఆఫ్ మోడరన్ లిటరరీ తెలుగు - జయంతి రామయ్య పంతులు
  2. గ్రామ్యవాదుల భాషాపవాదం - పానుగంటి లక్ష్మీనరసింహారావు
  3. ఆధునికాంధ్ర వాజ్ఞ్మయ వికాస వైఖరి - జయంతి రామయ్య పంతులు
గతంలో అడిగిన ప్రశ్నలు
  1. ‘ప్రాణ సమానుండవైన చెలివి’ అన్న శాసన ప్రయోగం
    ఎ) నామవాచకం మీద ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం చేరింది.
    బి) నామవాచకం మీద ఉత్తమ పురుష ఏకవచన ప్రత్యయం చేరింది.
    సి) నామవాచకం మీద మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం చేరింది.
    డి) నామవాచకం మీద ప్రథమ పురుష బహువచన ప్రత్యయం చేరింది.
  2. శాసనభాషలో కనిపించే వెలసును అనే తద్ధర్మార్థక రూపానికి ధాతు రూపం?
    ఎ) వెలుచు
    బి) వేచు
    సి) వెలుగు
    డి) వెలయు
  3. శాసనభాషలో క్రీ.శ 6వ శతాబ్దికి ఈ విశిష్టత ఉంది?
    ఎ) శాసనంలో తెలుగురాజుల పేర్లుండటం
    బి) శాసనాల్లో తెలుగు రాజ్యాల ప్రత్యేక ప్రస్తావన
    సి) మొత్తం తెలుగులో ఉన్న శాసనాలు లభించడం
    డి) శాసనాల్లో తెలుగు పదాలు ఉండడం
  4. 100 సంఖ్యను సూచించే తెలుగు శబ్దాల్లో ప్రాజ్ఞ్నన్నయ యుగ శాసన భాషలో కనిపించని శబ్దం?
    ఎ) శతము
    బి) నూట
    సి) వంద
    డి) నూఱు
  5. ఎక్కువమంది ప్రజలకు సమ్మతంగా ఉండటం లక్షణంగా కలది?
    ఎ) జానపద భాష
    బి) వ్యావహారిక భాష
    సి) ప్రామాణిక భాష
    డి) మాండలిక భాష
  6. మాట్లాడే భాషలో సాధారణంగా కనిపించే లక్షణం?
    ఎ) చందోబద్ధత
    బి) సుదీర్ఘ వాక్య నిర్మాణం
    సి) సమాచార పునరుక్తి
    డి) దీర్ఘ సమాస భూయిష్ఠత
సమాధానాలు
1) సి 2) డి 3) సి 4) సి 5) సి 6) సి

మాదిరి ప్రశ్నలు
  1. శాసనాల్లో తత్సమ శబ్దాలకు తెలుగు పద్ధతిలో సంధి చేయడానికి ఉదాహరణ?
    ఎ) మన్చ్యణ్ణ
    బి) నీలీశ్వర
    సి) మీనవ మ్మ
    డి) తిక్కన య్య
  2. శిష్టోచ్ఛారణలో జరిగే మార్పు?
    ఎ) హ కారం పోతుంది
    బి) చకారం సకారమవుతుంది
    సి) శ-ష-సల భేదం ఉంటుంది
    డి) హల్లులు సమీకరణ పొందుతాయి
  3. క్రీ.శ 1100 ముందునాటి శాసనాల్లో కనిపించే దేశ్య తత్సమ మిశ్ర సమాసాలు?
    ఎ) కణ్ణసామి, గొల్లపల్లు
    బి) అమృతపడి జయమాడ
    సి) చౌషష్ట, ఘనరాచమణి
    డి) దేవొనొజ్జ, మొగమాడున్
  4. శాసనభాషలో స్త్రీ, పురుషోభయ వాచకాలైన ప్రత్యయాలు?
    ఎ) అయ్య, అన్న
    బి) అవ, ఇయ
    సి) పిడుగు, పోతు
    డి) అమ్మ, పోఱి
  5. భాషా చరిత్రకు ముఖ్యమైన జయసింహవల్లభుని శాసనం?
    ఎ) బెజవాడ
    బి) అద్దంకి
    సి) మైదవోలు
    డి) విప్పర్ల
  6. శాసనాల్లో కనిపించని ప్రసిద్ధమైన ఛందస్సు
    ఎ. ఉత్పలమాల
    బి. చంపకమాల
    సి. శార్దూలం
    డి. కందం
  7. శాసన భాషలో ‘ళ’ వర్ణం ఏ శతాబ్ది వరకు కనిపిస్తుంది?
    ఎ) క్రీ.శ 5వ శతాబ్ది
    బి) క్రీ.శ 6వ శతాబ్ది
    సి) క్రీ.శ 9వ శతాబ్ది
    డి) క్రీ.శ 10వ శతాబ్ది
  8. గూడూరు కామసాని శాసనంలో ఉన్న పద్యాల ఛందస్సు?
    ఎ) రెండు చంపకమాలలు- మూడు ఉత్పలమాలలు
    బి) మూడు చంపకమాలలు - రెండు ఉత్పలమాలలు
    సి) ఒక ఉత్పలమాల- నాలుగు చంపకమాలలు
    డి) నాలుగు చంపకమాలలు-ఒక తేటగీతి
  9. జన వల్లభుడి హర్కానల శాసనంలో ఉన్న పద్య ఛందస్సు?
    ఎ) తేటగీతి
    బి) మధ్యాక్కర
    సి) కందం
    డి) ఆటవెలది
  10. పొట్లదుర్తి మాలెపాడు శాసనం వేయించిన రాజు
    ఎ) ఎరుక ల్ ముత్తురాజు
    బి) జయసింహ వల్లభుడు
    సి) రేనాటి పుణ్యకుమారుడు
    డి) గుణగ విజయాదిత్యుడు
  11. 1910లో ప్రారంభమైన భాషోద్యమం?
    ఎ) గ్రాంథిక బాషోద్యమం
    బి) ప్రామాణిక భాషోద్యమం
    సి) అధికార భాషోద్యమం
    డి) వ్యావహారిక భాషోద్యమం
  12. గ్రాంథిక భాషలో ‘ప్రొందెనుగు కమ్మ’ పుస్తకం రచించిన పండితుడు
    ఎ) గురజాడ అప్పారావు
    బి) గిడుగు రామ్మూర్తి పంతులు
    సి) కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి
    డి) జయంతి రామయ్య పంతులు
  13. నిత్య వ్యవహారంలో గ్రాంథిక భాషనే మాట్లాడిన పండితుడు?
    ఎ) కందుకూరి వీరేశలింగం
    బి) వేదం వేంకటరాయ శాస్త్రి
    సి) కొక్కొండ వెంకటరత్నం పంతులు
    డి) జయంతి రామయ్య పంతులు
  14. గ్రాంథిక భాషా పరిరక్షణకు నిర్వహించిన పత్రిక
    ఎ) ఆంధ్ర భారతి
    బి) ఆంధ్ర పత్రిక
    సి) భారతి
    డి) ఆంధ్ర సాహిత్య పరిషత్
సమాధానాలు
1. బి; 2. సి; 3. సి; 4. బి; 5. డి;
6. సి; 7. బి; 8. బి; 9.సి; 10. సి
11. డి; 12. బి; 13.సి; 14.డి.
Published date : 20 Dec 2014 05:38PM

Photo Stories