Skip to main content

సెప్టెంబర్‌ 1 నుంచి ఉపకార దరఖాస్తులు ప్రారంభం!

సాక్షి, హైదరాబాద్‌: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి 2021–22 విద్యా సంవత్సరం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభించేందుకు సంక్షేమ శాఖలు సన్నాహాలు చేస్తున్నాయి.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో వృత్తి విద్యా కోర్సులు మినహా మిగతా కేటగిరీల్లో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తే పరిశీలన మొదలుపెట్టవచ్చని భావిస్తున్న అధికారులు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. సెప్టెంబర్‌ 1 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని, అక్టోబర్‌ నెలాఖరు వరకు గడువు విధించాలని ప్రతిపాదనలు రూపొందించారు. తాజాగా వీటిని ఆమోదం కోసం ప్రభుత్వానికి సమరి్పంచారు. ఆమోదం రాగానే ఈపాస్‌లో అప్లికేషన్‌ ఆప్షన్‌ను తెరవనున్నారు.

ముందుగా సీనియర్లకు అవకాశం...
ఈ విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల స్వీకరణ రెండు రకాలుగా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వివిధ కోర్సుల్లో ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ముందుగా సీనియర్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తే.. తర్వాత జూనియర్లకు అవకాశం ఇస్తే సర్వర్‌పైనా ఒత్తిడి ఉండదని అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టులోనే ప్రారంభించినా.. కోవిడ్‌ నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమై నాలుగుసార్లు దరఖాస్తు గడువును పెంచారు. ఈ ఏడాది జాప్యం కాకుండా ఉండేందుకు కాలేజీల వారీగా అవగాహన నిర్వహించి త్వరగా లక్ష్యాన్ని సాధించాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Published date : 20 Aug 2021 07:16PM

Photo Stories