Skip to main content

ఒక ఉత్తమ పౌరుడుగా రూపొందాలంటే.. ఈ గురువు కావాల్సిందే..

ఒక రాయికి రూపం పోయాలంటే శిల్పి ఉండాలి, అదే విధంగా ఒక ఉత్తమ పౌరుడుగా రూపొందాలంటే అతడికి గురువు మార్గదర్శనం ఉండాలి.
అందుకే ఉపాధ్యాయుడు లేని విద్య నిష్ఫలం అని పెద్దలు అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.. అంటు పాఠశాలల్లో, అదే విధంగా ప్రతీ చోట వారిని మనందరం తలుచుకుంటాం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానంగా మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు అంతటి విలువను ఇస్తాం. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం...

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రామస్వామి గణితబోధనలో దిట్ట. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా తీసుకునేలా, కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నే రీతిలో ఈ పాఠశాలను తీర్చిదిద్దాడు. విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలకాలని, ప్రయోగ విధానం రావాలని కోరుకోవడంతో పాటుగా తన పాఠశాలలో ఆచరణలో పెట్టారు. దీంతో ఈ పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడు అయిన సరే బోధించే విధానం ఇతర పాఠశాలలతో పోల్చితే వేరుగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చాట్‌ రూపంలో, అదే విధంగా మన నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల మార్పులాగా విద్యార్థులకు సునాయసంగా అర్థమయ్యే రీతిలో నేర్పుతు గణితం అంటే విద్యార్థుల్లో ఉంటే భయాన్ని ఆమడ దూరంలో ప్రాలదోలుతున్నాడు.

పాఠశాలలో ప్రతీ విద్యార్థి చదువుతో పాటుగా మానవత ధృక్పదం, సామాజిక పరిజ్ఞానం, పెంచుకునేలా ప్రతి రోజూ కార్యక్రమాలు తన తోటి ఉపాధ్యాయులతో కలిసి ఒక కుంటుంబంలా చేస్తున్నారు. దీంతో ఈ పాఠశాల పేరు నేడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017న సెప్టెంబర్‌ 5న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును పొందారు. ఈ పాఠశాలలో 1000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందుకు కారణం ప్రధానోపాధ్యాయులు రామస్వామి ప్రత్యేక చొరవే అని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంటున్నారు.

సమాజానికి ఉపయోగపడేలా చేస్తాం..
విద్యార్థులు మొక్కలాంటి వారు. వారిని చిన్ననాటి నుంచి ఏ విధంగా తయారు చేస్తే ఆ విధంగా తయారు అవుతారు. అందువల్ల కేవలం మార్కుల చదువులు మాత్రమే వద్దు, వారికి సమాజం పై అవగాహన ఉండాలి. సమాజానికి ఉపయోగపడే విధంగా మాత్రమే విద్యావిధానం ఉండాలి. బట్టి విద్యతో కేవలం విద్యార్థికి మార్కులు మాత్రమే వస్తాయి, కానీ ఆ విద్యార్థికి సమాజంపై ఎలాంటి అవగాహన మాత్రం ఉండదు. అందువల్ల మానవతా విలువలతో కూడిన విద్యను అందించాలి.
– రామస్వామి, ఇందిరానగర్‌ ఉన్నత పాఠశాల, సిద్దిపేట

గురువు జెప్పిన మాట–గురు తప్పదు..
  • తల్లి దండ్రి గురు దైవం పూజార్హులు, సదా అవనిపైన నాడూ నేడూ గురువు ఆదర్శం కదా. దూర దృష్టి, దృఢ సంకల్పాలకు పునాదులు పోస్తాడు. అందుకే 'గురుదేవోభవ' అంటు శ్లాఘిస్తారు.
  • ధరణిపై జీవులకు ప్రకృతియే ప్రథమ గురువు అటు నిటు ఎటు గాంచిన విశదమౌను ఈ నిజం మనుగడ కోసం పోరాటం ఇంకెంతో ఎదగాలని ఆరాటం విరించిలా విపంచిలా వినిపిస్తాడు గురువు.
  • కఠిన శిలలకు కమనీయ రూపం కల్పించె శిల్పి ధర్మాధర్మం–సత్యాసత్యం–హింసాహింసా– నీతి అవినీతి లంచం వంచనలు, మంచి చెడులను విశ్లేషిస్తాడు అబలల పాలిట ఆకృత్యాలను ఎండగట్టు గురువు.
  • గురువు జెప్పిన మాట–గురు తప్పదను వాడుక తరచి చూడగ నిధి చాలా నిజమని గమనించు శ్రద్ధ బూని చదివితే మెప్పులు అశ్రద్ధ జేస్తివా పలు తిప్పలు గొప్ప చదువుతో పదవికెక్కగ జూసి పరవశించు గురువు.
  • ఓ నాడు బతకలేనివాడు బడి పంతులన్నారు. ఈనాడు బ్రతుకు నేర్పువాడని సరిదిద్దుకోవలెను విద్యలేని వాడిని వింత పశువన్నారు, పలు విద్యలను నేర్పు నిపుణులగు గురువులున్నారు.
- వై.దేవదానం, రిటైర్డు హెచ్‌ఎం, కవి (భావనా తరంగాలు రచయిత) నర్సాపూర్, మెదక్‌ జిల్లా

గురు మార్గం అనితర సాధ్యం...
గురువు బోధనం శ్రీవాణి కటాక్షం గురువు శిక్షణం సర్వజ్ఞాన బీజాక్షరం. వెలుగు వీచికల్ని వేనోళ్ళ గుభాళింప జెసి, ఉన్నత విలువల్ని విద్యార్థులలో ఆకళింప సి, అనుభవైక వేద్యమైన గురు మార్గం అనితర సాధ్యం, అద్వితీయం. అక్షరాలు బాలల ఉజ్వల భవిష్యత్‌కు ఆక్షౌ హిణులై, ఆశయాలు ఉన్నత సోపానాలై. మార్గాన్ని అనుసరించిన శిష్యులు, గురు కర కమలములచే రూపు దిద్దుకున్న చైతన్య శిల్పులు. జన్మను సన్మార్గం చేయు విధాత జ్ఞాన భిక్ష అందించే ప్రదాత విద్యా సేవకే అంకితమైన ఉన్నత మూర్తి, మార్గనిర్ధేశకత్వానికి గురువు ఒక స్ఫూర్తి.
– సముద్రాల శ్రీదేవి,తెలుగు ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్‌ఎస్, పటాన్‌చెరు
Published date : 05 Sep 2020 08:07PM

Photo Stories