Skip to main content

కామన్ మిస్‌టేక్.. ఇది మీరు చేయకండి: కాళోజీ హెల్త్ వర్సిటీ

కార్తీక్ (పేరు మార్చాం)కు గతేడాది ‘నీట్’లో మంచి ర్యాంకు వచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు వస్తుంది కాబట్టి రాష్ట్రంలో పేరొందిన కాలేజీల్లో చేరాలనుకున్నాడు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
ఆప్షన్లు చాలా ఇచ్చాడు. ఆప్షన్ల ప్రకారం అతని ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని సుదూర ప్రాంతంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. అది నచ్చలేదు. రెండో రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటే నచ్చిన కాలేజీలో సీటొస్తుందని భావించి, మొదటి కౌన్సెలింగ్‌లో సీటొచ్చిన కాలేజీలో చేరలేదు. దురదృష్టం ఏమిటంటే వచ్చిన కాలేజీలో చేరకపోవడంతో, తదుపరి కౌన్సెలింగ్‌లకు అర్హత కోల్పోయాడు.

ఎంతో కష్టపడి నీట్‌లో మంచి ర్యాంకు సాధించి కూడా మెడికల్ సీట్లు కోల్పోతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. సరైన గెడైన్స్, అవగాహన లేక ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఆప్షన్ల ఎంపికలో తప్పిదాలు, సీటొచ్చినా కాలేజీల్లో చేరకపోవడం వంటి కారణాలతో తదుపరి కౌన్సెలింగ్‌కు అర్హత కోల్పోతున్నారు. దీంతో కొందరు కన్వీనర్ కోటా, మరికొందరు జాతీయ స్థాయి కోటా సీట్లు సాధించే సత్తా ఉన్నా ఎంబీబీఎస్‌లో చేరలేకపోతున్నారు. అందుకే నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, లేకుంటే ప్రతిభావంతులూ నష్టపోతారని అధికారులు అంటున్నారు.

ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి
కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేటపుడే ర్యాంకు, సీటొచ్చే అవకాశం ఉన్న కాలేజీలను అంచనా వేసుకొని ఆప్షన్లు పెట్టుకోవాలి. ఒకవేళ తొలి కౌన్సెలింగ్‌లో అనుకున్న కాలేజీలో సీటు రాకపోతే దాన్ని వదిలేసుకోకూడదు. ఆప్షన్లు ఇచ్చిన వాటిలో సీటొచ్చిన కాలేజీలో ముందుగా చేరిపోవాలి. అప్పుడే తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హులవుతారు. తదుపరి కౌన్సెలింగ్‌లో సీటొచ్చాక అంతకుముందు చేరిన మెడికల్ సీటును వదిలేసుకొని ఇష్టమైన కాలేజీలో చేరవచ్చు. అలా చేయడం వల్ల అంతకుముందు చేరిన కాలేజీ కూడా చెల్లించిన ఫీజును తిరిగిచ్చేస్తుంది. అందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది. సీటొచ్చిన కాలేజీలో చేరకపోతే, తెలంగాణలో కనీసం ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో కూడా చేరే అవకాశాన్ని కోల్పోతారు. ఇతర రాష్ట్రాల్లోనే చేరడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కన్వీనర్ కోటా మెడికల్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పొరపాట్లు చేయవద్దని, ఆప్షన్లు పెట్టేటప్పుడే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాలని, సంబంధిత కాలేజీకి వెళ్లి పరిశీలించుకోవాలని వర్సిటీ సూచిస్తోంది.

జాతీయస్థాయి కౌన్సెలింగ్ ఇలా..
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లకు ఆలిండియా స్థాయిలో జరిగే కౌన్సెలింగ్‌పైనా విద్యార్థులు స్పష్టతతో ఉండాలి. ఆలిండియా మొదటి, రెండో కౌన్సెలింగ్‌ల తర్వాత మిగిలే సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకే వదిలేస్తారు. అలా గతేడాది మన రాష్ట్రానికి 50 సీట్లు వెనక్కి వచ్చాయి. ఈసారీ అదే మేరకు వచ్చే అవకాశముంది. ఇక ఆలిండియా స్థాయిలో సీటొచ్చిన విద్యార్థులు, తమకు సంబంధిత రాష్ట్రంలోని కాలేజీ నచ్చకపోతే దాన్ని వదిలేసుకునేందుకు అవకాశమిస్తారు. అప్పుడు ఆ సీటును వదిలేసుకొని తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అందుకోసం ప్రతీ రౌండ్ కౌన్సెలింగ్‌కు నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎంపిక చేసుకున్న కాలేజీలో చేరాక, దాన్ని వదులుకోవాల్సి వస్తే కొంత జరిమానా చెల్లించాలి. కొన్ని జాతీయస్థాయి కాలేజీల్లో ముందే అడ్వాన్స్ ఫీజు కట్టించుకుంటారు. దాన్ని తిరిగివ్వరు. డీమ్డ్ వర్సిటీలైతే సీటు వదులుకుంటే రూ.2 లక్షలు వసూలు చేస్తాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.

ఈడబ్ల్యూఎస్‌కు తాజా ధ్రువీకరణ తప్పనిసరి
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్లు పొందే విద్యార్థులు ఏప్రిల్ 1 తర్వాత తహసీల్దార్ జారీచేసిన ధ్రువీకరణపత్రం పొందాలి. గతేడాది ధ్రువీకరణ సమర్పిస్తే సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో గతేడాది మాదిరే ఈసారీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేంద్రం 190 సీట్లను గాంధీ, కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేటాయించింది. వీటిలో 95 మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయిస్తారు. మిగిలిన సీట్లను రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండేందుకు ఇతర కేటగిరీ రిజర్వేషన్లలో సర్దుబాటు చేస్తారు. ఇదిలావుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటాను కేటాయించలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కాళోజీ ఆరోగ్య వర్సిటీ సూచి స్తోంది.

విద్యార్థులు ఇవి తెలుసుకోవాలి
అన్ రిజర్వుడు సీట్లు:
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లపై స్థానికులకు అధికారం ఉంటుంది. అయితే 15 శాతం సీట్లను అన్ రిజర్వుడుగా ఉంచుతారు. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులెవరైనా తమ ర్యాంకు ఆధారంగా సీటు పొందొచ్చు. మిగిలిన సీట్లను స్థానికులకే కేటాయిస్తారు. ఇక ప్రైవేట్ మెడికల్ సీట్లలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా తదుపరి ఏడాదికి సంబంధించిన ఫీజు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. మాప్ అప్ రౌండ్: అన్ని కౌన్సెలింగ్‌లు అయిపోయాక చివరగా మిగిలిన సీట్లన్నింటినీ అక్కడకు వచ్చిన వారికి ర్యాంకు ప్రకారం అప్పటికప్పుడు ఇవ్వడమే మాప్ అప్ రౌండ్. ఎక్కడైనా చేరినవారు మాప్ అప్ రౌండ్‌కు అనర్హులనే విధానం గతంలో ఉండేది. కానీ దాన్నిప్పుడు ఎత్తేశారు.

ఆప్షన్లే కీలకం
మెడికల్ ప్రవేశాల్లో పాల్గొనే విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకునేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పు చేస్తే ఇబ్బందులు పడతారు. ఆప్షన్లు పెట్టుకున్నాక సీటొచ్చిన కాలేజీల్లో చేరకపోతే, తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఆప్షన్లు ఇచ్చిన కాలేజీల్లో చేరకుండా సీట్లను బ్లాక్ చేయడం వల్ల సమస్యలు వస్తుండటంతో ఈ నిబంధన తెచ్చాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీట్ల భర్తీ, రిజర్వేషన్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతాయి. ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు.
- డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వైస్‌చాన్సలర్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
Published date : 12 Nov 2020 05:08PM

Photo Stories