Skip to main content

టీఎస్‌ ఆర్టీసీలో కొత్తగా మరో 2 ఈడీ పోస్టులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో కొత్తగా మరో రెండు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) పోస్టులు ఏర్పాటు కాబోతున్నాయి.
ఇద్దరు సీనియర్‌ అధికారులకు పదోన్నతి ద్వారా వాటిని కేటాయించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఐదుగురు ఈడీలున్నారు. అన్నే పోస్టులున్నాయి. కానీ, అవి సరిపోవటం లేదన్న ఉద్దేశంతో ఈడీ పోస్టుల సంఖ్యను ఏడుకు పెంచాలని ఇటీవల నిర్ణయించారు. త్వరలో వాటిని భర్తీ చేసే అవకాశముంది. దీంతో తెలంగాణ ఆర్టీసీలో ఈడీ పోస్టులు ఏడుకు చేరుకోనున్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈడీ పోస్టుల సంఖ్య పెంచటం సరికాదన్న భావన కొందరు అధికారుల్లో వ్యక్తమవుతోంది. కానీ పాలనపరంగా వెసులుబాటు కోసమే ఈ సంఖ్యను పెంచుతున్నట్టు మరికొందరు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోకముందు సంస్థలో 12 మంది ఈడీలు ఉండేవారు. విడిపోయిన తర్వాత ఏపీఎస్‌ఆరీ్టసీకి 7 ఈడీ పోస్టులు, తెలంగాణ ఆర్టీసీకి 5 ఈడీ పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం ఏపీలో ఏడుగురే ఉన్నారు. అంతకంటే చిన్న సంస్థ అయిన తెలంగాణలో కూడా ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్య ఏడుకు చేరుకోనుంది.

అధికారుల ఎదురు చూపులు..
ప్రస్తుతం ఈడీలుగా ఉన్న అధికారుల సీనియారిటీతో సమానంగా కొందరు ఇతర అధికారుల సర్వీసు కూడా ఉంది. కానీ పోస్టులు లేకపోవటం వల్ల వారికి ఈడీ పదోన్నతి రావటం లేదు. కొందరు అలాగే పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో ఆ సీనియర్‌ అధికారులు ఆవేదన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, పదోన్నతి రాకున్నా.. ఆర్థికపరమైన చెల్లింపులన్నీ జరిగేలా ఈడీ స్కేల్‌ ఇస్తూ కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ కల్పిస్తున్నారు. ఇది సరికాదని, వారికి కూడా ఈడీ పదోన్నతి వచ్చేలా 2 పోస్టులు పెంచాలని ఇటీవల నిర్ణయించారు. కానీ గతంలో రమణరావు ఎండీగా ఉండగా, ఇదే ప్రతిపాదన వస్తే ఆయన తిరస్కరించా రు. పోస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు అవసరముందని వాటి సంఖ్యను పెంచుతున్నారు. ఇటీవల ఆర్టీసీలో ఈడీ అడ్మిన్‌గా ఉన్న టీవీ రావు చనిపోవటంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఆయన స్థానంలో ఓ అధికారికి పదోన్నతి లభించే అవకాశం కలిగింది. అయినా కూడా కొత్తగా రెండు పోస్టులు భర్తీ చేస్తారో, ఆయన ఖాళీతో ఏర్పడ్డ స్థానంతో పాటు మరొక్క పోస్టు మాత్రమే భర్తీ చేస్తారో చూడాలి.
Published date : 01 Aug 2020 04:22PM

Photo Stories