Skip to main content

తెలంగాణ - నదీ వ్యవస్థ

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది 79శాతం, కృష్ణానది 69 శాతం పరీవాహక ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. వీటితోపాటు భీమ, మంజీరా, మూసీ, ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని, పాలేరు తదితర నదులు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు
గోదావరి
ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద నది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది.
  • దీనికి దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అనే పేర్లు కూడా ఉన్నాయి.
  • ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ జిల్లాలోని ‘త్రయంబకం’ వద్ద జన్మిస్తోంది.
  • ఈ నది మహారాష్ట్ర ద్వారా ప్రవహించి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తోంది.
  • దీని మొత్తం పొడవు 1465 కి.మీ.
  • ఇది తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి దిగువన 7 పాయలుగా చీలి కొంత దూరం ప్రవహించిన తర్వాత బంగాళాఖాతంలో కలుస్తోంది.
  • తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గోదావరి పుష్కరాలను నిర్వహించారు. ఇవి 2015 జూలె 14న (ఉదయం 6.31) ప్రారంభమయ్యాయి.
  • ఉపనదులు: ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, ప్రవర, శబరి, సీలేరు, వార్ధా, పూర్ణ, వైన్‌గంగ, పెన్‌గంగ, మానేరు మొదలైనవి దీని ముఖ్యమైన ఉపనదులు.
  • ఈ నదిపై నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు.
  • తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలు: బాసర (ఆదిలాబాద్ జిల్లా); కాళేశ్వరం, ధర్మపురి (కరీంనగర్ జిల్లా); భద్రాచలం (ఖమ్మం జిల్లా).
  • గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై‘కుంతల’ జలపాతం ఉంది.
ప్రాణహిత నది
మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా పర్వతాల్లో జన్మిస్తున్న ‘వైన్‌గంగ’, మహారాష్ట్రలో జన్మిస్తున్న ‘పెన్ గంగ, ‘వార్ధా’ అనే మూడు చిన్న నదుల కలయికతో ప్రాణహిత ఏర్పడుతోంది. ఇది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ద్వారా ప్రవహించి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తోంది. ఆ తర్వాత ఇది ఆదిలాబాద్ సరిహద్దు ద్వారా ప్రవహిస్తూ కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించి, మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలుస్తోంది. ఈ నది ఆదిలాబాద్ జిల్లాను మహారాష్ట్రతో వేరు చేస్తోంది.
  • ప్రాణహిత గోదావరి నదికి అతి ముఖ్యమైన ఉపనది. ఇది గోదావరికి దాదాపు 40 శాతం నీటిని సరఫరా చేస్తోంది.
మంజీరా నది
మహారాష్ట్రలోని ‘బాలాఘాట్’ పర్వతాల్లో మంజీరా జన్మిస్తోంది. అక్కడ నుంచి ఆగ్నేయ దిశగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ద్వారా ప్రవహించి, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి గోదావరి నదిలో కలుస్తోంది.
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ నది పరీవాహక ప్రాంతం ఉంది.
  • మంజీరా నదిపై నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు, మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణ సమీపంలో సింగూరు రిజర్వాయర్ నిర్మించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటిని అందించే ప్రధాన లక్ష్యంతో వీటిని నిర్మించారు.
కిన్నెరసాని
ఇది గోదావరికి ఉపనది. ఈ నది వరంగల్ జిల్లాలో మేడారం-తాడ్వాయి కొండసానువుల్లో జన్మించి ఆగ్నేయ దిశగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా ద్వారా ప్రవహిస్తూ భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్య గోదావరితో కలుస్తోంది.
  • దీని పొడవు సుమారు 96 కి.మీ.
  • కిన్నెరసాని ఉపనది అయిన ‘ముర్రేడు’ కొత్తగూడెం పట్టణం ద్వారా ప్రవహిస్తోంది. ఇది సంగం గ్రామం వద్ద కిన్నెరసానితో కలుస్తోంది.
కృష్ణానది
ఇది భారతదేశంలో మూడో అతి పెద్ద నది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది.
  • ఈ నది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని ‘మహాబలేశ్వరం’ వద్ద జన్మిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహిస్తూ తెలంగాణలోకి మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్ తాలూకాలోని ‘తంగడి’ వద్ద ప్రవేశిస్తోంది.
  • ఇది తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ప్రవహిస్తోంది.
  • కృష్ణానది మొత్తం పొడవు 1400 కి.మీ.
  • ఉపనదులు: భీమ, దిండి, మూసీ, పెద్దవాగు, మలప్రభ, తుంగభద్ర, హాలియా, పాలేరు, మున్నేరు, కోయ్‌నా, పంచగంగ, దూద్‌గంగ ముఖ్యమైనవి.
  • కృష్ణానదిపై తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ జిల్లాలోని రావులపల్లి సమీపంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మించారు.
తుంగభద్ర
కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో జన్మించే తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని ‘చిక్‌మంగ్‌ళూరు’ జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి ‘తుంగభద్ర’గా ఏర్పడుతున్నాయి.
  • ఈ నది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు ద్వారా ప్రవహించి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద కృష్ణా నదితో కలుస్తోంది.
  • ఉపనదులు: కుముద్వతి, వరద, వేదవతి.
దిండి నది
ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని షాబాద్ కొండల్లో జన్మిస్తోంది. నల్గొండ జిల్లా ద్వారా ప్రవహించి ‘ఏలేశ్వరం’ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది.
  • ఈ నదికి మరో పేరు ‘మీనాంబరం’.
మూసీ నది
ఇది తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ సమీపంలో ‘శివారెడ్డి పేట’ వద్ద అనంతగిరి కొండల్లో జన్మిస్తోంది.
  • ఈ నది రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ద్వారా ప్రవహించి, నల్గొండ జిల్లాలోని ‘వాడపల్లి’ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది.
  • ఈ నదికి మరో పేరు ‘ముచికుంద’.
  • ఈసా, ఆలేరు అనేవి దీనికి ఉపనదులు.
  • మూసీ నదిపై 1920లో ఉస్మాన్‌సాగర్ డ్యామ్‌ను నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని కూడా అంటారు.
పాలేరు
వరంగల్ జిల్లాలోని బాణాపురం ప్రాంతంలో ఈ నది జన్మిస్తోంది. నల్గొండ, ఖమ్మం జిల్లా సరిహద్దు మీదుగా ప్రవహించి, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తోంది.
  • నిజాంల కాలంలో ఖమ్మం జిల్లాలోని ‘పాలేరు’ పట్టణ సమీపంలో ఈ నదిపై రిజర్వాయర్ నిర్మించారు.
  • ఈ నది పొడవు 145 కి.మీ.
మున్నేరు
ఇది వరంగల్ జిల్లాలోని ‘పాకాల’ చెరువు నుంచి ఉద్భవిస్తోంది. వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహించి అంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోని ఏలూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. దీని పొడవు 192 కి.మీ.
  • వైరా, కట్లేరు దీని ముఖ్యమైన ఉపనదులు.
  • ఈ నదిపై నిర్మించిన చిన్న డ్యామ్ ద్వారా ఖమ్మం పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
Published date : 04 Sep 2015 05:27PM

Photo Stories