Skip to main content

ఢిల్లీ సుల్తాన్‌లు

ఉత్తర భారతదేశం రాజకీయంగా క్రీ.శ. 750 నుంచి 1200 వరకు ముక్కలు చెక్కలుగా ఉంది. ఈ రాజకీయ అనిశ్చితిని మంచి అవకాశంగా తీసుకుని మొదట అరబ్బులు దండయాత్రలు చేశారు. ఆ తర్వాత ఘజనీ మహమ్మద్, ఘోరీ దాడి చేశారు. మూడు వందల ఏళ్లుగా జరిగిన దండయాత్రలు ఒక తీరైన రాజకీయ రూపాన్ని సంతరించుకొని క్రీ.శ. 1206 నాటికి దేశంలో ఢిల్లీ సుల్తానుల పాలన ప్రారంభమైంది. క్రీ.శ. 1526 వరకు ఢిల్లీ సుల్తానుల పాలన అవిచ్ఛిన్నంగా సాగింది. ఢిల్లీ సుల్తానుల్లో మొదట పాలించినవారు బానిస వంశస్థులు.

బానిస వంశం

కుతుబుద్దీన్ ఐబక్ (క్రీ.శ. 1206-1210): ఇతడు భారతదేశంలో తురుష్క - అఫ్గాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు ఇల్బారీ వంశానికి చెందిన తురుష్కుడు. ఇతడు 1206లో ఢిల్లీ సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. ఢిల్లీకి మొదటి ముస్లిమ్ సుల్తాన్ ఇతడే. ఇతడిని బానిస వంశ స్థాపకుడిగా పేర్కొంటారు. 1210లో ఇతడు ‘పోలో’ ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు. ఐబక్ ‘కుతుబ్ మినార్’ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఇల్‌టుట్ మిష్ పూర్తి చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్‌కు ‘లక్‌బక్ష్’ అనే బిరుదు ఉంది.


ఇల్‌టుట్ మిష్ (క్రీ.శ. 1211-1236): ఇల్‌టుట్‌మిష్ తురుష్కుల్లో ఇల్బారీ తెగకు చెందినవాడు. రాజ్య రక్షణ కోసం ఇతడు 40 మందితో బానిసల దళం (చిహాల్‌గనీ) ఏర్పాటు చేశాడు. ఇల్‌టుట్‌మిష్ మంగోలుల దాడుల నుంచి భారతదేశాన్ని కాపాడాడు. స్వతంత్రంగా అరబ్బీ నాణేలను ముద్రించడం ప్రారంభించాడు. వెండి టంకా, రాగి జిటాల్ ఇతడి కాలం నుంచే వాడుకలోకి వచ్చాయి. తురుష్క సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు. కుతుబ్‌మినార్ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు.

సుల్తాన్ రజియా (క్రీ.శ. 1236-1240): ఈమె ఇల్‌టుట్ మిష్ కుమార్తె. యాకుబ్‌ఖాన్ అనే అబిసీనియన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె మధ్యయుగానికి చెందిన మొదటి, చివరి సుల్తానా (రాణి). ఇల్‌టుట్ మిష్ తన కుమారులు అసమర్థులవ్వడం వల్ల కూతురైన రజియాను వారసురాలిగా ప్రకటించాడు. ఈమె మంచి పాలనాదక్షురాలు. ఈమె కాలంలో చిహాల్‌గనీలు బలవంతులై ఆమెను ఎదిరించారు. వీరిని అడ్డుకునే ప్రయత్నంలో రజియా ప్రాణాలను కోల్పోయారు.

సుల్తాన్ నసీరుద్దీన్ మహమ్మద్ (క్రీ.శ. 1246 - 1265): ఇతడు ఇల్‌టుట్ మిష్ కుమారుడు. అసమర్థుడు. భోగలాలసుడు. అమీర్‌ల చేతిలో కీలుబొమ్మగా మారాడు.

సుల్తాన్ ఘియాసుద్దీన్ బాల్బన్ (క్రీ.శ. 1265 -1285): ఇతడు సుల్తాన్ నసీరుద్దీన్‌కు 1246-65 మధ్య ప్రధానమంత్రిగా సర్వాధికారాలు చెలాయించాడు. నసీరుద్దీన్ మరణానంతరం సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. 40 మంది బానిసల దళాన్ని రద్దు చేశాడు. శత్రువుల రహస్యాలు తెలుసుకునేందుకు గూఢచార దళాన్ని ఏర్పాటు చేశాడు. సాష్టాంగపడి సుల్తాన్ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం లాంటి పారశీక రాచ మర్యాదలను బాల్బన్ ప్రవేశపెట్టాడు. సర్దార్లను అణచివేయడానికి మద్యపానం, జూదం, అతిగా మాట్లాడటం లాంటివాటిని నిషేధించాడు.
 

ఖిల్జీ వంశం (క్రీ.శ. 1290-1320)

ఇది ఢిల్లీని పాలించిన రెండో తురుష్క వంశం. వీరి పాలనా కాలం క్రీ.శ. 1290-1320.
జలాలుద్దీన్ (క్రీ.శ. 1290-1296): ఇతడు బాల్బన్ కొలువులో చేరిన ఖిల్జీ వంశానికి చెందిన తురుష్క తెగకు చెందిన వ్యక్తి. 1290లో బానిస వంశ చివరి పాలకుడైన కైకోబాద్‌ను వధించి ఢిల్లీ సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. ఇతడి అన్న కొడుకు అల్లా ఉద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ తన కూతురిని అల్లా ఉద్దీన్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ఇతడి కాలంలో ఇస్లామ్ మతాన్ని స్వీకరించిన మంగోలులు నయాముస్లింలుగా చెలామణి అయ్యారు. వీరు ప్రభుత్వానికి బెడదగా తయారయ్యారు.

అల్లాఉద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1296-1316): ఇతడు 1299లో గుజరాత్‌ను జయించాడు. కాకతీయ, యాదవ, హోయసాల, పాండ్య రాజ్యాలపై అల్లా ఉద్దీన్ సేనాని మాలిక్‌కపూర్ దండెత్తి జయించాడు. 1312లో మాలిక్‌కపూర్ దేవగిరి రాజైన శకదేవుడిని వధించి ఆ రాజ్యాన్ని ఢిల్లీ రాజ్యంలో కలిపాడు. 1303లో మంగోలుల దాడుల నుంచి రక్షించుకోవడానికి దుర్గాలను నిర్మించాడు.
అల్లాఉద్దీన్ ఖిల్జీకి ‘సికిందర్’ అనే బిరుదు ఉంది. ఇతడు జాగీర్లను రద్దు చేశాడు. ఇతడి కాలంలో సైన్యం పోషణ బాధ్యత ప్రభుత్వ పరిధిలోనే ఉండేది. గుర్రాలపై ముద్రలు వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు. జీతాలను నగదు రూపంలో చెల్లించేవాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వ్యాపారులు సరకులు అమ్మాలని శాసించాడు. ఇతడు ‘సిరి’, ‘అలైదర్వాజా’ కట్టడాలను నిర్మించాడు. అమీర్‌ఖుస్రూ అనే పర్షియన్ కవిని పోషించాడు. అల్లాఉద్దీన్ ‘నయాముస్లిం’లను అణచివేశాడు. అలైదర్వాజా తురుష్క వాస్తు రీతికి ప్రతీక.
అల్లాఉద్దీన్ షియాబుద్దీన్ ఉమర్, కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ వంశం చివరి పాలకులు. నసీరుద్దీన్ ఖుస్రూతో ఖిల్జీ వంశ పాలన పూర్తిగా అంతమైంది.

తుగ్లక్ వంశం (క్రీ.శ. 1320-1414)

తుగ్లక్‌లు తరుష్క తెగకు చెందినవారు. ఈ వంశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ప్రసిద్ధమైనవారు.

గియాస్ ఉద్దీన్ (క్రీ.శ. 1320-1325): ఘజీమాలిక్ గియాస్ ఉద్దీన్ ‘తుగ్లక్’ వంశ పాలనను ప్రారంభించాడు. ఇతడి కుమారుడైన జునాఖాన్ కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిపై దండెత్తి ఓడించాడు.
ఓరుగల్లు పేరును ‘సుల్తాన్‌పూర్’గా మార్చి ఢిల్లీ రాజ్యంలో విలీనం చేశాడు. తండ్రిని హత్య చేసి జునాఖాన్ ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’గా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.

మహమ్మద్ బిన్ తుగ్లక్ (క్రీ.శ. 1325 - 1351): మహమ్మద్ బిన్ తుగ్లక్ మధ్యయుగ చక్రవర్తులందరిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నపాలకుడు. సమకాలీన ప్రభువుల్లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరు పొందాడు. ఇతడు బహు భాషా కోవిదుడు. గణిత, తర్క, ఖగోళ, వైద్య, భౌతిక, తత్త్వ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. పరమత సహనం ఉన్న వ్యక్తి. ఇన్ని సద్గుణాలున్నప్పటికీ తొందరపాటు ఎక్కువ. మొండిగా నిర్ణయాలు తీసుకునేవాడు. అదుపులేని కోపం ప్రదర్శించేవాడు. అందువల్ల చరిత్రకారులు ఇతడిని ‘విరుద్ధ గుణాల నిలయుడు’గా పేర్కొన్నారు. 1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చాడు. 1329లో రాగి నాణేలను ప్రవేశపెట్టాడు. 1337లో నాగర్ కోటపై విజయం సాధించాడు. ఇతడు వివిధ సంస్కరణలు చేపట్టినప్పటికీ దూరదృష్టి లేకపోవడంతో అవి విఫలమయ్యాయి.

ఫిరోజ్ షా తుగ్లక్ (క్రీ.శ 1351-1386): సైన్యానికి జాగీర్లు ఇచ్చే పద్ధతిని తిరిగి ప్రవేశ పెట్టాడు. బానిసల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశాడు. ముస్లిమేతరుల(హిందువులు)పై ‘జిజియా’ పన్ను, ముస్లింల ఆస్తులపై 2.5 శాతం పన్ను ‘జకత్’ విధించాడు. పండిన పంటలో పదో వంతు భాగాన్ని పన్ను (ఖరజ్) రూపంలో వసూలు చేసేవాడు. యుద్ధంలో సాధించిన ధనంలో 1/5 వ
భాగం ప్రభుత్వానికి,4/5 వ భాగం సైనికులకు ఇచ్చేశాడు. ఇతడి కాలంలో జియా ఉద్దీన్ బరానీ 300 హిందూ-సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించాడు.
ఫిరోజ్ షా శాంతికాముకుడు. ఇతడు యుద్ధాల పట్ల విముఖత చూపాడు. ఇతడికి ధైర్య సాహసాలు, యుద్ధ నిర్వహణా సామర్థ్యాలు తక్కువ. అందువల్ల ఇతడి కాలంలో విజయనగర, బహమనీ రాజ్యాలు
ఏర్పడ్డాయి; బెంగాల్‌లోనూ స్వతంత్ర పాలన ప్రారంభమైంది. ఫిరోజ్ షా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జాన్‌పూర్ మొదలైన నూతన నగరాలను నిర్మించాడు. కఠిన శిక్షలను రద్దు చేశాడు. బానిసల అవసరాలకు ప్రత్యేక శాఖను నెలకొల్పాడు.

తుగ్లక్ వంశ చివరి పాలకులు: ఫిరోజ్ షా తర్వాత తుగ్లక్ షా అధికారంలోకి వచ్చాడు. ఢిల్లీ సర్దార్‌లు ఏడాది కాలంలోనే (1389) ఇతడిని తొలగించి మహమ్మద్‌ను సుల్తాన్‌గా నియమించారు. ఆ తర్వాత నాసిరుద్దీన్ మహమ్మద్ సింహాసనం అధిష్టించాడు. 1398లో తైమూర్ దండయాత్ర జరిగింది. 1414లో తుగ్లక్ వంశం పూర్తిగా అంతరించింది.

సయ్యద్ వంశం (క్రీ.శ. 1414-1451)

తైమూర్ ప్రతినిధి ‘ఖిజిర్‌ఖాన్’ ఢిల్లీని ఆక్రమించి 1414లో సయ్యద్ వంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో నలుగురి పాలనలో రాజ్యం అల్లకల్లోలంగా మారింది. దీంతో లోడి వంశానికి చెందిన బహలాల్ లోడి ఢిల్లీని ఆక్రమించాడు.

లోడి వంశం (క్రీ.శ. 1451-1526)

ఈ వంశాన్ని బహలాల్ లోడి స్థాపించాడు. ఇతడు అఫ్గాన్ తెగకు చెందినవాడు. ఇతడి కుమారుడైన ‘సికిందర్ లోడి’ భూమిని కొలవడానికి ‘సికిందర్ గజ్’ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆగ్రా నగరాన్ని కూడా ఇతడే నిర్మించాడు. ఇబ్రహీం లోడి 1526లో బాబర్‌తో జరిగిన ‘పానిపట్ యుద్ధం’లో ఓడిపోయాడు. దీంతో లోడి వంశం అంతమైంది.

ఢిల్లీ సుల్తాన్ల పాలనలోని మంత్రులు

నయీల్ - ఉల్ - ముల్క్: ఇతడు సుల్తాన్‌కు పాలనా విషయాల్లో ముఖ్య సలహాదారుడు.
వజీర్: ఇతడు ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి. ప్రభుత్వ యంత్రాంగమంతటికీ ఇతడే అధిపతి.
దివాన్-ఇ-రిసాలత్: విదేశాంగ మంత్రి.
సాదర్-ఉస్-సదర్: ముస్లిం దానధర్మాలను సక్రమంగా వినియోగించే విధంగా చూడటం ఇతడి ప్రధాన విధి.
దివాన్-ఇ-అరీజ్: యుద్ధ మంత్రి, సైన్యాధిపతి.
దివాన్-ఇ-ఇన్షా: రాజ్యానికి సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు నిర్వహించేవాడు.
దివాన్-ఇ-ఖాజీ: న్యాయ, నిర్వహణ విభాగాధిపతి.
దివాన్-ఇ-బరీద్: గూఢచారి శాఖ చూసేవాడు.
Published date : 28 Oct 2015 11:39AM

Photo Stories