Skip to main content

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కథాకమామీషు

2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన పావలా వడ్డీ రుణాల పథకాన్నే (2016 వరకు కొనసాగింది) తిరిగి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జూలై 8, 2020 (ఏపీ రైతు దినోత్సవం)న ప్రారంభించారు.
ఇ–పంట (ఈ–క్రాప్‌)లో నమోదైన వాస్తవ సాగుదార్లకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభమైంది. రైతులకు ఈ పథకం కింద రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పొందే సౌకర్యం ఉన్న రైతుల ఖాతాలకు జమ చేస్తుంది.

ఈ పథకం ఎలా అమలు అవుతుందంటే...
సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ బ్యాంకులకు చెల్లిస్తుంది. అసలు, వడ్డీని రైతు చెల్లించినట్టు జాబితాలు తయారు చేసి ఆయా బ్యాంకులు లేదా నోడల్‌ బ్యాంకు శాఖలు వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్‌ కార్యాలయానికి పంపుతాయి. వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ కమిషనర్‌ వడ్డీ సొమ్మును బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హతగల రైతుల ఖాతాతల్లోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని జమ చేస్తుంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా http://ysrsvpr.ap.gov.in  వెబ్‌ పోర్టల్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలు ఉంటాయి.

ఏమిటీ పథకం ప్రాధాన్యత..?
వ్యవసాయ అవసరాల కోసం రూ.లక్షలోపు పంట రుణాన్ని తీసుకుని సకాలంలో వాయిదాలు (కిస్తీలు) చెల్లించిన రైతులకు వారు కట్టిన వడ్డీ (4 శాతం) మొత్తాన్ని ‘వడ్డీ లేనిరుణ పథకం’ కింద గతంలో బ్యాంకులకుజమ చేసేవారు. రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటినుంచి అంటే 2019 నుంచి రూ.లక్షలోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలన్న సంకల్పంతో ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని ప్రారంభించింది. ఈ విధంగా ఖరీఫ్‌కు సంబంధించిన రుణాలను సకాలంలో చెల్లిస్తే అక్టోబర్‌లో.. రబీకి చెందిన రుణాలను సకాలంలో చెల్లిస్తే మార్చిలో సున్నా వడ్డీ రాయితీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ కడుతుందన్న నమ్మకం రైతుల్లో కలుగుతుంది.

ఇప్పటి వరకూ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ఈ విధంగా అమలయ్యింది...
  • ఖరీఫ్‌–(2019– 20) సీజన్‌లో 43,28,067 మంది రుణాలు పొందగా.. వారిలో 25,96,840 మంది రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారున్నారు. నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా చెల్లించిన 14.58 లక్షల మంది ఈ పథకం కింద అర్హత పొందారు. వీరికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ కింద 2020 నవంబర్‌ 17న రూ.510.32 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది.
  • పాత బకాయిలు కూడా.. వడ్డీ లేని రుణ పథకం కింద 2014–15 నుంచి 2018–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. దీంతో 51 లక్షల 84 వేల మంది రైతులకు ఏకంగా రూ.1180 కోట్లను సున్నా వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం జమ చేసింది. .
  • రబీ–(2019–20) సీజన్‌లో 28,08,830 మంది రుణాలు పొందగా.. వారిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారు 16,85,298 మంది ఉన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారిలో 6,27,908 మంది రైతుల వివరాలను సున్న వడ్డీ పథకం రుణాలు (ఎస్‌వీపీఆర్‌) పోర్టల్‌లో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేయగా, వాస్తవ సాగుదారులకు మాత్రమే వడ్డీ రాయితీ అందించాలన్న సంకల్పంతో ఈ జాబితాను ఈ–క్రాప్‌తో సరిపోల్చి 2,50,550 మంది రైతులను వ్యవసాయ శాఖ అర్హులుగా గుర్తించింది. అయితే, రైతులకు సాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని, బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేసిన 6,27,906 మంది రైతులకు నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలనీ, రూ.128.47 కోట్లు ఏప్రిల్‌ 20, 2021న వారి ఖాతాల్లో జమ చేసింది.

అర్హత ఉండి అందకపోతే...
గ్రామ సచివాలయాల్లో సంప్రదించి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి. 155251 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కాల్‌ సెంటర్‌ నంబరు 1907కు ఫోన్‌ చేయొచ్చు.

రైతుల కోసం ఇంకా..
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా.. రైతులకు వైఎస్సార్‌ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేయించి మోటార్లు కూడా ప్రభుత్వమే ఇస్తుంది, పగటిపూట ఉచితంగా 9 గంటల విద్యుత్, 13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు, 10,641 రైతు భరోసా కేంద్రాలు, జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా పాడి గేదెల పంపిణీ, వైఎస్సార్‌ రైతు భీమా పథకం ద్వారా పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం... ఇలా అనేక విధాలుగా రైతుకు తోడుగా నిలుస్తోంది.
Published date : 23 Jun 2021 03:42PM

Photo Stories