Skip to main content

Science of Success: 2023లో భారత్ సాధించిన సైన్స్‌ ఘన విజయాలు ఇవే..

చంద్రయాన్–3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్‌ 2023లో సాధించిన అతిగొప్ప విజయం.
The Science of Success in 2023  Celebrating India's Scientific Success  India Launches National Quantum Mission in 2023

ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయమిది. చంద్రయాన్ సక్సెస్‌ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటి. ‘లిగో ఇండియా’ ప్రాజెక్టుకు మన దేశం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా నిర్మాణం ప్రారంభమైంది. నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు కూడా 2023లోనే శ్రీకారం పడింది. అయితే, సెన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు.

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్ లను జాబిల్లి పైకి మోసుకెళ్లిన అపోలో–11 లూనార్‌ మాడ్యూల్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ కెమెరా ఉండేది. ఆ ఇద్దరు వ్యోమగాములు చందమామపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టపు లైవ్‌ ప్రసారం ఈ కెమెరా ద్వారానే జరిగింది. అప్పట్లో ఈ ప్రసారాన్ని 53 కోట్ల మంది వీక్షించారు. అంతరిక్ష పరిశోధనల్లో 1969 జూలై 20 నాటి ఈ ఘటన అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. అలాగే టెలివిజన్  ప్రసారాల్లోనూ ఓ మైలురాయిగా నిలిచింది. యాభై ఏళ్ల తరువాత 2023 ఆగస్టు 23న కూడా దాదాపు ఇలాంటి చారిత్రక ఘటనే భారత్‌ లోనూ నమోదైంది. చంద్రయాన్ –3 జాబిల్లిపై అడుగుపెట్టిన ఘట్టాన్ని యూట్యూబ్‌లోనే 80.9 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్‌ లైవ్‌ స్ట్రీమ్‌కు సంబంధించి ఇదో రికార్డు. 

చంద్రయాన్–3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్‌ 2023లో సాధించిన అతిగొప్ప విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయ మిది. చంద్రయాన్  ప్రయోగం సక్సెస్‌ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటిగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం తొలివారంలో ఈ అంతరిక్ష నౌక సూర్యుడిని పరిశీలించేందుకు అనువైన స్థానానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రయోగాలు మాత్రమే కాకుండా 2023లో ‘ఇస్రో’ ఖాతాలో పలు కీలకమైన ప్రాజె క్టులను అమలు చేసిన ఖ్యాతి చేరింది. రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం, రెండోతరం నావిగేషన్  ఉప గ్రహాల్లో తొలి ప్రయోగం, మానవ సహిత ప్రాజెక్టు ‘గగన్‌యాన్ ’లో క్రూ ఎస్కేప్‌ మోడల్‌ పరీక్ష ఈ జాబితాలో కొన్ని మాత్రమే. 

Year Ender 2023: ఈ సంవ‌త్స‌రంలో ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!

అంతరిక్ష ప్రయోగాలకు ఆవల..
దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవల కూడా మన దేశం పలు విజయాలను నమోదు చేసింది. లేజర్‌ ఇంటర్‌ఫెరోమీటర్‌ గ్రావిటేషనల్‌ వేవ్‌ అబ్జర్వేటరీ (లిగో ఇండియా)కి ప్రభుత్వం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అరుదైన గురుత్వ తరంగాల వేధశాలగా, అతి సున్నితమైన నాలుగు కిలోమీటర్ల పొడవైన ఇంటర్‌ఫెరోమీటర్‌ సొరంగం ఉన్నదిగా ఇది రికార్డులకు ఎక్కింది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్  నక్షత్రాల వంటివి కలిసిపోయినప్పుడు పుట్టే గురుత్వ తరంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికాలో ఇప్పటికే పని చేస్తున్న లిగో వేధశాలలతో కలిసి హింగోలి వేధశాల పనిచేస్తుంది.

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు కూడా 2023లోనే అడుగు పడింది. సూపర్‌ కండక్టింగ్, ఫొటోనిక్‌ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో మధ్యమ స్థాయి క్వాంటమ్‌ కంప్యూటర్లు తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంతోపాటే కృత్రిమ మేధ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు కూడా జాతీయ స్థాయి కార్య క్రమం ఒకటి ఈ ఏడాది మొదలైంది. కృత్రిమ మేధను బాధ్యతా యుతమైన టెక్నాలజీగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 

పరిశోధనల్లోనూ ఉన్నత స్థితిలో..
భారతదేశంలో ప్రచార ఆర్భాటాలకు చిక్కని, అత్యుత్తమ, అంత ర్జాతీయ స్థాయి పరిశోధనలు ఎన్నో నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హైదరాబాద్‌లోని లాకోన్స్లో ఒక పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యతను గుర్తించేందుకు అభివృద్ధి చేసిన పద్ధతి. సీసీఎంబీ అనుబంధ సంస్థ అయిన లాకోన్స్లో ఎస్‌. మను, జి.ఉమాపతి ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. నీరు, మట్టి, గాలుల్లోని డీఎన్ ఏ పోగుల ఆధారంగా జీవవైవిధ్యతను కొలవడం ఈ పద్ధతి ప్రత్యేకత. 

Astronaut to the moon by 2040: 2040 కల్లా చంద్రుడిపై వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు

కర్నాల్‌(హరియాణా)లోని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు దేశీ గిర్‌ జాతి ఆవును క్లోనింగ్‌ పద్ధతి ద్వారా సృష్టించడం 2023 విశేషాల్లో ఇంకోటి. బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన జ్ఞానేశ్వర్‌ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సింహళీయులకు, శ్రీలంకలోని తమిళులకు మధ్య దగ్గరి జన్యు సంబంధాలు ఉన్నట్లు పరిశోధన పూర్వకంగా నిర్ధారించింది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రెండు వర్గాల ప్రజలకూ మరాఠా జనాభాకూ మధ్య సంబంధాలు ఉండటం..! కోవిడ్‌ విషయానికి వస్తే, పుణె కేంద్రంగా పనిచేస్తున్న జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్‌ దేశీయంగా తయారు చేసిన ఎంఆర్‌ఎన్ ఏ టీకాను విడుదల చేసింది. ఒమిక్రాన్  వైరస్‌ నియంత్రణకు పనికొస్తుందీ టీకా.

విధాన నిర్ణయాలను పరిశీలిస్తే..
దేశం మొత్తమ్మీద శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటా యింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్ ’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. వివరాలు పూర్తిగా బహిరంగం కాలేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పనిచేస్తున్న విజ్ఞాన్  ప్రసార్‌ను 2023లో మూసివేశారు. ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌సీఏ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతాయి. సైన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. 

కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జనవరిలో సైన్స్ కాంగ్రెస్‌ జరిగే అవకాశాలు లేవు. డీఎస్‌టీ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఐఎస్‌సీఏ ఆరోపిస్తోంది. సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను లక్నోలో కాకుండా జలంధర్‌ సమీపంలోని పగ్వారాలో నిర్వహించాలన్న ఐఎస్‌సీఏ నిర్ణయం డీఎస్‌టీకి రుచించలేదు. 2023లో సైన్స్ కాంగ్రెస్‌ను నాగ్‌పూర్‌లో నిర్వహించారు. మరోవైపు పలు శాస్త్ర సంబంధిత విభాగాలు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ విజ్ఞాన్  భారతి ప్రాయో జకత్వం వహిస్తున్న వార్షిక్‌ సైన్స్ ఫెస్టివల్‌కు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తూండటం గమనార్హం.

దురదృష్టవశాత్తూ చాలా సంస్థలు రాజకీయ పెద్దల అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయాయి. లక్నోలోని నేషనల్‌ బొటానికల్‌ రీసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని నామకరణం చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్‌ ‘నమో 108’ను ఆవిష్కరిస్తూ ‘మతపరంగా కమలానికి, 108 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కొత్త రకం కమలం చాలా ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిరంతర కృషీవలుడు నరేంద్ర మోదీ అంతః సౌందర్యానికి ఈ కమలం ఓ గొప్ప బహుమానం’ అని కూడా అన్నారు.

ఇంకో సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థ నికోటిన్  మోతాదు తక్కువగా ఉన్న పొగాకు వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.కళైసెల్వి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఎన్సీఈఆర్టీ చంద్రయాన్‌ ప్రయోగ కీర్తి ప్రధానికి దక్కుతుందని పొగడటం ప్రస్తావనార్హం. 

Google's Year in Search 2023 : ప్రపంచవ్యాప్తంగా 2023లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసినవి ఇవే..

 

Published date : 03 Jan 2024 09:09AM

Photo Stories